8, అక్టోబర్ 2022, శనివారం

వేదంలో పూర్వభాగం

 [08/10, 11:30 am] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 1 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


వ్యాసభగవానుడు ఈ దేశమునకు చేసిన సేవ సామాన్యమయినది కాదు. ఆయన మహోత్కృష్టమయిన సేవ చేశారు. చేసి అంతటితో ఊరుకోలేదు. అల్పాయుర్దాయం కలిగి అనారోగ్యంతో ఉంటూ బుద్ధి ఎప్పుడూ కూడా అర్ధకామములయందు మాత్రమే తగిలి ఉండే సామాన్య జనులు కలియుగంలో వేదములను నాలుగింటిని చదవడం దుస్సాధ్యమనే బుద్ధిచేత వ్యాసభగవానుడు వేదరాశిని నాలుగుగా విభాగం చేశారు. ఆయన వేదరాశినంతటినీ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము అని నాలుగు భాగములుగా విభాగం చేశారు.


వేదంలో పూర్వభాగం అంతా మనం ఆచరించవలసిన విధి విదానములను గురించి, మనం ఆచరించిన విధివిధానముల వలన మనం పొందే ఇహలౌకిక పారలౌకిక సౌఖ్యములను గూర్చి వివరిస్తుంది. ఉత్తరభాగం అంతాకూడా మళ్ళీ మనం ఒక అమ్మ కడుపులో ప్రవేశించవలసిన అవసరం లేకుండా ఇదే తుట్టతుద జన్మ చేసుకోవడం కోసమని ఏ జ్ఞాన సముపార్జన చేయడం చేత మనకు కైవల్యం లభిస్తుందో దానిని గురించి తెలియజేస్తుంది. ‘జ్ఞానాత్ కేవల కైవల్యం’ జ్ఞానం చేత మాత్రమే కైవల్యం లభిస్తుంది.


పునరావృత్తిరహిత శాశ్వత శివసాయుజ్య సిద్ధి కొరకు ఏ జ్ఞానమును మనం పొందాలో అటువంటి జ్ఞానమును వేదము ఉత్తరభాగం ప్రతిపాదన చేస్తుంది. ఆయన తన శిష్యుడయిన జైమినిచేత వేదమునకు పూర్వభాగమయిన కర్మకు సంబంధించిన, విషయములన్నిటికి వ్యాఖ్యానం చేయించారు. దానిని ‘పూర్వమీమాంస’ అంటారు. ఉత్తరభాగమంతా జ్ఞానమునకు సంబంధించినది. వ్యాసమహర్షియే స్వయంగా బ్రహ్మసూత్రములను రచించారు. ఈ బ్రహ్మసూత్రములనే ‘ఉత్తరమీమాంస’ అని కూడా అంటారు. మరల ఆయన పదునెనిమిది పురాణములను రచించారు. పురాణములను రచించడం అంటే తేలికయిన పనికాదు.


‘సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ!

వంశానుచరితంచైవ పురాణం పంచలక్షణం!!

పురాణమునకు ఐదు లక్షణములు ఉండాలి. సర్గ, ప్రతిసర్గ అని విభాగం ఉండాలి. గొప్పగొప్ప వంశములను గురించి ప్రస్తావన చేయాలి. అనేక మన్వంతరములలో జరిగిన విశేషములను చెప్పాలి. అది భగవత్సంబంధముగా దానిని ప్రతిపాదన చేయకలిగిన శక్తి ఉండాలి. అటువంటి వాడు తప్ప పురాణమును చెప్పలేదు. అటువంటి పురాణములను రచించిన మహానుభావుడు వేదవ్యాసుడు. మనకి జ్ఞాపకం ఉండడము కోసమని తేలిక సూత్రమునొక దానిని పెద్దలు ప్రతిపాదించారు.


‘మ’ద్వయం ‘భ’ద్వయం చైవ ‘బ్ర’త్రయం ‘వ’చతుష్టయం!

‘అ’ ‘నా’ ‘ప’ ‘లిం’ ‘గ’ ‘కూ’ స్కా’ని పురాణాని పృథక్ పృథక్!! (దేవీభాగవతం 1-3-21)


మద్వయం – మకారముతో రెండు పురాణములు ప్రారంభము అవుతాయి. అందులో ఒకటి మార్కండేయ పురాణము, రెండవది మత్స్య పురాణము.

భద్వయం – భ తో రెండు పురాణములు ప్రారంభమవుతాయి. అవి భాగవత పురాణము, భవిష్య పురాణము.


బ్రత్రయం – బ్ర’ తో మూడు పురాణములు ప్రారంభమవుతాయి. అవి బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మవైవర్త పురాణము.

వచతుష్టయం – ‘వ’కారంతో నాలుగు పురాణములు ప్రారంభమవుతాయి. అవి వరాహపురాణము, విష్ణు పురాణము, వామన పురాణము, వాయు పురాణము.

అనాపలింగకూస్కాని – అన్నప్పుడు ఒక్కొక్క అక్షరమునకు ఒక్కొక్క పురాణము వస్తుంది.


అ – అగ్నిపురాణం, నా – నారద పురాణం, ప – పద్మ పురాణం, లిం – లింగపురాణం, గ – గరుడ పురాణం, కూ – కూర్మపురాణం, స్కా – స్కాందపురాణం.


వ్యాసభగవానులు వేదములను విభాగం చేసినప్పుడు ఒక్కొక్క వేదమును ఒక్కక్క శిష్యుడికి అప్పచెప్పారు. వ్యాసుడు చేసిన సేవ అంతా ఇంతా కాదు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

[08/10, 11:32 am] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 2 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


మొట్టమొదటిది అయిన ఋగ్వేదమును పైలుడు అనే ఒక శిష్యుడికి పూర్ణముగా నేర్పారు. దాని శాఖలకు పైలుడు ఆధిపత్యము వహించాడు. యజుర్వేదమును వైశంపాయనుడు అనే ఋషి తెలుసుకున్నారు. సామవేదమును జైమిని పూర్ణముగా అవగాహన చేసుకున్నాడు. అధర్వణ వేదమును సుమంతువు అనే ఋషికి తెలియజేశారు. ఈ పదునెనిమిది పురాణములను రోమహర్షణుడు అనే ఒక మహానుభావుడికి నేర్పారు. రోమహర్షణుడి కుమారుడు సూతుడు. సూతుడు పురాణ ప్రవచనము చేస్తూ ఉంటాడు.


పురాణ వాజ్ఞ్మయమునంతటిని కూడా ప్రవచనము చేసిన వాళ్ళు సూతుడు, రోమహర్షణుడు అయితే ఒక్క భాగవతమును మాత్రము శుకబ్రహ్మ చెప్పారు. శుకబ్రహ్మ సాక్షాత్తు వేదవ్యాసుని కుమారుడు. ఆయన పుట్టుకచేతనే అపారమయిన జ్ఞాన వైరాగ్యములు, భక్తి కలిగినవాడు. ఎంత వైరాగ్య భావన కలిగినవాడు అంటే – ఆయన మంచి నిండు యవ్వనములో ఉండే రోజులలో తండ్రిగారు ఆయనను వివాహము చేసుకోమని అడిగారు. Ii ఆయన ‘నాకు వివాహం అక్కరలేదు...ఈలోకం అంతా దుఃఖభూయిష్టమయిపోయింది. నేను ఆనందమును అనుభవించాలి. నేను బ్రహ్మైక్య సిద్ధి కొరకు తపస్సు చేస్తాన' ని చెప్పి అరణ్యములను పట్టి వెళ్ళిపోతున్నాడు. వెనకనుంచి వ్యాసుడు పుత్రునిమీద వున్న కాంక్షచేత ‘హా పుత్రా! హా పుత్రా!’ అని అరుస్తూ వెంటవస్తున్నా శుకుడు ‘ఓయ్’ అనలేదు. అంతటా ఆత్మతత్త్వమును చూడడమునకు అలవాటయిపోయిన శుకునికి బదులుగా వ్యాసునికి అరణ్యములో వున్న చెట్లు అన్నీ ‘ఓయ్ ఓయ్’ అని జవాబు చెప్పాయి. అంతటి బ్రహ్మనిష్ఠాగరిష్ఠుడై యవ్వనమునందే ఒంటిమీద బట్టలేకుండా వెళ్ళిపోతూ ఉండేవాడు.


శుకబ్రహ్మ వైరాగ్య సంపత్తిని గురించి మనకి ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు. ఆయన ఒకనాడు ఒక సరోవరము పక్కనుంచి వెళ్ళిపోతున్నారు. వెనక వ్యాసుడు వస్తున్నాడు. అక్కడి సరోవరములో అప్సరసలు దిగంబరముగా స్నానం చేస్తున్నారు. అందులో ఒకరు శుకుడు వస్తున్నాడు అన్నారు. శుకబ్రహ్మకు వచ్చి నమస్కారము చేయాలని వారు వివస్త్రలుగా ఒంటిమీద వస్త్రం కట్టుకోకుండా లేచివచ్చి శుకునికి నమస్కరించారు. అపుడు శుకుడు నిండు యవ్వనములో ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ అప్సరసలు స్నానం చేస్తున్నారు. వ్యాసుడు వస్తున్నాడు అన్నారు. బట్టలు కట్టుకుని వ్యాసునికి నమస్కరించండి అన్నారు. వాళ్ళు బట్టలు కట్టుకుని వ్యాసునికి నమస్కరించారు. ఈ సంఘటనకు వ్యాసుడు ఆశ్చర్యపోయాడు. ‘నా కుమారుడు యవ్వనములో ఉన్నాడు. నేను వార్ధక్యమునందు ఉన్నాను. నేను వస్తే మీరు వస్త్రములు కట్టుకుని నమస్కరించారు. నా కుమారుడు వెళ్ళిపోతుంటే వస్త్రములు లేకుండా నమస్కరించారు ఏమిటి ఈ తేడా? అని వ్యాసుడు అప్సరసలను అడిగితే అప్సరసలు – ‘నీ కుమారునికి స్త్రీ పురుష భేదము తెలియదు. అతడు అంతటా బ్రహ్మమునొక్కదానిని మాత్రమే చూస్తాడు. నీకు స్త్రీపురుష భేదము తెలుసు. అందుకే నీకు మేము బట్టలు కట్టుకొని నమస్కరించాము’ అని బదులు చెప్పారు. అదీ శుకబ్రహ్మ వైరాగ్య సంపత్తి.


శుకుడు చాలా గొప్పవాడు. అందుకే ఒక్క భాగవతమును మాత్రము వ్యాసుడు వేరోకరిచేత చెప్పించకుండా శుకునిచేత మాత్రమే చెప్పించారు. భాగవతము చెప్పడానికి ఈశ్వరుడు ఒక సమర్ధత చూశాడు. ‘కుశ’ అంటే దర్భ. దర్భ చేతిలో పట్టుకున్నంత సేపు కర్మాచరణము చేస్తాడు. కర్మాచరణము ఎందుకు చేస్తారంటే – కర్మ చేయగా చేయగా ఇంటిని తుడుచుకుకుని తుడుచుకుని బూజులన్నీ దులుపుకుని పండగ వచ్చే ముందు శుభ్రపరుపబడిన ఇల్లులా మీరు భగవద్భక్తితో కర్మాచరణము చెయ్యగా చెయ్యగా లోపల ఉండేటటువంటి మనస్సుకు పట్టిన మాలిన్యము తొలగి ఈశ్వరుడు వచ్చి కూర్చొనడానికి, సత్కర్మాచరణమును పూనికతో సంతోషముతో చెయ్యడానికి కావలసినటువంటి బుద్ధియందు ఆనందప్రదమయిన స్థితి ఏర్పడుతుంది. అప్పుడు దానివలన జ్ఞానము కలుగుతుంది. జ్ఞానముచేత మోక్షము కలుగుతుంది. అందుకని మొట్టమొదట కావలసింది సత్కర్మాచరణము. ఈ సత్కర్మాచరణము చెయ్యడము అనేదానికి దర్భలతో సంబంధము ఉన్నది. తిరగేస్తే – ‘శుక’ అయింది. ఆయనకు కర్మాచరణము లేదు. అనగా ఆయన కర్మాచరణమును కావాలని మానినవాడు కాదు. ఆయన చెయ్యడానికి కర్మలేనివాడు. ఈ స్థితికి వెళ్ళిపోయిన వాడు. ఆయన నిరంతరము బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు. బ్రహ్మము తప్ప వేరొక వస్తువు ఆయనకు తెలియదు ఎప్పుడూ బ్రహ్మమునే చూస్తాడు. బ్రహ్మముతో కలిసిఉంటాడు. బ్రహ్మమును పొందుతూ ఉంటాడు. ఇంత ఆనందస్థితిని అనుభవించే వ్యక్తి శంకర భగవత్పాదులు. ఆయన ‘కౌపీనపంచకము’ అని ఒక పంచకము చేశారు. అందులో – ‘అసలు కౌపీనము పెట్టుకున్న వాడంత భాగ్యవంతుడు ఈ ప్రపంచములో ఎక్కడ ఉన్నాడు’ అన్నారు. ఎందుకని? అన్నీ విడిచిపెట్టి సర్వసంగ పరిత్యాగియై ఈశ్వరుని పాదారవిందములను సేవిస్తూ తిరుగుతున్నవంటి వానికి ఇంద్రపదవి లభించినా సరే దానిని తిరస్కరిస్తాడు. తనకు అక్కర్లేదు అంటాడు. ఇందులోనే తనకు తృప్తి ఉన్నది అంటాడు.


మహానుభావుడయిన శుకుడు నిరంతరము ఆనందమును అనుభవించేవాడు. ఆయన ఏదయినా ఒక ప్రదేశమునకు వస్తే ఒక ఆవుపాలు పితకడానికి ఎంతసమయము పడుతుందో అంతకన్నా ఎక్కువ సమయము నిలబడేవాడు వాడు కాదు. ఎందుకు? ఒకవేళ ఎక్కడయినా అంతకన్నా ఎక్కువసేపు నిలబడితే ఆ ఊళ్ళో ఉన్న వ్యక్తులతో తనకు పరిచయము ఏర్పడితే ఆ పరిచయం వల్ల ఇంతమంది తన మనసులో ప్రవేశించి, వీరు ఫలానా వీరు ఫలానా అని గుర్తుపెట్టుకొని వీళ్ళందరినీ లోపలపెట్టుకుంటే ఈశ్వరుడితో సంగమము తగ్గిపోయి లోకముతో సంగమము పెరిగిపోతుందని ఆయన ఎక్కడా ఎక్కువసేపు ఉండకుండా తిరుగుతూ వెళ్ళిపోతూ ఉండేవాడు. మహానుభావుడు శుకుడు తనంత తానుగా వచ్చి కూర్చుని ఏడురోజులు భాగవతములు ప్రవచనము చేశాడు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

[08/10, 11:32 am] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 3 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


భాగవత ప్రవచనము ఎవరి కొరకు చేయబడినది? భాగవతమును అందరు వినలేరని శాస్త్రం చెపుతున్నది. భాగవతమును శ్రవణం చేయడము అనేది కొన్నికోట్ల కోట్ల జన్మల తరువాత మాత్రమే జరుగుతుంది. వ్యాసుడు మిగిలిన అన్ని పురాణములను రచించినట్లు భాగవత పురాణమును రచించలేదు.

ఆయన పదిహేడు పురాణములను రచన చేసారు. ఒకసారి సరస్వతీ నదీ తీరంలో తన ఆశ్రమమునకు దగ్గరలో కూర్చుని ఉండగా మనస్సంతా ఏదో నైరాశ్యము ఆవహించింది. ఏదో నిరాశ! ఏదో లోటు! తానేదో తక్కువ చేశాననే భావన! ‘ఎక్కడో ఏదో చెయ్యడములో అసంపూర్తి మిగిలిపోయింది’ అని అనుకున్నారు.


ఆయన చేసిన కార్యక్రమాన్ని ఆలోచించారు. ‘వేదరాశినంతటినీ విభాగము చేశాను. పదిహేడు పురాణములను రచించాను. బ్రహ్మసూత్రములను రచించాను. పరాశరుడికి సత్యవతీదేవికి నారాయణాంశలో కుమారుడిగా జన్మించినందుకు నేను చేయగలిగినంత సేవ చేసాను. ఈశ్వరుడి పాదములు పట్టి సేవించాను. ధ్యానం చేశాను. అయినా నా మనస్సుకు ఎందుకో లోటుగా ఉన్నది. ఎందుకు ఇంత లోటుగా ఉన్నది? అని ఆలోచన చేసినపుడు మహానుభావుడు నారదుడు దర్శనము ఇచ్చారు. మనకు రామాయణములో మొదట సంక్షేప రామాయణము చెప్పినది నారదుడే. భాగవతములో సంక్షేప భాగవతము చెప్పినవాడు నారదుడే. ‘నారం దదాతి ఇతి నారదః’ – ఆయన జ్ఞానమును ఇస్తూ ఉంటారు.


నారదుడు వచ్చి వ్యాసునితో ‘వ్యాసా! నీ మనస్సు ఎందుకు అసంతృప్తితో, ఏదో లోటుతో ఉన్నదో తెలుసా? నువ్వు ఇన్ని విషయములు రచించావు. భారతమును రచించావు. కానీ భారతములో కృష్ణకథ ఎక్కడ చెప్పినా ధర్మమును తప్పినటువంటి కౌరవులు ఎటువంటి పరిస్థితిని పొందుతున్నారు, ధర్మమును పట్టుకున్నటువంటి పాండవులు ఎటువంటి పరిస్థితిని పొందుతున్నారు అన్న ప్రధానకథకు కృష్ణ కథను అనుసంధానము చేశావు తప్ప కృష్ణ భక్తుల చరిత్రని, ఈ ప్రపంచమంతా ఎలా పరిఢవిల్లుతున్నదో విశ్వము ఎలా సృష్టించబడిందో పంచభూతములు ఎలావచ్చాయో, భగవంతుని నిర్హేతుక కృపచేత ఆయన సృష్టికర్తయై, స్థితికర్తయై, ప్రళయ కర్తయై ఈలోకమును ఎలా పరిపాలన చేస్తున్నాడో నీవు ఎక్కడా చెప్పలేదు. ఆకారణము చేత నీమనస్సులో ఎక్కడో చిన్నలోటు ఏర్పడింది. ఇది పూర్తిచేయడానికి నీవు భాగవత రచన చెయ్యి’ అని ప్రబోధము చేశారు.


వ్యాసభగవానుడు ఆనందమును పొందినవాడై ధ్యానమగ్నుడై ఆచమనము చేసి కూర్చుని భాగవత రచన ప్రారంభము చేశారు. ఏది చెయ్యడము మిగిలిపోయిందని వ్యాసుడు నైరాశ్యము చెందాడో, ఏది అందించడం చేత తనజన్మ సార్ధకత పొందుతుందని అనుకున్నాడో, ఏది అందించిన తరువాత ఏది తెలుసుకున్న తరువాత మనిషిలో ఒక గొప్ప మార్పు వస్తుందో, కొన్ని కోట్ల జన్మలనుండి మనస్సు ఏది పట్టుకొనక పోవడము వలన అలా జరిగిందో, ఏది పట్టుకోవడము వలన మనుష్య జన్మకు సార్ధకత సిద్ధిస్తుందో అటువంటి మహా ఔషధమును మహానుభావుడు అందించడము ప్రారంభించారు.

అది వేరొకరు చెప్పడానికి కుదరదు. అది సాక్షాత్తు ఉపనిషత్తుల సారాంశం. జ్ఞానం అంతా కూడా భాగవతమునందు నిక్షేపింపబడినది. దీనిని చెప్పడానికి శుకబ్రహ్మ మాత్రమే తగినవ్యక్తి. తన కుమారుడయిన శుకబ్రహ్మకి భాగవతమును ప్రబోధము చేసారు.


ఆ భాగవతమును శుకబ్రహ్మ పరీక్షన్మహారాజుగారికి ఏడురోజులు చెప్పారు. ఎటువంటి పరిస్థితులలో చెప్పారు? భాగవతం చెప్పబడిన పరిస్థితిని మీరు విచారణ చేయాలి. చెప్పినది ఏడురోజులే! అంతకన్నా ఎక్కువ రోజులు చెప్పలేదు. ఎందుకు ఏడురోజులు చెప్పవలసి వచ్చింది? భాగవతమును సప్తాహముగా చెప్పుకోవడము వెనుక ఒక రహస్యం ఉన్నది. ఒక మనిషి ఎన్ని సంవత్సరములు బ్రతకనివ్వండి. – డెబ్బది సంవత్సరములు కాని, తొంబది సంవత్సరములు కాని లేక –

‘శతమానం భవతి శతాయుః పురుష శ్శతేంద్రియః ఆయుష్షేవేంద్రియే ప్రతితిష్ఠతి’

నూరు సంవత్సరములు పూర్ణముగా బ్రతకనివ్వండి – కాని ఎన్నిరోజులు బ్రతికాడని పరిశీలిస్తే ఏడురోజులే బ్రతికినట్లు అని మనం తెలుసుకోవాలి. ఎందుచేత? ఎన్ని సంవత్సరములు బ్రతికినా అతడు బ్రతికినది ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని – ఇంతకన్నా ఇక రోజులు లేవు. ఎనిమిదవ రోజు ఇంకలేదు. ఎప్పుడు మరణిస్తాడు? ఈ ఏడు రోజులలోనే మరణిస్తాడు. ఎంత గొప్పవాడయినా వాడు పోవడానికి ఎనిమిదవ రోజు ఉండదు. ఎవరయినా ఆ ఏడురోజులలోనే వెళ్లిపోవాలి. ఆ ఏడు రోజులలోనే పుట్టాలి. ఆ ఏడురోజులలోనే ఉండాలి. ఆ ఏడు రోజులలోనే తిరగాలి. కాబట్టి భాగవత సప్తాహము అంటే నీవు ఏరోజున భగవంతుణ్ణి స్మరించడం మానివేశావో ఆ రోజు పరమ అమంగళకరమయిన రోజు. ఆరోజు భగవంతుని ఎడల విస్మృతి కలిగింది కాబట్టి తన భగవన్నామమును పలకలేదు. ఈశ్వరుడికి నమస్కరించలేదు. ఈశ్వరుని గురించిన తలంపు లేదు. ఆరోజున తను ఉండి మరణించిన వానితో సమానం. కాబట్టి ఆ రోజున ఇంట్లో ఏమి తిరిగింది? నడయాడిన ప్రేతము ఒకటి తిరిగింది. ఒక శవం ఆ ఇంట్లో నడిచింది. కాబట్టి ఆరోజు ఆ ఇల్లు అమంగళం అయింది. కాబట్టి ఏది బ్రతుకు? నిజమయిన బ్రతుకు ఏది? నిజమయిన బ్రతుకు ఈశ్వరుని నామస్మరణమే! భగవంతుని నామమును ఎవరు స్మరిస్తాడో వాడు మాత్రమే బ్రతికివున్నవాడు. అయితే భగవంతుని నామము స్మరిద్దామంటే ఆ నామము అంత తేలికగా స్మరణకు వస్తుందా! ఆ వస్తువునందు నీకు ప్రీతి ఏర్పడితే నీమనస్సు భగవన్నామమును స్మరించడానికి అవరోధము ఉండదు. మీరు ఎక్కడ కూర్చుని వున్నా మీ మనస్సు మీకు ఇష్టమయిన వస్తువును గూర్చి స్మరిస్తూ ఉంటుంది. మనస్సు ఆవస్తువునందు ప్రీతిచెందింది కాబట్టి ఎప్పుడూ ఆ వస్తువును స్మరిస్తూ ఉంటుంది. మీ మనస్సు ఈశ్వరునియందు ప్రీతిచెందకపోతే ఈశ్వరుని నామమును స్మరించదు. ఇప్పుడు మనస్సు భగవంతుని పట్ల ప్రీతితో తిరగడానికి కావలసిన బలమును వ్యాసభగవానుడు భాగవతమునందు ప్రతిపాదన చేస్తున్నారు. 

భాగవతమును ఎవరు వింటారో వారి మనస్సు తెలిసో తెలియకో ఈశ్వరుని వైపు తిరిగిపోతుంది.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

[08/10, 11:32 am] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 4 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


శుకబ్రహ్మ పరీక్షిత్తు సమక్షములో ఏడురోజులపాటు భాగవత ప్రవచనమును చేశారు. దాని ఫలితం తాను చనిపోతానని బెంగపెట్టుకున్న పరీక్షిత్తు భాగవతమునంతటిని విన్నాడు. విన్న తరువాత ఆయన – 'ఈ శరీరం చచ్చిపోతుంది – బెంగలేదు’ అన్నాడు. ఆయనకు చనిపోవడము అనేది ఆత్మకు లేదు శరీరమని తెలిసింది. పుణ్యంచేసినా యజ్ఞంచేసినా యాగము చేసినా, తపస్సు చేసినా, అశ్వమేధయాగములు చేసినా తాను ధనుస్సు పట్టుకుని దేవతల పక్షమున నిలబడి యుద్ధము చేసినా కల్పములు మారిపోయినా, యుగములు మారిపోయినా, శరీరము పడితీరుతుంది. ధృవుడంతటివాని శరీరము పడిపోయింది. ఎవరి శరీరమయినా పడిపోవలసిందే! పడిపోయేటటువంటి సత్యము శరీరమునకు చెందినది. అది పడిపోయి తీరుతుంది. కానీ పడదని ఒక అసత్యమునందు ఒక పూనిక పెట్టుకొని ఈ భ్రాంతిచేత లోకమునందు సంగమము కలిగి చేయకూడని పనులన్నింటిని చెయ్యడానికి పూనుకుంటూ ఈ శరీరము ఉండిపోతుందన్న భ్రాంతిని పొందుతుంటే వెళ్ళవలసింది వెళ్ళిపోయి తీరుతుంది. వెళ్ళనిది ఎప్పుడూ వెళ్ళదు. 'నేను' అనబడినది ఆత్మ అయితే దానికి చావులేదు. ’నేను’ అన్నది శరీరమయితే అది చచ్చిపోయి తీరుతుంది. సత్యవస్తువును పట్టుకుంటే మరణ భయంలేదు. అసత్యవస్తువును పట్టుకుంటే మరణ భయం ఉన్నది. మరణభయములో సమస్తమయిన అజ్ఞానం, అవిద్య, భయం ఉన్నది. సత్యమును పట్టుకోవాలి. అది అంత తేలికయిన విషయం కాదు. భాగవతమును విన్నవాడు మాత్రమే సత్యమును తేలికగా పట్టుకోగలడు. అలా పట్టుకునేటట్లు సత్యవస్తువు గురించి వ్యాసుడు తన భాగవతమునందు ప్రతిపాదన చేశారు. ఎవరు భాగవతమును వింటున్నారో చదువుతున్నారో వారికి సత్యముపట్ల పూనిక కలుగుతుంది. ఈశ్వరుని పట్ల పూనిక కలుగుతుంది. ఆయన పాదములు పట్టుకున్నవాళ్ళు ఎలా తరించారో భగవంతుని భక్తుల గాథలు ఆవిష్కరింపబడతాయి.

ఏడురోజులు భాగవతమును విన్న పరీక్షిత్తుకు మరణము రాకుండా పోలేదు. మరణం వచ్చింది. ఏడురోజులు పోయిన తరువాత పరమ ధైర్యముతో – 'శరీరమునకు మరణము వచ్చినా నాకు బెంగలేదు. ఇపుడు నేను ఆత్మగా నిలబడిపోతున్నాను’ అన్నాడు. ఈ శక్తి కొన్ని కోట్ల జన్మలలో లోపించడము వలన మనం అలా తిరుగుతూనే ఉన్నాము. శంకరభగవత్పాదులు సౌందర్యలహరిలో 'మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషీ’ (సౌందర్యలహరి – 97) అంటారు. అలా మాయలో తిరుగుతూనే ఉన్నాము. ఈ సత్యమును భాగవతము ఆవిష్కరిస్తున్నది. భాగవతమును శుకబ్రహ్మ ప్రవచనము చేశారు. పెద్దలు అంటారు –

'నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖాదమృత ద్రవసంయుతం!

పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః!!’

భాగవతమును వినేవాళ్ళు 'భాగవతమును నేను వింటున్నాన' ని ఎప్పుడూ వినకూడదు. 'పిబత భాగవతం’ – భాగవతమును త్రాగేయాలి. భాగవతమును త్రాగడము ఎలా కుదురుతుంది? త్రాగడమును నోరు అనబడే ఇంద్రియము చెయ్యాలి. వినడమనే దానిని చెవనే ఇంద్రియము చెయ్యాలి. చెవనే ఇంద్రియానికి ఒక లక్షణము ఉన్నది. నోరు త్రాగుతున్నప్పుడు మనస్సు ఎక్కడో తిరుగుతూ ఉన్నా అయినా నోరు ఆ పదార్థమును తీసుకొని కడుపులోకి పంపించివేస్తుంది. ఒకవేళ ఆ పాలలో ఒక చీమ ఉన్నా నోరు పుచ్చుకోను అనదు. పుచ్చుకుంటుంది. త్రాగేసే పదార్థములో సాధారణముగా తీసిపారేసేది ఏదీ ఉండదు. భాగవతము కూడా అటువంటిదే. దీనిలో తీసిపారవేయవలసినది ఏదీ ఉండదు. భాగవతము నందు ఉన్నవాడు ఒక్కడే! భాగవతములో భగవంతుడు శబ్దరూపముగా వస్తున్నాడు. దానిని నీవు చెవులతో పట్టి త్రాగెయ్యాలి. విడిచిపెడితే జారి క్రిందపడిపోతుంది. ఏమిటి దాని గొప్పతనం?

వేదములనే కల్పవృక్షము ఒకటి ఉన్నది. వేదములను సేవించడము చేత కావలసిన సమస్తమయిన కోర్కెలను తీర్చుకోగలరు. అటువంటి వేదములనబడే కల్పవృక్షము శాఖల చిట్టచివర పండు పండింది. వేదముల చివర ఉన్న ఉపనిషత్తులు జ్ఞానమును ప్రబోధము చేస్తాయి. జ్ఞానమును బోధించే వేదముల చివర ఉన్న శాఖల చివరిభాగములలో పండిన పండు ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మ స్వరూపము. ఈ పరబ్రహ్మ స్వరూపము ఈవేళ పండుగా పండింది. దానిని శుకబ్రహ్మనే చిలక కొట్టింది. దేనిమీదా అపేక్షలేనటువంటి మహాపురుషుడు శుకుడు తన నోటి ద్వారా ప్రవచనము చేశారు. అటువంటి శుకబ్రహ్మ నోట్లోంచి వచ్చింది. ఆ భాగవతమును త్రాగెయ్యాలి. ఇది ఈశ్వరుడితో నిండిపోయి ఉన్నది. భూమియందు నీవు భావుకుడివి అయితే నీవు చేయవలసిన ప్రధాన కర్తవ్యం ఇదే. ఈ భాగవతము అంత గొప్పది.

ఇటువంటి భాగవతమును సంస్కృతము లో మహానుభావుడు వ్యాసమహర్షి ద్వాదశ స్కంధములలో ప్రవచనము చేసారు. దానిని ఆంధ్రీకరించినది మహానుభావులు పోతనామాత్యులవారు. పోతనగారిలో మీరు గమనించవలసిన విషయం ఒకటి ఉన్నది. మనకి ముగ్గురు రాజులు ఉన్నారు.

వారిలో ఒకరు త్యాగరాజు, ఒకరు పోతురాజు, ఒకరు గోపరాజు. వీరి ముగ్గురిపేర్లలో రాచరికం ఉన్నది. వీరు ముగ్గురూ భగవంతుని సేవించారు. సేవించి ఈ రాచరికం వద్దని తీసి అవతల పారేశారు. పిమ్మట గోపరాజుగారు సాక్షాత్తుగా రామదాసు అయ్యారు. త్యాగరాజుగారేమో త్యాగయ్య అయ్యారు. పోతరాజుగారు పోతన్న అయ్యారు. ముగ్గురూ రాచరికాలను తీసి ఈశ్వరుని పాదముల దగ్గర దాస్యమును అభిలషించారు. వీళ్ళు ముగ్గురు జగత్తును ఏలి భక్తిని పంచిపెట్టారు.

పోతనగారికి జీవనాధారముగా కేవలము కొద్ది భూమిమాత్రమే ఉండేది. మనం సాధారణముగా ఒకమాట వింటూ ఉంటాము – 'రామాయణం, భాగవతం చదువుకుందాం అని ఉంటుంది – కానీ ఎక్కడ? ఆఫీసు, ఇల్లు, ఇంటికి వచ్చిన తరువాత సంసారం – వీటితోనే సరిపోతోంది – భాగవతము పన్నెండు స్కంధములు చదవాలంటే ఎక్కడ జరుగుతుందీ – కుదరడము లేదు – చదవాలని ఉంటుంది’ అంటారు. మనం పోతనగారి జీవితమును పరిశీలిస్తే ఆయనకు చిన్న పొలం ఉండేది. ఆయన ఏకశిలానగరం ఓరుగల్లుకి దగ్గరలో ఉండేవారు. ఉండి ఆ పొలం దున్నుకొని ఎప్పుడు నాగలిపట్టారో, ఎప్పుడు విత్తనములు చల్లారో, ఎప్పుడు పొలము దున్నారో, ఎప్పుడు మంచెమీద కూర్చున్నారో తెలియదు. త్రికాలములయందు సంధ్యావందనము చేసుకొని ఒకానొకనాటి సాయంకాలం చంద్రోదయం జరుగుతున్న సమయములో వారు గోదావరినదిలో స్నానం చేసి సైకతము మీద ధ్యానమగ్నులై అరమోడ్పు నేత్రములతో కూర్చుని ఉన్నారు. వారికి శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్కారమయి 'పోతనా! నీజన్మ ఉద్ధరించాలని నేను అనుకుంటున్నాను. నీవు మహాభాగవతమును ఆంధ్రీకరించు. తెలుగులో వ్రాయి’ అన్నారు. వెంటనే పోతనగారు శ్రీరామచంద్రమూర్తికి నమస్కరించి – 'అయ్యా ! మీరు ఆనతిచ్చారు. నేను భాగవతమును వ్రాయడమేమిటి!’

పలికెడిది భాగవతమట

పలికించెడి వాడు రామభద్రుండట నే

బలికిన భవహర మగునట

పలికెద వేరొండు గాథ పలుకగనేలా? అన్నారు.

ఎంతో చెప్పారు. ’నేను భాగవతమును రచించడము ప్రారంభము చేస్తున్నాను. కానీ భాగవతమును రచిస్తున్నవాడు పోతనా! నా వెనకాతల ఉండి దానిని నాచేత పలికిస్తున్నవాడు శ్రీరామచంద్రమూర్తి. ఎన్నో కోట్ల జన్మలనుంచి పొందిన పాపమును పోగొట్టడానికి నాచేత భాగవతమును రచింపచేశాడు. ఇంకొకగాథ నేను ఎందుకు పలకాలి? ఈశ్వరుడు ఏది పలికిస్తున్నాడో అదే నేను పలుకుతాన' ని ఎంతో గొప్ప మాట అన్నారు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

[08/10, 11:33 am] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 5 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


పోతనగారు భాగవతమును ఆంధ్రీకరిస్తూ మొట్టమొదట ఒక పద్యం చెప్పుకున్నారు.


శ్రీకైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్ లోక ర

క్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవో

ద్రేకస్తంభకుఁ గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా

నా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్!!


పోతనగారి శక్తి, ఉపాసనా బలం ఏమిటో ఆ పద్యములలో చూడాలి. ఆ పద్యం నోటికి వచ్చి – మీరు ఆ పద్యమును ఎక్కడ కూర్చున్నా చదువుకోగలితే – జీవితమును మార్చడానికి ఆ పద్యం ఒక్కటి చాలు. పోతనగారు ఈ భాగవతమును ఎందుకు ఆంధ్రీకరిస్తున్నాను? భాగవతమును ఆంధ్రీకరించి రాజులకు గాని లేక ఎవరో జమీందారులకు ఇచ్చి వారి దగ్గర ఈనాములు పుచ్చుకొని నేను ఏదో పాముకోవాలనే తాపత్రయం నాకు లేదు’ అన్నారు. ఈశ్వరుడి గురించి చెప్పుకున్నారు. కైవల్యము అన్నమాట అద్వైత సాంప్రదాయమునకు చెందినది. కైవల్యము అంటే ఇంక మళ్ళీ తిరిగిరావలసిన అవసరము లేకుండా ఈశ్వరునిలో కలిసిపోవడము. అలా 'ఈశ్వరుడియందు నా తేజస్సు వెళ్ళి ఆయన తేజస్సులో కలిసిపోవడానికి గాను నేను ఆయనను ధ్యానము చేస్తున్నాను' అన్నారు. రామచంద్రమూర్తి రచింపజేస్తున్నారు. పోతనగారి చెయ్యి కదిపిన శక్తి రామచంద్రమూర్తిది.

పరమాత్మ లోకములను రక్షించుటను ఆరంభించినవాడు. సృష్టించడములో లోకరక్షణము ప్రారంభం అవుతుంది. 'ఆ పరమాత్మను సృష్టికర్తగా నేను నమస్కరిస్తున్నాను’. లోకమునంతటిని ఆయన రక్షిస్తూ ఉంటాడు. ఆయనపెట్టిన అన్నం తిని, జీర్ణం చేసి శక్తిని ఇస్తే ఆ శక్తితో ఈశ్వరుడిని తిట్టేవాని యందు కూడ ఈశ్వరుడు శక్తిరూపములో ఉంటాడు. తనను నమ్ముకొన్న వాళ్ళని, ఈశ్వరుడు ఉన్నాడని నమ్మి పూనికతో వున్నవాళ్ళను రక్షించడము కోసం ఈశ్వరుడు వాళ్ళవెంట పరుగెడుతూ ఉంటాడు. పరుగెత్తే లక్షణము ఉన్నవాడు. దానవుల ఉద్రేకమును స్తంభింపజేయువాడు. రాక్షసులందరికీ చావులేదని అనుకోవడము వలననే వారికి అజ్ఞానము వచ్చింది. ’ఈలోకములనన్నిటిని లయం చేస్తున్నవాడు ఎవడు ఉన్నాడో వానికి నమస్కరిస్తున్నాను' ఆన్నారు తప్ప ఎవరిపేరు చెప్పలేదు. ఆయన పరబ్రహ్మమును నమస్కరిస్తున్నారు. 'సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తయిన పరబ్రహ్మమునకు నేను నమస్కరిస్తున్నాను. కేవలము తన చూపులచేత లోకములనన్నిటిని సృష్టించగల సమర్ధుడయిన వానికి నేను నమస్కరిస్తున్నాన’ ని ఆన్నారు. భాగవతములో పరబ్రహ్మముగా కృష్ణభగవానుడిని ప్రతిపాదించారు. ఇక్కడ కృష్ణుడని అనడము లేదు. 'మహానందాంగన’ అని ప్రయోగించారు. చిన్న పిల్లవానిలా కనపడుతున్న వాని గురించి చెపుతున్నాను కాని వాడు పరబ్రహ్మ అందుకని వాని కథ నేను చెప్పుకుంటున్నాను’ అన్నారు. అందులో ఒక రహస్యము పెట్టారు. పోతనగారిలా బ్రతకడము చాలాకష్టం. పోతనగారి ఇలవేల్పు దుర్గమ్మ తల్లి. పోతనగారు తెల్లవారు లేచి బయటకు వస్తే విభూతి పెట్టుకుని, రుద్రాక్షమాలలు మెడలో వేసుకొని ఉండేవారు. ఎల్లప్పుడూ నారాయణ స్మరణ చేస్తూ ఉండేవారు. పోతనగారు

'కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నానాకంజాత

భవాండకుంభకు మహానందాంగనా డింభకున్’ అని ఎంతో విచిత్రమయిన మాట

అన్నారు. ఎవరు ఈ మహానందాగన? మీరు ఇంకొకరకంగా ఆలోచిస్తే – పొందే ఆనందము శాస్త్రం లెక్కలుకట్టి ఆనందమును శాస్త్రం నిర్వచనము చేసింది. ఏదో మనుష్యానందము, సార్వభౌమానందము, దేవతానందము అని ఇలా చెప్పిచెప్పి చివరకు ఆనందము గొప్పస్థితిని 'మహానందము’ అని చెప్పింది. ఈ మహానందము అనేమాట శాస్త్రంలో శ్రీ దేవీ ఖడ్గమాలాస్తోత్రంలో వాడారు. అమ్మవారికి ’మహానందమయి’ అని పేరు. అమ్మవారి డింభకుడు కృష్ణుడు అంటే ఎలా కుదురుతుంది? అమ్మవారి కొడుకుగా కృష్ణుణ్ణి ఎక్కడ చెప్పారు? లలితా సహస్రమును పరిశీలిస్తే అందులో

'కరాంగుళినఖోత్పన్న నారాయణ దశాకృతిః’

భండాసురుడు పదిమంది రాక్షసులను సృష్టించాడు. మళ్ళీ రావణాసురుడుని, హిరణ్యాక్షుడిని, హిరణ్యకశిపుడిని సృష్టించాడు. వాళ్ళు పదిమంది మరల పుట్టామనుకొని యుద్ధానికి వస్తున్నారు. వారిని అమ్మవారు చూసి ఒకనవ్వు నవ్వింది. వారికేసి ఒకసారి చెయ్యి విదిల్చేసరికి ఆమె రెండుచేతుల వేళ్ళ గోళ్ళనుండి దశావతారములు పుట్టాయి. పుట్టి మరల రాముడు వెళ్ళి రావణుణ్ణి చంపేశాడు. కృష్ణుడువెళ్ళి కంసుడిని చంపేశాడు. అలా చంపేశారు కాబట్టి శ్రీమహావిష్ణువు అవతారములు అన్నీ అమ్మవారి చేతి గోళ్ళలోంచి వచ్చాయి. ’శ్రీమహావిష్ణువు మహానందమయి కుమారుడు. మహానందమయి డింభకుడు. అటువంటి స్వామికి నేను నమస్కరిస్తున్నాను’ అన్నారు. ఆయన స్వరూపము మహానందం. ఆయన పేరు కృష్ణుడు. నిరతిశయ ఆనందస్వరూపుడు.


పోతనగారు భాగవతమును అంతటినీ రచించి ఒక మంజూష యందు పెట్టారు. ఆయన ఎవ్వరికీ తాను అంత భాగవతమును రచించానని కూడ చెప్పలేదు. 'ఇది రామచంద్రప్రభువు సొత్తు – దానిని రామచంద్రప్రభువుకి అంకితం ఇచ్చేశాను’ అని అన్నారు. కొడుకును పిలిచి ఆ తాళపత్ర గ్రంథములను పూజామందిరములో పెట్టమన్నారు. ఆ తాళపత్ర గ్రంథములు పూజామందిరములో పెట్టారు. కొంత కాలమయిపోయిన తరువాత పోతనగారి కుమారుడు పెద్దవాడయిపోయి అనారోగ్యము పాలయ్యాడు. అతడు తన శిష్యుడిని పిలిచి 'మా నాన్నగారు రచించిన భాగవతము ఆ మంజూషలో ఉన్నది. దానిని జాగ్రత్తగా చూడవలసింది’ అని చెప్పాడు. కొద్ది కాలమునకు అందులోంచి నాలుగయిదు చెదపురుగులు బయటకు వస్తూ కనపడ్డాయి శిష్యునికి. అపుడు ఆ శిష్యుడు మంజూషను తీశాడు. తీసిచూస్తే అందులో ఆంధ్రీకరింపబడిన భాగవతము ఉన్నది. ఇంత గొప్ప భాగవతమని అప్పుడు తాళపత్ర గ్రంథములకు ఎక్కించారు తప్ప పోతనగారు తన జీవితములో ఎప్పుడూ ఇంత గొప్ప విషయమును రచించానని బయటకు చెప్పుకోలేదు. మహానుభావుడు అంత నిరాడంబరుడు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

[08/10, 11:33 am] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 6 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు! శూలికైన దమ్మిచూలికైన!

విబుధజనుల వలన విన్నంత కన్నంత, దెలియవచ్చినంత తేట పరతు!!

ఎంతో వినయముగా చెప్పుకున్నారు. భాగవతము ఎవరు చెప్పగలరు? భాగవతమును చతుర్ముఖ బ్రహ్మ చెప్పలేరు. జ్ఞానమునకు ఆలవాలమయిన పరమశివుడు చెప్పలేడు. ఒక్కొక్క కోణములో ఒక్కొక్క అర్థం వస్తూ వుంటుంది. 'మహాపండితులయిన వారి దగ్గర నేను విన్నది చదువుకున్నది ఏది ఉన్నదో నాకు అర్థమయిన దానిని, నాకు శారదాదేవి ఏది కృపచేసిన దానిని నేను చెప్పుకుంటున్నాను’ అన్నారు. ఆయన –

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బె

ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దన్ను బో

నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మా

యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్!!

విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవెలలో ఇప్పటికీ రాజద్వారం మీద ఈ పద్యం రాసి ఉంటుంది. ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుంది. తెలిసికాని, తెలియకకాని పోతనగారు వ్రాసిన పద్యములు కొన్ని నోటికి వచ్చినవి మీరు చదివినట్లయితే అవి సద్యఃఫలితము ఇస్తాయి. అందరు కొన్ని చదవకూడదు. కొన్ని చేయకూడదు. పక్కన గురువు వుంటే తప్ప మేరువుని, శ్రీచక్రమును ఇంట్లోపెట్టి పూజ చెయ్యలేరు. బీజాక్షరములను ఉపాసన చెయ్యడము కష్టం. పోతనగారు ఈ దేశమునకు బహూకరించిన గొప్ప కానుక ఆయన రచించిన భాగవత పద్యములు.


'అమ్మలనుకన్న దేవతా స్త్రీలయిన వారి మనస్సులయందు ఏ అమ్మవారు ఉన్నదో అటువంటి అమ్మకు మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ – ఈ నాలుగింటికోసము నమస్కరిస్తున్నాను. అటువంటి దుర్గమ్మ మాయమ్మ. ఇవీ ఆయన ఈ పద్యంలో చెప్పిన విషయములు. మనం చెయ్యలేని చాలా కష్టమయిన పనిని పోతనగారు చాలా తేలికగా ప్రమాదము లేని రీతిలో మనతో చేయించేయడానికి ఇటువంటి ప్రయోగము చేశారు.


'అమ్మలగన్నయమ్మ’ – లలితాసహస్రము 'శ్రీమాతా’ అనే నామముతో ప్రారంభమవుతుంది. 'శ్రీమాతా’ అంటే ’శ’ కార 'ర’ కార ’ఈ’ కారముల చేత సత్వరజస్తమోగుణాధీశులయిన బ్రహ్మశక్తి, విష్ణుశక్తి రుద్రశక్తులయిన రుద్రాణి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి – ఈ ముగ్గురికీ అమ్మ – ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ ఆయమ్మ – 'లలితాపరాభట్టారికా స్వరూపం’ – ఆ అమ్మవారికి, దుర్గాస్వరూపమునకు భేదం లేదు – 'అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ’ – ఆ ముగ్గురు అమ్మలే మనం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపములుగా కొలిచే తల్లులు. ఈ ముగురమ్మల మూలపుటమ్మ.


'చాల పెద్దమ్మ’ – ఇది చాలా గమ్మత్తయిన మాట. చాల పెద్దమ్మ అనే మాటను సంస్కృతములోకి తీసుకువెడితే మహాశక్తి – అండపిండ బ్రహ్మాండములనంతటా నిండిపోయిన శక్తిస్వరూపము. ఈ శక్తి స్వరూపిణి చిన్నపెద్దా భేదము లేకుండా సమస్త జీవరాశులలోను ఇమిడి ఉన్నది. అలా ఉండడము అనేదే మాతృత్వం. ఇది దయ. దీనిని సౌందర్యం అంటారు. దయకు సౌందర్యం అని పేరు. అది ప్రవహిస్తే సౌందర్యలహరి.

అండపిండ బ్రహ్మాండములనన్నిటినీ నిండిపోయి ఈ భూమిని, లోకములనన్నిటినీ తిప్పుతూ ఇవన్నీ తిరగడానికి కారణమయిన అమ్మవారు ఎవరో ఆ అమ్మ, 'సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ’ – సురారి అనగా దేవతలకు శత్రువయిన వాళ్ళ అమ్మ దితి. దితి ఏడిచేటటుగా కడుపుశోకమును మిగిల్చింది. అనగా రాక్షసులు నశించడానికి కారణమయిన అమ్మ. దేవతలలో శక్తిగా ఈమె ఉండబట్టే రాక్షసులు మరణించారు.

'తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ’ – ఇదొక గొప్పమాట.

మనకి సంప్రదాయములో ’అష్టమాతృకలు’ అని ఉన్నారు. వాళ్ళని మనం ఎనిమిది పేర్లతో పిలుస్తూ ఉంటాము. బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, మహేంద్రి, చాముండ, కౌమారి, వారాహి, మహాలక్ష్మి.

ఇలా ఎనమండుగురు దేవతలు ఉన్నారు. వీరిని ’అష్టమాతృకలు’ అని పిలుస్తారు. ఈ అష్టమాతృకలు శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు. వీరు నిరంతరము అమ్మవారిని లోపల కొలుస్తూ, అమ్మవారి వలన శక్తిని పొంది మనని ఉద్ధరిస్తూ ఉంటారు. ఈ ఎనమండుగురునే మనం కొలుస్తూ వుంటాము.

'రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సౌభాగ్యసుందరాం వైష్ణవీం శక్తిమద్భుతాం’

అని దేవీభాగవతములో వ్యాసభగవానుడు అంటారు. ఈ ఎనమండుగురికీ శక్తినిచ్చిన అమ్మవారెవరో ఆవిడే వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ – దుర్గమాయమ్మ – ఈ దుర్గమ్మే లలితా పరాభట్టారిక – ఆ అమ్మ మాయమ్మ.

’మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్’ – ఆవిడ దయతో మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదలను అర్హత ఉన్నదని ఇవ్వనక్కరలేదు. దయతో ఇచ్చెయ్యాలి.


అమ్మవారికి 'శాక్తేయప్రణవములు’ అని కొన్ని బీజాక్షరములు ఉన్నాయి. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌః – ఈ ఆరింటిని శాక్తేయ ప్రణవములని పిలుస్తారు. బీజాక్షరము అంటే “Letter Pregnant with sound” అంటారు చంద్రశేఖర పరమాచార్య స్వామివారు. బీజాక్షరములను అన్నివేళలా ఉపాసన చెయ్యకూడదు, చేయలేము. ఇప్పుడు పోతనగారు ఒక గొప్ప ప్రయోగము చేశారు. మహత్వమునకు బీజాక్షరము 'ఓం’ కవిత్వమునకు బీజాక్షరము, 'ఐం’ పటుత్వమునకు భువనేశ్వరీ బీజాక్షరము, 'హ్రీం”, సంపదలు – లక్ష్మీదేవి – 'శ్రీం’ 'ఓంఐంహ్రీంశ్రీం’ – అమ్మలగన్నయమ్మ ’శ్రీమాత్రే నమః’ బీజాక్షరములతో అస్తమానము అలా అనడానికి వీలులేదు. మీరు రైలులో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా స్నానం చేసినా, చెయ్యక పోయినా, ఎక్కడ ఉన్నా – అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ – అనుకుంటుంటే మీరు మరోరూపంలో 'ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’ – 'ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’ అంటూ ఎప్పుడూ అమ్మను తలచుకున్నట్లు అవుతుంది. అమ్మవారు చాలా తొందరగా మీకు పలుకుతుంది. అందుకే లలితా సహస్రం 'శ్రీమాతా’ అంటూ అమ్మతనముతో ప్రారంభమవుతుంది.

అమ్మవారు రాజరాజేశ్వరయినా ఆవిడముందు అమ్మా! అమ్మా! అనేసరికి ఆవిడ పొంగిపోతుంది. ఇన్నిమార్లు ఆ పద్యంద్వారా అటూ ఇటూ అమ్మని మీరు పిలుస్తుంటే విసుక్కోవడము చేతకాని దయాస్వరూపిణి అయిన అమ్మ మీకోరికను తీరుస్తుంది. 'ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రే నమః’ అనలేకపోవచ్చు. 'అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ ’ అనడానికి కష్టం ఉండదు ఈవిధముగా పోతనగారు శ్రీవిద్యా రహస్యములన్నిటిని ఔపోసనపట్టి ఆంధ్రదేశమునకు ఒక మహత్తరమయిన కానుకను బహూకరించిన మహాపురుషుడు. ఆయన ఒక ఋషి కనుక ఆ పద్యమును ఇచ్చారు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

[08/10, 11:33 am] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 7 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu

భాగవతం అనేది సామాన్యమయిన గ్రంథము కాదు.

లలితస్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం

జులతాశోభితమున్, సువర్ణ సుమన స్సుజ్ఞేయమున్, సుందరో

జ్జ్వలవృత్తంబు, మహాఫలంబు, విమల వ్యాసాలవాలంబునై

వెలయున్ భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్ద్విజశ్రేయమై.

దీని స్కంధము లలితము. కృష్ణుడు మూలమై ఉన్నాడు. ఒక చెట్టు బాగా పెరగాలంటే చెట్టు మొదట్లో నీళ్ళు పోస్తే బాగా పెరుగుతుంది. శుకబ్రహ్మ ఆలాపన చేసిన మహోత్కృష్టమయిన స్తోత్రము. అపారమయిన మంజులమయిన మాటలతో శోభిస్తూ ఉంటుంది. ఈ భాగవతము చదువుతున్న వారికి, మంచిమనస్సుతో ఉన్న వారికి అర్థమయ్యే స్వరూపము కలిగినది. ఇది పుడమి మీదకి వచ్చి నిలబడిన కల్పతరువు భాగవతములో పది పద్యములు వచ్చినట్లయితే ఆ వ్యక్తి కల్పవృక్షమును జేబులో పెట్టుకొని తిరుగుతున్నట్లు లెక్క. వాని కోరిక తీరుతుంది. భాగవతంలో పోతనగారు గొప్పగొప్ప ప్రయోగములన్నిటిని, పద్యములుగా తీసుకువచ్చి పెట్టిన అంత గొప్ప భాగవతమును శుకబ్రహ్మ వివరణ చేశారు.

వ్యాస భగవానుడు నైరాశ్యమును పొందితే నారదుడు సాక్షాత్కరించి ‘వ్యాసా! లోకములో బోధ చేయకపోయినా సరే ప్రజలు అందరికి కూడా తెలిసిన విషయములు రెండు ఉన్నాయి. అవి అర్థ, కామములు. ఈ రెండింటి గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పనక్కరలేదు. అందరికీ డబ్బు దాచుకోవడం, డబ్బు సంపాదించుకోవడం తెలుసు. రూపాయి ఎలా సంపాదించాలనే తాపత్రయం మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. సంస్కారబలం తక్కువగా ఉంటుంది. కలియుగంలో ఉండే వాళ్ళది అల్పాయుర్దాయం. బుద్ధి బలం చూస్తే తక్కువ. ఎప్పుడూ అర్థకామములయందు మాత్రమే ప్రచోదనం ఉంటుంది.

ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళు వచ్చేసరికి కొడుక్కి మీరు పెళ్ళి చేయకపోతే – పెళ్ళి చేయలేదనే విషయమును తెలిసేలా చేస్తాడు. అమ్మ దగ్గరికి వచ్చి నా ఈడువాడికి అప్పుడే కొడుకమ్మా అంటాడు. ఇది అమ్మా! మీరు నా సంగతి పట్టించుకోవడం లేదని తల్లికి పరోక్షంగా చెప్పడమే! ఇంకా అశ్రద్ధ చేస్తే – ఎప్పుడో ఒకరోజు పెళ్ళి చేసుకొని మీ దగ్గరకి నమస్కారం పెట్టడానికి వస్తాడు.

మానవుడు ఎప్పుడూ అర్థ కామములయందు తిరుగుతూ ఉంటాడు. అర్థకామములను గురించి ఎవరికీ ప్రత్యేకముగా బోధ చేయనక్కరలేదు. భగవత్సంబంధమును గురించి, భక్తి గురించి మాత్రం బోధ చెయ్యాలి’ అని నారదుడు చెప్పడము కొనసాగించాడు.

రోగం ఎక్కడ పుట్టింది? అని శాస్త్రం అడిగితే అన్నంలోంచి పుట్టిందని చెప్పారు. డాక్టరుగారు తినవద్దని చెప్పిన పదార్థములను తినడము ద్వారా మనిషి రోగమును పెంచుకుంటున్నాడు. తన రసనేంద్రియములను నిగ్రహించలేకపోవడం వలన అటువంటి స్థితి ఏర్పడి రోగము వస్తుందని తెలిసినా సరే, శరీరమే పోతుందని తెలిసినా సరే, తినాలని కోరికను నిగ్రహించలేకపోయారు. ఈ బలహీనత కొన్ని కోట్ల జన్మలనుండి తరుముతున్నది. డబ్బు పిచ్చి, ఇంద్రియముల పిచ్చి అలా తరుముతూనే ఉన్నాయి. వాటికి వశులవుతూనే ఉన్నారు. అయినాసరే ఒక బురదలో పడిపోయిన వాడు బురదనీటిని తీసుకొని స్నానం చేస్తే వాడు శుద్ధి అయిపోడు. నీవు ఇంద్రియముల చేత తరమబడి కొన్ని కోట్ల జన్మలు ఎత్తి మరల ఇంద్రియములకు సంబంధించిన సుఖములనే శరీరమునకు ఇస్తుంటే ఇక ఎప్పుడూ ఉత్తమగతులు పొందడము జరగదు. ఒంటికి పట్టిన బురద పోవాలి అంటే మంచినీటి స్నానము ప్రేమ ఉన్న అమ్మ చేయిస్తుంది. ఇక్కడ ప్రేమ వున్న అమ్మస్వభావం కలవారు వ్యాసుడు. ఆయన చేయించాలి. అందుకని ఆయన భాగవతం ఇచ్చారు.

నారదుడు – ‘నువ్వు పాండవులు కౌరవులు ఎలా కొట్టుకున్నారో, వారికి రాజ్యములు ఎలా వచ్చాయో మున్నగు విషయములను గూర్చి వివరించి వ్రాసావు. అవి అన్నీ ఇప్పటి ప్రజలకు చాలా బాగా తెలుసు. ఇప్పటి వ్యక్తులు భారతము ఏమీ చదవకుండా దుర్యోధనుని కన్నా అహంకారముతో తిరగగలరు. ధృతరాష్ట్రునికన్నా బాగా పక్కింటివాడి ఐశ్వర్యము తెచ్చి దాచేసుకోగలరు. నీవు ప్రయత్నపూర్వకముగా భగవంతుని గూర్చి ఏమీ చెప్పలేదు. భగవంతుని గురించి చెప్పకపోతే ఈ జన్మలో చేసుకున్న ఇంద్రియలౌల్యం వచ్చే జన్మలో హీన ఉపాధులలోకి తీసుకుపోతుంది. భగవంతునికి ఏమీ రాగద్వేషములు ఉండవు. ఒక వ్యక్తికి కామము బాగా ఉండిపోయి ఆ వ్యక్తికి రాకూడని మాట ఒకటి వస్తూ ఉంటుంది.

వార్ధక్యంబున మోహమూర్ఖతలచే వాతాది రోగాలచే

వ్యర్థంబై చెడు వాక్ప్రవాహములచే వాత్సల్యచిత్తంబుచే

యర్థధ్యానముచే మహాభ్రమతచే హాస్యప్రసంగాలచే

స్వార్థంబే పరమార్థమై చెడుదు రీ స్వార్థప్రజల్ శంకరా! (శ్రీశంకరశతకం-80)

కామం ఉండిపోతే పైకి చెప్పలేక డెబ్బది ఏళ్ళు వయస్సు వచ్చేసిన తరువాత మంచి పంచె కట్టుకొని వస్తే – ‘తాతయ్యా! పెళ్ళికొడుకులా ఉన్నావు’ అని సరదాకి ఎవరయినా – అంటే ‘అమ్మా! అలా అనకూడదు. మిమ్మల్ని చూడగానే త్రివేణీ సంగమంలో స్నానం చేసిన ఫలితము కనిపించే మంచి ఉపాసనాబలం పొందుతున్న వారిలా ఉన్నారను – అది నా శరీరమునకు సరిపోతుంది. ఇంకా నేను పెళ్ళికొడుకునేమిటమ్మా’ అని అనకుండా – నాకు పిల్లనిచ్చేవాళ్ళు ఎవరు? అంటాడు. కడుపులో ఎంతో బాధ. ఎనభై ఏళ్ళు వచ్చినా వాళ్ళు అలా అన్నందుకు బాధపడడము లేదు. నిజంగా నేను పెళ్ళికొడుకులా ఉంటే సంబంధములు చూసి, తాతగారూ! మీరు చేసుకోండని పిల్లను తెచ్చి పెళ్ళి చేయవచ్చు కదా ! అని కడుపులో బాధ! వృద్ధాప్యములో ఒక విధమయిన ధూర్తతనం వచ్చి అంత్యమునందు ఇంకా వ్యామోహం ఉండిపోతుంది. శరీరములోంచి నిరంతరము చీము స్రవించే వ్రణములు బయలుదేరతాయి. అందులోంచి క్రిములు బయటపడుతూ ఉంటాయి. అంతదూరంలో ఉండే ఇక్కడే పుల్లటి కంపు రావడము మొదలవుతుంది. ఎవరూ వాని దగ్గరకు వెళ్ళరు ఎంతో బాధపడతాడు. అంత బాధపడ్డ తరువాత కామం పోతుంది. నీవు వ్యాసుడవయినందుకు అంత బాధ వారు పడకుండా నీవు చూడాలి. ఇటువంటి పాపం ఉత్తరజన్మకు వెళ్ళకుండా ఆపేశక్తి వీళ్ళకి ఇవ్వాలి. వ్యాసా! నువ్వు భగవద్భక్తికి సంబంధించిన విషయం అందించు. తెలిసో తెలియకో వచ్చి భాగవతమును వినడం, చదవడం కాని చేస్తే అంతమాత్రం చేత భాగవతం విన్నారని వారి ఖాతాలో వ్రాసి హీనోపాధికి వెళ్ళిపోకుండా ఈ ఫలితమును అడ్డుపెట్టి మంచి జన్మవైపుకి తిప్పుతాడు. భాగవత శ్రవణం ఒక ఉత్తముని ఇంట్లో పుట్టి భగవద్భక్తి వైపుకి మారుస్తుంది. ఒకమంచిమాట చెప్పు. నీవు మరల అర్థకామములను గురించే మాట్లాడితే కావ్యమునకు ఏమీ ప్రయోజనం ఉండదు. హరినామస్మృతిలేని కావ్యము వృథా దాని వలన ఏవిధమయిన ఉపయోగం ఉండదు. హరినామస్మృతి చేయు కావ్యము మానస సరోవరము లాంటిది. హరినామము చెప్పని కావ్యము నీవు ఎంతగొప్ప అర్థములతో చెప్పినా అది తద్దినం పెట్టేచోటికి కాకులు వచ్చే రేవులాంటిది. అందుకని నీవు ఇప్పుడు భగవద్భక్తి, భగవంతునికి సంబంధించిన విశేషములు, భగవద్భక్తుల కథలతో కూడిన విషయములను చెప్పు. భాగవతంలో అటువంటివి చెప్ప’ ని వ్యాసునికి చెప్పాడు.

https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage

instagram.com/pravachana_chakravarthy

[08/10, 11:33 am] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 8 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


శ్రీమదాంధ్ర భాగవతం - నారదుని పూర్వజన్మ వృత్తాంతము

‘వ్యాసా! నా చరిత్ర నీకు చెపుతాను వింటే నీవు తెల్లబోతావు’ అని తాను నారదుడెలా అయ్యాడో చెపుతాడు.


నారదుడు ఒక దాసీపుత్రుడు. ఆయన తల్లిగారు చిన్నతనంనుంచీ బాగా ఐశ్వర్యవంతులయ్న బ్రాహ్మణుల ఇంటిలో ఊడిగం చేసేది. వాళ్ళ ఇల్లు తుడవడం, వాళ్ళ గిన్నెలు తోమడం, ఆవులకు పాలు పితికి పెట్టడం మొదలగు పనులు చేసేది. తల్లి ఎక్కడికి వెడితే ఎక్కడికి వెళుతూ బ్రాహ్మణుల ఇంటిలో తిరుగుతున్నాడు. వారు వేదవేదాంగములను చదువుకున్నవారు. ఆ ఇంటికి వర్షాకాలంలో కొంతమంది సన్యాసులు చాతుర్మాస్యమునకు వచ్చారు. వస్తే అమ్మతోపాటు ఈ పిల్లవాడు కూడ అక్కడ ఉన్నాడు. యజమాని ఈ పిల్లవానికి రోజూ ‘నీవు ఉదయముననే స్నానం చేసేసి, వాళ్ళకి పీటలు వెయ్యడం, దర్భాసనములు వెయ్యడం, వాళ్ళ మడిబట్టలు తీసుకురావడం, ఇటువంటి పనులు చేస్తూ ఉండవలసినద’ ని చెప్పాడు.


దాసీ పుత్రుడైన నారదుడు రోజూ స్నానంచేసి వాళ్ళ మడిబట్టలు తీసుకువచ్చి అక్కడ పెడుతూ ఉండేవాడు. వాళ్ళు సన్యాసులు అంటే లోకం అంతటా పరబ్రహ్మమును చూసేవాళ్ళు. ఆ పిల్లవాని దాసీపుత్రునిగా చూడలేదు. అయిదు సంవత్సరముల పిల్లవాడు తమకు చేస్తున్న సేవచూసి వారు తినగా మిగిలినటువంటి ఉచ్ఛిష్ఠమును నారదునికి ఇచ్చేవారు. మహాభాగవతులయిన వాళ్ళు తినగా మిగిలినటువంటి భాగవత శేషమును తినేవాడు. ఆ వచ్చిన సన్యాసులు పొద్దున్న లేవడం, భగవంతుడిని అర్చన చేసుకోవడం, వేదవేదాంగములు చదువుకోవడం, వాటిని గూర్చి చర్చ చేసుకోవడం, మధ్యాహ్నం అయేసరికి భగవంతుని స్మరిస్తూ సంతోషముతో పాటలు పాడుతూ నాట్యం చేయడం చేస్తూ ఉండేవాడు. ఆఖరుకి చాతుర్మాస్యము అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోతూ పిల్లవాడయిన నారదుని పిలిచి –

అపచారంబులు లేక నిత్యపరిచర్యాభక్తి యుక్తుండనై

చపలత్వంబును మాని నే గొలువగా సంప్రీతులై వారు ని

ష్కపటత్వంబున దీనవత్సలతతో గారుణ్య సంయుక్తులై

యుపదేశించిరి నాకు నీశ్వరరహస్యోదారవిజ్ఞానమున్!!


ఆ పిల్లవానికి ఏమీ తెలియకపోయినా, ఏ తాపత్రయం లేకుండా మనస్సులో వాళ్ళమీద ఉన్న అపారమయిన భక్తిచేత అతడు వారిని సేవించగా – వారందరు కూడ కారుణ్యమని చెప్పడానికి కూడ వీలు లేదు – మిక్కిలి వాత్సల్యచిత్తముతో నారదుని వాళ్ళు పక్కన కూర్చోబెట్టుకుని వానికి కృష్ణ పరమాత్మమీద ద్వాదశాక్షరీ మహామంత్రమును ఉపదేశము చేసి ప్రణవోపదేశం చేసేసి ఆ పిల్లవానిని ఈ లోకమునందు మాయ ఎలా ఉంటుందో, సత్యం ఎలా ఉంటుందో చెప్పారు. ఇంతకాలం అటువంటి వారిని సేవించి ఉండడము వలన నారదునికి సత్పురుష సాంగత్యం కలిగింది.


సత్సంగత్వే నిస్సంగత్వం – నిస్సంగత్వే నిర్మోహత్వం

నిర్మోహత్వే నిశ్చలతత్త్వం – నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః ||


సత్పురుషులతో తిరగడం వలన హృదయము అంతా పరిశుద్ధమయి వెంటనే ఈయనకు మనసులోకి అందింది. చాతుర్మాస్యము అయిపోయి ఆ సన్యాసులు వెళ్ళిపోయారు. తాను లోపల ఆ శ్రీమన్నారాయణుని తలుచుకొని పొంగిపోతూ రోజూ అమ్మతో వెళ్ళేవాడు. ఒకరోజు చీకటిపడిపోయిన తరువాత గృహయజమానులయిన బ్రాహ్మణులు పిల్లవాని తల్లిని పిలిచి పెరట్లోకి వెళ్ళి ఆవులపాలు పితికి పట్టుకుని రమ్మని చెప్పారు. ఆవుపాలు పితుకుదామని వెళ్ళింది. అక్కడ ఒక పెద్ద త్రాచుపాము పడుకున్నది. ఆవిడ చూడకుండా పొరపాటున దానిమీద కాలువేసింది. త్రాచుపాము ఆవిడని కరిచేసింది. తల్లి చచ్చిపోయింది. పిల్లవాడు – ‘ నాకు ఉన్న ఒకే ఒక బంధం తెగిపోయింది. అమ్మ అన్నది ఒకర్తి ఉండడం వలన నేను ఈ ఇంట్లో అమ్మతోపాటు తిరగవలసి వచ్చింది. ఇప్పుడు నేను స్వేచ్ఛావిహారిని. అంతా ఈశ్వరుణ్ణి చూస్తూ వెళ్ళిపోతాన’ ని వెళ్ళి వెళ్ళి చివరకు ఒక మహారణ్యములోకి వెళ్ళాడు. అక్కడ పెద్దపులులు, కౄరసర్పములు తిరుగుతున్నాయి. ఆయన – ‘నాకు ఏమిటి భయం! ఈలోకం అంతటానిండి నిబిడీకృతమయి శాసించే కారుణ్యమూర్తయిన శ్రీమన్నారాయణుడు ఇక్కడ ఉన్నాడని వాళ్ళు నాకు చెప్పారు. నా స్వామి ఉండగా నాకు ఏ ఆపద జరగదు’ అనుకున్నాడు. ఆ సమయములో అతనికి విపరీతమయిన దాహం వేసింది. అక్కడ ఒక మడుగు కనబడింది. అక్కడ నీళ్ళు తాగి స్నానంచేసి ‘ఇక్కడ నా స్వామి ఒకసారి నాకు సాకారముగా కనపడితే బాగుండున’ ని ఒక రావిచెట్టు క్రిందకూర్చుని ద్వాదశాక్షరీ మంత్రమును తదేకముగా ధ్యానం చేస్తుంటే లీలామాత్రముగా ఒక మెరుపులా శ్రీమన్నారాయణుని దర్శనం అయింది. పొంగిపోయి పైనుంచి క్రిందకి మెరుపును చూసినట్లు చూశాడు. అంతే! స్వామి అంతర్ధానమయి ఆయన యొక్క వాణి వినపడింది ‘ఈజన్మలో సత్పురుషులతో తిరిగిన అదృష్టంచేత, వాళ్ళ మాటలు పట్టించుకున్న కారణంచేత, నీకు లీలామాత్ర దర్శనము ఇచ్చాను. నీవు చూసిన రూపమును అలా బాగా చూడాలని కోరుకుంటూ, నువ్వు నా గురించే చెప్పుకుంటూ, నా గురించే పాడుకుంటూ, నా గురించే మాట్లాడుకుంటూ తిరిగి తిరిగి దేహధర్మమును అనుసరించి ఒకరోజున ఈ శరీరమును వదిలేస్తావు. అలా వదిలేసిన తరువాత నిన్ను గుప్తముగా ఉంచుతాను. ఒకనాడు నీవు సాక్షాత్తుగా బ్రహ్మదేవుని కుమారుడిగా జన్మిస్తావు. ఆనాడు నీకు ‘మహతి’ అనే వీణను బహూకరిస్తాను. దానిమీద నారాయణ స్తోత్రం చేస్తూ స్వేచ్ఛగా లోకములయందు విహరిస్తావు. నీకీ కానుకను ఇస్తున్నాను’ అన్నాడు.

‘ఆనాడు శ్రీమన్నారాయణున్ని దర్శనం చేస్తూ దేశమంతటా తిరిగి స్వామి గురించి చెప్పుకుని, చెప్పుకుని దేహధర్మం కనుక ఒకనాడు ఈ శరీరము వదిలిపెట్టి సంతోషముగా బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళిపోయాను. మళ్ళీ కల్పాంతం అయిపోయిన తరువాత నారాయణుని నాభికమలంలోంచి మరల చతుర్భుజ బ్రహ్మగారు సృష్టింపబడ్డారు. మొట్టమొదట ప్రజాపతులను సృష్టించినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు నన్ను సృష్టించారు. నాకు ‘మహతి’ అను వీణను ఇచ్చారు. ఆ వీణ సర్వకాలములయందు భగవంతునికి సంబంధించిన స్తోత్రమే పలుకుతుంది. నేను నారాయణ నామము చెప్పుకుంటూ లోకములనంతటా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాను. నేను వైకుంఠమునకు, సత్యలోకమునకు, కైలాసమునకు వెళతాను. ఏ ఊరుపడితే ఆ ఊరు వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళినా లోక సంక్షేమమును ఆవిష్కరిస్తాను. భగవంతుని శక్తి గురించి మాట్లాడతాను. అదితప్ప మరొకటి నాకు రాలేదు.

వ్యాసా! దాసీపుత్రుడనయిన నాకు నలుగురు సన్యాసులు ఉపదేశించిన జ్ఞానము ఇవ్వాళ నన్నీస్థితికి తెచ్చింది. రెండవజన్మలో నారదుడను అయ్యాను. నీవు భాగవతమును, భగవత్కథను చెప్పగలిగితే విన్నవాడు ఉత్తరజన్మలో ఎందుకు మహాజ్ఞాని కాలేడు? ఎందుకు భక్తుడు కాలేడు? అందుకని నీవు భగవద్భక్తి గురించి చెప్పవలసింది. దుర్యోధన ధృతరాష్ట్రులగురించి చెప్పకపోయినా ప్రజలకందరకు వారిని గురించి తెలుసు. అందుకని భక్తి గురించి చెప్పు. భక్తికి ఆలవాలమయిన భాగవతమును రచించు’ అన్నారు.


మహానుభావుడు వ్యాసభగవానుడు నారదుని మాటలు విని పొంగిపోయి ‘నారదా! ఎంతగొప్పమాట చెప్పావు. నేను భగవంతుని గురించి, భగవంతుడి విశేషముల గురించి, ఈ బ్రహ్మాండముల ఉత్పత్తిగురించి, ఆయనను నమ్ముకున్న భాగవతుల గురించి, ఈశ్వరుడు వాళ్ళవెంట పరుగెత్తినటువంటి వృత్తాంతముల గురించి నేను రచన చేస్తాను. ఇది ఎవరు చదువుతారో, ఎవరు వింటారో వాళ్ళు నీవు తరించినట్లు తరిస్తారు. అటువంటి భాగవతమును రచన చేయడం ప్రారంభిస్తున్నాన’ ని ఆచమనము చేసి కూర్చుని వ్యాసభగవానుడు తన ఆశ్రమములో భాగవత రచన ప్రారంభము చేశారు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

[08/10, 11:34 am] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 9 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


వేదవ్యాసుడిని నారదభగవానుడు ప్రార్థనచేస్తే ఆయన సలహామేరకు వ్యాసుడు తన ఆశ్రమంలో భాగవతమును రచించడం ప్రారంభంచేశారు. దానిని మన అదృష్టవశాత్తు మన తెలుగువారయిన పోతనామాత్యులవారు ఆంధ్రీకరించారు.

‘శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా

హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం

దార సుధాపయోధి సితతామర సామర వాహినీ శుభా

కారత నొప్పు నిన్ను మదిగానగ నెన్నడు గల్గు భారతీ!’

అని పోతనగారు ఆ శారదాదేవిని స్తోత్రం చేసి ఆంధ్రీకరించడం ప్రారంభం చేస్తే మహానుభావుడికి అలవోకగా పడిపోయాయి పదాలు. ఆ రోజున ఒక అద్భుతమయిన ఆంధ్రీకరణం జరిగింది.

భాగవతంలో శౌనకాది మహర్షులందరు కూడ దీర్ఘసత్రయాగం చేస్తున్నారు. సత్రయాగము అనే యాగము ఒక విచిత్రమయిన యాగము. దీర్ఘసత్రయాగం అంటే చాలాకాలం పాటు కొనసాగే యాగం. దానిని నైమిశారణ్యములో చేశారు. ఎవరు ఋత్విక్కులుగా ఉంటారో వారే యజమానులుగా కూడా ఉంటే దానిని సత్రయాగము అని పిలుస్తారు. దానికి అనువయిన ప్రదేశంగా నైమిశారణ్యమును నిర్ణయించుకున్నారు. అది విష్ణుభగవానుని శక్తి ప్రకటితమయిన క్షేత్రము. ఇరుసును ఆధారము చేసుకుని చక్రములు తిరుగుతూ ఉంటాయి. ఇరుసు విరిగిపోతే ఆ బండి పనికిరాదు. సంసారమునకు ఉండేటటువంటి నేమి (ఇరుసు) ఏ ప్రాంతమునందు శిధిలం అయిపోయిందో అటువంటి పరమ పవిత్రమయిన ప్రాంతమునకు నైమిశారణ్యము అని పేరు. ఆ నైమిశారణ్యములో చేసిన క్రతువు చాలా విశేషమయిన ఫలితమును ఇస్తుంది. శ్రీమహావిష్ణువు అనుగ్రహమునకు నోచుకున్న క్షేత్రము. అటువంటిచోట ఈ దీర్ఘసత్రయాగమును చేసినట్లయితే బాగుంటుందని శౌనకాది మహర్షులందరు కూడ ఈ యాగమును ప్రారంభం చేశారు. అక్కడికి సూతమహర్షి విచ్చేశారు.

ఒక కోయిల వస్తే – అది పాట పాడాలని కోరుకుంటాము. ఒక నెమలిని చూసినట్లయితే అది ఒక్కసారి పురివిప్పితే బాగుండును అనుకుంటాము. పురివిప్పి ఆడుతున్న నెమలి అందంగా వుంటుంది. సూతుడు కనపడినప్పుడు ‘ భగవంతుడి గురించి నాలుగు మాటలు చెప్పండి’ అని అడగకపోతే అలా అడగని వాడు చాలా దురదృష్టవంతుడు. సూతుడు పురాణ వాఙ్మయము అంతా తెలిసి ఉన్నవాడు వచ్చినప్పుడు ఆయన దగ్గర పురాణములలో ఉండే విశేషములను, హరికథామృతమును తెలుసుకొని గ్రోలాలి.

శౌనకాది మహర్షులు – నీవు రోమహర్షణుని కుమారుడవు. నీకు పురాణములలో ప్రతిపాదింపబడిన విషయములు అన్నీకూడా తెలుసు. శుకబ్రహ్మచేత ప్రవచనము చేయబడి భాగవతము నీకు కరతలామలకము. అందులో హరినామములు, హరిభక్తి, హరికథామృతము, విశేషంగా ప్రవచనం చేయబడ్డాయి. ఏ భగవంతుని గుణములు వినడం చేత వేరొకసారి పుట్టవలసిన అవసరము కలుగదో, ఏ భగవద్భక్తికి సంబంధించిన కథలను వినితీరాలో, అటువంటి విషయములను కలిగి ఉన్న భాగవతపురాణమును మాకు వివరించవలసినది. జన్మనెత్తవలసిన అవసరములేని పరమాత్మ కృష్ణభగవానుడిగా, వసుదేవునికి కుమారుడిగా ఎందుకు జన్మించాడు? అన్ని అవతారములలో వచ్చినట్లుగా కాకుండా అర్ధరాత్రివేళ కారాగారములో ఆ దేవకీ వసుదేవులకు జన్మించి కంసుడిని ఎందుకు వధించాడు? తాను వచ్చిన అవతార ప్రయోజనమును నెరవేర్చడములో అంత విడంబము చేస్తూ అంతకాలంపాటు భూమిమీద తాను ఉండి శత్రుసంహారము చేసి జరాసంధుడివంటి రాక్షసులను సంహరించడంలో చాలా ఆశ్చర్యకరమయిన లీల ప్రదర్శిస్తాడు భగవానుడు.

‘కన్నులు తెరువని కడు చిన్నిపాపడై దానవి చనుబాలు ద్రావి చంపె’

కనురెప్ప పైకెత్తడం కూడా సరిగ్గా చేతకాని వయస్సులో ఉన్న కృష్ణపరమాత్మ పూతన పాలుతాగి పూతనాసంహారం చేసాడు. జరాసంధుడికి పదిహేడుమార్లు అవకాశం ఇచ్చాడు. పదిహేడుమార్లు జరాసంధుడు దండెత్తి వస్తే అన్నిసార్లు జరాసంధుడిని ఓడించి వదిలేశాడు తప్ప చంపలేదు. పద్దెనిమిదివ మారు జరాసంధుడు దండెత్తి వచ్చాడు కృష్ణుడు పారిపోయాడు. యుద్ధంలో జరాసంధుడిని నిర్జించలేదు. కృష్ణ లీలలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఇంతమంది రాక్షసులను మట్టుపెట్టినవాడు జరాసంధుడు కనపడినప్పుడు ఎందుకు పారిపోయాడు? ఈ లీలలు మాకు వినిపించవలసింది. ఎన్ని కోట్ల జన్మములనుండియో భగవంతుని కథను విస్మృతిపొందడం చేత మేము మళ్ళీ మళ్ళీ అనేక యోనులయందు తిరుగుతున్నాము. ఇన్నాళ్ళకు మాకు భాగవతకథా శ్రవణం చేసే అదృష్టం పట్టింది. మహానుభావా! శుకమహర్షీ! ఆ భగవత్కథలను కలిగినటువంటి అమృత స్వరూపము కనుక దానికి భాగవతము అని పేరు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

[08/10, 11:34 am] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 10 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


భగవంతుని అవతారములు :-


పరమాత్మ ఇరవైరెండు రూపములు ప్రధానమయినవిగా వచ్చాడు. ఆ ఇరవైరెండు రూపములు గురించి వింటే నీకు ఈశ్వరుడు ఎంత ఉపకారం చేశాడో అర్థం అవుతుంది.' అన్నాడు సూతుడు. అలా ఎక్కడ వచ్చాడో చెప్పమని శౌనకాది మహర్షులు పరమానందంతో అడిగారు.


ఆయన అన్నారు – ’క్షీరసాగరమునందు శయనించి లోకుల అన్ని విషయములను యోగనిద్రలో తెలుసుకుంటున్న మూర్తిగా శంఖచక్రగదాధరుడై నాభికమలమునుండి చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టగా, ’కదిలిన బాహుపదంబుల కంకణ రవముసూప’ అంటారు పోతనగారు – ఇలా చేతులు కదులుతుంటే ఆయన వేసుకున్న మణికంకణములు ధ్వనిచేస్తుంటే, ఆయన పాదమును లక్ష్మీదేవి ఒత్తుతున్నప్పుడు ఆ పాదములకు పెట్టుకున్న నూపురముల ధ్వని కలుగుతుంటే, పచ్చని పీతాంబరము కట్టుకొన్నవాడై, తెల్లటి శంఖమును చేతిలోపట్టుకొని, కుడిచేతిలో చక్రం పట్టుకొని, గద పట్టుకొని, పద్మం పట్టుకొని, శేషుని మీద పడుకున్న ఆ శ్రీమహావిష్ణువు వున్నాడే శ్రీమన్నారాయణుడు – ఆ శ్రీమన్నారాయణుడు ఈ లోకమంతటికీ ప్రధానమయిన స్వామి. అటువంటి స్వామి, ఆ నారాయణ తత్త్వము, ఆ నారాయణమూర్తి అందరికీ గోచరమయ్యేవాడు కాదు. ప్రతివాడి మాంసనేత్రమునకు కనపడడు. అది ఎవరో యోగులు – జీవితములలో మాకు సుఖములు అక్కర్లేదని తలచివవారై ఇంద్రియములను గెలిచినవారై తపస్సుచేసి కొన్నివేల జన్మలు భగవంతునికోసం పరితపించిపోయిన మహాపురుషులు, ఎక్కడో ధ్యానసమాధిలో ఈశ్వరదర్శనం చేస్తున్నారు. అది మొట్టమొదటి తత్త్వం. అది ఉన్నది దానిలోంచి మిగిలినవి అన్నీ వచ్చాయి. అది అవతారము కాదు. అది ఉన్న పదార్థము. అది మైనము. ఇపుడు ముద్దకట్టి దాంట్లోంచి ఎన్ని బొమ్మలయినా చేయవచ్చు.


అసలు ఉన్నది ఏది? నారాయణుడు. ఈ సృష్టి జరగడానికి నారాయణుని నాభికమలంలోంచి మొదట వచ్చినది చతుర్ముఖ బ్రహ్మగారు. నాలుగు ముఖములతో వేదం చెపుతూ శ్రీమన్నారాయణుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం సృష్టిచేసిన వాడెవడో అది మొట్టమొదటి అవతారం. ఆయనే చతుర్ముఖ బ్రహ్మగారు.


ఆ చతుర్ముఖ బ్రహ్మగారి తరువాత వచ్చిన అవతారం ఈ భూమినంతటినీ తీసుకువెళ్ళి తనదిగా అనుభవించాలనే లోభబుద్ధితో ప్రవర్తించిన హిరణ్యాక్షుని వధించడానికి వచ్చిన యజ్ఞ వరాహమూర్తి రెండవ అవతారము.

మూడవ అవతారము – సంసారమునందు బద్ధులై, కర్మాచరణం ఎలా చెయ్యాలో తెలియక కామమునకు, అర్థమునకు వశులైపోయిన లోకులను ఉద్ధరించడం కోసమని చతుర్ముఖ బ్రహ్మగారిలోంచి పైకివచ్చిన మహానుభావుడైన నారదుడు.


బ్రహ్మగారితోపాటు వచ్చినవారు సనకసనందనాదులు. నారదుని అవతారం తరువాత వచ్చినది సాంఖ్యయోగం చెప్పినటువంటి కపిలుడు. విశేషంగా వేదాంతతత్త్వమునంతటిని చెప్పాడు. కపిలుని అవతారము తరువాత వచ్చిన అవతారము దత్తావతారము. దత్తాత్రేయుడై అనసూయ అత్రి – వారిద్దరికి జన్మించి మహాపురుషుడై, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అయిన బ్రహ్మవిష్ణు మహేశ్వరుల తత్త్వముతో కూడినవాడై జ్ఞాన ప్రబోధంచేసి ప్రహ్లాదాదులను ఉద్ధరించిన అవతారము ఏది ఉన్నదో అది దత్తాత్రేయస్వామి వారి అవతారము. కపిలుడు దత్తుడు అయిపోయిన తరువాత వచ్చిన అవతారము యజ్ఞావతారము. యజ్ఞుడు అనే రూపంతో స్వామి ఆవిర్భవించాడు.


ఆ తరువాతి అవతారమునకు వచ్చేటప్పటికి ఋషభుడు అనే పేరుతో మేరుదేవి, నాభి అనబడే ఇద్దరి వ్యక్తులకు స్వామి ఆవిర్భవించారు.

తరువాత ఈ భూమండలమును ధర్మబద్ధంగా పరిపాలించడానికి చక్రవర్తి రూపంలో ఉద్భవించమని భక్తులు అందరు ప్రార్థనచేస్తే పృథుచక్రవర్తిగా ఆవిర్భవించాడు. ఆ రోజున భూమినంతటినీ గోవుగా మార్చి పృథుచక్రవర్తి ఓషధులను పిండాడు.


తరువాత వచ్చినది మత్స్యావతారము. మత్స్యావతారములో సత్యవ్రతుడు అనబడే రాజు రాబోయే కాలములో వైవస్వతమనువుగా రావాలి. ప్రళయం జరిగిపోతోంది. సముద్రములన్నీ పొంగిపోయి కలిసి పోయాయి. భూమి అంతా నీటితో నిండిపోయింది. ఇక ఉండడానికి ఎక్కడా భూమిలేదు. అప్పుడు ఈ భూమినంతటినీ కలిపి ఒక పడవగా చేసి తాను మత్స్యమూర్తిగా తయారయి పెద్దచేపగా మారి తనకు ఉండే ఆ మూపుకి ఈ పృథివిని పడవగా కట్టుకుని అందులో సత్యవ్రతుణ్ణి కుర్చోబెట్టి లోకములన్నీ ప్రళయంలో నీటితో నిండిపోతే ఆ పడవను లాగి, ప్రళయాన్ని దర్శనం చేయించి వైవస్వత మనువుని కాపాడిన అవతారము మత్స్యావతారము.


తదనంతరము క్షీరసాగరమథనం జరిగింది. అందులో లక్ష్మీదేవి పుడుతుంది. లక్ష్మీకళ్యాణం జరుగుతుంది. లక్ష్మీకళ్యాణఘట్టమును ఎవరు వింటారో వాళ్ళకి కొన్నికోట్ల జన్మలనుండి చేసిన పాపము వలన అనుభవిస్తున్న దరిద్రం ఆరోజుతో అంతమయిపోతుంది. లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. క్షీరసాగరమథన సమయంలో మందరపర్వతం క్షీరసాగరంలో మునిగిపోకుండా స్వామి కూర్మావతారం ఎత్తాడు.కూర్మావతారం వచ్చిన తరువాత వచ్చిన అవతారం మోహినీ అవతారం దేవతలకు, దానవులకు మోహినీ స్వరూపంతో అమృతమును పంచిపెట్టాడు. మోహినీ అవతారము తరువాత వచ్చినటువంటి అవతారము నరసింహావతారము. ఈ అవతారములో స్వామి హిరణ్యకశిపుడిని వధించాడు.


నరసింహావతారము తరువాత వచ్చిన అవతారము వామనావతారము. ఇప్పుడు చెప్పుకుంటున్న అవతారక్రమము మనువుల కాలగతిని బట్టి చెప్పుకుంటూ వెళ్ళడం జరుగుతోంది. ఆ రోజున స్వామి పొట్టివాడై బలిచక్రవర్తి దగ్గర అర్థించాడు. వామనమూర్తి కథ వింటే ఆ ఇళ్ళల్లో జరిగిన శుభకార్యములు వైదికంగా పరిపూర్తి చేయకపోయినా, తద్దినం సరిగా పెట్టకపోయినా, తద్దోషం నివారించి ఆ కార్యం పూర్ణం అయిపోయినట్లుగా అనుగ్రహించేస్తాడు. అంత గొప్పకథ వామనమూర్తి కథ.


వామనావతారము తరువాత వచ్చిన అవతారము పరశురామావతారము. గండ్రగొడ్డలి పట్టుకుని ఇరువతి ఒక్కసార్లు భూప్రదక్షిణం చేసి క్షత్రియులను సంహరించాడు. పరశురామావతారము తరువాత వచ్చిన అవతారము వ్యాసావతారము.


కలియుగంలో జనులు మందబుద్ధులై ఉంటారని వేదవిభాగం చేసి ఉదారముగా పదునెనిమిది పురాణములను వెలయించిన మహానుభావుడుగా వ్యాసుడై వచ్చాడు.


వ్యాసావతారము తరువాత వచ్చిన అవతారము రామావతారము. రామావతారములో సముద్రమునకు సేతువుకట్టి దశకంఠుడయిన రావణాసురుణ్ణి మర్దించి ధర్మసంస్థాపన చేసి లోకులు ధర్మముతో ఎలా ప్రవర్తించాలో నేర్పిన అవతారము రామావతారము.

రామావతారము తరువాత వచ్చిన అవతారము బలరామావతారము.

బలరామావతారము తరువాత వచ్చిన అవతారము కృష్ణావతారము.

కృష్ణావతారము తరువాత వచ్చిన అవతారము బుద్ధావతారము. దశావతారములలో బుద్ధావతారము కలియుగ ప్రారంభమునందు కీకటదేశము అనబడు మగధ సామ్రాజ్యమునందు దేవతలపట్ల విరోధభావనతో వున్న రాక్షసులను మోహింపచేయడానికి వచ్చిన అవతారము. మీరు అనుకుంటున్న వేరొక బుద్ధావతారము గురించి వ్యాసుడు ప్రస్తావన చేయలేదు.


బుద్ధావతారము తరువాత వచ్చే అవతారముగా వ్యాసుడు నిర్ధారించిన అవతారము కల్కిఅవతారము. కల్కిఅవతారము ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్లుగా కలియుగం ప్రథమపాదంలో వస్తోందని వ్యాసుడు చెప్పలేదు. కలియుగం అంతం అయిపోయేముందు యుగసంధిలో కాశ్మీరదేశంలో ఉన్న విష్ణుయశుడు అని పిలవబడే ఒక బ్రాహ్మణుడి కడుపున స్వామి ఆవిర్భవిస్తారు. ఆయన అవతారం రాగానే సవికల్పసమాధిలో ఉన్న యోగులందరూ పైకిలేస్తారు. అపుడు ఖడ్గమును చేతపట్టుకొని తెల్లటి గుర్రంమీద కూర్చుని ప్రజలను పీడించి ధనవంతులయ్యే పరిపాలకులనందరిని సంహరిస్తారు. యుగాంతం అయిపోతుంది. మరల క్రొత్త యుగం ప్రారంభమవుతుంది. కల్కి అవతరం యుగసంధిలో వస్తుంది.

ఇలా ఇరవై రెండు అవతారములను స్వామి స్వీకరించబోతున్నారు. దీనిని వ్యాసుడు ఎప్పుడు చెప్తున్నారు? కృష్ణావతార ప్రారంభమునందు భాగవతమును రచిస్తున్న సమయంలో భూతభవిష్యద్వర్తమాన కాలజ్ఞానము ఉన్నవాడు కాబట్టి వ్యాసుడు ఈ విషయములను చెప్పగలుగుతున్నాడు. వ్యాసుడు అంటే సాక్షాత్తు నారాయణుని అంశ. మహానుభావుడు. ఇలా స్వామి ఇరవై రెండు అవతారములలో విజయం చేస్తున్నారు. అయితే అవతారములు ఈ ఇరవై రెండేనని మీరు అనుకుంటే పొరపాటు పడినట్లే! కొన్ని ప్రధానమయిన విషయములు మాత్రమే ప్రస్తావన చేయబడ్డాయి.

’అజాయమానో బహుధావిజాయతే” ఆయనకు అసలు ఒక రూపమును తీసుకోవలసిన అవసరం లేదు. అటువంటి స్వామి ఈ కంటితో చూడడానికి వీలయిన రూపమును పొందాడు. దేనికోసం? ఆయనే చెప్పారు.


“పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం

ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే!!


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

కామెంట్‌లు లేవు: