21, నవంబర్ 2024, గురువారం

మొగలిచెర్ల అవధూత


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర..*
  
*మాలకొండ లో తపస్సాధన..*

*(తొమ్మిదవ రోజు)*

"ఏకేన చక్రమపరేణ కరేన శంఖం
అన్యేన సింధు తనయా మవలంబ్య తిష్ఠన్
వామేతరేణ వరదాభయ హస్తముద్రాం
శ్రీ లక్ష్మీనృసింహ! మమదేహి కరావలంబం౹౹"

"ఒకచేత సుదర్శన చక్రము, వేరొకచేత పాంచజన్య శంఖము, ఇంకొక చేత లక్ష్మీదేవిని చుట్టి, తన ఎడమ తొడపై కూర్చుండబెట్టుకొని, తన కుడిచేతితో అశేష భక్తకోటికి అభయం ఇస్తూ దర్శనం ఇచ్చే శ్రీ లక్ష్మీ నరసింహా!..నాకు చేయూత నివ్వు!!" 

అని శ్రీ ఆదిశంకరాచార్యులు చేసిన స్తోత్రం లోని శ్లోకాన్ని గుర్తుచేసుకుంటూ..శ్రీ స్వామివారు మాలకొండ కు చేరి, ముందుగా ఆ లక్ష్మీనృసింహుడి సన్నిధిలో కొంత సేపు గడిపారు..మాలకొండ లో ఉగ్రరూపంతో వుండే ఆ లక్ష్మీ నరసింహుడు..ఈ యువక యోగి పట్ల ప్రసన్నుడై..తన అక్కున చేర్చుకున్నాడు..

శ్రీ స్వామివారు మాలకొండలోనే ఉత్తరంగా కొద్దిగా దిగువున, రెండు పెద్ద బండరాళ్లు చీలి ఏర్పడిన దారితో, ఒకే పెద్ద గొడుగు లాటి రాతి కింద వున్న శివాలయం వద్దకు వచ్చారు..ఆ శివాలయానికి మరికొద్ది దిగువున ఉన్న పార్వతీదేవి మఠం చూసారు..తన ఆవాసానికి ఆ అమ్మవారు కొలువైయున్న మఠం సరైనదని నిర్ణయానికి వచ్చారు..శివాలయం..దానిపైన వున్న రాతి గుహలు తన తపస్సుకు అనువైన ప్రాంతాలని నిర్ధారించుకున్నారు..

ఒకవైపు సాక్షాత్తూ వైష్ణవావతారం నృసింహుడు..మరో ప్రక్క  ఆది దంపతులైన శివ పార్వతులు..తనకు ఇంతకంటే రక్షణ ఇచ్చే ప్రదేశం మరోటి ఎక్కడుంది?..ఇది తన మోక్షమార్గాన్వేషణలో మరో మజిలీ..ఇప్పటిదాకా తాను చేసిన సాధన ఒక ఎత్తు..ఇక చేయబోయేది మరో ఎత్తు!..గురువు బాలబ్రహ్మం చెప్పినట్లు, ప్రకృతి అనుక్షణం మాయను ప్రదర్శిస్తుంది..అందులో చిక్కకుండా ఏకాగ్రచిత్తంతో సాధన చేయాలి..ఎల్లవేళలా జాగురూకత తో ఉండాలి..దేహాభిమానాన్ని త్యజించాలి..మమకారాన్ని మనసులోంచి తుడిచివేయాలి..తానింతకాలం ఏ మోక్షం కోసం తపించి సాధన చేస్తున్నాడో అందుకు అనువైన ప్రదేశం కూడా లభించిందని సంతోషపడ్డారు..

పార్వతీదేవి మఠం లో నివాసం ఏర్పరుచుకున్నారు..మితాహారం భుజించడం..సాధన చేసుకోవడం..ఇవి రెండే కార్యక్రమాలు..మాలకొండ క్షేత్రం ఒక్క శనివారం నాడు మాత్రమే భక్తుల కొరకు తెరచి ఉంటుంది..ఆ ఒక్కరోజు శ్రీ స్వామివారు శివాలయం పైనున్న గుహలలోకి వెళ్లిపోయేవారు..అక్కడ ఏకాంతంలో తపోసాధన చేసుకునేవారు..మిగిలిన ఆరు రోజులూ నరసంచారం వుండదు కాబట్టి, ఎక్కువభాగం శివాలయం లోనే తన తపస్సు కొనసాగించేవారు..

కానీ..కుతూహలం తో కూడిన మానవులున్న లోకం ఇది..ఎవరో యువక యోగి వచ్చి తపస్సు చేసుకుంటున్నాడని..మాలకొండ క్రింద ఉన్న గ్రామస్థులు పసిగట్టేశారు..వాళ్ళు కొండపైనున్న అడవి కర్రలు ఏరుకొచ్చి అమ్ముకునే వాళ్ళు..శ్రీ స్వామివారు శివాలయానికి వెళ్ళేటప్పుడు..తిరిగి పార్వతీదేవి మఠానికి వచ్చేటప్పుడు గమనించడం మొదలెట్టారు..వాళ్లలో వాళ్ళు శ్రీ స్వామివారి గురించి చర్చించుకోవడం కూడా జరుగుతోంది..శ్రీ స్వామివారిని చూసినప్పుడు పలకరించడం చేయసాగారు..తాను మౌనం లో వున్నప్పుడు చిరునవ్వే వారికి సమాధానం!..మౌనం వీడినప్పుడు..ముక్తసరిగా సమాధానం చెప్పి, వారిని పంపించివేసేవారు..ఇలా కాలం గడచిపోతోంది..

మాలకొండకు పశ్చిమంగా కొంత దూరం లో కంబాలదిన్నె అనే గ్రామం ఉంది..ఆ గ్రామ వాస్తవ్యులు శ్రీ చెక్కా కేశవులు గారు వైశ్య కులస్థుడు.. ఆయన మాలకొండ లక్ష్మీనృసింహ స్వామి వారి భక్తుడు..విజయవాడ లో వ్యాపారం చేస్తున్నారు..తన గ్రామానికి వస్తూ పోతూ ఉన్నప్పుడల్లా మాలకొండకు వచ్చి, శ్రీ లక్ష్మీనృసింహ స్వామి దర్శనం చేసుకొని వెళుతూవుండేవారు..అదొక నియమం తో కూడిన ప్రక్రియ వారికి..అలా వస్తూ పోతున్న సమయం లో ఒకసారి శ్రీ స్వామివారిని చూడటం తటస్థించింది..శ్రీ స్వామివారిలో ఉన్న తేజస్సు, చెక్కా కేశవులు గారిని కట్టిపడేసింది..క్రమంగా శ్రీ స్వామివారిని తరచూ చూడటం..మెల్లిగా పలకరించడమూ చేశారు..శ్రీ స్వామివారు సైతం చెక్కా కేశవులు గారితో మాట్లాడారు..కేశవులు గారికి నమ్మకం కలిగింది..శ్రీ స్వామివారు, ఇలా ఎటువంటి సరంజామా లేకుండా..భూశయనం చేయడం..కేశవులు గారికి నచ్చలేదు..శ్రీ స్వామివారు నెత్తి నోరు కొట్టుకొని వారిస్తున్నా వినకుండా..ఒక ఇనుప మంచాన్ని, దోమతెరను..కప్పుకోవడానికి దుప్పట్లు వగైరా అంతా పార్వతీదేవి మఠం కు చేర్చారు..

"నాయనా!..ఇవన్నీ నాకు వద్దు..నేను సర్వసంగపరిత్యాగిని..అన్నీ వదిలేసి ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాను..నన్ను మళ్లీ సంసారబంధం లోకి లాగకు..నీ కోరిక ఏమిటి?.." అని లాలనగా అడిగారు..

చెక్కా కేశవులు గారు చాలాసేపు తటపటాయించి..ఎట్టకేలకు తన మనసులోని కోరికను బయటపెట్టారు..విన్న స్వామివారు ఫక్కున నవ్వారు..

చెక్కా కేశవులు గారి అనుభవం..రేపటి భాగంలో..


సర్వం..
శ్రీ దత్తకృప!.

(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా.. పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).
 

మోక్ష మార్గానికి మార్గం

 *మోక్ష మార్గానికి మార్గం - వివేక చూడామణి గ్రంధాధ్యయనం*  


అద్వైత సిద్ధాంతాన్ని స్పష్టం చేయడానికి శ్రీ ఆదిశంకర భగవత్పాదులు రచించిన గ్రంథాలలో *వివేక చూడామణి* ఉత్తమమైనది. ఈ పుస్తకంలో అతను ఆ సిద్ధాంతం యొక్క అన్ని దశలను సంక్షిప్తంగా మరియు స్పష్టంగా వివరించాడు. ప్రధానంగా ఈ గ్రంథంలో వేదాంత తత్త్వాన్ని తెలుసుకోవాలని, జ్ఞాని అయిన శిష్యుడు తన గురువు నుండి తత్త్వాన్ని అడిగే విధానాన్ని, అటువంటి శిష్యునికి సరైన మార్గంలో తత్త్వాన్ని బోధించే న్యాయాన్ని గురించి, యోగ్యతఅంటే ఏంటో చెప్పాడు. 

 మన పరమ గురువు జగద్గురువులు శ్రీ శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు ఈ గ్రంథంపై చక్కని ఉపన్యాసం రాశారు.దాని ద్వారా ఈ గ్రంథాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు.శ్రీ శంకర భగవత్పాదులు ఈ గ్రంథం యొక్క ప్రయోజనాన్ని చిట్ట చివరి శ్లోకంలో చెప్పారు

 అంటే మోక్షమార్గం ఈ గ్రంథంలో చెప్పబడింది. భగవత్పాదులు ఆ మార్గం గురించి ప్రధానంగా చెప్పారు

 మోక్షం పట్ల ఆసక్తి ఉన్నవాడు విషం వంటి ప్రాపంచిక విషయాలను విడిచిపెట్టాలి. తృప్తి, దయ, సహనం, నిజాయితీ, శాంతి, నియంత్రణ అనేవాటిని అమృతాన్ని సేవించినట్లే అలవర్చుకోవాలి.అంటే ఈ యోగ్యతను పొందిన వ్యక్తి మాత్రమే మోక్షమార్గంలో ప్రవేశించగలడు. 

 ఎన్నో మంచి విషయాలు ఉన్న ఈ వివేక చూడామణిని అందరూ చదవండి.


-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*

ధర్మాత్ములు

 ఇలాంటి ధర్మాత్ములు ఇంకా ఉన్నారు కాబట్టే వర్షాలు పడుతున్నాయి…


ఉన్నారు, ఇంకా అక్కడక్కడ !


ఇపుడు 55 ఏళ్ల వయసు కలిగిన సుధాకరన్ కు 2014 లో 45 ఏళ్ళ వయసు. ఆయన ఉత్తర కేరళలోని కన్హన్ ఘాడ్ లో శీతల పానీయాలు ,మిఠాయిలతో పాటు లాటరీ టికెట్లు కూడా అమ్ముతాడు.


ఆయన దుకాణం పేరు శ్రీ మూకాంబిక. నెలకు 10 వేల రూపాయల కంటే ఎక్కువ సంపాదన చూడలేదు.


దైవభక్తుడు. తక్కువగా మాట్లాడతాడు. కోపం రాదు. సహనం పోదు. పెద్దగా చదువుకోలేదు (అదృష్టం కొద్దీ !). జీవితంలో ఏవో పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోలేదు.


సాధారణ జీవితం. ఆ జీవితంలో కొన్ని పాటిస్తూ వస్తున్నాడు : తల్లితండ్రులు చెప్పే వాటిలో మంచి వుంటే, దాన్ని పాటించాలి, ఎవరినీ మోసం చేయరాదు, డబ్బు వున్నా, లేకపోయినా ఒకే విధంగా వుండాలి, ఎంతమందిని మోసం చేసినా, ఎన్ని తంటాలు పడినా, యమ భటులో, దేవ దూతలో వచ్చినపుడు, నేను ఇక్కడి నుండీ ఆవగింజను కూడా తీసుకెళ్లలేను…


ఒక రోజు తన దుకాణానికి దాదాపు ప్రతి రోజూ వచ్చే అశోకన్ అనే వ్యక్తి, సుధాకరన్ కు చరవాణి పిలుపు చేసి ” నాకు 10 లాటరీ టికెట్లు పక్కన పెట్టు. డబ్బు మళ్ళీ ఇస్తాను ” అన్నాడు. ఈయన సరేనని 10 టికెట్లు పక్కన పెట్టి మిగతావి అమ్మేసాడు. మరుసటి రోజు లాటరీ టికెట్ల ఫలితాలు వచ్చాయి. సుధాకరన్ తాను అశోకన్ కోసం ఎత్తి పెట్టిన టికెట్లను తీసికొని చూస్తే వాటిలో ఒక టికెట్ లాటరీ గెలుచుకొంది. డబ్బు ఎంత?   ఒక కోటి రూపాయలు.


2014 లో ఒక కోటి రూపాయలు.


అశోకన్ కోసం ఎత్తి పెట్టిన లాటరీ టికెట్ల సంఖ్యలు తనకు తప్ప, ఎవరికీ తెలియదు. ఆ టికెట్లకు అశోకన్ ఇంకా డబ్బు కూడా ఇవ్వలేదు, ఏదో ఒక మాట చెప్పి ఆ కోటి రూపాయలు తాను తీసుకోవచ్చు. అలానే చేశాడా ? లేదు.

 చరవాణి అందుకొని తండ్రికి కాల్ చేసి, జరిగిన విషయం చెప్పి ” ఏమి చేయమంటారు? ” అని అడిగితే ఆయన ” ఇందులో ఆలోచించేందుకు ఏముంది? అశోకన్ కు చరవాణి పిలుపు చేసి నీవు ఒక కోటి రూపాయలు గెలుచుకొన్నావు ‘ అని చెప్పి, ఆ లాటరీ చీటీ అతనికి ఇచ్చేయి ” అన్నాడు.


సుధాకరన్ మరో ఆలోచన కూడా చేయలేదు. తండ్రి చెప్పినట్టే చేసాడు.


“అంత డబ్బు చూసాక, మీరు దాన్ని మీ సొంతం చేసుకోవాలి అనిపించలేదా? అశోకన్ కు ఆ లాటరీ సంఖ్య తెలియదు కదా? ఇతరులకు కూడా ఆ టికెట్ సంఖ్య గురించి తెలియదు కదా? ” అని ఒక పాత్రికేయుడు అడిగితే ” అసలు అలా అనిపించలేదు. నా తల్లితండ్రులు నాకు నిజాయితీగా బ్రతుకు అని చెప్పారు. ‘ నీకు డబ్బు అవసరం వుంటే, అడుక్కు తిను కానీ ఇతరుల డబ్బును తీసుకువద్దు ‘ అని వాళ్ళు నాకు చిన్నప్పటి నుండీ నేర్పించారు, ” అన్నాడు సుధాకరన్.


ప్రపంచంలో 99% మంది ఎందుకు, ఎలా జీవిస్తారో అలా కాకుండా 1% మంది మరి దేనికోసమో జీవిస్తారు. ధర్మాన్ని వదలరు. అబద్దం చెప్పరు. సత్యాన్ని తప్పరు. ఆ ఒక్క శాతం మనుషులే ఈ భూమికి అందం, ఈ లోకానికి అలంకారం….

కార్తీకపురాణం 20

 కార్తీకపురాణం 20 వ అధ్యాయము

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


🍃🌷పురంజయుడు దురాచారుడగుట:


జనక మహారాజు, చతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్టునితో "గురువర్యా! కార్తీకమాస మహాత్మ్యమును ఇంకను వినవలయుననెడి కోరిక కల్గుచున్నది. ఈ వ్రత మహాత్మ్యమునందింకను విశేషములు గలవా! యను సంశయము గూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములు వినిపించి నన్ను కృతార్దునిగాజేయు" డనెను. 


అ మాటలకు వశిష్టుల వారు మంద హాసముతో "ఓ రాజా ! కార్తీకమాస మహాత్మ్యము గురించి అగస్త్య మహామునికి , అత్రిమునికి జరిగిన ప్రసంగ మొకటి కలదు. దానిని వివరించెదరు ఆలకించు" మని అ కథా విధానమును ఇట్లు వివరించిరి...


పూర్వ మొకప్పుడు అగస్త్య మహర్షి అత్రిమహర్షిని గాంచి , "ఓ అత్రిమహామునీ! నీవు విష్ణువు అంశయందు పుట్టినావు. కార్తీకమాస మహాత్మ్యమును నీకు ఆములాగ్రమున తెలియును, కాన దానిని నాకు వివరింపుము" అని కోరెను. అంత అత్రిమహముని "కుంభసంభవా! నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమయినది. కార్తీక మాసముతో సమానమగు మాసము. వేదముతో సమానమగు శాస్త్రము. ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటె వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను గలుగు ఫలితము అపారము. ఇందుకొక ఇతిహాసము వినుము...


త్రేతాయుగమున పురంజయుడను సూర్య వంశపురాజు అయోధ్యా నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగ రాజ్యపాలన చేసెను. ప్రజలకెట్టి యాపదలు రాకుండ పాలించుచుండెను. అట్లుండ కొంత కాలమునకు పురంజయుడు అమిత ధనాశచేతను, రాజ్యాధికార గర్వముచేతను జ్ఞానహీనుడై దుష్టబుద్దిగలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహణ మాన్యములు లాగుకొని, పరమలోభియై, చొరులను జేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగము వాటా తీసికోనుచు ప్రజలను భీతావహులను చేయుచుండెను. 


ఇటుల కొంతకాలము జరుగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను. ఈవార్త కాంభోజ, కొంకణ, కళింగాది రాజుల చెవులబడినది. వారు తమలో తాము ఆలోచించుకొని కాంభోజరాజును నాయకునిగా చేసుకోని రధ, గజ, తురగ, పదాతి సైన్య బలాన్వితులై రహస్యమార్గము వెంట వచ్చి అయోధ్యానగరమును ముట్టడించి, నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్భంధముచేసి యుద్దమునకు సిద్దపడిరి.


అయోధ్యా నగరమును ముట్టడించిన సంగతిని చారులవలన తెలిసికోనిన పురంజయుడు తానుకూడా సర్వసన్నద్దుడై యుండెను. అయినను యెదుటి పక్షము వారధికబలాన్వితులుగా నుండుటయి తాను బలహినుడుగా నుండుటయు విచారించి యే మాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి, చతురంగబల సమేతమైన సైన్యముతో యుద్దసన్నద్దుడై, వారిని యెదుర్కొన భేరి మ్రోగించి, సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హుంకరించి శత్రుసైన్యములపై బడెను.


ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీకమహత్మ్యమందలి వింశాద్యాయము - ఇరవయ్యోరోజు పారాయణము సమాప్తము.


ఓం నమః శివాయ...🙏🙏

Kartika Puranam - 21

 Kartika Puranam - 21


కార్తిక పురాణము - ఇరవై ఒకటో అధ్యాయము

ఇట్లు యుద్ధమునకు పురంజయుని జూచి యుద్ధ ప్రవీణులయిన ఆ రాజులు కోప రక్తాక్షులై శస్త్రములతోను, అస్త్రములతోను, బాణములతోను, వాడియైన గుదియలతోను, ఇనుపకట్ల లాటీ కర్రలతోను, హస్తాయుధములయిన గుదియలతోను, కత్తులతోను, భల్లాతకములతోను, పట్టసములతోను, రోకళ్ళతోను, శూలములతోను, తోమరములతోను, కుంభాయుధములతోను, గొడ్డళ్ళతోను, కర్రలతోను, ఆయుధముల విక్షేపములతోను, యుద్ధము చేసిరి. గుర్రపురౌతులతో గుర్రపు రౌతులు, ఏనుగులు ఏనుగుల తోడను, రథికులతో రథికులు, కాల్బంటులతో కాల్బంటులు, శూరులతో శూరులును, ఆయుధములతో యుద్దమును భటులనన్యోన్యము క్రూరవాక్యములను పలుకుచు చేసిరి.

ఓ అగస్త్య మునీంద్రా! అంతలో కాంభోజ మహారాజు వస్త్రాదులను పదిలపరచికట్టికొని కవచమును ధరించి పరాక్రమించి మంచి రథమెక్కి ధనుర్బాణములను ధరించి కోలాహల ధ్వని చేయుచు వడిగా పురంజయుని వద్దకు వచ్చి మూడువందల బాణముల వేసెను. ఆ బాణములు పోయి పురంజయుని ఛత్రమును, ధ్వజమును, రథమును నరికినవి. తరువాత కాంభోజుడు కొన్ని బాణములతో పురంజయుని కొట్టి అయిదు బాణములతో పురంజయుని రథము యొక్క తురగములను జంపెను. తరువాత పురంజయుడు కోపించి ఇంద్రుడు వాలే విక్రమించి భుజాస్ఫాలనము చేసి నారి బిగించి బ్రహ్మ మంత్రములతో పది బాణములను ప్రయోగించి కాంభోజుని హృదయమందు కొట్టెను. పురంజయుని బాహుబలము చేత వేయబడిన ఆ బాణములు సర్పముల వాలే పోయి కాంభోజ రాజు హృదయమును భేదించి నెత్తురును త్రాగి తృప్తులై భటుల వద్దకు పోవుటకు ఇష్టపడలేదు.

సరిగా రొమ్ములో గుచ్చుకున్న బాణములను కాంభోజుడు హస్తముతో లాగి ఆ బాణములనే ధనుస్సునందు గూర్చి పురంజయునితో యిట్లనియె.

క్షత్రియా! వినుము. నీచే వేయబడిన బాణములను తిరిగి నీకే ఇచ్చెదను. నేను పరుల సొమ్మునందాసక్తి గలవాడను కాను. ఇట్లు పలికి కాంభోజుడు బాణములను విడువగా అవి వచ్చి పురంజయుని సారధిని, ఛత్రమును వాని ధనుస్సును త్రుంచినవి. పురంజయుడు మరియొక ధనుస్సును గ్రహించి నారిగట్టి రెక్కలతో గూడిన బాణములను పుచ్చుకుని ధనస్సుకు చేర్చి నారిని చెవి వరకు లాగి కోపముతో కాంభోజునితో ఇట్లనియెను. రాజా! శూరుడువౌదువు గాని యుద్ధమందు ధైర్యముతో నుండుము. నాచేత కొట్టబడిన బాణములనే తిరిగి నాకిచ్చినావు. నీవంటి నీచులకు ప్రతిదాన విధి తెలియునా? నేనిప్పుడు నీకు వేరు బాణములను ఇరువదింటిని ఇచ్చుచున్నాను.

ఇట్లు పలికి పురంజయుడు బాణములను విడిచెను. ఆ బాణములు గురిగా కాంభోజుని కవచమును ద్రుంచి వక్షస్థలమును భేదించి దూరము పోయినవి.

అప్పుడు భయంకరమయిన యుద్ధము జరిగెను. సైనికులు అన్యోన్య శరాఘాతముల చేత భుజములు తెగి బాహువులూడి పాదములు మొండెములై మేడలు విరిగి భూమియందు పడిరి.

అన్యోన్య శరాఘాతముల చేత ఏనుగుల తొండములు తెగినవి. గుర్రముల తోకలు తెగినవి. కాల్బంటులు హతులైరి. రథములు చక్రములతో సహా చూర్ణములాయెను. కొందరు తొడలు తెగి నేలబడిరి. కొందరు కంఠములు తెగి కూలిరి. బాణముల చేత శరీరమంతయు గాయములు పడినయొకభటుడు ధనుస్సును ధరించి నారి బిగించి అన్య భటునితో యిట్లనియె. తిరుగు వెనుకను తిరుగు, నాముందుండు ఉండుము. నీ వీపును నాకు చూపకుము. నీవు శూరుడవు కదా, ఇట్లు చేయవచ్చునా? ఓ మునీ ఇట్టి నిష్ఠురములగు మాటలను విని ప్రతి భటుడు ధనుర్బాణములను ధరించి ధనువు టంకార ధ్వని జేయుచు సింహగర్జనములను చేయుచు బహునేర్పుగా బాణములను ప్రతిభటుని మీద ప్రయోగించెను. ఆకాశమందుండి చూచెడి దేవతలు బాణములు తూణీరములనుండి తీయుటను, అనుసంధించి వేయుటను గుర్తించ లేరైరి. బహునేర్పుతో బాణములను వేయుచుండిరి. ఆయుద్ధమందు సూదిదూరు సందులేకుండా బాణవర్షము కురిసెను. ఇట్లన్యోన్యము శూరులను, భటులను బంగారపు కట్లతో గూడినవియు, స్వయముగా వాడియైనవియు, సానపెట్టబడినవియు, స్వనామ చిహ్నితములు అయిన అర్థ చంద్ర బాణములతోను, ఇనుప నారాచములతోను, ఇనుప అలుగులు గల బాణములతోను, ఖడ్గములతోను, పట్టసములతోను, ఈటెలతోను కొట్టుకొనిరి. గుర్రపురౌతులు కొందరిని చంపిరి. గుర్రపు రౌతులను ఏనుగు బంట్లు చంపిరి. రధికులు కాల్బంట్లను జంపిరి. కాల్బంట్లు రథికులను జంపిరి. ఇట్లు తొడలు, భుజములు, శిరస్సులు అంగములు తెగి హతులై చచ్చిరి. అచ్చట నెత్తురుతో యొకనది ప్రవహించెను. ఆకాశమందు మేఘాచ్చాదితలైన అప్సర స్త్రీలు లావైన కుచములతో ఒప్పుచుండి వచ్చి చూచి వీడునావాడు, వీడు నావాడని పలుకుచుండగా శూరహతులయిన శూరులు యుద్ధమందు మృతినొంది దివ్యాంబరధారులై విమానములెక్కి దేవతలు సేవించుచుండగా స్వర్గమునకు బోయి దేవస్త్రీ సంభోగాది సుఖములకై పాటుబడుచుండిరి. యుద్దమందు హతులైన వారు సూర్యమండలమును భేదించుకుని దేవస్త్రీలతో గూడుకొని గంధర్వాప్సరసల చేత కొనియాడబడుచు స్వర్గమునకు బోవుదురు. కాంభోజుడు మొదలగు రణకోవిదులైన శూరులచేతను, ఇతర రాజుల చేతను, సుభటులచేతను చాలా భయంకరమైన యుద్ధమునకు అందరికి ఒళ్ళు గగుర్పొడిచినది. ఇట్టి యుద్దమందు పురంజయుడు ఓడిపోయి సపరివారముగా సాయంకాలమందు పట్టణమున ప్రవేశించెను. రాజులును యుద్ధభూమిని వదలి కొంచెము దూరములో డేరాలు వేయించి వాటియందుండిరి. యుద్ధభూమి భూతప్రేత పిశాచ భేతాళములతోడను, నక్కలతోడను, రాబందులతోను, గద్దలతోను, మాంసాశనులతోను, బ్రకాశించుచుండెను. కాంభోజరాజునకు పదమూడు అక్షౌహిణీళ సేన యున్నది. మూడు అక్షౌహిణీలసేన హతమైనది. పురంజయుడు తానూ యుద్ధమందోడుటకును, తన రాజ్యము శతృరాజుల చేత ఆక్రమింపబడుటకును చింతించుచుండెను. ఇట్లు చింతించుచు ముఖము వాడిపోయి చింతచే ఏమియు తోచకున్న పురంజయునితో సమస్త విద్యాపారంగతుడైన సుశీలుడను పురోహితుడిట్లు పలికెను. ఓ రాజా! శత్రుబృందముతో సహా వీరసేన మహారాజును జయించ గోరితినేని విష్ణుమూర్తి సేవ జేయుము. ఇప్పుడు కార్తికపూర్ణిమ, నిండు పూర్ణిమ, కృత్తికా నక్షత్రముతో కూడినది. కాబట్టి యిది అలభ్యయోగము. ఈ కాలమందున్న పుష్పముల చేత హరిని పూజింపుము. విష్ణు సన్నిధిలో దీపములు పెట్టుము. హరిముందు గోవిందా, నారాయణా మొదలయిన నామములను పాడుచు నాట్యమును జేయుము. సుశీలుడిట్లు చెప్పెను. కార్తిక వ్రతమాచరించితివేని హరి తన భక్తులను ఆపత్తులు లేక రక్షించుట కొరకు తన వేయి అరలు గల విష్ణు చక్రము పంపును. కార్తిక మాసమందు చేసిన పుణ్య మహిమను జెప్పుటకెవ్వని తరమౌను? నీ అధర్మ వర్తనము వలన అపజయము కలిగినది. ఇకముందు సత్ధర్మపరుడవు గమ్ము. అట్లయిన కొనియాడదగిన వాడగుదువు. ఓ రాజా! కార్తిక వ్రతమాచరింపుము. హరి భక్తుడవు కమ్ము. కార్తిక వ్రతము వలన ఆయువు, ఆరోగ్యము, సంపదలు, పుత్రులు, ధనవృద్ధి, జయము కలుగును. నామాట నమ్ముము. త్వరగా చేయుము.

ఇతి స్కాంద పురాణే కార్తికమహాత్మ్యే ఏక వింశాధ్యాయః సమాప్తః

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం  - శరదృతువు - కార్తీక మాసం - కృష్ణ పక్షం  - షష్ఠి - పుస్యమి -‌‌ గురు వాసరే* (21.11.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

20, నవంబర్ 2024, బుధవారం

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం  - శరదృతువు - కార్తీక మాసం - కృష్ణ పక్షం  - పంచమి - పునర్వసు -‌‌ సౌమ్య వాసరే* (20.11.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

హాస్పిటల్ కి

 హాస్పిటల్ కి వచ్చాకే ,

అర్దం అయ్యింది,

*ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎందుకు అంటారోనని*


బీపీ వచ్చాకే తెలిసింది,

*బిజీ లైఫ్ స్టైల్ కాదు - బీ కేర్ ఫుల్ లైఫ్ స్టైల్ ఉండాలని!*


షుగర్ వచ్చాకే తెలిసింది,

*'షు' వేసుకుని పొద్దుటే నడవాలని*


కళ్ల జోడు వచ్చాకే తెలిసింది,

*కళ్ళు ఉన్నవి, ఫోన్ చూడటానికి మాత్రమే కాదు, కళ్ళు మూసుకుని నిద్ర కూడా పోవటానికి అని!*


టెస్టు లకి blood ఇస్తుంటే

తెలిసింది,

*వేస్ట్ ఫుడ్లు, ఫాస్ట్ పుడ్లు తినకూడదు అని,*


గ్యాస్ ట్రబుల్ వచ్చాక తెలిసింది,

*ట్రబుల్ body లో కాదు, మన  ఫుడ్-టైంటేబుల్ లోనూ & టేబుల్ పైనా ఉందని*

*చివరికి అర్దం అయ్యింది.*

👇


లైన్ లో నిలబడి,

బిల్లు లు కట్టి,

టెన్షన్ పడి,

*హాస్పిటల్స్ ని devlop చేయద్దు - health ni devlop చేసుకుందాం అని👌*


_*చదవడం ఈజీ.- ఆచరణ కష్టం!*_

*Forward చేస్తేనో, చదివితేనో రోగాలు తగ్గవు.*

*ఆచరించితేనే ఆరోగ్యం!☝️*

19, నవంబర్ 2024, మంగళవారం

*23 - భజగోవిందం

 *23 - భజగోవిందం / మోహముద్గర*

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️


*భజగోవిందం శ్లోకం:-21*


స్వామీ చిన్మయానందజీ గీతోపాన్యాసాలు 11-52-52 చూడుము.


*పునరపి జననం పునరపి మరణం*

*పునరపి జననీ జఠరేశయనమ్ ।*

*ఇహ సంసారే బహుదుస్తారేకృపయాఽ పారే పాహి మురారే॥ భజ ॥ 21*.


*ప్రతి॥* పునరపి = మళ్ళీ తిరిగి; జననం = పుట్టుక; పునరపి=మళ్ళీ తిరిగి; మరణం = చావు; పునరపి = మళ్ళీ మళ్ళీ; జననీ = తల్లి యొక్క; జఠ రే= పొట్టయందు; శయ నమ్ = పడివుండటం; ఇహ = ఈ; సంసారే = ప్రపంచమందు; బహు = చాల; దుస్తారే = దాట టానికి దస్తరమైనది; అపా రే= (ఇలాంటి ఈ) అపార సంసారం నుంచి; కృపయా = దయచేసి అనంతమైన స్వభావం కలిగిన; మురారే = మురను చంపిన నీవు: పాహి = రక్షించుమా!


*భావం:-*


మళ్ళీ మళ్ళీ చావు పట్టుకల్లో తిరగడం మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో పడటం ఈ అపార సంసారములోని యీ పద్ధతి యెంతో తరించలేనట్టిదిగా వుంది. ఓ అనంత దయా మయుడవైన మురారీ ! దయచేసి రక్షించుమా !


*వివరణ:-*


పుట్టుక చావుల చక్రం జీవుని విషయంలో విశ్రాంతి అనేది పొందదు. “అహం” అనేది కోరికలతో ప్రేరేపింపబడి, అపరిమిత భావనలను పెంచి, అలవాట్లకు మరిగి, కోరికలు తీర్చుకోవటానికి బదులు క్రొత్తకోరికల పుంజాన్ని చుట్టూ అలంక రించుకొంటుంది. వాసనా ప్రాబల్యంతో జన్మలోకి వచ్చినతను వాసనలను వదిలించు కోవటానికి బదులు ఆ విధంగావృద్ధిపొందించు కొంటుంది. ఆ యహం ఎందుకని? వదిలించు కోవటం చేతగాక, బాహ్యవస్తువులపై దృష్టి మమత్వ దృష్టితోనే మునుగుతూ వుండటం చేత అంతర్గతమైన దృష్టి యేర్పరచు కొనక బాహ్య వస్తువులకు రంగులు చల్లి విలువలు హెచ్చించటంచేత దానిని “మాయ” అంటాము-- ఆ మాయ చేత.


ఈ ప్రపంచములోకి మనం సహజ వాసనలతో సహా పుట్టినాము. ఇక్కడ అడ్డదిడ్డంగా వుండే వాసనలెన్నో ఆడుతూ వున్నాయి. బాహ్య వస్తువులు, మనిషి ప్రయత్నాలు మొదలైన వాటి అనుభవాలు, సహజ వాసనలతో పుట్టిన వాళ్ళము. క్రొత్త వాసనలను ఎక్కించుకోకుండా వుంటే - అనగా అసక్తతతో కోరికలు లేకుండా అహం భావము ప్రదర్శించకుండా కాలం గడిపినట్లయితే అహంకార భావమూ మమకార భావమూ లేకుండ వున్నట్లయితే- క్రొత్త వాసనలు మీద కెక్కక పాత వాసనలు యీ అనుభవంతో ఖర్చయి పోతవి. నిజానికి ఇదీ అనుసరించాల్సిన మార్గం. అంటే పనులు చెయ్యవద్దా? ప్రపంచములో అని శంక. చెయ్యాలి. తప్పకుండా నిరంతరం చెయ్యాలి. కాని ఆ ప నులన్నీ కర్తవ్యాలన్నీ పరమేశ్వర పరంగా చెయ్యాలి. లోక సంగ్రహార్థం చెయ్యాలి. 


యజ్ఞ భావంతో చెయ్యాలి అంటే నేను పరమేశ్వరుడికి చెయ్యి (లేదా ఇంద్రియం) వంటి వాడని, పరమేశ్వరుడు ఈ పని నా కర్తవ్యమన్నాడు. గనుక - చెయ్యి నాకెలా పని చేస్తోందో అలా నేను భగవంతుడి పరంగా పని చేస్తున్నాను అని అలా చేసిన పని ఫలితం నాది కాదు, ఆయనదే. ఆయన అనగా సర్వ ప్రపంచమూనని అర్థం. అందుకని నేను చేసేది లోక సంగ్రహార్థమేననీ భగవంతుడు నడిపించే యీ ప్రపంచమనే యంత్రంలో ఒక "సీల"లా నేనున్నాను. నాకు ఏర్పరచినంత వరకూ నేనూ నా కర్తవ్యం చేస్తున్నాను. "యీ యంత్రము భగవంతుడి కోసమే” అనుకొంటూ ఈ ప్రపంచంలో బ్రతుకుతూ వుండాలి. 


అలా, వున్న వాసనలు తగ్గిపోతే, ఆలోచనల ఆటంకాలు తగ్గిపోతాయి. మనోబుద్ధు లావిధంగా తగ్గితగ్గి పరమేశ్వరుణ్ణి చేరిపోతవి.


ఆ తరువత క్రొత్తవాసనలు చేరక పోవటాన, వున్నవాసనలు ఖర్చయిపోవటాన అసలు వాసనలే వుండవు. వాటిని యిక అనుభవించి తీర్చుకొనటమనే ప్రశ్నే ఉదయించదు కనుక తిరిగి పుట్టవలసి అగత్యమే పోతుంది. ఇక అందుకనే జన్మ వుండదని భావము.


పుట్టటం చాల బాధతో కూడినట్టిది-చావు యింకా యెక్కువ బాధాకరం కావచ్చు. అలా వుంచండి- తల్లికి గల చిన్న పొట్టలో పడటం, వత్తిడి, మెలికలు తిరగ టం, ఖైదీలా వుండటం, తల్లియ్కొ భౌతికమైన, మానసికమైన కష్టనిష్ఠూరాలకల్లా తను కూడ చికాకు పడి ఇరుకున పడుతుండటం, ఆమెను తన్నుతుండటం, ఇదంతా చాల కఠినమైనట్టిది, బాధాకరమే కాదు - భయంకరమైనట్టిది, క్రూరమైనట్టిది కూడ.


పరి పూర్ణతనుండి యిలా పడిపోతుంటే కలిగే దుష్టశక్తి చాలా యెక్కువైంది. మనం ఒంటరిగా దాన్ని ఆపలేమేమో. నానుంచి కలిగింది ఈ శక్తి ఈ అహం - అది యింత పెద్దదై వెలుస్తోంది. నన్నే ముంచి వేస్తోంది. ఇలా ఆక్రమిస్తున్న దీని ముందుఅయ్యో నేను వట్టి బానిసనా? అనిపిస్తోంది. లోపలి నిరంకుశుడి నుంచి నేను విడివడ టానికి - నాకు శక్తి కనపడదు - అందుచేత ఇంకొక బలవంతుడైన స్నేహితుని నాకు సాను భూతి చూపేవాడిని ఆశ్రయించాలి. అతడెవరు?


‘‘అహం’’ అనే ‘ముర’ రాక్షసుని చంపిన ఓ కృష్ణా నన్ను రక్షించు, నన్ను రక్షించవయ్యా మహానుభావా! అనే హృదయ విదారకమైన ఆర్తి కలుగుతుంది. అతడి పాదాలను ప్రేమతో ఆశ్రయించటమనే ఒకే ఒక్క మార్గం తప్ప మరొకటి లేదు.


నిజానికి నా స్వంత ఉద్రేకాలకే నేను బానిసనై పోయిన నాకు ఆ పరమేశ్వరుని సహాయం కోరటంకన్న యింక నేమి మిగిలింది? ఆయన్ను ప్రార్థించటం తప్ప:--


"ఓ ప్రభూ! ఇన్నాళ్ళు నీ మీదకు మనస్సు త్రిప్పని మాట నిజమే! అప్పుడు నీకయి సమర్పించటానికి నా కన్నీరు తప్ప యింకొకటిలేదు నా దగ్గర, నాకు ఏమున్నదని చెప్పుకోను? చిల్లర విషయాల్లో పడిన శ్రమ విసుగూ తప్ప! స్వార్థంతో చేసిన పనుల న్యూనత తప్ప! ఉద్రేకాల్లో విడిచిన స్వేద జలం తప్ప నేను రక్షింపబడ్డ తగనట్టి వా నేమొకాని ప్రభూ! అలిసి పోయాను లోవొక్కింతయి లేదు. -- ధైర్యం విలోలంబయ్యె మూర్చ వచ్చే పశ్చాత్తాపంతో కృశించి పోతున్నా. నిస్సహాయుణ్ణి, సంపూర్ణంగా నశిం చాను, నీ మ్రోల !


" నీ ముందు నీ దయావర్షములో నన్ను నేను సమర్పించుకొంటాను నీవునీవు కనుక-నా మొర వినవచ్చు నేను నీ నుంచి కనక, దయా పూర్ణత నాశించవచ్చు. నీవు కృపాసముద్రుడవు గదా! వికాసమూర్తివి, దయామయుడవు. ప్రేమ పూర్ణుడవు! ముర అనే రాక్షసుని చంపిన వాడవు గదా! నీవు తిరిగి ఆ రాక్షసుణ్ణి చంపకూడదా! వాడు మళ్ళీ నా హృదయంలో వున్నాడు. నా దుర్మార్గపు వాసనలే వాడై హృదయంలో వాడుగా వున్నాడు. ఒక్కసారి మళ్ళీ నా మీద దయతలచి వాణ్ణి చంపివేయవూ!! ప్రభూ! నీ దయ - నీవేంచేసినా సరే - నీ మ్రోల నేను నశించనీ పోనీ!


అలా అతడికి సమర్పించుకోవటం నిష్కపటంగా అతడిని ధ్యానించడం వల్ల మంచి వాసనలను మనసులో సృష్టించబడతవి. అవే ఆ అహం అను వానికి మందు. అహంభావ భూయిష్ఠమైన వాసనలు తగ్గటానికి అదే సూత్రం, అవి తగ్గిపోతే మురళీ కృష్ణుని సంగీతరవం వినపడుతుంది. ఆయన హీనకాంతి దృగ్గోచరమవుతుంది. ఆయన మెడలో పూలహారాలను చూరిస్తుంది. ఆయన చేతిలోని నవనీతం అమృతా న్నిస్తుంది. ఆయన యాలింగనం మనలో కరిగిపోయి వుంటుంది. 


*ఓమ్ తత్సత్.*

*సశేషం*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

టీటీడీ పాలక మండలి

 టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు.. 


👉అన్యమతస్తులను వేరే చోటకు బదిలీ చేయాలని నిర్ణయం

👉శ్రీనివాస సేతును గరుడ వారధిగా పేరు పునరుద్ధరణ 

👉గతంలో సీఎం చంద్రబాబు గరుడ వారధిగా ప్రాజెక్టు ప్రారంభించారు 

👉దానిని గత ప్రభుత్వం శ్రీనివాస సేతుగా పేరు మార్చింది 

👉ఇప్పుడు గరుడ వారధిగా పేరును కొనసాగించాలని నిర్ణయం 

👉తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే కేసులు 

👉శ్రీవాణి ట్రస్ట్‌ను రద్దు చేసి.. ప్రధాన ట్రస్ట్‌కే ఆ నిధులు తరలిస్తాం 

👉శ్రీవాణి పథకం మాత్రం కొనసాగుతుంది 

👉నిత్య అన్నదాన కార్యక్రమాన్ని మరింత మెరుగుపరుస్తాం 

👉లడ్డూలోని నెయ్యి నాణ్యతను మరింత పెంచాలని నిర్ణయం 

👉టీటీడీ ఉద్యోగులకు 10 శాతం బోనస్ ఇవ్వాలని నిర్ణయం 

👉ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని నిర్ణయం 

👉టూరిజం శాఖ ద్వారా ఇచ్చే టికెట్లను రద్దు చేయాలని నిర్ణయం 

👉టూరిజం శాఖ ఇచ్చే 4 వేల టికెట్ల రద్దుకు నిర్ణయం  

👉టూరిజం శాఖ ఇచ్చే టికెట్లలో అవకతవకలు జరిగాయి 

👉ఏఐ సహకారంతో సామాన్య భక్తులకు త్వరగా దర్శనం 

👉ఏళ్ల తరబడి డంపింగ్ యార్డులో పేరుకున్న చెత్తను తొలగిస్తాం 

👉తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలపై పూర్తిగా నిషేధం  

👉తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే కేసులు  

తిరుపతిలోని స్థానికులకు ప్రతినెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం 

👉శారదాపీఠం లీజు రద్దు చేసి స్థలం స్వాధీనం చేసుకుంటాం 

👉ముంతాజ్ హోటల్స్ సంస్థకు గత ప్రభుత్వం ఇచ్చిన భూముల లీజ్ రద్దు 

👉ప్రసాదాల తయారీ పోటుకు మరమ్మతులు చేయాలని నిర్ణయం : టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు