🌹సహస్రారాంబుజా రూఢా🌹
ఆజ్ఞ పైన సహస్రార కమలమని చెప్పుకున్నాం కదా. ఈ పద్మానికి వెయ్యి రేకలు.
ఇదిగో, ఇక్కడ, ఆ లలితా పరమేశ్వరి సహస్రార కమలంపై కూర్చుని ఉన్నది.
తల మధ్యలో వున్న మాడు వద్ద వున్న ప్రాంతం ఈ సహస్రార స్థానం.
మాడు పుట్టినప్పుడు తెరచుకుని ఉంటుంది. పెరుగుతున్న కొద్దీ మాయ కమ్మి మూసుకుపోతుంది.
దీనికి పైన బ్రహ్మ రంధ్రమున్నది. జపతపాలతో ఆ బ్రహ్మ రంధ్రాన్ని తెరచుకుని జీవుడు
స్వేచ్చని పొందాలి. అప్పుడే జీవుడికి తానే దేవుడు అన్న భావన స్థిరపడుతుంది.
ఆ స్థితిని పొందితే జీవుడు ఆ సహస్రార పద్మంలో, వెలిగిపోతున్న లలితా పరమేశ్వరిని దర్శించి,
బ్రహ్మానంద భరితుడవుతాడు. ఒక్క విషయం శ్రద్ధాభక్తులతో గమనించండి.
ఈ మొత్తం సాధనా క్రమంలో, ప్రతి దశలోనూ అమ్మ జీవుడితోనే వున్నది.
తల్లి పిల్లలను ఎంత భద్రంగా, పక్కనే వుండి నడిపిస్తుందో, ఈ లలితమ్మ కూడా
తన రక్షణ కోరి వచ్చిన అందరినీ, కాపు కాచుకుంటూ తన మార్గంలో నడిపిస్తున్నది.
సహస్రార కమలంలో ఉంటూ మనలను ఎంతో అవ్యాజానురాగంతో, ప్రేమతో,
కరుణిస్తున్న, ఆ సహస్రారాంబుజారూఢ కు వందనం. 🌹
.🌹 సుధాసారాభి వర్షిణీ🌹
ఆ సహస్రార కమల స్థాయికి చేరుకుంటే, సుషుమ్నానాడి ద్వారా పైకి వెళ్లిన
జీవుడికి దొరికేది అమృతవర్షము. అమ్మ అక్కడ చంద్రవంక రూపములో సుధలను వర్షిస్తుంది.
ఆ సుధాధారలను స్రవిస్తున్న తత్వమే కామధేను తత్వము.
గ్రంధి భేదనములు జరిగి, ఇంద్రియ నిగ్రహంతో, అసూయ లేని అనసూయ తత్వంతో,
సమస్త సృష్టి పట్లా ఏకత్వ భావము పొందిన, జీవుడికి ఇక్కడ కామధేనుతత్వం బోధపడుతుంది.
ఈ జ్ఞానం పొందిన వారికి, గరికపోచ బ్రహ్మాస్త్రమెలా అవుతుందో,
అదే విధంగా సామాన్య ధేనువు, కామధేనువు అవుతుందని అవగాహన కలుగుతుంది.
అటువంటి కామధేనువు జ్ఞాన సుధాధారలను తన పొదుగు నుంచి వర్షిస్తుంటే,
డెబ్బై రెండు వేల నాడులూ ఆ అమృత ధారలలో తడిసి జీవుడు ఆనందభరితుడవుతాడు.
సరియైన మార్గంలో సాధన చేస్తే, ప్రతి గ్రంధీ ఉపాసకుల పాలిట కామధేనువు అవుతుంది.
ఆ స్థితికి చేరుకోవాలంటే అమ్మ చరణాలను పూజించాలి. అప్పుడు ఆ చరణకమలాలే
ఉపాసకులను సహస్రార కమలానికి చేరుస్తాయి. జీవుని శరీరమంతా పద్మమయం.
ప్రతి పద్మమూ, దాని ప్రతి దళమూ ఉపాసకులకు దివ్యానుభూతులను అందిస్తాయి.
ఆ అమృత అనుభూతులను, సహస్రారకమలం చేరుకున్న ఉపాసకుల కొరకు,
చంద్రమండలం నుంచి, సుధాధారల రూపంలో వర్షిస్తున్న, ఆ సుధాసారాభి వర్షిణి కి వందనం. 🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి