29, ఆగస్టు 2021, ఆదివారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*983వ నామ మంత్రము* 29.8.2021


*ఓం త్రిఖండేశ్యై నమః*


దశముద్రల యందలి త్రిఖండి యను దశమముద్రకు స్వామిని అయిన పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *త్రిఖండేశీ* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం త్రిఖండేశ్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకునకు ఆ జగన్మాత కరుణచే భౌతికపరమైన మరియు ఆముష్మికపరమైన అభీష్టములు సిద్ధించును.


శ్రీచక్రార్చనలో సాధకుడు ఒక్కొక్క ఆవరణకు ఒక్కొక్క ముద్ర చొప్పున తొమ్మిది ఆవరణలకు తొమ్మిది ముద్రలు ప్రదర్శించి, మొత్తం శ్రీచక్రమునంతటికీ పదియవ ముద్ర ప్రదర్శించును. అలా ప్రదర్శించే పదియవ ముద్రయే త్రిఖండ (సర్వత్రిఖండ) యను ముద్ర. జగన్మాత సర్వత్రిఖండ ముద్రకు ఈశ్వరి గనుక *త్రిఖండేశీ* యని అనబడినది. పదియవ ముద్ర అయిన ఈ సర్వత్రిఖండ ముద్రను శ్రీచక్రార్చనలో సర్వత్రా (మొత్తం శ్రీచక్రమునకు) ఉపయోగించడం జరుగుతుంది. ఈ సర్వత్రిఖండ యను దశమముద్ర పరమేశ్వరి స్వరూపము.


శ్రీవిద్యా మంత్రమయిన పంచదశీ మంత్రంలో వహ్ని (అగ్ని) ఖండము, సూర్యఖండము, సోమ (చంద్ర) ఖండము అను మూడు ఖండములు ఉన్నవి. ఈ మూడుఖండములకు పరమేశ్వరి ఈశ్వరి గనుక ఆ తల్లి *త్రిఖండేశీ* యని అనబడినది. అమ్మవారి సూక్ష్మరూపము వాగ్భవ కూటమి, కామరాజ కూటమి మరియు శక్తి కూటమి అనికూడా గతంలో చెప్పబడినది.


పంచదశీ మంత్రం *క ఏ ఈ ల హ్రీం హ స క హ ల హ్రీం స క ల హ్రీం* అయితే ఇందులో మొదటి ఐదు బీజాక్షరములు *క ఏ ఈ ల హ్రీం* అనునది వాగ్భవకూటము (అమ్మవారి ముఖకమలము). తరువాత ఆరు బీజాక్షరములు *హ స క హ ల హ్రీం* అనునది కామ రాజకూటము (అమ్మవారి కంఠం దిగువభాగం నుండి కటిప్రదేశం వరకు). చివరి నాలుగు బీజాక్షరములు *స క ల హ్రీం* అనునది శక్తికూటము (అమ్మవారి కటిప్రదేశం దిగువభాగం నుండి పాదములవరకు). అనగా పంచదశీ మంత్రంలో మూడు శివశక్తులు గలవు. పంచదశీ మంత్రం అమ్మవారి సూక్ష్మరూపమును చెప్పుచున్నది *(మూలకూటత్రయ కళేబరా - 89వ నామ మంత్రము)* అని కూడా అమ్మవారు అనబడుచున్నది. ఆ విధంగా అమ్మవారు మూడు కూటముల సూక్ష్మరూపిణిగా *త్రిఖండేశీ* యని కూడా అనబడుచున్నది.


జగన్మాత బ్రహ్మరంధ్ర, మణిపూర, మూలాధారములకు అధిష్ఠానదేవత గనుక, ఆ తల్లి *త్రిఖండేశీ* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం త్రిఖండేశ్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: