235f4;
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀9️⃣6️⃣
*శ్రీ మహావిష్ణు పురాణం*
➖➖➖✍️
96 వ భాగం
*శ్రీకృష్ణావతారము - యదువంశ కథ - కంసుడి నుంచి శ్రీకృష్ణుడి వరకు జననం,మరణం.*```
యదువు మరో పుత్రుడు అనలునికి ఆనకదుందుభి అనే కుమారుడు జన్మించాడు. అతని సుతుడు పునరస్వుడు. పునర్వసుని కుమారుడు ఆహుకునకు దేవకుడు, ఉగ్రసేనుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు. దేవకునకి వృకదేవ, ఉపదేవ, దేవరక్షిత, శ్రీదేవి, శాంతిదేవి, దేవకి, సహదేవి అనే ఏడుగురు కుమార్తెలు జన్మించారు. వీరిని వసుదేవునికి ఇచ్చి వివాహం చేశారు. ఉగ్రసేనుడికి కంసుడు మొదలైన పదిమంది కుమారులు జన్మించారు.
భజమానుని కుమారుడు విదూరథుడు, అతని కుమారుడు శూరుడు, శూరునికి ప్రతిక్షతుడు, ప్రతిక్షతునికి భోజుడు, భోజునికి హృదీకుడు, హృదీకునికి కృతవర్మ, ఆనందుడు జన్మించారు. కృతవర్మ పదివేల యదువీరులకు నాయకుడై శ్రీకృష్ణుడి చేత దుర్యోధనుడికి ఇవ్వబడి కౌరవుల పక్షాన కురుక్షేత్ర యుద్దంలో పోరాడాడు. కౌరవ సేనలో చివరకు మిగిలిన ముగ్గురులో కృతవర్మ ఒకడు.
శూరునికి మారిష అనే మరో భార్య యందు పదిమంది కుమారులు కలిగారు. వారిలో వసుదేవుడు ప్రసిద్ధి చెందినవాడు. వసుదేవుడు జన్మించే సమయంలో దేవతలు ఆకాశంలో "ఇతని కుమారుడిగా మహావిష్ణువు జన్మించి మమ్మల్ని, ముల్లోకాలను కాపాడతాడు" అంటూ దేవదుందుభులు మ్రోగించారు. కనుక అతనికి ఆనకదుందుభుడు అనే పేరు కూడా ఉంది.
వసుదేవుడు దేవకుని పుత్రికలైన దేవకి మొదలైన ఏడుగురుని వివాహం చేసుకునే ముందే రోహిణి మొదలైన ముగ్గురు కన్యలను వివాహం చేసుకుని ఉన్నాడు. వసుదేవునికి ఐదుగురు పృధ, శ్రుతదేవ, శ్రుతకీర్తి, శ్రుతశ్రవ, రాజాధీదేవి అనే చెల్లెళ్ళు ఉన్నారు. కుంతీభోజుడు ఆడ సంతానం లేకపోతే వసుదేవుని తండ్రి శూరుని ఒప్పించి పృధను దత్తత తీసుకున్నాడు. ఆమె పేరు కుంతీదేవిగా మారింది.
కుంతీదేవి కురువంశానికి చెందిన పాండురాజుని పెళ్ళాడింది. పెళ్లికి పూర్వం దుర్వాస మహర్షికి సేవ చేసి "కోరిన దేవుడి వలన పుత్రుని పొందే" మంత్రం సేవకు ఫలంగా పొందింది. మునిశాపం వలన పాండురాజు తండ్రి కాలేకపోవడంతో యమధర్మరాజుని ప్రార్ధించి ధర్మరాజుని, వాయుదేవుని ప్రార్ధించి భీముని, ఇంద్రుని ప్రార్ధించి అర్జునుడికి తల్లి అయ్యింది. తన మంత్రాన్ని సవతి మాద్రికి ఉపదేశించగా ఆమె అశ్వనీ దేవతలను ప్రార్ధించి నకుల సహదేవులను పొందింది.
కుంతీదేవి పెళ్లికి పూర్వం దుర్వాస మహర్షి మంత్రం పరీక్షించాలనే చంచల బుద్దితో సూర్యదేవుడిని ప్రార్ధించి కవచకుండాలు కలిగిన కర్ణుని పుత్రునిగా పొందింది. లోకోపవాదుకి భయపడి నదిలో వదిలేయగా, ధృతరాష్ట్రడి సారథి అయిన సూతుడు చేరదీసి పెంచాడు.
కరూశ దేశాధిపతి అయిన వృద్ధధర్ముడు వసుదేవుని చెల్లెలు శ్రుతదేవను వివాహమాడాడు. వారికి ఐదుగురు కుమారులు జన్మించారు. మరో చెల్లెలు రాజాధిదేవిని అవంతిరాజు వివాహం చేసుకున్నాడు. వీరికి విందుడు, అనువిందుడు అనే ఇద్దరు కుమారులు, లక్ష్మణ అనే పుత్రిక జన్మించింది. లక్ష్మణను స్వయంవరంలో శ్రీకృష్ణుడు వివాహం చేసుకున్నాడు.
చేదిరాజు దమఘోషుడు వసుదేవుని మరోచెల్లెలు శ్రుతశ్రవను పెళ్లి చేసుకున్నాడు. వీరికి శిశుపాలుడు జన్మించాడు. వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు సనకసనందాదుల శాపం వలన మహావిష్ణువు శత్రువులుగా మూడు జన్మలు మూడు యుగాలలో ఎత్తి నారాయణుని అవతారాలచే సంహరించబడి వైకుంఠం తిరిగి చేరారు. కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించి వరాహ, నరసింహ అవతారాలచే సంహరించబడ్డారు. త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా జన్మించి శ్రీరామునిచే చంపబడ్డారు. ద్వాపరయుగంలో శిశుపాలుడు, దంతవ్రక్తునిగా జన్మించి కృష్ణుని చేత చంపబడ్డారు.
కంసుడు తన పెదనాన్న పుత్రిక అయిన చెల్లెలు దేవకిపై అమితమైన ప్రేమ కలిగి ఉండేవాడు. ఆ ప్రేమతోనే దేవకిని వసుదేవుడు పెళ్ళాడినప్పుడు స్వయంగా రథ సారధ్యం చేసి అత్తవారింట దింపడానికి రథంలో తీసుకుని బయలుదేరాడు. దారిలో ఆశరీరవాణి కంసుని "దేవకికి పుట్టే అష్టమ సంతానం చేతిలో మరణముంటుందని" హెచ్చరించింది. దానితో దేవకిని చంపబోయాడు. వసుదేవుడు "దేవకికి పుట్టిన సంతానం అప్పగిస్తాను" అన్నమాటతో చంపకుండా భార్యాభర్తులను వెనుకకు తెచ్చి కారాగారంలో బంధించాడు.
కంసుడి చర్యకు భయపడిన వసుదేవుని పెద్ద భార్య రోహిణి వసుదేవుడు మిత్రుడైన గోపాలుర రాజైన నందుని ఇంట తలదాచుకుని రహస్యంగా ఉంది. వసుదేవుడు కంసుడికి ఇచ్చిన మాట పాటించి పుట్టిన ఆరుగురు పుత్రులని కంసుడికి అప్పగించగా కంసుడు చంపివేశాడు. దేవకి ఏడవ గర్భంలో పురుడు పోసుకుంటున్న ప్రాణాన్ని యోగమాయ మహావిష్ణువు ఆదేశంతో దేవకి గర్భం నుంచి రోహిణి గర్భానికి మార్చింది. రోహిణికి ఆదిశేషుడు పుత్రుడిగా జన్మించి బలరాముడు అనే పేరు పొందాడు.
దేవకి అష్టమ పుత్రుడిగా మహావిష్ణువు జన్మించాడు. యోగమాయ నందుని భార్య యశోదకు పుత్రికగా జన్మించింది. మహావిష్ణువు ఆదేశంతో వసుదేవుడు పుట్టిన మగ శిశువును నందుని ఇంటికి చేర్చి యశోదకు పుట్టిన ఆడ శిశువుని తీసుకు వచ్చి దేవకి వద్ద ఉంచాడు.
ఆడపిల్లని చూడకుండా కంసుడు ఆడపిల్లను ఆకాశానికి ఎగరేసి చంపబోయాడు. ఆకాశానికి ఎగిరిన శిశువు యోగమాయగా మారి "నిన్ను చంపబోయేవాడు పుట్టి మరోచోట సురక్షితంగా ఉన్నాడు" అని హెచ్చరించి మాయమైంది.
మహావిష్ణువు యశోద పుత్రుడు శ్రీకృష్ణుడిగా ఎదిగి పదహారు వేల ఎనిమిదిమందిని వివాహమాడాడు. వారికి లక్ష ఎనభై వేల మంది పుత్రులు జన్మించారు. ఈవిధంగా యదువు వంశం యాదవ, అంధక, వృష్ణి, భోజ వంశాలుగా విస్తరించి వ్యాపించింది. శ్రీకృష్ణుని అవతార సమాప్తి సమయంలో గాంధారి, మునుల శాపాల వలన కలిగిన అంతర్గత యుద్దంలో యదు వంశాలన్ని ఒకరితో ఒకరు పోరాడి అంతమైపోయాయి.✍️
*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం..
*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో..
-సేకరణ:పెండ్యాల ఉపేంద్ర రావు```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి