26, అక్టోబర్ 2021, మంగళవారం

పెద్దరికం


🌹పెద్దరికం🌹


ఇంటికి పెద్దదిక్కు వుండాలి అంటారు.. ఎందుకంటే నాలుగు మంచి మాటలు చెప్పడానికి మరియు ఎవరైనా తప్పు చేస్తే ఖండించడానికి.. ‘మాకు పెద్ద దిక్కే వద్దు, మంచి చెప్పే వాళ్లు వద్దు !’ అని అంటే ఆ కుటుంబం ఎటుపోతుంది ? కళ్లు గానక ఊబిలోనికి కూరుకుపోతారు. ఇదే దుర్యోధనుని విషయంలో జరిగింది. దుర్యోధనునికి తల్లిదండ్రులు ప్రేమ వలన సుద్దులు చెప్పలేకపోయారు, విదురుడు మంత్రిత్వం వలన చెప్పలేక పోయాడు, భీష్ముడు పాపం తాత గారు, చనువు ఎక్కువ అయినా ఎన్నో సార్లు చెప్పి చూశాడు కానీ ఆయన్నీ లెక్క చేయలేదు.. చివరికి సర్వం రాజ్యమే కూలిపోయింది.


పెద్దలు లేని సంసారం, కుటుంబం ఏమవుతుందో తెలుసుకోవాలి.


నూరుగురు కౌరవులు ఏమయినారో మనం గుర్తుంచుకోవాలి, ధర్మాన్ని చెప్పేవాడు ఒక్కడైనా వుండాలి, అదే ధృతరాష్ట్రుని గొప్పతనం... ధృతరాష్ట్రుడు విదురుడ్ని ప్రక్కన బెట్టుకొన్నాడు, అందుకనే ఆయనకు శ్రీకృష్ణ విశ్వరూప దర్శనం లభించింది. అదే ‘శకుని’ని దగ్గర పెట్టుకొన్న దుర్యోధనడు యొక్క స్థితి మనకు తెలుసు.


దుర్మార్గుడైనా సరే ఓ మహాత్ముడ్ని, మంచి వాడ్ని చెంత పెట్టుకోవాలి.. దీనిని మనం బాగా పట్టుకోవాలి.


అదే ధర్మరాజు విషయంలో చూడండి.. అందరి మాట విన్నాడు, ఆయన మాట ఆయన తమ్ముళ్లు విన్నారు, ధర్మ ప్రవర్తనతో బ్రతికారు


దుర్యోధనుడు ఎవ్వరి మాట వినలేదు, తల్లిదండ్రుల మాట వినలేదు, గురువుల మాట వినలేదు, పెద్దల మాట వినలేదు, శ్రేయోభిలాషుల మాట వినలేదు, భగవంతుడి మాట కూడా వినలేదు చివరికి ఏమైయాడు ?


మంచి చెప్పే వాళ్లను బ్రతిమలాడి కోనైనా తెచ్చుకోవాలి. "అయ్యా మీరు మార్గ నిర్ధేశకులుగా ఉండండి, అధ్యక్షులుగా వుండండి, పెద్దలుగా వుండండి మాకు !" అని ప్రాధేయపడి వుంచుకోవాలి. పెద్దవాళ్లను వుంచుకున్నందువలన కుటుంబాలకు, సంస్థలకు, సభలకు గౌరవం లభిస్తుంది, చెడ్డవాళ్లను డబ్బులు ఇచ్చి అయినా వదిలించుకోవాలి అంటారు. రాజు చెడ్డవాడు అయినా మహా మంత్రి మంచివాడుగా, ధర్మం చెప్పేవాడుగా వుండాలి.. అప్పుడే ఆ రాజు, ప్రజలు పది కాలాలు పాటు చల్లగా వుంటారు.


ధర్మం చెప్పే పెద్దలు లేనందువలన లేదా చెప్పినా వినకపోవడం వలన సమాజం దెబ్బతింటుంది.


ఎవడికి వాడు నేనే పెద్ద అంటే ఎలాగా ? అలాంటి జ్ఞానవంతులు వుంటేనే ఒక్కోసారి పొరబాట్లు, తప్పులు జరిగిపోతూనే వుంటాయి.


”అయ్యా శ్రీకృష్ణా ! నేను ఏమి తప్పుజేసానని ? అని భీష్ముడు శ్రీకృష్ణుల వారిని అడుగుతాడు


"ఓ తప్పు జరిగేచోట పెద్దలు వుండటమే తప్పు" అని అంటాడు. ఓ తప్పును చూస్తూ ఖండించకుండా, అక్కడ నుంచి వెళ్లిపోకుండా మౌనం వహించి చూస్తూ వుండటమే భీష్ముడు చేసిన తప్పు.


ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో భీష్ముడు ఏమీ చేయలేక అక్కడే వుండిపోయాడు.. అదే విదురుడు చూడకుండా వెళ్లిపోయినాడు...


*_కావున పెద్దలు ఓ తప్పు జరిగిన చోట వుంటే ఆ పాపం వారి ఖాతాలో కూడా వేస్తారు. అందువలన చెప్పిన మాట విననప్పుడు పెద్దలు ఆ స్థలం నుంచి వెళ్లిపోతారు... ఇది విజ్ఞులు చేసే పని.


కావున ఎవరైనా తప్పు చేస్తుంటే వారికి చెప్పి సరిదిద్దాలి... వారు మాట వినకపోతే అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు... 


💥సర్వేజనాః సుఖినోభవంతు💥

కామెంట్‌లు లేవు: