5, అక్టోబర్ 2021, మంగళవారం

దొంగజాంకాయ

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

 శ్రీమతి శశికళ ఓలేటి గారి కథ* 

                🌷🌷🌷

దొంగజాంకాయ( ఇష్టమైన...పాత హాస్యకధ )


""""జోగారావురికి బాగాసీరియస్ గా ఉందిట కదా. నెల్లాళ్లు ఐసీయూ లో ఉంచి , లాభం లేదు. ఇంటికి తీసుకెళ్లిపోండి, అయినవాళ్లనందరినీ ఆఖరిచూపులుకు పిలుచుకోండి అని చెప్పేసారంట కదా! అప్పుడే వారమయిందట ఇంటికి తీసుకొచ్చి...........", ధనలక్ష్మితో... అదే తలనొప్పి. మొదలెట్టడమే... అవతలి వారికి మాటాడే అవకాశం ఇవ్వదు.


భార్య వాక్ప్రవాహానికి అడ్డుకట్టేస్తూ.. రాంబాబు అందుకున్నాడు.


" అవును! తెలుసు! ఇప్పుడు అక్కడినుంచే వస్తున్నా! అయితే ఏంటంట?! "...... కాస్త కటువుగా పలికాడు.


" ఏంటంటారేంటండీ! జోగారావుగారు మన యజమాని. మీ బాల్యస్నేహితుడు. 

పైగా వామాక్షి నా ఫ్రెండు. 

నాకు కనీసం మాటయినా చెప్పలేదు ఎవరూ. నేనింకా ఏదో సుస్తీయే అనుకుంటున్నా ఇంకా! ఇంత సీరియస్ సిట్యుయేషన్ అని చెప్పద్దూ మీరు! 

మన చిన్నది అమెరికా నుండి కాల్ చేసి చెప్పింది. వాళ్ల చిన్నబ్బాయి కూడా వచ్చేసాట్ట కదా! 

మనం ఇలాంటి సమయంలో దగ్గర లేకపోతే నలుగురూ ఏమనుకుంటారు?.........."


మళ్లీ ఆపాల్సి వచ్చింది అతనికి.. ఆమె వాగ్ధోరణిని.


" ఏం మాట్లాడుతున్నావ్ ధనా? 

వాడు మనకు యజమానేమిటి? 

నన్ను బిజినెస్ పార్టనర్ గా చేర్పించి, మన ఆస్తంతా అమ్మించి ,పెట్టుబడి పెట్టించి, ఆనక నష్టాలొచ్చాయని కంపెనీ మూసేసాడు!

కొత్త వ్యాపారం మొదలెట్టి , కోట్లు గడించాకా, నాకన్నా విశ్వాసపాత్రుడు దొరకడని, నన్నే మేనేజర్ గా పెట్టుకుని, పూలమ్మిన చోట కట్టెలమ్మిస్తున్న చీట్ ఆ జోగారావు. 

స్నేహం విలువెరగని ట్రైటర్ వాడు. 

మంచి శాస్తే అయింది. 

అందరి పొట్టలూ కొట్టి, సంపాదించింది తినకుండానే... పోతున్నాడు"! .......కక్షగా నొక్కి మరీ చెప్పాడు రాంబాబు.


" నిజమే నండి! ఆ వామాక్షి మాత్రం తక్కువా! చీరల వ్యాపారం పెడదామంటే , మా అమ్మా వాళ్లిచ్చిన ఎకరమూ అమ్మి చేతులో పెట్టా! మూడునెలలు లాభం చూపించి ...నాలుగోనెల కస్టమర్లు డబ్బివ్వలేదని మూసేసింది.।

నా చేతిలో పదిచీరలూ, పదివేలూ పెట్టేసి నోరుమూయించి, గప్ చుప్ గా దొడ్డిదారిని వ్యాపారం చేసుకుంది అప్పట్లో!...విచిత్రం చూడండి... వామాక్షి అంటే కుచేలుడి పెళ్లంట. 

మనం కుచేలుళ్లమయ్యాం. 

ఆమె ధనలక్ష్మి అయిపోయింది. అయినా దేవుడున్నాడా అసలు? ఈ అన్యాయాలు చూస్తూ కూడా ఎలా సహిస్తున్నాడో............."


భార్యనాపకపోతే ఆమె శాపాలకి ప్రపంచం భస్మమైపోతుందని గ్రహించి , రాంబాబు 

" సరే! తయారవ్వు. నువ్వూ ఒకసారి చూసేద్దువు గాని ...ఆ జోగిగాడిని"..... అంటూ బాత్రూంలో దూరాడు. 


స్నానం చేసొచ్చి, కాస్సేపు ధ్యానం చేద్దామని కూర్చున్నాడు కానీ , ఎక్కడా మనసు లగ్నం అవ్వడం లేదు. జోగారావు మీదకే ఆలోచనలన్నీ మళ్లాయి.


పెంటపాడులో తనతండ్రి పెద్దకామందు. తనూ, తన అన్నగారూ పిల్లజమిందార్లలా తిరిగేవారు. ఈ జోగిగాడు కరణంగారబ్బాయి. పదిమంది పిల్లల్లో ఎనిమిదో వాడు. తన తండ్రికీ, కరణం గారికీ ఉన్న లావాదేవీల వలన జోగారావు తండ్రితో ...తమింటికి వస్తూ పోతూ... తనకి మిత్రుడయ్యాడు.


తనూ, అన్నయ్యా ఆడుకుంటుంటే ఆటలో అరటిపండులా వచ్చిచేరి, కొంచెం సేపటికే లీడర్ అయిపోయేవాడు. ఖాళీజేబూలు గోళీలతో నిండేవి. కొన్నాళ్లకి వయసుతో పాటూ వాడు గెలుచుకునే వస్తువులూ పెరిగాయి. బేట్లు, బుష్ షర్టులు, రేమాండ్ పేంట్లు, రేబాన్ కళ్లద్దాలు, చివరకు తమ పోకెట్ మనీలూ. 


వాళ్లనాన్నా తక్కువ తినలేదు. తనతండ్రి మంచితనాన్ని ఆసరా చేసుకుని , తమ్మినిబమ్మి చేసి, ఆరుగురి కూతుళ్ల పెళ్లి చేసాడు. 


ఖర్మకాలీ జోగారావు తనకు కాకినాడ ఇంజినీరింగ్ కాలేజీలో కూడా తగులుకున్నాడు. అరబ్బూ-ఒంటే కధలోలా, మెల్లగా తన గదంతా హాయిగా ఆక్రమించి, తన తిండితిని , తన బట్టలన్నీ వాడి, తనతోనే ఫీజులు కట్టించి... మొత్తానికి ఇంజినీరయ్యాననిపించాడు.


అలా కేవలం కాళ్లూ, చేతులతో వచ్చేసి, పైసా ఖర్చుపెట్టకుండా... పైకొచ్చిన వాడు అతనే. పొరుగువాడి దేదైనా తనది కావలసిందే. నవ్వుతూనే అవతలివాళ్ల మెడకాయమీంచి తలకాయ లాగేసే రకం.


ఎలా సంపాదించాడో తెలీదు, తనఅత్తెసరు మార్కులతోనే , నాగార్జున సాగర్లో అసిస్టెంట్ ఇంజినీరుగా చేరిపోయాడు. 


అక్కడే తమకు బంధువులయిన ఈ.ఈగారి కూతురు వామాక్షిని పెళ్లాడేసి , అంచెలంచెలుగా ఎదిగిపోయాడు. 


వామాక్షి విషయంలోనూ వంచనే! 

నిజానికి వామాక్షి తన మేనత్తకూతురు. తనకనుకున్న సంబంధం. 

చూచాయిగా ఈవిషయం జోగి కి తెలుసు. 

అంతే సాగర్ వెళ్లడమేమిటి పావులు కదిపి, తన మేనత్త వేపునుండి నరుక్కొచ్చి వామాక్షిని సొంతం చేసుకున్నాడు. 


అప్పుడే తనని అన్నయ్య హెచ్చరించాడు..."జోగిగాడి నీడకూడా పడకుండా దూరంగా ఉండరా"... అని! 


తండ్రిపోయాకా , ఆస్తుల పంపకం చేసుకుని... తను కాకినాడలో కాంట్రాక్ట్ లు చేసుకుంటూ, బానే సంపాదిస్తూ ఉండేవాడు. ధనలక్ష్మి, ఇద్దరు పిల్లలతో సుఖంగా ఉంది జీవితం.


అదిగో అప్పుడే మళ్లీ ఊడబడ్డాడు జోగారావ్. ఉద్యోగం ఒదిలేసి... కాంట్రాక్టర్ అవతారం ఎత్తానని, స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్, నేవీ క్వార్టర్స్ సబ్ కాంట్రాక్ట్ దొరికిందని, మొత్తం రెండొందల కోట్ల పనులనీ ..... ఓ ఊదరగొట్టేసాడు. 


వచ్చినప్పుడల్లా, కొత్తకారులో రావడం, పిల్లలకేవో బహుమానాలు తేవడం చేసేవాడు. 


మెల్లగా జోగారావ్ చూపించే అరచేతి వైకుంఠం తనకీ, ధనాకీ బాగా బుర్రకెక్కింది. 

అన్నగారు చెప్తున్నా వినకుండా తన వంతు ఆస్తులమ్మి జోగారావ్ ఫర్మ్ లో పెట్టాడు. 

చాకిరీ యేమో తనది. 

బిల్లులూ, బడ్జెట్లూ వాడివీ. 


ఆఖరికి ఐదేళ్లకల్లా ఫర్మ్ లో నష్టాలూ, తన చేతికి చిప్పా చూపించాడు . 


కొన్నాళ్లకు జోగారావ్ పెట్టిన "వామాక్షీ ఇంజినీరింగ్ కంపెనీకి" మేనేజర్ లెవల్లో తను కుదురుకోవలసి వచ్చింది.


జోగారావ్ నల్లగా ఉంటాడు. పెద్ద పర్సనాలిటీ కూడా ఉండదు. కానీ సమ్మోహనంగా నవ్వుతాడు. అంతకన్నా మధురంగా మాట్లాడతాడు. 


ఈ నేర్పుతోనే ఇద్దరు వంటరి మహిళలు ఆస్తులతో సహా ఇతనివైపు ఆకర్షితులయ్యారు. అవన్నీ తెరవెనుక భాగోతాలే! 


వామాక్షికి ఇవన్నీ పెద్ద పట్టింపు లేదు. "భర్త సమర్ధుడు! అదే చాలు!" అనుకునే మనిషి. ధనలక్ష్మి వట్టి భోళా! అమాయకురాలు. తనకి తగ్గట్టే! 


జోగారావు పుణ్యమా అంటూ ఎక్కడో ఉండవలసిన తన కుటుంబం ఎక్కడికి చేరిందో తలుచుకున్నప్పుడల్లా.... తన మనసు వికలం అయిపోతుంది. 


దీర్ఘంగా నిట్టూర్చి, ధ్యానం నుండి లేచాడు రాంబాబు. అప్పటికే ధనలక్ష్మి తయారయి ఉంది.


*^*^*^*^*^*^*^*^*^*^*^*^*^*^*^*^^^^^^^*^*


కారు డ్రైవ్ చేస్తున్న రాంబాబు దృష్టి యూనివర్సిటీ రోడ్డుపక్క అమ్ముతున్న లేతాకు పచ్చలో పెద్దపెద్ద దబ్బకాయలంత జామకాయల మీద పడింది. కారాపి, బేరం చేసి డజను ఎనిమిదొందలికి కొని తెచ్చాడు.


" మతి లేదేంటి? కోమాలో ఉన్నవాడికి పళ్లెందుకు? ఇంట్లో వాళ్లు మింగడానికా?.....కోపంగా అడిగింది ధన! 


" అన్నట్టు చెప్పలేదు కదూ! జోగారావ్ ఇప్పుడు డెలీరియంలో ఉన్నాడు. అస్తమానూ "జామకాయ" "జామకాయ"! అనే కలవరిస్తున్నాడు. వాడికి పాపం చిన్నప్పటి నుండి జాంకాయలంటే పిచ్చి. అందరి గోడలెక్కి, అందరి దొడ్లలో దూరి జాంకాయలు దొంగతనం చేసి తన్నులు తినేవాడు.....మా రామారావు సార్ వాడిని " దొంగ జాంకాయ!" అనేవారు. వాడికి ఆఖరికోరిక లాగుంది... జామకాయ తినడం!"


"వామాక్షి అప్పటికీ...పాపం కడియం, ద్వారపూడి, పాలకొల్లు, విజయవాడ మనిషిని పంపి జాంకాయలు తెప్పించింది. ...పెద్దకొడుకు కలకత్తానుండి తెచ్చాడు. చిన్నాడు అమెరికానుంచి మెక్సికో జాంపళ్లు తెచ్చాడు. ఆడపిల్ల ఇంకో మెట్టెక్కి ఏకంగా చైనానుండి జాంపళ్లు తెప్పించింది. వాళ్ల బావగారు ఏదో ఎయిర్ లైన్స్ డైరక్టర్ కదా!" 


"జోగి ముందు ఎన్ని రకాలు చూపించి, ముక్కలు పెట్టినా ఆత్రంగా చూడడం , నిరాశగా మొహం తిప్పి, కిటికీ కేసి, యమదూతల కోసం చూస్తున్నట్టు చూస్తుంటాడు... వెధవ! ఎంత శత్రువయినా ఇప్పుడు ఇలా చూస్తుంటే కడుపుతరుక్కుపోతోంది." 


"అప్పటికీ నేను మనూరి జాంకాయలూ... తెప్పించా! అన్నయ్యకు చెప్పి! "


"కాదుట! కళ్లమ్మట నీరు కారుస్తాడు! జాంకాయ! జాంకాయ్ అని గొణుగుతాడు. అందుకే ధనా ! ఇవి కొన్నా"......... చెప్తూనే చొక్కా లోపల పేంట్లో దోపుకున్న పవర్ ఆఫ్ అటార్నీ కాయితాలు తడుముకున్నాడు రాంబాబు!!


ధనలక్ష్మి కళ్లల్లో కూడా నీళ్లు చిప్పిల్లాయి. 


వెళ్తూనే ధనలక్ష్మి... వామాక్షిని కావులించుకుని భోరుమంది. 


వామాక్షి ఆల్రెడీ ప్రిపేర్ అయివుండడంతో, అతి ప్రయత్నం మీద కన్నీరు సృష్టించుకుని, ధనని పొదివిపట్టుకుని సోఫాలో కూర్చోపెట్టి, జాగారావు కేమయిందో, ఏమవబోతోందో ...అన్నీ చెప్పుకొచ్చింది. 


ఇంట్లో పండుగ వాతావరణంలా ఉంది. ఈవేళో రేపో అనుకుని వచ్చేసిన చుట్టాలంతా సోఫాల్లో, వరండాల్లో, గదుల్లో, లాన్లో సర్దేసుకున్నారు! 


పెద్ద ఇల్లేమో ! పిల్లలంతా హాయిగా పరుగులెడుతూ ఆడుకుంటున్నారు! కొంత మంది చేతుల్లో కాఫీకప్పులూ, అందరి చేతుల్లో మాత్రం జాంకాయలు. ఇల్లంతా పండిపోయిన జాంపళ్ల వాసనతో ఒకలా ఉంది.


ధనా, వామాక్షి, రాంబాబు .... జోగారావు గదిలోకి వెళ్లారు. మనిషి నెలలోనే చిక్కిశల్యమై మంచానికి అతుక్కుని ఉన్నాడు. 

ఏసీ గదిలో వెంటిలేటర్ల శబ్దం తప్ప మారులేదు. ధనలక్ష్మి నీరునిండిన కళ్లతో అతని చెయ్యి పట్టుకుంది. 

కన్నీరు కారుస్తూ " జాంకాయ" అంటూ నిర్వేదంగా బయటకు చూస్తున్నాడు జోగారావ్. 

ఒక్కసారి ఘొల్లుమంది వామాక్షి


" ఇది ధనా! వరస! .....అంటూ! 


ధన ..తను తెచ్చిన జాంకాయలు రెండు చేతుల్లో పట్టుకుని అతని కళ్లముందాడించింది. మార్పులేదు. 

చూపు కూడా తిప్పలేదు. 


నిరాశగా ఆడవాళ్లిద్దరూ గదినుంచి నిష్క్రమించారు.


రాంబాబు... చలనం లేని జోగి చెయ్యి.. తనచేతిలోకి తీసుకుని, 


" జోగారావ్! నీతో కొంచెం మాట్లాడాలి. నీ పరిస్థితి నీకు తెలుసో లేదో నాకు తెలీదు... కానీ నువ్వింక బ్రతికి బట్టకట్టవని డాక్టర్లు తేల్చేసారు. 


అమెరికా తీసుకెళ్లడానికీ లేదు. నీ బీపీ , పల్స్ రేట్ పడిపోతున్నాయి. ఇలా వెన్నెముక విరిగిపోయి, కాళ్లూ చేతులూ చచ్చుబడిపోయి, నువ్వు రోజుల్లో ఉన్నావు. 


నీ వ్యాపారం నీ కలల సౌధం అని నాకు తెలుసు!!నీ తరువాత ఎవరు? అన్నది ఎవరికీ అవగాహన లేదు ! 

మన ప్రాజెక్టుల మీద నాకు తప్పా... మరి ఎవరికీ పూర్తి సమాచారం లేదు!


నేను మోసగాణ్ని కాదని నీకు తెలుసు. తలుచుకుంటే నేనిప్పుడే నీ అప్పోనెంట్స్ తో చేతులు కలిపి కావలసిన సమాచారం అందించచ్చు. కానీ నేనెప్పటికీ అలా చెయ్యను.


కనుక నాకు పవర్ ఆఫ్ అటార్నీ ఇయ్యి. నీ వ్యాపారం పువ్వుల్లో పెట్టి చూసుకుని భద్రంగా... నీ కొడుకులకు అప్పజెప్తా!" ........


అది వినగానే , జోగారావు మొహంలోకి కోపం ఛాయలు పొడజూపాయి.


" వామాక్ క్ క్...... అనుకుంటూ గొణిగాడు!


" ఛీఛీ! నీదెంత పాడుబుద్ధిరా! 

చావుపడక మీద కూడా ఎంత అభద్రత నీకు!. వామాక్షి నాకు పెళ్లి ముందు మరదలయినా , పెళ్లయ్యాకా నాకు సోదరిసమానురాలు. 

ఆమెను వశపరచుకుని నీ ఆస్తి కాజేస్తానేమో అనే కదా నీ భయం? అవన్నీ నువ్వు చేసిన వెధవ పనులు! నేనంత నీచుడ్ని కాదు! 


చిన్నప్పటినుండీ పరాన్నభుక్కు లాగా ఇంకోళ్ల సొమ్ము మీద పడి తిన్నది నువ్వు. పక్కవాడి దగ్గర ఏది నదురుగా వుంటే , దాన్ని సాధించేదాకా నిద్రపోలేదు! 


ఎవడేమి వ్యాపారం చేస్తే దానిలో దిగిపోవడం, తమ్మినిబమ్మి చేసి, వాడిని నాశనం చేయడం. ఇదేగా మనం చేస్తున్న వ్యాపారం!! చెప్పరా! అలాంటిది... నువ్వు వామాక్షీ, నా ...పేరత్తడం నీ..నీచత్వానికి పరాకాష్ట!! 


" సరే విను! యూఎస్ లో... మా అమ్మాయీ, మీ చిన్నకొడుకూ ఒకళ్లంటే ఒకళ్లు ఇష్టపడ్డారు. 

మా పెద్దపాపని మీ పెద్దాడికిమ్మని.. వామాక్షి అడిగింది. 

కనుక నాకన్నా సరయిన వాడు నీకు దొరకడు... నీ ఆస్తి కాపాడడానికి. 


నువ్వు 'ఊ'...అంటే లాయర్నీ, మేజిస్ట్రేట్ నీ పిలిపిస్తా. రాతకోతలు చేసుకుందాం! పైగా నీ వ్యాపారంలో... నా డబ్బుందని నీకూ తెలుసు".....


జోగారావు మూసుకుపోతున్న కళ్ల వెనుక భావమేదో అర్ధమవ్వలే.. రాంబాబుకు. చూపు మాత్రం... పక్క తలుపుమీంచి తిప్పడంలే!! 


ఒళ్లుమండుకొచ్చింది రాంబాబుకి. కుర్చీలోంచి విసురుగా లేచి... పక్క తలుపు తెరుచుకుని బాల్కనీలోకెళ్లాడు. 


విశాలమైన బాల్కనీలో ఉయ్యాలబల్ల మీద కూర్చుని సిగరెట్ వెలిగించాడు. పెరట్లో ఎవరో ఆడవాళ్ల వాదన వినిపించింది. జోగారావ్ ఇంటి పనిమనిషి... పక్కింటి పనిమనిషితో గొడవపడుతోంది. 


వెనక్కితిరిగి పోబోతున్న రాంబాబు చెవుల్లో అసంకల్పితంగా కొన్ని మాటలు చెవున పడ్డాయి. ఆగి చెవులు రిక్కించి...వారి మాటలు విన్నాడు. మసక చీకట్లో పెరడూడుస్తున్న జోగారావు పనిమనిషి.,. తమింట్లో రాలుతున్న పక్కింటి చెట్ల ఆకుల గురించి గొడవపడుతోంది. అదేమీ విచిత్రం కాదు... కానీ ఆ ఆకులు రాలుస్తున్న చెట్లు జామచెట్లు! వంగుని పిట్టగోడ మీంచి పారాపెట్ మీదకు వాలి చూసాడు రాంబాబు! 


పక్కింటి వాళ్ల ...పెద్ద జామిచెట్టు కొమ్మకటి ....వీళ్ల పేరాపెట్ మీదకు... ఎండ కోసమై విస్తరించి ఉంది. 


పేరాపెట్ ఎత్తుగా మొదటి అంతస్తులో ఉండడం వలన ఎవరికీ అందదు. 

మిగిలిన కొమ్మలన్నీ పిందే పీపీతో ఉంటే, పేరాపెట్ మీదున్న విశాలమైన కొమ్మకు మాత్రం... ఆరముగ్గినవీ, దోరగా పండిన జామకాయలు పెద్దవి గుత్తులు గుత్తులుగా..గుత్తంగా పడున్నాయి...నోరూరిస్తూ! 


రాంబాబు పెదవులమీదకి ఒక్కసారిగా... విశాలమైన నవ్వు పాకింది. 

అది అతని మనసుని చక్కిలిగిలి పెట్టి... పకపకలాడించింది. 


కాసేపు అక్కడే నిలబడి... మనస్ఫూర్తిగా నవ్వుకుని , లోపలికి వెళ్లేముందు... రెండు ఫోన్ కాల్స్ చేసి, తలుపు తెరుచుకుని, జోగారావు బెడ్ రూంలోకి వచ్చాడు.


సవ్వడి విని జోగారావు... అతికష్టం మీద కళ్లు విప్పాడు. 

రాంబాబు చేతులకేసి ఆశగా చూసాడు. 

అతని రిక్తహస్తాలు చూసి... జోగారావు కన్నీళ్ల పర్యంతమయ్యాడు.


రాంబాబు మిత్రుడిని సమీపించి... ప్రేమగా నుదుటి మీద ముద్దుపెట్టుకున్నాడు. 


అతని చచ్చుబడిపోయిన చేతిని... తన చేతిలోకి తీసుకుని మార్దవంగా......


" జోగీ! నిజం చెప్పు! ఆరోజు... నువ్వుఆ పక్కింటాళ్ల జాంకాయలు కోద్దామని ..చీకట్లో వంగి, మేడమీంచి పడిపోయావ్ కదూ! 

మీ వాళ్లంతా నువ్వు ఫోన్ మాట్లాడుతూ కళ్లుతిరగడం వలన కిందపడి, అక్కడున్న రోటిమీద పడడం వలన అయ్యిందనుకుంటున్నారు ...పిచ్చాళ్లు. 


ఒరే! నాకు తెలీదురా నువ్వెంత దొంగజాంకాయవో! 


నీ విస్తరిలో పంచభక్ష పరవాన్నాలున్నా, పక్కోడి విస్తరిలోంచి ఆవకాయ బద్ద దొబ్బుకుతింటే కానీ... నీకు పూటగడవదు కదా! 


సరే! అదంతా వదిలేయ్! నీకు ఆ పక్కింటి జాంకాయలు... కోసిస్తా. 

మరి నాకు పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తావా? 

ఇలా అడగడం మానవత్వం కాదని తెలుసురా జోగీ! 

కానీ అవన్నీ నీకు పట్టవు కదా! పరవాలేదు! "


కానీ జోగారావుకి ఇవేవీ పట్టట్లేదు. 

స్నేహితుడికి ...తన ఆఖరికోరిక తెలిసిపోయిందన్న సంగతి తెలియగానే... మొహంలోకి విపరీతంగా వెలుగొచ్చేసింది. 


ముద్దముద్దగా " పెడతా! పెడతా!" అని గొణిగాడు. 


ఆ తరువాత రాంబాబు ఒక్క క్షణం ఆలస్యం చెయ్యలేదు.


అప్పటికే వచ్చివున్న లాయర్, మెజిస్ట్రేట్, జోగారావు కొడుకులూ, భార్యా సమక్షంలో తన అన్ని వ్యాపారలమీద... రాంబాబుకు పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తూ ...ఒప్పందాలు అయిపోయాయి. 


డాక్టర్, అతని సిబ్బంది జోగారావుని వీల్ చెయిర్ లో కుదేసారు. 

ఆక్సిజన్ మాస్క్ తోనే పక్కనున్న బాల్కనీలోకి తోసుకెళ్లారంతా! 

అప్పటికే అక్కడ ఏర్పాటు చేసిన... ఫ్లడ్ లైట్ల వెలుగులో ఆ ప్రాంతమంతా వేడిగా, వెలుగుగా ఉంది. 


జోగారావుని... పేరాపెట్ వాల్ దగ్గరగా తెచ్చారు. 


రాంబాబు మెల్లగా తాడు సాయంతో పళ్లతో నిండిన కొమ్మలు పైకిలాగాడు, పేరాపెట్ మీద నిలబడ్డ నౌకర్.. పైకి ఎత్తితోస్తుంటే!!


జోగారావు ఒళ్లోకి గుత్తుల గుత్తుల జాంపళ్లు వచ్చాయి. వామాక్షి.... ఏడుస్తూ ఒక జాంపండు కాకెంగలి చేసి ...జోగారావు నోటికందించింది. 


అదే ఆఖరికి ...అతని పాలిట తులసితీర్ధమయింది. 


పదకొండోరోజు పిండప్రధానానికి.... అన్నం ముద్దలు పేరాపెట్ వాల్ మీదే పెట్టారు. అక్కడే పదిరోజులుగా తిష్టవేస్తున్న కాకి ..ఆరోజు ఆ పిండప్రసాదాన్ని ముట్టలేదు! 


జోగారావు కొడుకులు ఆర్ద్రంగా " నాన్నా! రా నాన్నా! తిను నాన్నా! "....అన్నా తినలేదు. పక్కింటాళ్ల జాంకాయ పెట్టారు . అయినా తినలేదు.


ఈలోపల రాంబాబు ఒక బాక్సులోంచి తన ఇంట్లోంచి తెచ్చిన అన్నం ముద్దలు చేతికిచ్చి... పెట్టమన్నాడు. వెంటనే కాకొచ్చీ చటుక్కున తినేసి... పారిపోయింది. ఎవ్వరికీ అర్ధం కాలేదు... ఒక్క రాంబాబుకు తప్పా.


ఆకాకి మళ్లీ జోగారావు ఇంటిమీద వాలలేదు. ఇప్పుడు రాంబాబు తినే ప్రతీ మొదటిముద్దా... తనింటి మీదే కాపరం పెట్టిన కాకికి ...పెట్టాలిసిందే! 


మరి... కోట్ల ఆస్థికి బాధ్యత కట్టబెట్టిందిగా! తీసుకోడమే తెలిసిన చెయ్యికి, మొదటిసారిగా ఇవ్వాలిసొచ్చింది. కనుక ఇంక కాకి బాధ్యత రాంబాబుదే!


రాంబాబూ మాత్రం విసుక్కోడు! మంచి నెయ్యేసి కలిపిన అన్నం ముద్ద పట్టుకుని , *"ఒరే! దొంగ జాంకాయ్!"* అని పిలవగానే తయారుగా ఉంటుంది కాకి!!

              🌷🌷🌷

 *శశికళ ఓలేటి*

కామెంట్‌లు లేవు: