11, మే 2024, శనివారం

హనుమంతునికి కూడా శని కాలం

 🍁 *ఓం శ్రీ ఆంజనేయాయ నమః*🍁


ఒకానొక సమయంలో హనుమంతునికి కూడా శని కాలం దాపురించింది. వానరవీరులంతా రాముడికోసం సేతువు నిర్మిస్తున్న సమయం.

శనీశ్వరుడు రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు.

అక్కడ వానరులందరూ

సేతువు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకుని వచ్చి సముద్రంలో పడవేస్తున్నారు. హనుమంతుడు పెద్ద బండలను ఏరి పెడుతున్నాడు. శ్రీ రాముడు

ఒక బండ మీద ఆశీనుడై

పర్యవేక్షిస్తున్నాడు.

అప్పుడు శనీశ్వరుడు రామునివద్దకు వచ్చి

" నేను హనుమంతుని పట్టుకొనే

కాలం వచ్చింది." అని

శ్రీ రాముని అనుమతి అడిగాడు.

" నన్నెందుకు అనుమతి అడగడం.. నీ విధిని నీవు చెయ్యి " అని

అన్నాడు శ్రీ రాముడు.


హనుమంతుని వద్దకు వెళ్ళి శని " నేను నీ వద్ద ఏడున్నర సంవత్సరాలు ఉండబోతున్నాను." అన్నాడు శనీశ్వరుడు.


"నేను రామ కార్యంలో నిమగ్నమైయున్నాను ఇపుడంత కాలం కుదరదన్నాడు హనుమంతుడు .

" సరి , ప్రస్తుతానికి ఏడున్నరమాసాలు వుంటాను ,సరేనా " అన్నాడు. అందుకు హనుమ ఒప్పుకోలేదు.

...ఏడున్నర వారాలు .. అంటూ

కాల ప్రమాణం తగ్గించుకుంటూ వచ్చాడు

శనీశ్వరుడు .

హనుమంతుడు , రామనామం ఆపకుండా

జపిస్తూనే చివరకు ఒక ఏడు క్షణాల కాలం తనను పట్టుకోవాలసిందిగా కోరాడు.

అప్పుడు శనీశ్వరుడు "నీ కాళ్ళలో ప్రవేశించనా"

అని అడిగాడు.

హనుమంతుడు "వద్దు ...

సేతువు కట్టడానికి రాళ్ళను తేవాలి .. పరిగెత్తాలన్నా, నడవాలన్నా కాళ్ళు అవసరం"

అన్నాడు.

" సరి, నీ చేతులు పట్టుకోనా"

అన్నాడు శనీశ్వరుడు .

ఆ రాళ్ళని చేతులతోనే కదా మోసి

తెస్తున్నాను. చేతులు పట్టుకోవద్దు. అన్నాడు

హనుమంతుడు.

"అయితే, నన్ను ఏం చెయ్యమంటావు?

నీ భుజాల పైన ఎక్కమంటావా" అన్నాడు

శనీశ్వరుడు.


"రామలక్ష్మణులను నా భుజాల మీద ఎక్కించుకుని వెడుతున్నాను. అందువలన

భుజాలు ఎక్కడానికి వీలులేదు " అన్నాడు హనుమంతుడు.


" పోనీ, నీ హృదయం లో వుండవచ్చునా?"

అని అడిగాడు శనీశ్వరుడు.


"ఈ హృదయంలో, మహాలక్ష్మీరూపిణి అయిన సీతాదేవి,

నా దేవుడైన

శ్రీరాముడు

నిరంతరంగా నివసిస్తూ వున్నారు ...అక్కడ నీకు

చోటు లేదు. " అన్నాడు

హనుమ.


" సరే , చివరకు నీ శిరస్సు ఒక్కటే

ఖాళీగా వున్నది. అక్కడే వుంటాను "అని

శనీశ్వరుడు , హనుమంతుని శిరస్సు

పైన ఎక్కి కూర్చున్నాడు.


హనుమంతుడు ఒక పెద్ద బండరాయిని తన శిరస్సు పై( అంటే శనీశ్వరుని

మీద) పెట్టుకుని ఒక్కొక్క బండను సముద్రంలో వేయడం మొదలెట్టాడు.

ఆ బండరాళ్ళ బరువును మోయలేక

శనీశ్వరుని కళ్ళుతేలేసాడు. మరో పెద్ద బండరాయిని హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే,

శనీశ్వరునికి ఊపిరి సలపక

గిలగిలలాడాడు. హనుమంతుడు ఆ రాయిని

సముద్రంలో వేసిన మరుక్షణమే

శనీశ్వరుడు హనుమ శిరస్సుపైనుండి కిందకి దూకేశాడు.


" మారుతీ, నీ వల్ల నాకు శ్రీ రాముని సేవించుకునే

భాగ్యం కలిగినది . నీవు సకల శక్తులకు అతీతుడవైన రామభక్తుడవు. నీముందు నా శక్తిచాలదు. నిన్ను నేను పట్టలేను, నన్ను వదిలిపెట్టు మహానుభావా"

అంటూ చేతులెత్తేసి ఒకే పరుగుపెట్టాడు శనీశ్వరుడు.

హనుమంతుని ముందా కుప్పిగంతులు!


నిర్మల భక్తితో , నిశ్చల మనస్సుతో శ్రీ రాముని సేవలో నిమగ్నమైయున్న ఎవరిని కూడా శనీశ్వరుడు

రెండు క్షణాలు కూడా

పట్టుకొనలేడు.

పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరం

శ్రీరామనామం జపిస్తే కష్టాల నుండి

విముక్తి కలిగి తీరుతుంది.


       🍁 *జై శ్రీరామ్* 🚩 

    🍁 *జై హనుమాన్* 🚩

కామెంట్‌లు లేవు: