12, సెప్టెంబర్ 2023, మంగళవారం

నవగ్రహా పురాణం🪐* . *23వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *23వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*పురాణ పఠనం ప్రారంభం*

 

*చంద్రగ్రహ జననం - 5*


మహా పతివ్రత అయిన శీలవతి వాక్కు ఫలించింది. ఘడియలూ , గంటలూ , రోజులూ గడిచిపోతున్నాయి. సూర్యోదయం కానేలేదు. లోకాలు నిరంతర అంధకారంలో మునిగిపోయాయి. నిత్య నైమిత్తిక కర్మలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రాణుల దైనందిన కార్యకలాపాలు ఆగిపోయాయి. విశ్వచాలన వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. నిశాచరులైన రాక్షసులు ఆనందంగా ఉన్నారు గానీ , దేవతలు భీతిల్లిపోయారు. ఇంక మానవులకు జీవితం దుర్భరంగా మారింది. ఎందుకు సూర్యుడు ఉదయించలేదో తెలియని ఇంద్రుడు వ్యాకులపాటులో మునిగిపోయాడు.


నారదుడు ఇంద్రుడ్ని కలుసుకున్నాడు. సూర్యోదయం కానందుకు కారణమైన శీలవతి శాపం గురించి వివరించాడు. శాపం ఉపసంహరించమని శీలవతిని ఆదేశిస్తానన్నాడు. ఇంద్రుడు.


*"శీలవతి మహాపతివ్రత , ఆమెకు భర్తే సర్వస్వం. కుష్ఠురోగీ , వృద్ధుడూ , దుర్మార్గుడూ అయిన భర్తను ఆమె ప్రత్యక్ష దైవంగా భావించి సేవిస్తోంది ! ఎలాంటి వాడైనా సరే భర్తను ఆమె త్యాగం చేయదు !"* అన్నాడు శీలవతిని గురించి బాగా తెలిసిన నారదుడు. 


*"గత్యంతరం ఏమిటి నారదా ?”* ఇంద్రుడు అడిగాడు.


*"ఏముందీ ! బ్రహ్మ , విష్ణువు , మహేశ్వరుడూ ఉన్నారు గదా ? వారిని ఆశ్రయించాల్సిందే !"* నారదుడు సూచించాడు.


ఇంద్రుడు నారదుడితో కలిసి బ్రహ్మను సందర్శించి , సమస్య వివరించాడు. పరమేశ్వరుణ్ని వెంటబెట్టుకుని , శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్తామన్నాడు బ్రహ్మ.


పరమేష్ఠీ , పరమేశ్వరులూ , ఇంద్రుడూ , నారదుడూ శ్రీమహావిష్ణువు సన్నిధికి చేరుకున్నారు. విషయం వివరించారు.


శ్రీమహావిష్ణువు సాలోచనగా పంకించాడు. *"మహేంద్రా ! శీలవతి పరమసాధ్వి! ఆమె శాపాన్ని నిర్వీర్యం చేసే శక్తి మాకెవ్వరికీ లేదు ! మాండవ్యుడు తన శాపాన్ని ఉపసంహరిస్తే , శీలవతి కూడా తన శాపాన్ని ఉపసంహరిస్తుంది ! అయితే , మాండవ్యుడికి ప్రస్తుతం శాపాన్ని ఉపసంహరించుకునే శక్తి లేదు.”*


*"మరి తరుణోపాయం , దేవా !"* ఇంద్రుడు ఆందోళనతో అడిగాడు.


*“శీలవతి నివాసప్రాంతానికి సమీపంలోనే మరొక మహాపతివ్రత ఉంది. ఆ సాధ్వి పేరు అనసూయ. మన బ్రహ్మ మానసపుత్రుడైన 'అత్రి' ధర్మపత్ని ఆమె. అనసూయను కలుసుకో ! లోక క్షేమం కోసం శీలవతి శాపాన్ని ఉపసంహరించేలా చేయమని అభ్యర్ధించు ! వెళ్ళి... రా ! విజయోస్తు"* అన్నాడు విష్ణువు.


*“మహేంద్రా ! శీలవతిని అంగీకరింపజేసే బాధ్యత తనదే అని అనసూయకు మా మాటగా చెప్పు !”* పరమేశ్వరుడు హెచ్చరించాడు.


*"ఔను ! మహేంద్రా ! మా మాట కూడా అదే సుమా !"* బ్రహ్మ కల్పించుకుని అన్నాడు. *"త్రిమూర్తులు ఆదేశమని చెప్పు !"*


ఇంద్రుడు త్రిమూర్తులకు నమస్కరించి కదిలాడు. నారదుడు ఆయనను అనుసరించాడు.


ఇంద్రుడికీ , నారదుడికీ అనసూయ అత్రి దంపతులు సాదరంగా స్వాగతం పలికారు. సూర్యుడు కనిపించని కారణంగా భూలోకంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల్ని అత్రి , అనసూయలకు వివరించారు. ఆ సరికొత్త అవాంతరానికి కారణం శీలవతి శాపం అని తెలిసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు.


*"సాధ్వి శీలవతి చేత ఆమె శాపాన్ని ఉపసంహరించే బాధ్యత మీరు స్వీకరించాలి. వదినా !"* నారదుడు వరుస కలుపుతూ అన్నాడు.


*"ఈ అభ్యర్థన మాది కాదు జననీ , త్రిమూర్తులది. వారు ముగ్గురూ మీకు ప్రత్యేకంగా ఆదేశం పంపించారు నా ద్వారా !"* ఇంద్రుడు వివరించాడు..


*"అనసూయా ! శీలవతిని కలిసి ప్రయత్నిస్తావా ?"* అత్రి ప్రశ్నించాడు. *"శాపం వెనక్కి తీసుకుంటే లోకానికి ఆమె ద్వారా ఎనలేని మేలు జరుగుతుందని వివరించు. నచ్చజెప్పు. ఎంత త్వరితంగా సూర్యుడు ఉదయిస్తే అంత మంచిది !"*


*"సూర్యుడు ఉదయిస్తే - శీలవతి భర్త అస్తమిస్తాడు కదా స్వామీ ! ఏ భార్యా భర్త మరణాన్ని కోరి తెచ్చుకోదు !”*


*“అయితే మాతా , శీలవతికి నచ్చజెప్పలేరా ?”* ఇంద్రుడు ఆందోళనతో అడిగాడు.


*"మీరు ఆ మహత్కార్యం చేయగలరని త్రిమూర్తులు గాఢంగా విశ్వసిస్తున్నారే !”* 


*“శీలవతికి నచ్చజెప్పుతాను... అయితే దానికో నిబంధన ఉంది..."* అనసూయ సాలోచనగా అంది.


*"నిబంధనా ? ఏమిటది ? చెప్పండి !"* ఇంద్రుడు ఆత్రంగా అడిగాడు.


*“నా సహాయం కోరుతూ , మీ ద్వారా ఆదేశం పంపించిన ఆ దేవదేవులు త్రిమూర్తులు ముగ్గురూ స్వయంగా నా ఆశ్రమానికి వచ్చి , నన్ను కోరాలి ! వారు స్వయంగా కోరితే ప్రయత్నిస్తాను !"* అనసూయ అంది.


అనసూయ మాట ఆశ్రమంలో ఒక్కసారిగా నిశ్శబ్దాన్ని ఏర్పాటు చేసింది. అత్రి , ఇంద్రుడూ , నారదుడూ క్షణకాలం అనసూయ వైపు చూసి , అయోమయంగా పరస్పరం ఒకర్నొకరు చూసుకొన్నారు.


ముందుగా నారదుడు తేరుకున్నాడు. *"నారాయణ ! అదెంత పని , వదినా ! మన మహేంద్రుడు సంకల్పిస్తే త్రిమూర్తులు క్షణంలో ఈ లోగిలిలో వాలుతారు !"*


నారదుని సూచనను అర్థం చేసుకున్న ఇంద్రుడు ఆకాశం వైపు తల ఎత్తి చేతులు జోడించి , ధ్యానించడం ప్రారంభించాడు. అనసూయ లోపలి కక్ష్యలోకి వెళ్లింది. అత్రి ఆమెను ఆతృతగా వెంబడించాడు. *“అనసూయా , ఏమిటిది ? దేవదేవులు స్వయంగా కోరాలనడమేమిటి ? త్రిమూర్తులను రప్పించి ఏం చేస్తావు ?”* ఆత్రుతగా అడిగాడు అత్రి.


*"వాళ్ళని ఆడిస్తాను !"* అంది అనసూయ నవ్వుతూ. పూజా ద్రవ్యాలతో , పళ్లెంతో , జలకలశంతో అనసూయ ఇవతలకి నడిచింది. అత్రి ఆమె వెనకే నడిచాడు. అయోమయంగా చూస్తూ...


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

కామెంట్‌లు లేవు: