6, సెప్టెంబర్ 2024, శుక్రవారం

మృణ్మయ గణపతే

 *మృణ్మయ గణపతే సర్వదా పూజ్యనీయం..*

భాద్రపద శుక్ల చతుర్థీ అంటే... వినాయకచవితి. ఈ గణపతి పూజా నియమాల గురించి ముద్గల పురాణంలో చెప్పబడింది. అందులో కణ్వమహర్షి భరతునికి గణపతి తత్వాన్ని, భాద్రశుక్ల చవితి వ్రత మహిమను చెప్పారు. అందులో భాగంగా ప్రధానమైన నియమం గణపతి యొక్క మూర్తిని మట్టితో మాత్రమే చేసి పూజించడం.  మిగతా పదార్ధాలతో చేసిన విగ్రహాల గురించి  అందులో ప్రస్తావన లేదు. గణపతిని మట్టితో పూజించడం వెనుక పంచీకరణం అనే ఒక తత్వం ఉంది. అసలేంటీ ఈ పంచీకరణం అంటే?

ఆకాశం నుండి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు,నీటి నుంచి భూమి ఉద్భవించాయి. ఇవి పంచభూతతత్వం.    జడపదార్ధమైన భూమి చైతన్యం కలిగిన నీళ్ళతో చేరినప్పుడు ప్రాణశక్తి కలిగి - ఆహారపదార్ధాలనూ, ఓషధులని మనకు అందిస్తుంది. నీరు ప్రాణాధారశక్తి. జడశక్తులు కలయికతో ఈ సృష్టి ఏర్పడిందనడానికి సంకేతంగా గణపతి విగ్రహాన్ని మట్టి, నీరు కలిపి తయారుచేస్తాం. అప్పుడది పూజార్హం అవుతుంది. మన శరీరంలో ఆరు చక్రాలు ఉన్నాయి అంటుంది యోగశాస్త్రం. ఆరు చక్రాల్లో మొదటిది మూలాధారచక్రం, వెన్నుపూస చివరిభాగాన ఉంటుంది. నాలుగు రేకులు పద్మంవలే, ఎరుపు రంగు కాంతులు విరజిమ్ముతూ ఉంటుంది. యోగశాస్త్రం ప్రకారం మూలాధారచక్రానికి గణపతి అధిష్ఠానదేవత. మూలాధారం - పృధ్వీ తత్వం, అంటే భూమికి సంకేతం. కనుక వినాయకున్ని మట్టితోనే చేయాలి.

పంచభూతాల్లో, ప్రతి భూతంలోనూ, దాని తత్వం 1/2 వంతు, తక్కిన 4 భూతాల తత్వాలు ఒక్కొక్కటి 1/8 వంతుగా ఉంటాయి. ఉదాహరణకు తీసుకుంటే భూమి- అందులో 1/2 భూతత్వం అయితే, 1/8 జలం, 1/8 అగ్ని, 1/8 వాయువు, 1/8 ఆకాశం ఉంటాయి.  దీన్నే 'పంచీకరణం' అంటారు. ఒక్కో తత్వానికి ఒక్కో అధిష్ఠానదేవత ఉంటారు. భూతత్వానికి అధిష్ఠానదేవత గణపతి, ఆకాశతత్వానికి ఈశ్వరుడు (శివుడు), జలతత్వానికి నారాయణుడు, అగ్నితత్వానికి అంబిక, వాయుతత్వానికి ప్రజాపతి (బ్రహ్మ). మనం పూజించే విగ్రహంలో గణపతి తత్వం 1/2 భాగం ఉండగా, మిగిలిన ఈ అన్ని దేవతల తత్వం 1/8 భాగంగా ఉంటుంది. పరమాత్ముడు ఒక్కడే, ఎన్నో విధాల కనిపించినా, అన్నీ ఒక్కరూపమే.  మృణ్మయ వినాయక విగ్రహంలో 1/2 భూతత్వం, తక్కినవి 1/8 ప్రకారం ఉంటాయి. మనం మట్టితో చేసే గణపతి విగ్రహం పంచమహాభూతాల సమాహారం. ఆ మృణ్మయ ప్రతిమను పూజించడం ద్వారా పంచభూతాలను, వాటి అధిష్ఠానదేవతలను పూజిస్తున్నాం అన్నట్లే . ఇది ఇతర పదార్ధాల చేత చేయబడిన గణపతి మూర్తులను ఆరాధించడం వలన కలుగదు. పంచభూతాలతో ఆధునిక మానవుడు సంబంధం తెంచుకున్న కారణం చేతనే అనేక సమస్యలకు, ఒత్తిళ్ళకు, రోగాలకు బాధితుడవుతున్నాడు.

ఏ తత్వాలతో ఒక వస్తువు ఏర్పడుతుందో, చివరికది ఆ తత్వాలలోనే లయం అవుతుంది. అదే సృష్టి ధర్మం. కనుక మట్టితో చేసిన వినాయక విగ్రహాన్ని నీళ్ళలో కలపడం వల్ల, ఆ విగ్రహంలో ఉన్న పంచతత్వాలు క్రమంగా వాటివాటి తత్వాల్లో  లీనమవుతాయి. ఇదే పంచభూతాత్వాక శక్తి. అంటే ఇక్కడ అర్ధం ఏమిటంటే....చివరికి ఏదైనా పృథ్వి లో మిళితం కావాలిసిందే అన్నమాట. ఓషధిగుణాలు కల్గిన 21 రకాల పూజపత్రాలులతో పూజించడంలో ఉన్న పరమర్థమూ అదే.

కనుక వినాయకుడిని మట్టితో చేసి పూజించడమే సర్వులకు శుభప్రదం, మంగళప్రదం.

ఓం గం గణపతయే నమః

*-శృంగేరీ జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థమహాస్వామివారు.*

కామెంట్‌లు లేవు: