25, నవంబర్ 2020, బుధవారం

_*శ్రీ శివ మహాపురాణం - 10 వ అధ్యాయం*_

 _*శ్రీ శివ మహాపురాణం - 10 వ అధ్యాయం*_




🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️



_*పంచకృత్యములు - ప్రణవము - పంచాక్షరి*_



☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️



*బ్రహ్మవిష్ణువులిట్లు పలికిరి -*


ప్రభో!మాకు సృష్టి మొదలగు ఐదు జగత్కార్యముల లక్షణమును చెప్పుము .


*శివుడిట్లు పలికెను -*


ఈ నా కర్తవ్యముల జ్ఞానము రహస్యమైనది. అయిననూ, మీకు కృపతో చెప్పెదను . ఓ బ్రహ్మ విష్ణువులారా! సృష్టి, స్థితి, సంహార, తిరోభావ, అనుగ్రహములను ఐదు జగత్కార్యములు నాకు నిత్యసిద్ధములు . సంసారము యొక్క ఆరంభము సర్గము ఆరంభింపబడిన జగత్తు స్థిరముగా మనుట స్థితి. జగత్తు యొక్క వినాశము సంహారము. జీవుల ప్రాణోత్క్రమణము తిరోభావము . జీవుల మోక్షము అనుగ్రహము. ఈ ఐదు నా కార్యములు. ఇతరులు ఈ కార్యముల ననుష్ఠించుట, గోపురము మీది బొమ్మ గోపురమును మోయుట వంటిది .


సర్గము మొదలుకొని నాలుగు కృత్యములు సంసారమును విస్తరింపజేయును. మోక్షహేతువగు ఐదవ కార్యము నా యందు నిత్యము స్థిరముగ నుండును . నా భక్తులీ ఐదు కార్యములను పంచభూతములలో దర్శింతురు. భూమి యందు సృష్టి, నీటి యందు స్థితి, అగ్ని యందు సంహారము , వాయువు నందు తిరోభావము, ఆకాశము నందు అనుగ్రహము గలవు. సర్వమును భూమి సృష్టించును. సర్వమును జలము వర్థిల్లజేయును . అగ్ని సర్వమును నశింపజేయును. వాయువు ప్రాణములను గొనిపోవును. ఆకాశము అనుగ్రహరూపము అని పండితులు తెలియనగును .


ఈ ఐదు కార్యముల భారమును వహించుటకై నాకు ఐదు ముఖములు గలవు. నాల్గుదిక్కులలో నాల్గు ముఖములు, వాటి మధ్యలో ఐదవ ముఖము గలవు . కుమారులారా ! మీరు తపస్సు చేసి, సంప్రీతుడనైన నా నుండి సృష్టి స్థితులనే రెండు కార్యములను నిర్వర్తించు భాగ్యమును పొందియున్నారు . అదే విధముగా, రుద్ర మహేశులు తరువాతి రెండు కృత్యములను నిర్వహించుచున్నారు. అనుగ్రహమనే ఐదవ కృత్యము నాకు తక్క మరియొకనికి పొంద శక్యము కాదు . ఈ పూర్వకాలీన వృత్తమును అంతయూ మీరిద్దరు కాలక్రమములో విస్మరించినారు. కాని, రుద్రమహేశులు ఈ సత్యమును విస్మరించలేదు . వారిద్దరికి రూప, వేష, కార్య, వాహన, ఆసన, ఆయుధాదులలో నాతోటి సామ్యమును కల్పించినాము .


వత్సలారా! నాధ్యానమును వీడుట వలన మీకీ అజ్ఞానము కలిగినది. నా జ్ఞానము ఉన్నచో ఇట్టి గర్వము కలుగకపోగా, మహేశుని వంటి రూపము కలుగును . కావున మీరీ పైన నా జ్ఞానము సిద్ధించుట కొరకై, ఓంకారమనే పేరు గల, గర్వమును పోగొట్టే, నా మంత్రమును జపించుడు . నేను పూర్వము సర్వమంగళ ప్రదమగు, ఓంకారమనే నా మంత్రమును ఉపదేశించియుంటిని. ఓంకారము మున్ముందు నా ముఖము నుండి పుట్టెను. అది నన్ను బోధించును . ఈ ఓంకారము వాచకము నేను వాచ్యుడను. ఈ మంత్రము నా స్వరూపమే. దానిని నిత్యము స్మరించుట నన్ను స్మరించుట యగును .


ముందుగా ఉత్తర ముఖము నుండి ఆకారము, పశ్చిమ ముఖము నుండి ఉకారము, దక్షిణముఖము నుండి మకారము, మరియు తూర్పు ముఖము నుండి బిందువు , మధ్య ముఖము నుండి నాదము పుట్టి ఈ మంత్రము ఐదు విధములుగా విస్తరించి, మరల ఐదు కలిసి ఒక్కటియై, ఓం అనే ఏకాక్షర మంత్రము అయెను . నామరూపాత్మక మగు సకల జగత్తు, వేదము నుండి పుట్టిన స్త్రీ పురుష అనే రెండు కులములు ఈ మంత్రముచే వ్యాపించబడియున్నవి. ఈ మంత్రము శివశక్తులను కూడ బోధించును .


దీనినుండి అకారాది వరుస, మరియు నకారాది వరుసలో పంచాక్షర మంత్రము పుట్టెను. ఈ పంచాక్షరి సాకారుడగు భగవానుని బోధించును . ఈ పంచాక్షరి నుండి ఐదైదు వర్ణములు గల ఐదు వర్గములతో కూడిన వర్ణమాల పుట్టెను. మరియు, శిరోమంత్రము అనే నాల్గవ పాదముతో సహా, ముడు పాదములు గల గాయత్రీ మంత్రము పుట్టెను . దాని నుండి సమస్త వేదములు, వాటి నుండి కోట్లాది మంత్రములు పుట్టెను. ఆయా మంత్రముల వలన ఆయా సిద్ధులు మాత్రమే లభించును. కాని, ఈ ప్రణవము వలన సర్వసిధ్ధులు కలుగును .


మంత్రసారమగు ఈ ప్రణవము వలన భోగమే గాక, మోక్షము కూడ సిద్ధించును. సాకారుడగు శివుని బోధించు శ్రేష్ఠ మంత్రములు ప్రత్యక్షభోగములనే గాక, మోక్షమును కూడ నిచ్చును .


*నందికేశ్వరుడిట్లు పలికెను -*


అంబికతో కూడియున్న శివగురువు తిరోధాన వస్త్రము వెనుక ఉత్తరముఖముగా కూర్చన్న వారిద్దరి శిరస్సులపై పద్మము వంటి తన హస్తమును మెల్లగా నుంచి, వారికి మరల ఆ మహా మంత్రము నుపదేశించెను . వారిద్దరు మంత్రమును మూడుసార్లు ఉచ్చరించి, యంత్ర తంత్రపూర్వకముగా స్వీకరించి, గురుదక్షిణగా తమను తాము సమర్పించుకొనిరి . వారిద్దరు చేతులు జోడించి , జగద్గురువగు మహాదేవుని ఇట్లు స్తుతించిరి .


బ్రహ్మాచ్యుతులిట్లు పలికిరి

 -*

నిరాకారుడవగు నీకు నమస్కారము. తేజోరూపుడవగు నీకు నమస్కారము. సాకారుడవగు ఈశునకు నమస్కారము . ఓంకార వాచ్యుడవగు నీకు నమస్కారము. ఓంకారము నీ చిహ్నము. సృష్ట్యాది పంచకృత్యములను చేయు, ఐదు ముఖములు గల నీకు నమస్కారము . సృష్ట్యాది ఐదు కృత్యములను చేయు పంచబ్రహ్మ స్వరూపుడవగు నీకు నమస్కారము. ఆత్మరూపుడు, పరబ్రహ్మస్వరూపుడు, అనంత గుణములు, శక్తి గలవాడు నగు నీకు నమస్కారము . సాకార, నిరాకార రూపుడగు శివగురువునకు నమస్కారము. బ్రహ్మ విష్ణువులు ఇట్లు గురువును శ్లోకములతో స్తుతించి నమస్కరించిరి .


*ఈశ్వరుడిట్లు పలికేను -*


వత్సలారా ! నేను మీకు తత్త్వము నంతనూ బోధించి, నా స్వరూపమును చూపించితిని. మీరు దేవీకృప వలన లభించిన, నా స్వరూపమైన ఓంకార మంత్రమును జపించుడు . ఓంకార జపము వలన సుస్థిరమగు జ్ఞానము, శాశ్వతమగు సర్వభాగ్యములు కలుగును. ఆర్ద్రా నక్షత్ర యుక్త చతుర్దశి నాడు జపించినచో, అక్షయఫలము కలుగును . సూర్యుడు మహా ఆర్ద్రా నక్షత్రములో ప్రవేశించినపుడు చేసిన ఒక ప్రణవ జపమునకు కోటి రెట్లు ఫలము లభించును. మృగశీర్ష యొక్క అంతిమ సమయము, పునర్వసు యొక్క ఆదిమకాలము . పూజా, హోమ, తర్పణాదులకు ఆర్ద్రతో సమమైన శ్రేష్ఠత కలవియని తెలియవలెను. ప్రాతఃకాలము నందు, మధ్యాహ్నమునకు ముందు నన్ను దర్శించవలెను . రాత్రి యందు గాని, లేక ప్రదోషమునందు గాని వ్యాపించి యున్న చతుర్దశి తరువాతి తిథితో కలిసియున్న కాలము నన్ను దర్శించుటకు శ్రేష్ఠమగు కాలము .


నా మూర్తి లింగములు సమానమైనవే. అయిననూ, సాధకులకు లింగార్చన శ్రేష్ఠమైనది. మోక్షమును కోరువారికి మూర్తి పూజ కంటె లింగార్చన శ్రేష్ఠతరము . సాధకుడు లింగమును ఓంకార మంత్రముతోను, మూర్తిని పంచాక్షరితోను పూజించవలెను. సాధికుడు స్వయముగా లింగమును ప్రతిష్ఠించి, లేదా ఇతరులచే ప్రతిష్ఠింపజేసి , వివిధ వస్తువులతో, ఉపచారములతో అర్చంచినచో, నా ధామను పొందుట సులభమగును. ఈ విధముగా శిష్యులకు ఉపదేశించి, శివుడచటనే అంతర్ధానమందేను .



*శ్రీ శివ మహా పురాణ విద్యేశ్వర సంహిత యందు పదవ అధ్యాయము ముగిసినది.*




_*శ్రీ ధర్మశాస్తా వాట్సాప్ గ్రూప్స్*_




9849100044

కామెంట్‌లు లేవు: