1, మార్చి 2022, మంగళవారం

మారేడుదళములు

 *🌿మారేడుదళములు* 🌿


మారేడు  దళములకు బోళా శంకరుడి పూజ కీ చాలా సన్నిహిత సంబంధం! బిల్వ వృక్షం (మారేడు చెట్టు) అంటేనే వృక్ష రూపంలో ఉన్న పరమశివుడు అని పురాణాలు చెప్తున్నాయి. మూడు విభూతి రేఖలు నుదుటి మీద ధరించకుండా, రుద్రాక్ష మాల లేకుం డా, బిల్వ పత్రం లేకుండా సంప్రదాయం తెలిసిన పండితులు శంకరుడిని పూజించరు! అంటుంది శివ పురాణం.


 బిల్వ వృక్ష దర్శనం, స్పర్శన మాత్రం చేతనే పాపక్షయం అవుతుందనీ, బిల్వ వృక్షాన్ని పూజలతో, చందనాది ద్రవ్యాలతో పూజిస్తే వంశాభివృద్ధి కలుగుతుందనీ శ్రద్ధాళువుల నమ్మకం. మారేడు చెట్టు కనిపించినప్పుడు, దాని ఆకులు కోసి, వాటితోనే ఆ వృక్షాన్ని పూజించినా పుణ్యమే అంటారు.


నిజానికి మారేడు చెట్టు చాలా సాధారణమైన వృక్షంగానే కంటికి కనిపిస్తుంది. మర్రి,, రావి చెట్ల లాగా మహావృక్షమూ కాదు. చెప్పుకోదగ్గ అందమైన పూలూ కనబడవు. తియ్యటి రుచికరమైన ఫలాలూ కావు. పోనీ అరుదైన వృక్షమా అంటే అదీ కాదు, ఆసి యా ఖండంలో దాదాపు అన్ని ప్రాంతాలలోనూ, అన్ని శీతోష్ణస్థితులు తట్టుకొని పెరిగే చెట్టు, నిరాడంబరతా, సాదాతనం, శీతోష్ణాలను ఓర్చుకోగల సహనం మొద లైన లక్షణాలలో మహాదేవుడికీ మారేడు చెట్టును శివా లయాలలో, దేవీ మందిరాల ప్రాంగణాలలో తప్పక పెంచుతారు. సాధారణంగా ఈ చెట్టును ఇళ్లలో పెం చరు. మారేడు ఆకులకూ, ఫలాలకూ ఓషధీ లక్షణాలు న్నాయని, కఫ వాత సంబంధమైన దోషాలను ఇవి నివారిస్తాయనీ ఆయుర్వేద వైద్యవేత్తలు అంటారు.


బిల్వ పత్రాలు మూడు దళాల రూపంగా ఉండ టం ఒక విశేషం అని చెప్పవచ్చు. ఆ త్రిదళ రూపం వల్ల వీటిని సత్వ రజస్తమోగుణాలకూ, సృష్టి స్థితి లయా లకూ, అకార ఉకార మకార సంయోగమైన ఓంకా రానికీ, శివుడి త్రినేత్రాలకు, ఆయన త్రిశూలానికి ప్రతీకలుగా భావించుతారు. త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రం చ, త్రియాయుధం, / త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం అంటూ ఆరంభమౌతుంది. 


మారేడు దళాల ప్రశస్తిని ఉగ్గడిస్తూ చెప్పిన బిల్వా ష్టకం. ఇలా ఒక వృక్ష జాతి ప్రాశస్త్యాన్ని గురించి చెప్పే అష్టకం మారేడు గురించి తప్ప, మరే చెట్టు గురించీ కనబడదు.


వినాయక చవితి పూజలో వాడే పత్రిలో కూడా బిల్వ పత్రాలు భాగమే. తులసి, బిల్వ, నిర్గుండీ (వావి లి), అపామార్గ (ఉత్తరేణి) కపిత్థక (వెలగ), శమీ (జమ్మి), ఆమలక (ఉసిరిక),  దూర్వా (గరిక) పత్రాల ను అష్ట బిల్వాలుగా పేర్కొనే పరిగణన కూడా ఒకటి ఉంది.


‘మారేడు దళాన్ని శివ లింగానికి తాకిస్తే, ఆ స్పర్శ వల్ల కలిగిన స్పందనల ప్రభావం ఆ దళంలో చాలా సేపు నిలిచి ఉంటుంది. అలాంటి మారేడు దళం మీరు రోజంతా మీ జేబులో, హృదయానికి దగ్గరగా ఉంచుకొని చూడండి. అది మీ శారీరక స్థితినీ, మానసిక స్థితినీ కూడా ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉంచుతుంది.


ఒకనాడు శనిదేవుడు, శివుని దర్శించుటకై కైలాసమునకేగి పార్వతీ పరమేశ్వరులను దర్శించి భక్తితో స్తుతించాడు. అంతట శివుడు శనిదేవుని విధి ధర్మమును పరీక్షించు నెపమున నీవు నన్ను పట్టగలవా? అని ప్రశ్నించాడు. అందుకు శని మరునాటి సూర్యోదయము నుండి సూర్యాస్తమయ కాలము వరకూ శివుని పట్టి ఉంచగలనని విన్నవించాడు. అంత శివుడు మరునాటి ఉషోదయ కాలమున బిల్వవృక్షరూపము దాల్చి, ఆ వృక్షమునందు అగోచరముగా నివసించాడు. మహేశ్వరుని జాడ తెలియక పార్వతీదేవితో సహా దేవతలందరు ముల్లోకములనూ గాలించారు. వారెవ్వరికి ఆ మహేశ్వరుని జాడగానీ, శనిదేవుని జాడగానీ తెలియలేదు. ఆనాటి సూర్యాస్తమయ సంధ్యాకాలము గడచిన పిదప మహేశ్వరుడు బిల్వ వృక్షము నుండి సాకార రూపముగా బయలు వెడలినాడు. మరుక్షణమే శనిదేవుడు అచట ప్రత్యక్షమైనాడు. "నన్ను పట్టుకోలేకపోయావే?" అని పరమేశ్వరుడు ప్రశ్నించగా శనిదేవుడు నమస్కరించి "నేను పట్టుటచేతనే గదా, లోకారాధ్యులు తమరు ఈ బిల్వ వృక్షరూపముగా ఇందులో దాగి వసించినారు" అన్నాడు. శనిదేవుని విధి నిర్వహణకు, భక్తి ప్రపత్తులకు మెచ్చిన శివుడు "ఈశ్వరుడినైన నన్నే కొద్దికాలము పట్టి, నాయందే నీవు వసించి యుండుటచేత నేటినుండి నీవు 'శనీశ్వరుడు' అను పేర ప్రసిద్ధి నొందగలవు. అంతట శని దోషమున్న వారు, ఆ దోషమున్నవారు, ఆ దోషపరిహారార్ధము నన్ను బిల్వ పత్రములలో పూజించిన దోష నివృత్తి జరుగును. బిల్వ పత్ర పూజ చేత శివభక్తులైన వారిని ఈ శనీశ్వరుడు బాధించడు' అని అభయమిచ్చెను.

లక్ష్మీదేవి తపస్సు వలన బిల్వవృక్షము పుట్టినది.


 ఆమెను 'బిల్వనిలయా' అని పిలుస్తారు. బ్రహ్మ వర్చస్సు పొందడానికి, సూర్యుని మెప్పుకోసం చేసే కామ్య యాగంలో బిల్వకొయ్యను యూప స్తంభముగా నాటుతారు. అశ్వమేధ యాగములో ఇలాంటి బిల్వయూపములను ఆరింటిని ప్రతిష్టించుతారు.


మారేడు దళాన్ని సోమవారము, మంగళ వారము, ఆరుద్రానక్షత్రము, సంధ్యాసమయము, రాత్రి వేళలందు, శివరాత్రి రోజున, సంక్రాంతి రోజున, పండుగల సమయాన కోయకూడదు. కనుక ఈ దళాలను ముందు రోజు కోసి, భద్రపరచిన దళాలతో పరమశివుని పూజిస్తారు.


మారేడు దళము శివార్చనకు పనికి వచ్చే, శివుడికి అతి ప్రీతికరమైన పత్రము.

మారేడుదళము గాలిని, నీటిని దోషరహితము చేస్తుంది.

కామెంట్‌లు లేవు: