18, ఆగస్టు 2023, శుక్రవారం

గర్భాధారణ రహస్యాలు -

 శుశ్రుతాచార్యుడి గర్భాధారణ రహస్యాలు  -


 *  శుక్రము నీటి గుణము కలిగి ఉంటుంది. స్త్రీ యొక్క ఆర్థవం తేజోగుణం కలిగి ఉంటుంది. 


 *  ఈ శుక్రశోణితములు యందు పంచభూతాలు సూక్ష్మ రూపము కలిగి ఉండును. 


 *  స్త్రీపురుష సంయోగ కాలం నందు శుక్రం అధికంగా ఉండిన యొడల పురుష సంతానం , స్త్రీ యొక్క ఆర్థవం పురుషుడి యొక్క శుక్రం కన్నా ఎక్కువుగా ఉన్నయెడల స్త్రీ సంతానం జనించును. శుక్రం మరియు స్త్రీ యొక్క ఆర్థవం సమాన స్థాయిలో ఉన్న నపుంసకుడు జనించును.


 *  స్త్రీ ఋతు స్నానం చేసినది మొదలు 12 దినములు వరకు స్త్రీ యందు ఆర్థవం ఉత్పత్తి అగును. అందుకనే ఆ 12 దినములను ఋతు కాలం అనెదరు . కొన్ని గ్రంధములలో ఋతుకాలమును 16 దినములుగా పేర్కొన్నారు . అనగా స్త్రీ ఋతువు అయిన 3 దినములు వదిలివేసి మిగిలిన 12 దినముల కాలం ను గర్భాదారణ కు మంచి సమయం అని అర్థం . 


 *  స్త్రీ ఋతుసమయం 3 దినములు అయిపోయిన వరసగా 4 - 6 - 8 - 10 - 12 దినముల యందు స్త్రీ , పురుష సంయోగం వలన పుత్రుడు , 5 - 7 - 9 - 11 దినముల యందు స్త్రీ పురుష సంయోగం వలన కన్యక జనియించును


 * ఆయాసం , బడలిక, దప్పి , తొడల యందు బలం లేకుండా ఉండటం , యోని యందు వణుకు అను లక్షణాలు స్త్రీ యందు కనిపించినచో ఆ స్త్రీ గర్బం ధరించినది అని తెలుసుకొనవలెను . ఇవి ప్రాధమిక లక్షణాలు .


 *  చనుమొనలు నలుపురంగుకు మారు ట , కనురెప్పలు ఒకదానికొకటి కలియిచుండుట , కారణం లేకుండానే వాంతి అగుట. మంచి సువాసన గిట్టకుండా ఉండటం. నోటి యందు నీరు ఎక్కువ వూరుట , శరీరం సడులు ట  ఇట్టి లక్షణములు గల స్త్రీ గర్భిణి అని తెలియవలెను . 


 *  గర్భిణి అని తెలుసుకున్న మొదలు శ్రమకరమైన పనులు , మైథునం , పూర్తిగా కడుపు నిండగా భుజించరాదు , రాత్రి యందు ఎక్కువుగా మేలుకొని ఉండరాదు. ఎక్కువ లంఖణం అనగా ఉపవాసం చేయరాదు , దుఃఖం చెందరాదు, బండి , గుఱ్ఱము మొదలుగు వాహనములు ఎక్కరాదు , భయంకరమైన పనులు చూడరాదు, కాళ్లు , చేతులు ముడుచుకుని కూర్చోరాదు , ఎత్తుపల్లాలు గల ప్రదేశంలో కూర్చోరాదు , మలమూత్ర వేగములను నిరోధించరాదు . 


 *  వాతాదిదోషములు వలన గాని , కర్రదెబ్బల వలన గాని గర్భిణి ఏయే అవయముల యందు వేదన పొందునో గర్భము నందు శిశువు కూడా ఆయా అవయముల యందు వేదన పొందును.


 *  గర్బము ను ధరించిన ప్రథమ మాసం నందు జిగట వలే ఉండును. ద్వితీయ మాసం నందు కఫవాతపిత్తం వలన పరిపాకమును చెంది పంచభూతాత్మము అయ్యి స్వల్పంగా ఘనీభవం చెందును . అట్టి గర్భం స్పర్శం వలన పిండాకారంగా ఉండిన పురుష గర్బం , పొడుగుగా ఉండిన స్త్రీ గర్బం అనియు , ఒక ముద్దవలే ఉండిన నపుంసక గర్బం అవును. స్త్రీ గర్భం ఇటుక రాయి ఆకారం వలే ఉండును అనియు , పురుష గర్బం అనునది గుండ్రముగా కఠినముగా ఉండునని , నపుంసక గర్భం అనునది గుండ్రని ఫలం యొక్క అర్ధభాగం వలే ఉండును . భోజుడు తన వైద్య గ్రంథం నందు వివరించాడు.


                  తృతీయ మాసం నందు గర్భమునకు పాదములు , హస్తములు, శిరస్సు అనునవి పుట్టును. మరియు ఆ మాసం నందే చెంపలు , ముక్కు, పెదవులు, నేత్రములు , చెవులు , వ్రేళ్లు  మొదలగు ప్రత్యంగములు సూక్ష్మ రూపంలో జనించును.నాలుగోవ మాసం నందు అన్ని అంగములు సూక్ష్మరూపంగా జనించును. ఆ మాసం నందే గర్బం నందు హృదయం ఆత్మకు స్థానం అగుట వలన దానికి ఆత్మకు సంభందం ఏర్పడును . 


                 అయిదోవ మాసం నందు మనస్సు , ఆరోవమాసం నందు బుద్ది, ఎడొవ మాసం నందు హస్తములు , పాదములు , నాసిక , వ్రేళ్లు , కేశములు పూర్తిగా ఏర్పడును . ఎనిమిదో మాసం నందు హృదయం నందు ఓజస్సు సర్వ ధాతువులు ఓజస్సు రూపం నొంది అస్థిరంగా ఉండును. ఎనిమిదో మాసం నందు గర్భిణి ప్రసవించినచో దోషం కలిగి ఉండును. కావున కుమార తంత్రం నందు చెప్పబడిన బలి విధానం ఆచరించవలెను . తొమ్మిదో మాసం నందు సర్వ అంగములు పరిపూర్ణంగా అభివృద్ధి చెంది గర్భిణి పరిపూర్ణ శిశువుని ప్రసవించును.


                గర్బముకు మాంసం , రక్తం , మేథస్సు , మజ్జ లేదా మూలుగ , హృదయం , నాభి , లివరు , ప్లీహం , ఆంత్రములు , గుదము మొదలగు మృదు అంగములు తల్లి నుంచి ఏర్పడును . 


        మొదట దక్షిణ స్థనం నందు పాల ఉత్పత్తి అగును. కుడికన్ను పెద్దదిగా కనపడును. తొలుత కుడితోడ గర్భభారము చేత ఉబ్బి ఉండునట్లు అగుపడును. స్వప్నం నందు కమలములు కనపడుట, మరియు నల్ల కలువలు కనపడును , తెల్ల కలువలు , మామిడిపండ్లు మొదలగునవి కనపడును. మొఖం ఎప్పుడూ ప్రశాంతంగా కనపడును ఇటువంటి లక్షణములు కల గర్భిణి స్త్రీ పుతృనిని కనును. దీనికి వ్యతిరేక లక్షణాలు కలిగిన గర్బిణి పుత్రికను కనును. రెండు తొడలు పెద్దగా కనిపిస్తూ కడుపు ముందుకు వచ్చి పైన చెప్పిన రెండు రకాల లక్షణాలు కలిగిన స్త్రీ నపుంసకుడుకి జన్మనిచ్చును. 


           ఏ గర్భిణి స్త్రీ కడుపు మధ్య భాగం పల్లంగా కనిపించుచుండునో అట్టి స్త్రీ కవలపిల్లలను జన్మనిచ్చును.



    నేను రాసిన గ్రంథాలలో మరిన్ని అనుభవ యోగాలు ఇవ్వడం జరిగింది. 


   

కామెంట్‌లు లేవు: