21, జులై 2023, శుక్రవారం

నిత్య సుమంగళి మండోదరి

 🕉️ నిత్య సుమంగళి మండోదరి....!! 🕉️


🌿మయాసురుడనే రాక్షసుడు గొప్పశిల్పి.  అతడికి మయబ్రహ్మ అని కూడా పేరు. ఆయన భార్య హేమ. ఆమె గంధర్వకాంత. వారి సంతానమే మండోదరి. ఆమె అత్యంత సౌందర్యవతి. సుగుణవతి. 


🌸తనకు ఒక అందమైన భవనం నిర్మించి ఇమ్మని అడగడం కోసం మయుడి వద్దకు వెళ్లిన రావణుడికి అనుకోకుండా మండోదరి కంట పడుతుంది. 

మొదటి చూపులోనే ఆమెను మోహించేస్తాడు. 


🌿అతని బుద్ధి తెలిసిన మయుడు అతనికి తన కుమార్తెను ఇవ్వనంటే ఇవ్వనంటాడు. అయితే,..

ఆ దంపతులను నయానా భయానా ఒప్పించి, ఆమెను వివాహం చేసుకుంటాడు రావణుడు. 


🌸వలచి మరీ ఆమెను పెళ్లాడిన రావణుడు  మొదట్లో బాగానే ఉన్నాడు కానీ, కొద్దికాలానికే తిరిగి పరకాంతల పొందుకోసం వెంపర్లాడసాగాడు. 


🌿ఎంత గొప్ప శివభక్తుడయినా, వేదాలు చదివినా, ఎంతటి పరాక్రమవంతుడయినా, అతనికి పరస్త్రీ వ్యామోహమనే అవలక్షణం ఉందని గ్రహించిన మండోదరి, అతన్ని సరిదిద్దేందుకు ప్రయత్నించి విఫలం అవుతుంది. 


🌸చేసేదేమీ లేక ఓరిమితో సహిస్తుంది.  భర్తతో కలిసి తాను కూడా శివపూజ చేస్తుంటుంది.  


🌿రావణుడు సీతను అపహరించుకునిపోయి.. బంధించినప్పుడు కూడా మండోదరి వ్యతిరేకించింది. ఆమెను రాముడి దగ్గరకు పంపించేయమని భర్తను ప్రాధేయపడింది. 


🌸చివరికి రాముడు రావణుడిపై యుద్ధం ప్రకటించినప్పుడు రాముడితో యుద్ధం జరగబోయేముందు రోజు కూడా మండోదరి రావణాసురుడికి తన ఆలోచనను మానుకోమని బోధ చేసింది. 


🌿కాని ఆమె ప్రయత్నాలన్నీ  చెవిటివాని ముందు ఊదిన శంఖంలా మారాయి. యుద్ధంలో రావణుడిని చంపేసిన తర్వాత  యుద్ధ ప్రాంగణాన్ని మండోదరి సందర్శించింది. 


🌸మహావీరుడైన తన భర్త విగత శరీరుడై రణరంగాన పడి ఉన్న దృశ్యం ఆమెనెంతో కలచి వేసింది. రాముణ్ణి శపిద్దామని బయలుదేరుతుంది. 


🌿అయితే, శాంతమూర్తిలా ఉన్న రాముడిని చూసి ఆమె తన మనసు మార్చుకుంటుంది. రాముడు సాక్షాత్తూ విష్ణువు అవతారమని గ్రహించి, స్త్రీల పట్ల ఆయనకు గల గౌరవాన్ని, ఆదరాభిమానాలనూ స్వయంగా చూసి నిండు మనస్సుతో నమస్కరించింది. 


🌸ఆయన మన్ననలు అందుకుంది. అభిమానానికి పాత్రురాలయింది. తన పతి శరీరానికి అంత్యక్రియలు నిర్వర్తించుకునేందుకు అనుమతి ఇమ్మని అర్థించింది. రాముడామె మాటను మన్నించాడు. 


🌿విభీషణుని పిలిచి, రావణుని శరీరానికి అంతిమ సంస్కారాలు జరపవలసిందిగా సూచిస్తాడు. 

అంతేకాదు, మహా పతివ్రత అయిన మండోదరికి వితంతువు అయే దుస్థితి పట్టకూడదని ఆమెకు నిత్య సుమంగళి యోగం కలుగుతుందని, ఆమె పేరు విన్నంతనే పాపాలన్నీ తొలగిపోతాయనీ వరం ఇస్తాడు. 


🌸ఇక్కడ మనం గ్రహించవలసిన నీతి ఏమిటంటే, భర్త చెడ్డవాడని కుంగిపోతూ కూచోకూడదు. చేతనైనంతలో ఆ చెడు లక్షణాలనుంచి భర్తను పక్కకు మళ్లించి, సన్మార్గంలో పెట్టేందుకు ప్రయత్నం చేయాలి. 


🌿భర్త చేసే చెడుని నివారించేందుకు అనుక్షణం పాటుపడాలి. సాధారణంగా ఎటువంటి స్త్రీఅయినా  తట్టుకోలేని శోకం ఎప్పుడు అనుభవిస్తుందంటే..భర్త అలాగే కడుపున పుట్టిన కొడుకు దిగజారిపోయినప్పుడు 

ఆ దుఃఖానికి అవధి ఉండదు. 


🌸మండోదరి మహా పతివ్రత. మయుడు, హేమల కుమార్తె. పది తలలు ఉన్న రావణాసురుని పట్టమహిషి. ఇంత గొప్పది. రావణుడి వక్షస్థలాన్ని చీల్చుకుని, 

గుండెను ఛేదించుకుని బాణం బలంగా భూమిలోకి దిగి తిరిగి రామచంద్రమూర్తి అక్షయ తూణీరంలోకి ప్రవేశిస్తే నెత్తురోడుతూ రావణుడు భూమ్మీద పడిపోయి ఉంటే... 


🌿గద్దలు, రాబందులు పైన ఎగురుతుంటే... దేవతలందరూ జయజయధ్వానాలు  చేస్తుంటే... మండోదరికి కబురందించి పల్లకి పంపి పిలిపించారు. ఆవిడ యుద్ధభూమికొచ్చింది. 


🌸రావణుడి శరీరానికి కొద్దిదూరంలో ఒక చెట్టుకింద రామలక్ష్మణులు, పక్కన విభీషణుడు నిలబడి ఉన్నాడు. 

సాధారణంగా ఆ పరిస్థితులలో ఉన్న ఏ స్త్రీ అయినా  వెంటనే... రాముడెక్కడ? అని అడుగుతుంది లేదా తన భర్తను చంపేసాడన్న కోపంతో రాముడిని  నింద చేస్తూ

విరుచుకుపడుతుంది....అని అనుకుంటారు.


🌿కానీ మండోదరి ఎంత ధర్మాత్మురాలంటే...

పల్లకీ దిగి రావణుడి దగ్గరకెళ్ళి... ఏడుస్తూ...‘‘వీళ్లందరికీ అమాయకత్వంతో తెలియని విషయం ఒకటున్నది రావణా!  రాముడు నిన్ను చంపాడని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ నీ భార్యను కనుక నాకు తెలుసు... 


🌸నిన్ను చంపింది రాముడు కాదు, నీ ఇంద్రియాలే. ఒకానొకనాడు నీవు తాచుపామును తొక్కిపెట్టినట్లు నీ ఇంద్రియాలను తపస్సు కోసం తొక్కిపట్టావు. నువ్వు బలవంతంగా వాటిని కోరికలకోసం తొక్కిపెట్టావు. 

తొక్కి పెట్టిన కాలుకింద నుంచి తప్పించుకున్న పాములా పగతో నీ ఇంద్రియాలు నిన్ను కాటేసాయి.


🌿 యుక్తాయుక్త విచక్షణ తెలియలేదు...అయినా నాలోలేని ఏ అందం నీకు సీతమ్మలో కనిపించింది?’’  ఎంత మర్యాదగా మాట్లాడిందో చూడండి. అంత శోకంలో కూడా అలా మాట్లడడం భార్యగా ఒక్క మండోదరికే సాధ్యపడింది.


🌸ఎటువంటి నిష్పక్షపాత తీర్పు చెప్పిందో చూడండి! అదీ ఈ జాతివైభవం. ఈ ఒక్కమాట లోకానికి అందితే జాతి చేయకూడని పొరబాట్లు చేయదు..

కామెంట్‌లు లేవు: