4, సెప్టెంబర్ 2023, సోమవారం

ముహూర్తం

 *ముహూర్తం అంటే ఏమిటి? దానికి బలం అనేది ఉంటుందా? ఎలా నమ్మాలి? దేనికి నమ్మాలి?*


*విజయనగర సామ్రాజ్య స్థాపన కోసం విద్యారణ్య స్వామి హరిహర బుక్కరాయల తో మంచి స్థలం కోసం గాలిస్తున్నారు. వారు ఒక ప్రాంతం చేరగానే వారికి ఒక వింత దృశ్యం కనిపించింది. కొన్ని కుందేళ్లు వేటకుక్కలను తరుముతున్న దృశ్యం చూడగానే మ్రాన్పడిపోయారు. ఆ బలం కుందేళ్ళది కాదు అని, అది ఆ నేలలో ఉన్న మహత్తర శక్తి అని విద్యారణ్య స్వామి గ్రహించారు. అక్కడ రాజధానిని నిర్మిస్తే, శక్తివంతమైన సైనికులు, ఆర్ధిక పరిపుష్టి కలిగిన వ్యాపారులు, మేధావులైన అధికారగణం, నిజాయితీపరులైన ప్రజలతో రాజ్యం విలసిల్లుతుంది అని భావించారు.*


*రాజ్య నిర్మాణానికి ఒక దివ్యమైన ముహూర్తాన్ని నిశ్చయించారు. తెల్లవారుజామున ఒక ఘడియ లో చంద్రుడు ఏవో నక్షత్రాలకు సమీపిస్తాడు ట. అది అత్యద్భుతమైన ముహూర్తం అని భావించారు. హరిహర. బుక్క రాయల తో "నేను ఆ సమీపం లోని కొండపైకి ఎక్కి చంద్రగ్రహ కదలికలను గమనిస్తూ, సరైన ముహూర్త సమయం రాగానే శంఖాన్ని పూరిస్తాను. ఆ శబ్దం వినపడింది మరుక్షణమే మీరు ఇక్కడ పునాది ని తవ్వాలి. ఆ సమయంలో పడిన పునాది విజయనగర సామ్రాజ్యాన్ని వెయ్యి సంవత్సరాలు ఆ ముహూర్తబలం కాపాడుతుంది" అని చెప్పి స్వామి కొండపైనున్న శిఖరాగ్రానికి వెళ్లారు.*


*రాయల సోదరులు ఇరువురూ గునపాలు చేబూని సిద్ధంగా ఉన్నారు. తెల్లవారు జామున పూర్ణచంద్రుడు తేజోమయంగా నభో మండలం లో నిశ్చలంగా పరిభ్రమిస్తున్నాడు. నక్షత్రాలు మిరుమిట్లు గొలుపుతున్నాయి. సరిగ్గా అదే సమయం లో ఒక జంగం దేవర నదీస్నానం చెయ్యడానికి వెళ్తూ పెద్దగా శంఖాన్ని పూరించాడు. అది స్వాములవారు పూరించినదే అని భ్రమించి రాయలసోదరులు భూమిలోకి గునపాలు దించారు. ఒక్క అడుగు తవ్వగానే శంఖం మరోసారి మోగింది. ఇది స్వామి పూరించింది. ఆ శబ్దం వినగానే సోదరులు ఇద్దరూ దిగ్భ్రాంతి చెంది అచేతనంగా నిలబడి పోయారు.*


*ఇంతలో స్వామి కొండదిగి వచ్చారు. ఆయన రాగానే "గురుదేవా.. ఎందుకు శంఖాన్ని రెండుసార్లు పూరించారు?" అని ప్రశ్నించారు సోదరులు. స్వామి ఆశ్చర్యంగా అదేమిటి? నేను ఇప్పుడే శంఖనాదం చేసాను. పునాది తీసారా? అని ఆత్రంగా ప్రశ్నించారు. "లేదు గురుదేవా.. కొన్ని ఘడియల క్రితం శంఖనాదం వినిపించింది. అది మీరే పూరించారు అని అప్పుడే పునాది తీసాము" చెప్పారు సోదరులు.*


*అప్పుడే మళ్ళీ శంఖం ఊదుకుంటూ జంగందేవర వెళ్ళిపోతున్నాడు. అతడిని చూడగానే స్వామి ఖిన్నుడు అయ్యారు. "అయ్యో... తొలిసారి పూరించింది నేను కాదు. ఆ జంగం దేవర...ఎంత పొరపాటు అయింది... మీరు పునాది తీసిన ఘడియ అంత బలమైనది కాదు. ఆ ముహూర్తం లో తీసిన పునాది ఎక్కువకాలం నిలబడదు. రెండు వందల సంవత్సరాలలో ఈ సామ్రాజ్యం కూలిపోతుంది. విదేశీయులకు మనవాళ్ళు బానిసలు అవుతారు. కుట్రలు, కుతంత్రాలతో రాజకుటుంబం పతనమై పోతుంది.. అంతా విధి రాత" అన్నారు బాధగా...*


*ఆయన చెప్పినట్లే విఆయనగర సామ్రాజ్యం రెండువందల ఏళ్లకే పతనమై పోయి చివరకు ఆంగ్లేయుల స్వాధీనం లోకి వెళ్ళిపోయింది.*


*ముహూర్త నిర్ణయం లో అంత శక్తి ఉన్నది.*


*శాస్త్రం ఏ విషయాన్నైనా నిష్కర్షగా కర్కశంగా చెప్తుంది.*

🙏🌞🌞🌞🌞🌞🙏

కామెంట్‌లు లేవు: