20, జనవరి 2023, శుక్రవారం

గురువాక్కు మహత్యం*

 *గురువాక్కు మహత్యం*


ఒకానొకప్పుడు ఒక గురువు గారు, ఆయన శిష్యుడు నది నుండి వారి ఆశ్రమానికి తిరిగి వెళ్తున్నారు...


ఇంతలో హఠాత్తుగా గురువుగారు ఒక మహావృక్షం ముందు ఆగి ప్రసన్నంగా నవ్వుతూ *"తథాస్తు"* అన్నారు. 

గురువుగారి చర్యకి కారణం ఏంటి? అని అడిగాడు శిష్యుడు. 


"ఆ మహావృక్షం తన కోరికని పక్కనున్న మరో వృక్షంతో చెప్తుంటే నాకు వినబడి 'తథాస్తు' అన్నాను." 

"ఏమిటా కోరిక గురువు గారూ?" 

*"తాను చక్రవర్తి అయి భూమండలాన్ని ఏలాలని."* 

"వచ్చే జన్మలోనా?" 

"కాదు ఈ జన్మలోనే" 

శిష్యుడు పగలబడి నవ్వాడు, "గురువు గారూ, ఇది మరీ గొంతెమ్మ కోరిక కదూ! అంత అత్యాశ తగునా? అర్హత చూసుకోవాల్సిన పనిలేదా? "


*"అర్హతకేం నాయనా! జీవితమంతా ప్రతఫలాపేక్ష లేకుండా ఫలాలనిచ్చింది. ఎన్నో జీవరాశులకి ఆశ్రయం ఇచ్చింది. అదంతా పుణ్యమే కదా!"* 

"అవుననుకోండి. కానీ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది" అన్నాడు శిష్యుడు.


అది విని *"ఏమో, భగవానుడు సంకల్పిస్తే ఏమైనా కావచ్చు!"* అన్నారు గురువుగారు.


ఆ రాత్రి పెద్ద గాలివాన వచ్చి ఆ మహా వృక్షం నేలకూలింది. 


శిష్యుడు నవ్వుకున్నాడు. అంతటితో ఆ విషయం మరిచి పోయాడు.

*సరిగ్గా సంవత్సరం తరువాత*


ఒక్కరోజు ఆ శిష్యుడు పరుగు పరుగున వస్తూ "గురువు గారూ,ఈ వింత విన్నారా!

శ్రీరామచంద్రులవారి పాదుకలకి పట్టాభిషేకం చేశారు వారి సోదరులు భరతులవారు. ఇక నుండీ పధ్నాలుగేళ్ళు పాదుకలు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాయట!అన్నాడు.


దానికి గురువు గారు నవ్వి, *"చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అన్నావు. ఇప్పుడు అయింది కదా!"* అన్నారు.

అంటే? అడిగాడు శిష్యుడు.

అవున్నాయనా,  ఆ మహావృక్షం కలపతోనే వడ్రంగులు పాదుకలు చేశారు. అవి శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు. ఎన్ని జన్మలు ఎంత తపస్సు చేసిందో,

ఎన్ని పుణ్యాలు చేసుకుందో, ఆ మహావృక్షం పాదరక్షలుగా మారి శ్రీరామచంద్రులవారి పాదాల వద్దకు చేరింది. 


శ్రీరామచంద్రులవారు ఆ పాదుకల్ని భరతుల వారికివ్వడం, 

భరతులవారు పాదుకలకి పట్టాభిషేకం చేయడం అంతా ఒక్కరోజులో జరిగిపోయింది.


ఆ విధంగా చక్రవర్తి కావాలన్న ఆ మహా వృక్షం కోరిక నెరవేరింది. 

అని చెప్పిన గురువు గారికి సాష్టాంగ ప్రణామం చేశాడు ఆ శిష్యుడు. 


*సద్గురువు వాక్కు సత్యం అయ్యి తీరుతుంది.*

కాదు కాదు, *ఆ భగవంతుడే మహాత్ముల నోటినుoచి వచ్చిన మాటలు నిజమయ్యేలాగా సoకల్పిస్తాడు.*🏵️


              🙏 ఓం నమః శివాయ 🙏

కామెంట్‌లు లేవు: