25, అక్టోబర్ 2021, సోమవారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*473వ నామ మంత్రము* 25.10.2021


*ఓం సిద్ధమాత్రే నమః*


మంత్రసిద్ధి గలవారిని తల్లివలె రక్షించు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సిద్ధమాతా* యను నాలుగక్షరముల నామమును *ఓం సిద్ధమాత్రే నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు సాధకులను ఆ తల్లి వారిని ఆపదలనుండి రక్షించును, సకలకార్యార్థసిద్ధిని అనుగ్రహించును.


సనత్కుమారులు లేదా సనకసనందాదులు బ్రహ్మ మానస పుత్రులు. వీరు సనకుడు, సనాతనుడు, సనందనుడు, సనత్కుమారుడు. వీరు జీవితపర్యంతం బ్రహ్మచర్యం పాటించి మహామహిమాత్ములైన ఋషులుగా పేరుపొందారు. సనకసనందాదులు నిత్యబాల్యాన్ని నిరంతర కౌమారదశను వరంగా పొందారు. ధర్మప్రజాపతి పుత్రులు. సనకసనందాదులు, సప్తర్షులు, పదునాలుగు మనువులు నా సంకల్పంవలన జన్మించి సమస్త ప్రాణులను సృష్టించారు అని కృష్ణుడు అంటాడు. సృష్టిని పెంపొందించండి అని బ్రహ్మ వీరిని కోరితే సృష్టి చేయటం ఇష్టం లేక తపస్సుచేస్తూ కాలంగడిపారు.బ్రహ్మ సన అని పలకటంతో వీరు పుట్టారు. వీరు (సనకసనందనాదులు) పుట్టుకతోనే జ్ఞానవైరాగ్యాలను పొందిన సిద్ధులు. అటువంటి వీరికి పరమేశ్వరి తల్లి వంటిది యగుటచే అమ్మవారు *సిద్ధమాతా* యని అనబడినది.


అనంతకోటి జీవరాశులకు అమ్మవారు తల్లి వంటిది. వారిని సర్వదా కాపాడుటకు సిద్ధముగా ఉంటుంది గనుక, ఆ తల్లి *సిద్ధమాతా* యని అనబడినది.


ఆజ్ఞాచక్రమునకు అధిష్ఠానదేవత సిద్ధమాత. పరమేశ్వరి ఆజ్ఞాచక్రాధిష్ఠానదేవతా స్వరూపిణియైన సిద్ధమాతాస్వరూపిణి గనుక, ఆ తల్లి *సిద్ధమాతా* యని అనబడినది.


పరమేశ్వరి తన భక్తుల తాపత్రయముల (తాపత్రయములు అనగా *మూడు తాపములు* అని ఆర్థము. అవి ఆది దైవిక తాపము, ఆది బౌతిక తాపము, ఆధ్యాత్మిక తాపము) నుండి పరమేశ్వరి కాపాడుటకు సదా సిద్ధముగా ఉంటుంది గనుక జగన్మాత *సిద్ధమాతా* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునప్పుడు *ఓం సిద్ధమాత్రే నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: