11, జూన్ 2024, మంగళవారం

పద్నాలుగు లోకాలు

 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*పురాణాలలో పద్నాలుగు లోకాలు ఉన్నాయి అని చెప్తారు కదా. అవి ఏమిటి? వాటి పేర్లు, వాటి విశిష్టతలు*..


భూలోకంతో కలిపి, భూలోకానికి పైన ఉండేవి ఊర్ధ్వలోకాలు:-


1) *భూలోకం* - ఇచ్చట స్వేదజాలు (చెమట నుండి ఉద్భవించు పేళ్ళు (పేనులు), నల్లులు మొ॥), ఉద్భిజాలు (గ్రుడ్డు నుండి ఉద్భవించు పక్షులు), జరాయుజాలు (స్త్రీ, పశువుల గర్భం నుండి ఉద్భవించు మానవులు, పశువులు) అని నాలుగు విధాలైన జీవరాసులు.


2) *భువర్లోకము* (భూలోకము పైన) - ఇచ్చట సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాదులు, అశ్విన్యాది నక్షత్ర సద్రుప్యాలైన గ్రహరాసులు, సూక్ష్మ శరీరులైన కిన్నెర, కింపురుష, విద్యాధరులు కలరు.


3) *సువఃలోకము లేక సువర్లోకము లేక స్వర్గలోకము* (భువర్లోకము పైన) - ఇక్కడ అధిష్ఠాన దేవతలు అగు ఇంద్రాదులు, దిక్పాలకులు, వర్ష-వాయువులు, ఐశ్వర్యాదులు కలరు. వీరితోపాటు సాధ్యులు, మహర్షులు, గంధర్వులు, అప్సరసలు కలరు. వీరు కామరూపులై భోగాలను అనుభవింతురు. వీరికి వృద్ధాప్యం, శరీర దుర్గందాధులుండవు. వీరిని క్షుత్పిసలు బాధింపవు. వీరు అయోనిజులు కావున, మాత్రు-గర్భ వాసం లేదు.


4) *మహర్లోకము* (సువర్లోకము పైన) - ఇక్కడ దేవతలు తపస్సు చేస్తుంటారు. ఎలా స్వర్గలోకంలోని దేవతలు దివ్య సుఖాలను అనుభవిస్తున్నారో, అవన్నీ ఇక్కడ తపస్సు ద్వారా పరిపూర్ణంగా అనుభవిస్తుంటారు.

ఆదిత్యయోగీ..


5) *జనోలోకము* (మహర్లోకము పైన) - దీనిని కొందరు సత్యలోకం అని కూడా అంటారు. ఏ స్త్రీ, భర్త మరణానంతరం సహగమనం చేస్తారో, ఆమె పవిత్ర శీలప్రభావంతో, ఆమె పతికి అన్య జన్మ ఉన్నప్పటికినీ, జన్మరాహిత్యం కలిగి, సతిపతులిరువురూ, ఈ జనలోకంలో సుఖశాంతులతో వర్ధిల్లుదురు. ఇక్కడ అయోనిజ దేవతలు కూడా తపమాచరిస్తుంటారు.


6) *తపోలోకము* (జనోలోకము పైన) - ఇక్కడ అయోనిజ దేవతలు నివసిస్తారు. పంచభూతాలు, పంచేంద్రియాలు వీరి ఆధీనంలో ఉంటాయి. కైలాసం, వైకుంఠం, మణిద్వీపం, స్కంధలోకం ఇచ్చటనే కలవు. ఈ లోకం సర్వదా సుగంధ ద్రవ్యాల సువాసనలతో, శాంతియుతంగా, సాంద్రానందంతో కూడి ఉంటుంది. భూలోకంలో ఎవరెవరు, ఏయే దేవతాముర్తులను ఉపాసిస్తారో, ఆయా మూర్తుల రూపాలతో ఇక్కడ తపం ఆచరిస్తారు. ఈ రీతిగా వారు కల్పాంత-కాలం అక్కడనే ఉండి, కర్మానుసారం భూలోకంలో తిరిగి జన్మించి, మరల పవిత్ర తపాలు ఆచరించి, ఎప్పుడు మహాప్రళయంలో సర్వం లయమగునో, అప్పుడు వీరు కూడా జన్మరాహిత్యం పొందుదురు.


7) *సత్యలోకం* (తపోలోకము పైన) - ఇక్కడ సృష్టికర్త అయిన హిరణ్యగర్భుడు, బ్రహ్మ అను ఒక అధికారిక పురుషుడు, ఆ పదవిని అనేకానేక కల్పానంతరం ఒక్కక్కరు పొంది, తమ ఆయువు తీరినంతనే బ్రహ్మంలో లయమవుతారు. ప్రస్తుత బ్రహ్మకు మొదటి అర్థభాగం తీరినది. భావిబ్రహ్మ శ్రీ ఆంజనేయస్వామి. ఈ లోకంలో కూడా, అనేక ఉపాసనలు చేసినవారు, వేదాంత విచారకులు, భూలోకంలో ఆత్మజ్ఞానం పొందినవారు, అసంఖ్యాకులగు మహర్షులు, వేదాంతవిచారణలు గావిస్తుంటారు.

ఆదిత్యయోగీ..


*భూలోకానికి కింద ఉండేవి అధోలోకాలు (7)*:-


1) *అతల లోకం* - ఇందులో అసురులు నివసిస్తుంటారు. వీరు సూక్ష్మ శరీరులు. భౌతిక సుఖలాలసులు కావున, అధిక మద సంపన్నులు.


2) *వితల లోకం* (అతలలోకం కింద) - ఇక్కడ పార్వతీ-పరమేశ్వరుల వీర్యం ‘ఆఢకం‘ అనే నది, సువర్ణ జల ప్రవాహాంతో నిండి ఉండును. అనేక భౌతిక సుఖాలతో పాటు, ఈ నదీ ప్రవాహంతో స్వర్ణాభరణాలు చేసుకొని ధరించెదరు.


3) *సుతల లోకము* (వితల లోకం కింద) - సప్త చిరంజీవులలో ఒకడైన మహాపురుషుడు, బలి చక్రవర్తి ఇక్కడే ఉన్నాడు. అయన సర్వదా విష్ణుధ్యాన పరాయణుడై, శ్రీమహావిష్ణువు ద్వారపాలకుడై కాపలాకాస్తున్నాడు.


4) *తలాతల లోకం* (సుతల లోకం కింద) - ఈ లోకంలో పరమేశ్వరునితో సంహరించబడిన దానవేంద్రులయిన త్రిపురాసురులు, దానవ శిల్పి అయిన మయుడు, మాయావిద్యలో నేర్పరులైన అసురులు, రాక్షసులు నివసిస్తారు.


5) *మహాతలము* (తలాతలలోకము కింద) - ఇక్కడ క్రదుపుత్రులైన (వినత క్రదువలు) కాద్రవేయులు(సర్పాలు), సహస్రాది శిరస్సులతో కూడినవారై, మహా బలవంతులై, కామరూపధారులై తమ పత్నులతో కూడి ఉన్నారు.


6) *రసాతలము* (మహాతలం కింద) - ఇక్కడ అసుర రాక్షస శ్రేష్ఠులు, నివాత కావచులు, కాలకేయాదులు, సురారులైన అనేక రాక్షసులు కలరు.


7) *పాతాళము* (రసాతలం కింద) - ఇక్కడ నాగలోకాధిపతియైన వాసుకి మొదలు, సర్ప సమూహములన్నీ కామరూపధారులై, సుఖసంతోషాలతో ఉన్నారు. మహా ప్రళయ కాలంలో ఈ చతుర్ధశ భువనాలు పరబ్రహ్మంలో లీనమగును...


*సర్వేజనాసుఖినోభవంతు*🙏


🌹🌹🌹🌹🌹🌹                                                     🪷⚛️✡️🕉️🌹

కామెంట్‌లు లేవు: