22, నవంబర్ 2020, ఆదివారం

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహాత్మ్యము

 శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహాత్మ్యము



సీ. మఱునాడు విప్రుడు వరువాతనే లేచి 

            నెఱవేర్చు కొనియును నిత్య క్రియలు 

     సత్య వ్రతము సేయు సంకల్పమును మళ్ళి 

            మదియందు భక్తితో మనన జేసి 

     హరి నామస్మరణతో యాత్మ సంశుద్ధితో 

            వివిధ గృహములందు వేడె బిక్ష 

     ఆనాడు విప్రుకు హరి మహాత్మ్యంబుచే 

            యధిక ద్రవ్యము దక్కె యద్భుతముగ 

తే. ద్రవ్యమున దెచ్చి యంతట తగిన సరుకు ,

     బంధు మిత్రుల బిలిచియు బ్రాహ్మణుండు 

     సత్యనారాయణస్వామి సద్వ్రతంబు 

     సల్పి విద్యుక్త రీతిన సంత సిల్లె          39


తే. సత్య వ్రతమును శ్రద్ధతో సల్పు కతన 

     విప్రునకు జేరె విభవంబు విరివిగాను 

     సత్యపథమున యాతడు సాగుచుండి 

     బంధు మిత్రుల యందున బడసె కీర్తి      40


క. సతతము విప్రుడు తదుపరి 

    ప్రతిమాసము నందు వ్రతము భక్తితొ జేయన్ 

    యతి సంపద సమకూడెను 

    యతులితమగు మోక్షపదము యందెనుతుదిలో 41


తే. సత్యనారాయణస్వామి సద్వ్రతంబు 

     యెవరు భక్తితొ సేతురో యిలను యెపుడు 

     యట్టి వారల కిహమందు యమరి సిరులు 

     ముక్తి  కల్గును తుదియందు మోదముగను   42


క. హరి నారదమునివరునకు 

    యెఱిగించిన విషయమంత యెఱిగిన మీరల్ 

    మఱి యేమి నెఱుగ దలతురొ 

    యెఱిగించిన నెఱుక సేతు వినయము తోడన్ " 43


తే. సూతు డారీతి జెప్పగ , శ్రోత లైన 

     శౌనకాదిగ గల్గిన సకల మునులు 

     "విప్రు వలనను వినియును విమలవ్రతము 

     చేసియుండిరె యెవరైన ? చెప్పు " మనిరి     44


క. శౌనకు  డాదిగ గల్గిన 

    ముని సంఘములెల్ల యటుల ముదమునయడుగన్ 

    విని సూతుం డీవిధముగ 

    వినిపించెను నొక్క వ్యక్తి విమల చరిత్రన్      45


తే. తొల్లి యీ విప్రవర్యుడె తోషముగను  

     సత్యనారాయణస్వామి సద్వ్రతంబు 

     బంధు మిత్రుల తోడను బ్రాహ్మణులతొ 

     సల్పుచుండెను భక్తితొ స్వగృహమున       46


తే. అప్పు డొక కాష్ఠవిక్రేత దప్పి గొనియు 

     చేరె విప్రుని గృహమును నీరమునకు 

     వచ్చి యట జేయుచున్నట్టి వ్రతము జూచి 

     యబ్బురంబొంది విప్రుని యడిగె నిట్లు    47


ఆ. "విప్రవర్య ! నీవు విధ్యుక్త రీతితొ 

     సల్పు చున్న వ్రతము , తెల్పు యేమి ?

     యేమి ఫలిత మిచ్చు ? యేరీతి చేయుట ?

     విశదపరచు మార్య ! వివరముగను "     48


 తే. ఆశతో కాష్ఠవిక్రేత యడుగ నట్లు 

      పరమ పావనుడైన యా బ్రాహ్మణుండు 

      విమల వ్రతవిధి నంతయు విశద పరచె 

      మఱియు ననెనిట్లు యత్యంత మధురముగను 49   


తే. “సత్యనారాయణస్వామి సద్వ్రతంబు 

      సల్పు నెవ్వరు భక్తితో శక్తి కొలది 

      యతని కోర్కెలు దీరియు యవనిపైన 

      సర్వ సంపద లొనగూరు సత్య మిదియె "   50


తే.  విప్రు వలనను వ్రతవిధి వినియు నంత 

      కాష్ఠవిక్రేత మనమందు గట్టిగాను 

      సత్యనారాయణస్వామి సద్వ్రతంబు 

      సల్పెదను నేను యనియును సమయ మొందె  51


తే.  కాష్ఠ విక్రేత యంతట కాష్ఠములతొ 

      ధనికు లున్నట్టి వీధికి తరలి వెళ్లి 

      యమ్మ కట్టెల నెల్లను సొమ్మునకును

      దైవ కృపవల్ల రెట్టింపు ద్రవ్య మొచ్చె       52


తే.  అంత యా కాష్ఠవిక్రేత సంతసమున 

      వలయు సామాగ్రి దెచ్చియు వ్రతమునకును 

      ప్రేమతో బంధువులనెల్ల బిలుచుకొనియు 

      సల్పె భక్తితొ విధ్యుక్త సత్యవ్రతము        53


తే. కాష్ఠవిక్రేత యారీతి క్రతువు జేసి 

     పొందె సంపద లెల్లను పుడమియందు 

     ఇహము యందున సుఖముల ననుభవించి 

     పరము నందున మోక్షంబు బడసె తుదిన "   54


                  రెండవ అధ్యాయము 

                          సమాప్తము 


                                            సశేషము...

కామెంట్‌లు లేవు: