7, జనవరి 2021, గురువారం

హనుమాన్ చాలీసా

 హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది? ఎందుకోసం పుట్టింది.?


ఆపదలుబాపే హనుమంతుని ప్రసన్నం చేసుకునే స్తోత్రాలలో విశేషమయిన హనుమాన్ చాలీసా ఎలా ఉద్భవించిందో తెలుసుకుందాము.


వారణాసిలో నివసిస్తూవున్న సంత్ తులసీదాస్ : రామనామ గాన నిరతుడయి బ్రహ్మానందములో తేలియాడుతుండేవారు. మహాత్ములయిన వారి సన్నిధిలో మహిమలు వెల్లువలవుతూ ఉండేవి. వారిప్రభావము వలన ప్రభావితులయిన జనం వారిద్వరా రామనామ దీక్ష తీసుకుని రామనామ రసోపాసన లో తేలియాడుతుండేవారు. ఎంతోమంది ఇతర మతాలకుచెందిన భక్తులుకూడా రామనామ భజనపరులుకావటం జరుగుతున్నది. ఐతే భగవంతుని పట్ల కాక తమ నమ్మకాల పట్ల మాత్రమే మొండి పట్టుదలకల ఆ మతగురువులకు ఇది కంటగింపుగా వున్నది. వారు తులసీదాసు మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మనమతాన్ని కించపరుస్తున్నాడని లేనిపోని అభియోగాలు ఢిల్లీ పాదుషావారికి పంపుతుండేవారు.


ఇదిలాఉండగా వారణాసిలో వున్న ఒక సదాచారవంతుడయిన గృహస్తు తన ఏకైక కుమారునకు కుందనపు బొమ్మలాంటి అమ్మాయితో వివాహం చేసాడు. వారిద్దరూ చిలకా గోరింకల్లా ఎంతో అన్యోన్యతతో ఆనంద తీరాలు చవిచూస్తున్నారు. కానీ కాలానికి ఈ సుఖ దు:ఖాల తో పనిలేదు కదా ! విధివక్రించి హఠాత్తుగా ఆయువకుడు కన్ను మూసాడు. ఆ అమ్మాయి గుండెపగిలి ఘోరంగా విలపిస్తున్నది. తలబాదుకుంటూ విలపిస్తున్న ఆతల్లిశోకానికి అందరిగుండెలూ ద్రవించిపోతున్నాయి. ఎవరెంత బాధపడ్డా జరగవలసినవి ఆగవుకనుక బంధువులు శవయాత్రకు సన్నాహాలు చేశారు. శవాన్ని పాడెమీద పడుకోబెట్టి మోసుకుని వెళుతుండగా ఆ అమ్మాయి తన భర్త శవాన్ని తీసుకు వెళ్ళనీయకుండా అడ్డంపడి రోదిస్తుండటంతో స్త్రీలు ఆమెను బలవంతంగా పట్టుకుని వుండగా శవ యాత్రసాగిపోతున్నది. శ్మశానానికి వెళ్ళేమార్గం తులసీదాస్ గారి ఆశ్రమం మీదుగనే సాగుతుంది. శవవాహకులు ఆశ్రమం దాటే సమాయానికి అక్కడ ఇంటివద్ద పట్టుకున్నవారిని విదిలించుకుని మృతుని భార్య పరుగుపరుగున వస్తూ ఆశ్రమం దగ్గరకు రాగానే మనసుకు కలిగిన ప్రేరణతో ఆశ్రమములోకి పరుగిడి, ధ్యానస్తులైవున్న తులసీదాసుగారి పాదాలపైన వాలి విలపించటం మొదలెట్టింది.


గాజులు , కాలి అందెల శబ్దం విన్న తులసీదాస్ గారు దీర్ఘసుమంగళీభవ అని దీవించాడు. దానితో ఆయువతి మరింత బిగ్గరగా ఏడుస్తుండటం తో కనులు తెరచిన సంత్ , అమ్మా ! నేను దీవించిన దానిలో తప్పేమున్నది తల్లీ ! ఎందుకిలా దు:ఖిస్తున్నావని అడిగారు. అప్పుడామె : తండ్రీ ! నాలాంటి నిర్భాగ్యురాలిని దీవించి తమలాంటి మహాత్ముల వాక్కుకూడా వ్యర్ధమయిందే అని బాధపడుతున్నాను అని దు:ఖిస్తూ పలికింది. అమ్మా : నా నోట రాముడు అసత్యం పలికించడే ! ఏమయినదమ్మా ! అని అనునయించాడు. 

తండ్రీ ! ఇంకెక్కడి సౌభాగ్యం, అదిగో నాతలరాత నా పసుపు కుంకుమలను మంటలలో కలిపేందుకు వెళుతున్నదని విలపించుట తట్టుకోలేని ఆయన లేచి వెళ్ళీ శవవాహకులతో ఆ శవాన్ని ఆపించాడు. అయ్య కొద్దిగా ఆపండి ,అని ఆపి ఆశవం కట్లు విప్పి రామనామాన్ని జపించి తన కమండల జలాన్ని చల్లాడు.


దానితో శవములో చైతన్యం వచ్చి ప్రాణం పోసుకున్నది. అదిచూసిన జనం జేజేలు పలుకుతూ వారికి భక్తిపూర్వకంగా నమస్కరించారు. దీనితో ఆయనగురించి మరింత ప్రాచుర్యం జరిగి , తండోపతండాలుగా జనం వారిని దర్శించి రామనామాన్ని స్వీకరించి జపించటం ఎక్కువయినది.


ఇదే అదనుగా భావించిన ఇతరమత గురువులు ఢీల్లీ పాదుషావారికి స్వయముగా వెళ్ళి ,తులసీదాస్ రామ నామము గొప్పదని చెబుతూ మన మతస్తులను ,అమాయకులను మోసంచేస్తున్నాడని, పలుఫిర్యాదులు చేసారు. 

దానితో ఢిల్లీ పాదుషా విచారణకోసం సంత్ గారిని ఢిల్లీ దర్భారుకు పిలిపించారు.

తులసీదాస్ గారూ మీరు రామనామము అన్నిటికన్నా గొప్పదని ప్రచారము చేస్తున్నారట. నిజమేనా ? అని పాదుషా ప్రశ్న.

అవునుప్రభూ ! సృష్టిలోని సకలానికీ ఆధారమయిన రామనామ మహిమను వర్ణించ నెవరితరము.?


పాదుషా : 

అలాగా? రామనామముతో దేనినయినా సాధించగలమని చెబుతున్నారట నిజమేనా?


సంత్ : 

అవును ! రామనామము తో సాధించనిదేమున్నది.


పాదుషా : 

మరణాన్ని సహితం జయించకలదని చెప్పారట?


సంత్ : 

అవును ప్రభూ ! రామనామానికి తిరుగేమున్నది.


పాదుషా : 

సరే ! మేమిప్పుడొక శవాన్ని తెప్పిస్తాము ,దానిని మీ రామనామము ద్వారా బ్రతికించండి ,అప్పుడు నమ్ముతాము.


సంత్ : 

క్షమించాలి ప్రభూ! జననమరణాలు జగత్ప్రభువు ఇచ్చాను సారంగా జరుగుతాయి కానీ మనకోరికలతో కాదు.


పాదుషా : 

చూడండి తులసీదాస్ జీ మీరు మీమాటను నిలుపుకోలేక మీరుచెప్పే అబద్దాలను నిరూపించుకో లేక ఇలాంటి మాటలు చెబుతున్నారు, మీ రామ నామము, మీరు చెప్పినవి అబద్దాలని చెప్పండి వదలివేస్తాము అని పాదుషా ఆగ్రహించాడు.


రామనామము దాని మహిమ సత్యమని పలికిన తులసీదాస్ మోసగాడిగా భావించిన పాదుషా చివరికి తులసీ నీకు చివరి అవకాశం ఇస్తున్నాను

రామనామము మహిమ అబద్దమని చెప్పి ప్రాణాలుదక్కించుకో లేదా శవాన్ని బ్రతికించు అని మొండిగా ఆజ్ఞా పించాడు. అప్పుడు తులసీదాసు "ఈ విపత్కర పరిస్తితిని కల్పించిన నువ్వే పరిష్క్రించుకోవాలని" మనసులో రామునికి మనవి చేసుకుని ధ్యాన మగ్నుడయ్యాడు. అది తనను ధిక్కరించటమని భావించిన పాదుషా ,తులసీ దాసుని బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు.

అంతే ! ఎక్కడ నుండి వచ్చాయో వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసీ దాసును బంధించవచ్చే సైనికులవద్ద ,ఇతర సైనికులవద్ద ఆయుధాలు లాక్కుని వారికేగురిపెట్టి, అందరినీ కదలకుండా చేసాయి. సభికులు ,ఏకోతి మీదపడి కరుస్తుందోనని హడలిపోతూ వున్నారు. ఈ కలకలానికి కనులువిప్పిన తులసీదాస్ గారికి ఆశ్చర్యం కలిగింది. 

దీనికి కారణమేమిటాని చుట్టూ చూడగా , సింహద్వారము మీద ఆసీనులై వున్న హనుమంతుడు దర్శనమిచ్చాడు. దానితో ఒడలు పులకించిన సంత్ ......

జయ హనుమాన జ్ఞాన గుణసాగర............ అంటూ 40 దోహాలతో ఆశువుగా వర్ణించాడు

దానితో ప్రసన్నుడయిన పవనసుతుడు, తులసీ నీ స్తోత్రంతో మాకు ఆనందమయినది నీకేం కావాలో కోరుకో అని అన్నారు

అయితే మహాత్ములెప్పుడూ తమస్వార్ధం కోసం కాక లోకక్షేమం కోసము మాత్రమే ఆలోచిస్తారు కనుక , తండ్రీ ! ఈ స్తోత్రంతో నిన్ను స్తుతించిన వారికి తమరు అభయమివ్వాలని విన్నవించుకున్నాడు

దానితో మరింత ప్రియం కలిగిన స్వామి , తులసీ మాకు అత్యంత ప్రీతి పాత్రమయిన ఈస్తోత్రంతో మమ్మెవరు స్తుతించినా వారిరక్షణ భారం మేమే వహిస్తామని వాగ్దానం చేశారు

అప్పటినుండి ఇప్పటివరకు హనుమంతుని చాలీసా భక్తుల అభీష్టాలను కామధేనువై నెరవేరుస్తూనేవున్నది....... 

కామెంట్‌లు లేవు: