*గరుడ పురాణం_*11వ భాగం*
_సదాశివాదులారా! విష్ణుభగవానుని విశేషపూజకై అయిదు ప్రకారాల రంగులు కలిపిన చూర్ణంతో వజ్రనాభమండలాన్ని నిర్మించాలి. దీనికి సమాన పరిమాణంలో పదహారు కోష్ఠకాలతో నిర్మించాలి._
_*వజ్రనాభ మండలం తయారు కాగానే న్యాసం చేసుకొని శ్రీహరిని పూజించాలి. హృదయ మధ్యంలో విష్ణుభగవానుని, కంఠంలో సంకర్షణుని, శిరంపై ప్రద్యుమ్నుని, శిఖాభాగంలో అనిరుద్ధుని, సంపూర్ణ శరీరంలో బ్రహ్మనీ, రెండు చేతులలో శ్రీధరునీ భావించుకొని న్యాసం చేసుకోవాలి. తరువాత*_ _అహం విష్ణుః_ _*అని ధ్యానం చేస్తూ పద్మంలో (మండలంలో నిర్మింపబడిన పద్మంలో) కర్ణిక భాగంలో శ్రీహరిని స్థాపించాలి. మండలానికి తూర్పులో సంకర్షణునీ, దక్షిణంలో ప్రద్యుమ్నునీ, పశ్చిమంలో అనిరుద్ధునీ, ఉత్తరంలో బ్రహ్మదేవునీ స్థాపించాలి. ఈశాన్యంలో ముందు శ్రీహరిని స్థాపించి ఆ తరువాత దిక్పాలకులను వారి వారి మంత్రాలతో ఈ దిగువ నిచ్చిన దిక్కులలో నిలపాలి.*_
ఓం ఇంద్రాయ నమః - ఇంద్రుని - తూర్పులో
ఓం అగ్నయే నమః - అగ్నిని - ఆగ్నేయంలో
ఓం యమాయనమః - యముని - దక్షిణంలో -
ఓం నిరృతయే నమః - నిరృతిని - నైఋతిలో
ఓం వరుణాయ నమః - వరుణుని - పశ్చిమంలో
ఓం వాయవే నమః - వాయువుని - వాయవ్యంలో
ఓం కుబేరాయ నమః - కుబేరుని - ఉత్తరంలో
ఓం ఈశానాయ నమః - ఈశ్వరుని - ఈశాన్యంలో
_*స్థాపించిన తరువాత అందరు దేవతలనూ గంధాది ఉపచారాల ద్వారా పూజించాలి. దీని వలన సాధకునికి దేహాంతంలో పరమపదం ప్రాప్తిస్తుంది.*_
_దేవగణములారా! దీక్షితుడైన శిష్యుడు వస్త్రంతో తన రెండు కన్నులనూ మూసుకొని దేవతల మూల మంత్రాలను పఠిస్తూ నూట యెనిమిది ఆహుతులను అగ్నిలోనివ్వాలి. పుత్ర లాభమును కోరుకొనే వారు దానికి ద్విగుణంగా అంటే రెండు వందల పదహారు ఆహుతులను అగ్నికి సమర్పించాలి. సాధనాసిద్ధికైతే మూడు రెట్లు (మూడు వందల ఇరవై నాలుగు) మోక్షప్రాప్తి కోసం చేసే దేశికునికైతే నాలుగు రెట్లు అనగా నాలుగు వందల ముప్పది రెండు ఆహుతులు అవసరం. (దేశికుడనగా ఉపదేశమిచ్చే ఆచార్యుడు)_
_*విద్వాంసుడైన దేశికుడు అన్నిటికన్న ముందు భగవంతుని ధ్యానించాలి. తరువాత వాయవ్యం వైపు తిరిగి 'యం' అనే బీజమంత్రాన్ని చదువుతూ శిష్యుల క్షేమాన్ని ఆలోచించాలి. ఆగ్నేయం వైపు తిరిగి 'రం' అనే బీజమంత్రం ద్వారా తమ మనస్తాపాలను తొలగించే విధానాన్ని ఆలోచించాలి. వారుణీ దిశగా తిరిగి 'వం' అనే బీజ మంత్రం ద్వారా హృదయస్థితినీ ధర్మాభిరుచినీ విచారించుకోవాలి. తరువాత దేశికుడు అభేద చింతనాన్ని చేయాలి. అభేద జ్ఞానమనగా ఆత్మతేజాన్ని పరమాత్మ తేజంతో ఏకం చేసే సాధనను చేయగలిగే తెలివి. అపుడు ఓంకారాన్ని జపిస్తూ వాయు, అగ్ని, జల, పృథ్వీ తత్త్వాలను ధ్యానం చేయాలి. అలా చేయగా చేయగా సాధకునికి వాటిపై విజయం ప్రాప్తిస్తుంది. తరువాత శరీరమంతా జ్ఞానంతో నిండిపోయి క్షేత్రజ్ఞుడవుతాడు.*_
_మండలాదికములను నిర్మించుకోవడం సాధ్యం కానపుడు సాధకుడు తన మానస మండలాన్ని తానే2 కల్పించుకొని ఆ శ్రీహరిని పూజించుకోవచ్చును. శరీరంలోనే బ్రహ్మాది తీర్థాలుంటాయని శాస్త్రాల్లో చెప్పబడింది. మనిషి మానసమండలానికి కూడ నాలుగు ద్వారాలుంటాయి. చేతిని పద్మంగానూ వ్రేళ్ళను పద్మపత్రాలుగానూ, హస్తమధ్యాన్ని కర్ణిక గానూ, గోళ్లను కేసరాలుగానూ భావించుకొనే సాధకుడు తన హస్తరూపియైన కమలంలోనే సూర్య, చంద్ర, ఇంద్ర, అగ్ని, యమాది పరివేష్టితుడైన శ్రీహరిని కల్పించుకొని పూజించుకోవచ్చును._
_*ఇక పూజానంతరము గురువు లేదా దేశికుడు తన చేతిని శిష్యుని తలపై పెట్టాలి. ఈ చేతిలోనే విష్ణువుంటాడు కాబట్టి ఆ హస్త స్పర్శ మాత్రాననే శిష్యుని పాపాలూ, అజ్ఞానమూ కూడా పటాపంచలై పోతాయి. అపుడు గురువు శిష్యుని పూజించి నూతన నామకరణం చేసి తనతో బాటు శిష్యుని కూడా ఆధ్యాత్మిక సాధనల దారిలో గొనిపోవాలి.*_
_శక్తిస్వరూపులైన ఓ శివాదిదేవతలారా! ఇక శ్రీలక్ష్మీ సిద్ధిప్రాప్తి విధివిధానాలు చూద్దాం. దీనిని స్థండిలాదులపై చేస్తారు. ఏదైనా పుణ్యకార్యానికై ప్రత్యేకంగా నేలకి కాస్త ఎత్తులో నిర్మింపబడి చదును చేయబడి పవిత్రీకరింపడిన ప్రత్యేక ప్రదేశాన్ని స్థండిలమంటారు._
_*ముందుగా ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మై నమః అని జపించి శ్రాం శ్రీం శ్రూం శైం శ్రాం శ్రః అనే బీజాక్షరాలను మంత్రానికి జోడిస్తూ క్రమంగా హృదయ, శిర, శిఖ, కవచ, నేత్ర, అస్త్రాలలో ఈ ప్రకారంగా షడంగన్యాసం చేసుకోవాలి.*_
ఓం శ్రాం హృదయాయ నమః ।
ఓం శ్రీం శిరసే స్వాహా ।
ఓం శ్రూం శిఖాయై వషట్
ఓం త్రైం కవచాయ హుం |
ఓం క్రౌం నేత్రత్రయాయ వౌషట్ ।
ఓం శ్రః *అస్త్రాయ ఫట్ |
_*సాధనారతుడైన భక్తుడు అంగన్యాసం తరువాత శ్రీమహాలక్ష్మిని పూజించాలి.*_
_( * సమస్త శరీరాన్నీ రక్షిస్తూ, ప్రతి భక్తుని చుట్టూ ఒక ఆవరక శక్తి వుంటుంది. దాన్ని 'అస్త్ర' అంటారు. న్యాసం చేసినపుడు ఈ శక్తిని రెండు చేతులలో కల్పన చేసుకోవాలి.)_
_*తరువాత ఒక మండలాన్ని నిర్మించి నాలుగు రంగులు అద్ది గర్భస్థానంలో పద్మాన్ని నిర్మించాలి. దానికి అరవై నాలుగు రేకులను కల్పించాలి. మధ్యలో లక్ష్మిని చిత్రించి ఒక వైపు దుర్గ నుంచి మిగతా అందరు దేవతలనూ విష్ణుపూజలో వలెనే స్థాపించాలి. హవనమూ చేయాలి. తరువాత ఓం ఘం టం డం హం శ్రీ మహాలక్ష్మ్యై నమః అనే మహామంత్రంతో లక్ష్మీదేవిని పూజించాలి.*_
_అటు పిమ్మట సాధకుడు - 'ఓం సౌం సరస్వత్యై నమః |' ఓం హ్రీం సౌం సరస్వత్యై నమః | 'ఓం హ్రీం వద వద వాగ్వాదిని స్వాహా|' ఓం హ్రీం సరస్వత్యై నమః l' అను మంత్రాలనుచ్చరించి సరస్వతీ దేవికి నమస్కరించాలి. (అధ్యాయాలు 6-10)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి