6, ఫిబ్రవరి 2026, శుక్రవారం

నిర్లక్ష్యం.. అతివేగం..*

 *జై శ్రీమన్నారాయణ*

*06.02.2026, శుక్రవారం*

*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*

*ఉత్తరాయనం - శిశిర ఋతువు*

*మాఘ మాసం - బహుళ పక్షం*

*తిధి : పంచమి రా2.46 వరకు*

*వారం : భృగువాసరే (శుక్రవారం)*

*నక్షత్రం : హస్త రా2.05 వరకు*

*యోగం : ధృతి రా1.31 వరకు*

*కరణం : కౌలువ మ2.25 వరకు*

*తదుపరి తైతుల రా2.46 వరకు*

*వర్జ్యం : 9.42 - 11.23*

*దుర్ముహూర్తము : ఉ8.50 - 9.35*

*మరల 12.36 - 1.21*

*అమృతకాలం : 7.47 - 9.28*

*రాహుకాలం :10.30-12.00*

*యమగండ/కేతుకాలం : మ3.00 - 4.30*

*సూర్యరాశి: మకరం* 

*చంద్రరాశి: కన్య*

*సూర్యోదయం: 6.35*

*సూర్యాస్తమయం: 5.53*


*


*నిర్లక్ష్యం.. అతివేగం..* 

*ఇంటి నుంచి బయటకు వెళ్తే.. తిరిగి వచ్చే వరకు భయం ...*


ఈ మధ్య కాలంలో యువత బైక్‌ లపై మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ అనేక ప్రమాదాలకు కేంద్రబిందువుగా నిలుస్తుండటం అత్యంత ఆందోళనకరమైన విషయం. ఉడుకు రక్తం నరనరాన ఉప్పొంగే యువత అతివేగంగా బైక్‌ నడపడం ఎంత ప్రమాదకరమో, ఒక్కొక్కసారి అది తమ ప్రాణాల మీదకు తెస్తుందనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ముఖ్యంగా, అతివేగం అనర్థదాయకం వంటి బోర్డులను రాష్ట్ర రవాణా శాఖ వారు ఎన్ని పెట్టినా వాటిని పెడచెవిన పెడుతూ యువత అత్యంత వాయు వేగంతో తమ మోటార్‌ బైక్‌లను దౌడు తీయిస్తున్నారు.


ఏ వైపు నుంచి ప్రమాదం పొంచి ఉందో, ఎప్పుడు ఎవరి ప్రాణం ఎలా పోతుందో అని ఎవరూ చెప్పలేని పరిస్థితి. బైక్‌పై రోడ్డెక్కిన మనిషి ఇంటికి వచ్చేదాక ఆ కుటుంబ సభ్యులకు అదో పెద్ద ఆందోళనే. తెలుగు రాష్ట్రంలో జరుగుతున్న ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిలో ఎక్కువ మంది ద్విచక్రవాహనదారులేనని సంబంధిత గణాంకాలు తెలుపుతున్నాయి. మితిమీరిన వేగం, హెల్మెట్‌ పెట్టుకోవాలన్న స్పృహ కూడా లేకపోవడమే శాపాలవుతున్నాయి..


ప్రాణం విలువ బంధాన్ని కోల్పోయిన ఆ కుటుంబానికి మాత్రమే తెలుస్తుంది. కాస్త జాగ్రత్తగా ఉండని ఏమరపాటు నిర్లక్ష్యం అంతులేని విషాదాన్ని నింపుతుంది. నిండు నూరేళ్ల జీవితాన్ని హరిస్తుంది. వారిని ప్రేమించే వారిని, వారిపై ఆధారపడ్డ వారిని సుడిగుండంలోకి నెట్టేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఏటా సగటున దాదాపుగా 15 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో 50 శాతం ద్విచక్రవాహనదారులే ఉండటం గమనార్హం. తలకు బలమైన గాయాలవ్వడం వల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి...


హెల్మెట్‌ ధరించకపోవటం వల్ల ఏటా సగటున 5.000 నుంచి 6 వేల మంది ప్రాణాలు రోడ్డుపాలవుతున్నాయి..


ప్రపంచంలోని మొత్తం వెహికల్స్లో మనదగ్గర ఉన్నది కేవలం ఒక్క శాతం మాత్రమే. కానీ, రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోయేవాళ్లు మాత్రం మనదేశంలోనే ఎక్కువ. వరల్డ్ బ్యాంక్ డేటా ప్రకారం.. ఏటా ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో చాలామంది చనిపోతున్నారు. వాళ్లలో 10 శాతం భారతీయులే. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ‘యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా-2021' కూడా ఇదే విషయం చెప్తోంది. దీని ప్రకారం మనదేశంలో 4,03,000 యాక్సిడెంట్స్ జరిగాయి. వీటివల్ల 1,55,000 చనిపోయారు..


ఏదిఏమైనా ఈ మితిమీరిన వేగం అనే అత్యంత అనారోగ్యపు అలవాటుకు పాదాక్రాంతం, బానిస అవ్వడమే గాక, వేగంగా వెళ్లడం అనేది ఓక వేలంవెర్రిగా భావిస్తున్న యువత వారి జీవితాలను వారే సర్వనాశనం చేసుకుంటున్నారు. ఏమైనా ప్రతి ఏడాది దేశ, రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఓక సందర్భంలో వేలాది మంది యువత ఈ అదుపు తప్పిన వేగం కారణంగా తమ విలువైన ప్రాణాలను మృత్యుకూపంలోకి నెట్టి వేసుకుంటుండటం అత్యంత దిగ్భ్రాంతికరం. ఇప్పటికైనా యువత తాము అంతకు తాముగా వివేకంతో వ్యవహరించి తమ వేగానికి ముకుతాడు వేయాలి. అది వారికి, ఈ సమాజానికి ఎంతో ఆరోగ్యకరం. కాబట్టి  

 *‘నేటి యువత రేపటి మన దేశ బంగారు భవిష్యత్తుకు ఆశాకిరణాలు’* అనే అత్యంత ప్రధానమైన విషయాన్ని గుర్తు పెట్టుకొని మసలుకోవాలి. దానివల్ల అటు వారికి, వారిని నమ్ముకున్న తల్లిదండ్రులకు, ఇటు దేశానికి ఎంతో మేలు చేసిన వారవుతారు...

కామెంట్‌లు లేవు: