30, జూన్ 2023, శుక్రవారం

వాసుదేవ ద్వాద‌శి*_

 _*ఈరోజు వాసుదేవ ద్వాద‌శి*_



వాసుదేవ ద్వాదశి రోజు ప్రధానంగా కృష్ణుడికి సంబంధించినది. తొలి ఏకాదశి తర్వాతరోజు జరుపుకోవాలి. చాతుర్మాస్య వ్రతం తొలి ఏకాదశి నుండి ప్రారంభించాలని మిగిలిన పురాణాలు చెబుతుండగా , వాసుదేవ ద్వాదశి నుండి ప్రారంభించాలని స్మృతి కౌస్తుభం చెబుతుంది. 


వాసుదేవుడు అంటే విష్ణువనే విషయం అందరికీ తెలిసిందే. విష్ణువు నామాల్లో ఒక్కొక్క దానికి ఒక్కో విశిష్టత ఉంది. అలాగే వాసుదేవ నామానికీ ఉంది. ఆయన వసుదేవుని కుమారుడైనందున వాసుదేవ అనే పేరు వచ్చింది. అన్నిటిలో వసించు వాడు కునుక వాసుదేవ అనే పేరు మరో విధంగా కూడా ఆయనకు సరిపడింది. ఆయన వేయి నామాల స్త్తోత్రమైన విష్ణు సహస్ర నామంలోని *‘సర్వ భూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే’* అనేది దీనినే సూచిస్తోంది.


ఇక అన్ని ప్రాణులలో నివసించే ప్రాణ శక్తి, చైతన్య శక్తి, ఆత్మపరమైన శక్తికి వాసుదేవమనే పేరు ఉన్నట్టు పెద్దలు చెబుతారు. అలాగే ప్రాణులను ఆశ్రయించి ఉండే వైశ్వానరాగ్నికి వాసుదేవమనే పేరు ఉందని కూడా పేర్కొంటారు. *‘అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత:* అని గీతలో భగవం తుడు చెప్పిన విషయం తెలిసిందే. విష్ణు సహస్ర నామంలో *‘వాసనాద్వాసుదేవస్య వాసితంతే జగత్త్రయం’* అని అన్నిటా ఆయన ఉన్నాడనే విషయాన్ని వివరించారు. అర్జునుడు కృష్ణుణ్ని ఎక్కువగా పిలిచే పేరు వాసుదేవ.

ఇక ఈ రోజు చేసే కార్యక్రమాల విషయానకి వస్తే శయనేకాదశి రోజున ఉపవాసం ఉన్న వారు ద్వాదశి రోజున విష్ణు పూజచేసి భోజనం చేయవచ్చు. ద్వాదశే పుణ్య తిథి. విషువుకు ప్రీతికర మైనది. శయనపేకాదశి తర్వాత వచ్చేది కనుక దీనికి ప్రాముఖ్యం ఎక్కువ. ఆ తర్వాత కూడా విష్ణు స్మరణతో కాలం గడిపితే మంచిది. ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణ విశేషఫల దాయకం.

అంతేకాక మన సంప్రదాయం అంతా దానానికి ఎంతో ప్రాధాన్య మిచ్చింది. అందువల్ల విష్ణు సహస్ర నామస్తోత్ర పుస్తక దానం కూడా పుణ్యప్రదమే. కొంత మంది విసన కర్రలు కూడా దానం చేస్తారు. వాస్తవంగా చూస్తే వేయి నామాల ఆ దేవుని ఏ పేరుతో పిలిచినా , ఏ నామం పలికినా పుణ్యం వస్తుంది. జగదాధారుడైన ఆయనను ఒక పేరుతో పరిమితం చేయలేము. అందుకే వేయి నామాలతో విష్ణు సహస్ర నామం ఏర్పడింది. అయినా ఈ వేయి నామాలకు కూడా ఆయన పూర్తి స్వరూపాన్ని వర్ణించడం సాధ్యం కాదు. విష్ణువు అసలు స్వరూపాన్ని దేవతల రాజైన ఇంద్రుడే చూడలేద‌ని ఒక చోట ఉంది.


ఆయన అందరిలోనూ , అన్నిటా ఉన్నం దున ఒక ప్రదేశం నుంచి ఆయనను చూడడం కుదరదు. మరో విధంగా చెప్పాలంటే చూసేదీ ఆయనే , చూడబడేదీ ఆయనే. అటువంటి వారిని ఇలా ఉంటాడని చెప్పలేం. అయితే దేవునికి ఒక రూపం ఉండాలి కనుక ఆయన ధ్యాన శ్లోకాలు ఇలా ఉన్నాడని చెబుతున్నాయి కనుక మనం పరిమితులం కనుక పరిమితునిగానే ఆయననూ చూస్తున్నాం. ఆయన మనం ధ్యానించే రూపుడు కూడా.

కామెంట్‌లు లేవు: