24, ఆగస్టు 2020, సోమవారం

*అమావాస్య కు ఆ పేరు ఎలా వచ్చింది ?*🌸



🌻మానవుడు తాను చేసిన పాపుణ్యాల ఆధారంగా నరక స్వర్గ లోకాలు ప్రాప్తిస్తాయి. స్వర్గం చేరటానికి అనేక ద్వారాలు దాటు కుంటూ వెళ్లాలి.

🌻కొన్ని మన పుణ్య కార్యాల వలన మన పాపాలను కడుక్కుంటూ స్వర్గం వైపు వెళుతుంటాం. మన మరణం తరువాత ఆత్మ పూర్తిగా స్వర్గాన్ని చేరలేదు. వారి పాపాలు కడగటానికి వారి సంతానం శ్రాద్ధ కర్మాదులు నిర్వహించి వారిని పాప విముక్తులను చేయాలి.

🌻దీనికి సంబంధించి మత్స్య పురాణం లో ఓ కధ ఉన్నది. అసలు అమావాస్య కి శ్రాద్ధ కర్మలకు గల సంబంధం వివరించబడింది.

🌻ప్రతిమాసంలోను వచ్చే అమావాస్య అన్నా, మహాలయ అమావాస్య అన్నా పితృదేవతలకు ఎంతో ఇష్టమని, ఆ రోజున శ్రాద్ధ కర్మాదులను చేస్తే మంచి ఫలితం ఉంటుందని పెద్దలంతా అంటుంటారు.

🌻పితృదేవతలు ఏడుగణాలుగా విభజించపడ్డాయి. వీరిలో మూడు గణాలవారికి ఆకారం ఉండదు. వైరాజులు, అగ్నిష్వాత్తులు, బర్హిషదులు అనేవారికి ఇలా ఆకారం ఉండకపోవడం విశేషం. అలాగే సుఖాలినులు, హవిష్మంతులు, ఆజ్యపులు, సోమపులు అనే నాలుగు గణాలకు ఆకారం ఉంటుంది.

🌻ఈ ఏడుగణాలవారూ ప్రాణులందరిలో అమితమైన సామర్థ్యాన్ని, చైతన్యాన్ని కలిగిస్తుంటారు. అందుకే ఈ పితృదేవతలకు కావల్సిన శ్రాద్ధవిధులను నిర్వర్తించాలని అంటారు. మూర్తి (ఆకారం) లేని పితరులు వైరాజుడు అనే ప్రజాపతి కుమారులు.

🌻అందుకే వీరిని వైరాజులు అని అంటారు. ఈ అమృతాలైన పితృగణాలవారు శాశ్వతాలైన లోకాలను పొందగోరి ఓసారి యోగసాధనకు ఉపక్రమించారు. అయితే ఏకాగ్రత లోపించి యోగం కోల్పోతారు.

🌻ఈ కారణంగా వీరంతా పితృదేవతలుగా మారారు. ఈ పితృదేవతల మానసపుత్రికే మేన. ఈమె హిమవంతుడిని పెళ్లాడింది. హిమవంతుడికి మైనాకుడు అనే కుమారుడు జన్మించాడు.

🌻మైనాకుడికి క్రౌంచుడు జన్మించాడు. ఆ క్రౌంచుడి పేరుమీదనే క్రౌంచద్వీపం ఏర్పడింది. మేనా హిమవంతులకు ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు.

🌻ఉమ, ఏకపర్ణ, అపర్ణ అని ఆ ముగ్గురు కుమార్తెల పేర్లు. ఆ కన్యలు మంచి యోగసిద్ధి కలవారు. హిమవంతుడు ముగ్గురిలో పెద్దదైన ఉమను రుద్రుడికి, ఏకపర్ణను భృగువుకు, అపర్ణను జైగీషవ్యుడికి ఇచ్చి వివాహం చేశాడు.

🌻ఇలా వైరాజ పితృదేవతల సంతతి వృద్ధి చెందింది. సోమపథాలు అనే లోకాలలో మరీచి అనే ప్రజాపతికి జన్మించిన పితృదేవతా గణాలు నివసిస్తుంటాయి.

🌻ఈ పితృదేవతలకు ఒక మానస పుత్రిక ఉంది. ఈమె పేరుమీదనే అనంతర కాలంలో అమావాస్య తిథి వచ్చింది. ఈమె జీవనకథనంలో నేటివారికి ఉపయుక్తమయ్యే ఓ సందేశం కూడా ఇమిడివుంది.

🌻అగ్నిష్వాత్తుల మానసిక పుత్రిక పేరు అచ్చోద. ఆమె నదీరూపంగా ఉండేది. అచ్చోదను పితృదేవతలు ఒక సరస్సులో సృష్టించారు.

🌻ఓరోజున వారంతా కలిసి ఆమె దగ్గరకు వచ్చారు. ఏదైనా వరం కోరుకోమని తమ కూతురును అడిగారు. అయితే దివ్యపుష్పమాలికలు, దివ్యగంధాలు, మంచి అలంకారాలు చేసుకుని ఎంతో సుందరాకృతిలో ఉన్న మావసుడు అనే ఒక పితరుని చూసి అచ్చోద కామపరవశురాలైంది.

🌻ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి తండ్రి అయిన మావసుడినే కోరిన కారణంగా ఆమె అప్పటిదాకా సంపాదించిన యోగశక్తి అంతా నశించింది. దాంతో ఆమె తన దివ్యత్వాన్ని కోల్పోయింది.

🌻అసంబద్ధంగా ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి ప్రవర్తించినందువల్లనే ఆమెకు ఇంతటి నష్టం ప్రాప్తించింది. పితృదేవతలు అచ్చోద తమకు ఎంతో అభిమానపాత్రురాలైన మానసపుత్రికే అయినా ధర్మాన్ని అనుసరించి శిక్ష విధించడంలో… అంటే ఆమెకు దివ్యత్వం నశించాలని శపించడంలో వెనుకాడలేదు.

🌻మావసుడు మాత్రం అచ్చోదను కామించక ఇంద్రియ నిగ్రహంతోనే ప్రవర్తించాడు. అచ్చోద మావస్య కాలేదు. అంటే మావసుడికి ప్రియురాలు కాలేదు. అందుకే ఆమె అమావాస్య అయింది.

🌻అమావాస్య అంటే మావసుడికి ప్రియురాలు కానిది అనేది ఇక్కడి అర్ధం. అలా తదనంతర కాలంలో అచ్చోదకే అమావాస్య అనే పేరు ప్రాప్తించింది.

🌻ఈమె అంటే పితృదేవతలకు ఎంతో ప్రాణం. తమ మానస పుత్రిక మీద ఉండే మమకారంతో అచ్చోద అమావస్య (అమావాస్య తిథి) అయిన రోజున తమకు ఎవరైనా అర్పించిన శ్రాద్ధానికి అనంత ఫలితాన్ని ఆనాటి నుంచి పితృదేవతలు ఇస్తూ వచ్చారు.
*****************

కామెంట్‌లు లేవు: