16, ఫిబ్రవరి 2021, మంగళవారం

_*శ్రీ పంచమి

 _*శ్రీ పంచమి / వసంత పంచమి*_


*మాఘ మాసం శుక్ల పంచమి రోజును వసంత పంచమి , శ్రీ పంచమి , మదన పంచమి అని పేర్లతో పిలుస్తారు,*


జ్ఞానము మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతుంది. 

జ్ఞానము , విద్య , చదువు పర్యాయపదాలు. 

విద్యకు అధిదేవత , జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతీదేవి జన్మదినంగా భావించి , స్మరించి , పూజించే రోజే వసంత పంచమి. యావద్భారతావనిలో ప్రజలంతా , ఆ తల్లి కటాక్షం కోసం పూజలు జరిపే పర్వదినమే వసంత పంచమి. 

ఈరోజునే క్షీరసాగర మథన సమయంలో మహాలక్ష్మి ఆవిర్భవించిన కారణంగా మదన పంచమిగా కూడా పేర్కొంటారు.


*యాదేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా* అంటూ సకల విద్యాస్వరూపిణి ఐన సరస్వతిగా ఆవిర్భవించిన పరమపావనమైన తిథి. 

బ్రహ్మవైవర్త పురాణం ఆదిగా ఎన్నో పురాణాలు ఈ రోజు సరస్వతీదేవిని అర్చించాలని శాసిస్తున్నాయి.


*శ్రీ పంచమి రోజు చేయవలసిన పూజలు:*


*మాఘ శుక్ల పంచమ్యాం విద్యారంభే దినేపి చ*

*పూర్వేహ్ని సమయం కృత్యా తత్రాహ్న సంయుతః రుచిః ॥*

వసంత పంచమినాడు ప్రాతఃకాలంలో సరస్వతీదేవిని అర్చించి విద్యారంభం చేయాలని శాస్త్ర వచనం. 

ఈరోజు మహాగణపతిని షోడశోపచారాలతో పూజించి , శ్రీ సరస్వతిదేవి ప్రతిమతోపాటు , జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలను , లేఖినులను పూజాపీఠంపై ఉంచి అష్టోత్తర పూజను చేయాలి. శ్రీ సరస్వతీదేవిని తెల్లని కుసుమాలతో , సుగంధ ద్రవ్యాలతో , చందనంతో , అర్చించి శుక్లవస్త్రాన్ని సమర్పించాలి.

చాలామంది తమ పిల్లలకు అక్షరాభ్యాసం జరిపించే ఆచారంకూడా ఉంది. తద్వారా , ఆ తల్లి కరుణాకటాక్షాలవల్ల అపారమైన జ్ఞానం లభించి , నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుందని ప్రజలందరి విశ్వాసం.


పూర్వ కాలంలో రాజాస్థానాలలో ఈరోజు దర్బారులు నిర్వహించి , కవితా ఘోష్టులు జరిపి కవులను , పండితులను , కళాకారులను సత్కరించడం ఆనవాయితీగా ఉండేది.


*సరస్వతీ కటాక్షం:*


బ్రహ్మదేవుడంతటి వాడే పరాశక్తిని శారదామాత రూపంలో దర్శించి , ఆరాధించి ఆమె కృపవల్ల సృష్టి రచనను సృజనాత్మకంగా ఆరంభించాడు.

గాయత్రీదేవికి గల ఐదు రూపాలలో సరస్వతీదేవి ఓకటి. యాజ్ఞవల్క్యుడు గురుశాపం వలన విద్యలను కోల్పోవడంతో , సూర్యుని ఆరాధించగా , ఆతడు యాజ్ఞవల్క్యునికి సరస్వతీ ఉపాసనను ఉపదేశించాడు. సరస్వతీదేవి కృపవలన స్మృతి శక్తిని తిరిగి సంపాదించుకుని మహావిద్వాంసుడయ్యాడు.

వాల్మీకి సరస్వతీదేవిని ఉపాసించి శ్రీమద్రామాయణ రచనను చేసేడని పురాణాలు చెబుతున్నాయి...

అలాగే వ్యాసమునీంద్రుడు కూడా సరస్వతీదేవి అనుగ్రహంవల్లనే వేద విభజన గావించి , పురాణాలను ఆవిష్కరించాడని , మహాభారత , భాగవత , బ్రహ్మసూత్రాది రచనలు చేసి భారతీయ సనాతన ధర్మవ్యవస్థకు మూలపురుషుడుగా నిలిచాడనీ ప్రతీతి...

తెలుగులో భాగవతాన్ని రచించిన పోతన మహాశయుడు సరస్వతీదేవి అనుగ్రహం పొందడమేకాక , ఆ గ్రంథాన్ని పొట్టకూటికోసం నరులెవ్వరికి అంకితమివ్వనని వాగ్దానం చేసినట్లు చెప్పుకున్నాడు.


*వసంత పంచమి శుభ సమయం*


పవిత్ర సమయం ఫిబ్రవరి 16న మధ్యాహ్నం 3.36కు ప్రారంభమవుతుంది,

ఫిబ్రవరి 17న ఉదయం 5.46 గంటల వరకు ఉంటుంది. ఫిబ్రవరి 16న ఉదయం 6.59కి సరస్వతి దేవికి పూజ చేయడం, మధ్యాహ్నం 12.35కి మధ్య శుభ సమయం ఉంటుందని వేదపండితులు చెబుతున్నారు...


          *_🌾శుభమస్తు🌾_*

కామెంట్‌లు లేవు: