1, మార్చి 2022, మంగళవారం

మాతృమూర్తి ఋణం🌷

 🌹🌹🌹🌹🌷🌹🌹🌹🌹

     🌷మాతృమూర్తి ఋణం🌷   

                  🌹🌹🌹     

ఆదిశంకరాచార్యులవారు సన్యాసాశ్రమం స్వీకరించి తన ఆప్తులందరినీ త్యజించి వేళ్ళే ముందు తల్లి ఆర్యాంబ

చాలా బాధ పడింది.

"శంకరా, నువ్వు నాకు ఏకైక పుత్రుడువి కదా! నన్ను వదలి వెళ్ళి పోతున్నావు, ఆఖరి క్షణాల్లో నాకని ఎవరున్నారు? నాకు దిక్కెవరు " అని దీనంగా ప్రశ్నించింది.

" అమ్మా! ఏ సమయమైనా సరే, నీవు తల్చుకుంటే చాలు నీ ముందు వుంటాను." అన్నాడు శంకరుడు.

భగవత్పాదులు శంకరాచార్యులవారి తల్లికి మరణకాలం సమీపించింది. మూసిన కళ్ళు తెరవలేదు.

"నేను తలచిన వెంటనే వస్తానన్నాడే శంకరుడు" అని మనసులోనే తలుచుకుంటూ వున్నది ఆర్యాంబ.

తల్లి తలచుకుంటున్నదన్న విషయం ఆదిశంకరులు గ్రహించారు.

వెంటనే శ్రీకృష్ణుని ధ్యానించారు. శ్రీకృష్ణుడు ఏం కావాలని అడిగాడు.

కురుపితామహుడు భీష్మాచార్యునికి మోక్షమిచ్చినట్లుగా నా మాతృమూర్తికి

మోక్షం ప్రసాదించమని వేడుకున్నారు శంకరాచార్యులవారు.

అర్యాంబ , తలుచుకుంటే శంకరుడు వస్తానన్నాడే అని తపిస్తున్నప్పుడు అక్కడికి ఎవరో వస్తున్న అలికిడయింది.

కళ్ళు కూడా తెరవలేని స్థితిలో వున్న ఆర్యాంబ చటుక్కున లేచి శంకరా! అంటూ , అక్కడికి వచ్చిన ఒక పసిబాలుని, గట్టిగా హృదయానికి హత్తుకుంది.

బాలుని ఒంటి నిండా ఆభరణాలను గమనించిన ఆర్యాంబ‌, శంకరుడు సన్యాసి కదా ! యీ ఆభరణాలు ఎలావచ్చాయని అనుకున్నది.

బరువెక్కిన కనురెప్పలను మెల్లిగా తెరచి చూసింది ఆర్యాంబ.

అక్కడ తను అను నిత్యం పూజించే గురువాయూరు శ్రీకృష్ణుడు సాక్షాత్కరించి నిలచివుండడం గమనించింది.

గురువాయూరప్పని చూసిన ఆర్యాంబ మహదానందంతో " అప్పా! నోరు తెరిచి, నీ నామజపం చేసే శక్తి కూడా లేని యీ దీనురాలి ఆఖరిక్షణాలలో నను చూసేందుకు వచ్చావా? కృష్ణా " అని మెల్లిగా గధ్గదకంఠంతో పలికింది.

శ్రీకృష్ణుడు వెంటనే "నీ పుత్రుని ఆదేశం. రాకుండా వుండగలనా ? అమ్మను చూడకుండా వుండగలనా " అని

చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు.

అదే సమయానికి శంకరాచార్యులవారు కూడా అక్కడికి వచ్చారు.

ఉప్పొంగిన ఆనందంతో ఆ మాతృమూర్తి శంకరునితో " నాయనా ! నా భాగ్యమేమని చెప్పను? నిన్ను పుత్రుని గా పొంది నేను తరించాను. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడినే నా ముందు నిలబెట్టావుకదా, శంకరా!" అని కన్నీళ్ళు కార్చింది .

గోపాలుని నేను నిలబెట్టడమేమిటి? నేను జన్మించినది మొదలు నీవు నా కోసం పడ్డ శ్రమకు , కష్టాలకు బదులుగా

నేనేమీ చేయలేకపోయాను.

సాక్షాత్తు భగవంతుడే మానవరూపంలో పుట్టినా మాతృ ప్రేమకు సాటిగా , ఎంతటి సేవచేసినా కన్నతల్లి ఋణం అణువంతైనా తీరదు.

నేనైనా అంతే. నేను చేయగలిగినదంతా నీ దివ్య చరణాలకు హృదయపూర్వకమైన సాష్టాంగ ప్రమాణం ఒక్కటే "

అని మాతృదేవత పాదాలముందు మోకరిల్లారు ఆదిశంకరాచార్యులవారు.

***

మన తల్లి తండ్రుల కు మనం చేసే సేవల వల్లనే వారి మనసు సంతృప్తిచెంది వారి దివ్యాశీస్సులు సదా తమ బిడ్డలకు ప్రసాదిస్తారని జగద్గురు ఆదిశంకరాచార్యులవారు ఈ లోకానికి సందేశమిచ్చారు.

సేకరణ:- చొప్పకట్ల సత్యనారాయణ గారి పోస్ట్. 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: