🌹షట్చక్రోపరి సంస్థితా 🌹
మూలాధారం, స్వాధిష్ఠానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ
అనే ఈ ఆరు చక్రాలు ఈ దేహంలో వున్నవి అని చెప్పుకున్నాం కదా.
ఆ ఆరు చక్రాలకూ పైన వున్న సహస్రార పద్మంలో ఆ శ్రీదేవి కొలువై వున్నది.
అక్కడ వున్న ఆ జగదంబను మనసులో దర్శించండి.
మూలాధారం వద్ద భూలోక స్థితిలో వున్న జీవుడు, స్వాధిష్ఠానం చేరి భువర్లోక స్థితికీ,
మణిపూరము చేరి సువర్లోక స్థితికీ, అనాహతము చేరి మహర్లోక స్థితికీ, విశుద్ధి చేరి జనలోక స్థితికీ,
ఆజ్ఞ చేరి తపోలోక స్థితికీ, ఆజ్ఞ దాటి సహస్రారం వద్ద సత్యలోక స్థితికీ చేరుకుంటాడు.
సహస్రారం వద్ద వున్న పరమేశ్వరుణ్ణి కలిసి, ఆ పరమేశ్వరి ఆనందంగా ఉంటుంది.
కామేశ్వరి, తన తటిల్లతా కాంతితో తానూ ధగద్ధగాయమానంగా వెలిగిపోతూ ఉంటుంది.
అలా సంతోషంతో వెలిగిపోతూ, ఆ షట్చక్రాలకు పైన వున్న వెయ్యి రేకుల పద్మంపై
ఆనందంగా ఆశీనురాలై వున్న ఆ రాజరాజేశ్వరిని మనసారా దర్శించటం ఒక అలౌకికానుభూతి.
ఆ అలౌకికానుభూతులను ఉపాసకులకు ప్రసాదిస్తున్న, ఆ షట్చక్రోపరిసంస్థిత కు వందనం. 🌹
🌹మహాసక్తిః🌹
మహాసక్తి అంటే అమ్మ ఎంతో ఆసక్తి కలది అని భావం.
ఆ ఆసక్తి దేనిమీద అనేది తెలిస్తే, మనం అమ్మను తృప్తిపరచగలం.
ఆ లలితా దేవికి ఉత్సవాలంటే ఆసక్తి. యజ్ఞాలంటే, హోమాలంటే ఆసక్తి.
కామేశ్వరుణ్ణి కలవాలంటే ఆసక్తి. పండుగ వాతావరణం అంటే ఆసక్తి.
నిత్యమూ మహోత్సవాలు జరుపుతుంటే, జరుగుతుంటే ఆసక్తి.
ఈ లోకా లోకాలన్నింటిలో జరిగే సమస్త కార్యములూ, కారణములూ
అన్నీ కూడా అమ్మకి ఆసక్తిదాయకమే.
అమ్మకి ఎల్లప్పుడూ సంబరాలు జరుగుతూ కోలాహలంగా ఉంటే ముచ్చట.
అవి అన్నీ జరిపించేదీ, జరిపించుకునేదీ కూడా ఆ అమ్మే.
సహస్రారకమలంపై, ఆ రాజరాజేశ్వరుని కూడి, ఈ చరాచర జగత్తులో జరిగే
అన్ని విశేషముల పట్ల ఎంతో సంభ్రమంతో, ఆసక్తితో వుండే, ఆ మహాసక్తి కి వందనం. 🌹
🌹కుండలినీ🌹
మూలాధారము నందు శక్తి ఒక సర్పము వలె చుట్టలు చుట్టుకుని వున్నదని చెప్పుకున్నాం కదా.
ఆ చుట్టల మధ్య భాగములో, కుండలినీ శక్తి తలని కప్పుకుని, నిద్రాణముగా ఉంటుంది.
ఆ మధ్యభాగాన్ని కుండలము అంటాం. ఆ శక్తే కుండలిని. కుండలములు అంటే చెవి కమ్మలు.
ఒరిస్సా ప్రాంతంలో కొందరు వృద్ధులు ఒక ప్రత్యేకమైన చెవికమ్మలు ధరించేవారు.
ఎంత బరువుగా, వెడల్పుగా ఉండేవంటే ఆ బరువుకి ఆ కమ్మలు జారి భుజం దాకా వచ్చేవి.
అవి సర్పాకారంలో వుండి, మూడున్నర చుట్లు చుట్టుకుని, పడగ భాగం విప్పుకుని ఉండేవి.
అది తలఎత్తిన కుండలినీ రూపం వలె ఉండేది.
ఈ మధ్య కాలంలో అటువంటి చెవి కమ్మలు ఎవరూ ధరించగా చూడలేదు.
మూలాధారం నుంచి ఇడా, పింగళా నాడులు కూడా సర్పముల వలె ఒకదాన్ని ఒకటి
చుట్టుకుని, సుషుమ్నతో పాటు పయనం సాగిస్తాయి.
ఇడానాడి చంద్రనాడి అయితే, పింగళానాడి సూర్యనాడి.
ప్రతి గ్రంధి వద్ద అవి ఒకసారి మెలికపడి స్థానాలు మార్చుకుంటాయి.
ఆజ్ఞ చేరేసరికి అవి సంపూర్ణంగా ప్రచోదితమయి సూర్య చంద్ర వహ్ని నేత్రాలను తెరుస్తాయి.
కుండలినే జీవుడిని మూలాధారం నుంచి సుషుమ్నా నాడి ద్వారా సహస్రారానికి చేర్చే శక్తి.
మూలాధారం వద్ద శక్తి రూపములో వున్నది ఆ కుండలినీ స్వరూపిణియే.
కనుకనే అమ్మని కుండలినీ అన్నారు. జీవుడిని ఉద్ధరించే మహాశక్తి, ఆ కుండలిని కి వందనం. 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి