6, ఆగస్టు 2023, ఆదివారం

శరీరానికి కావలిసిన

 శరీరానికి కావలిసిన అతిముఖ్య విటమినులు - అవి లభించు పదార్ధాలు .


     A , B , C , D , E అను పేర్లతో విటమిన్లు ప్రాముఖ్యం పొందినవి. వీటిని "దేహనిర్మాతలు " అని తెలుగులో పిలుస్తారు. ఇవి మనం తిను ఆహారం నందు లేకున్న శరీరపోషణం సరిగ్గా జరగదు. గుడ్లు , పాలు , పండ్లు , దంపుడు బియ్యం మొదలగు సహజసిద్ధముగా లభించు పదార్ధములలో ఈ విటమిన్లు ఎక్కువుగా ఉండును. 


           ఇప్పుడు ఈ అయిదు ముఖ్యవిటమిన్ల గురించి మీకు వివరిస్తాను.


 * "A" విటమిన్  -


       ఇది లోపించినవారికి "రేచీకటి" వచ్చును. కన్ను , నోరు , ఊపిరితిత్తులు మొదలైన సున్నితమైన చర్మం ఎండిపోయి రోగములు తెచ్చు సూక్ష్మజీవులు దాడిచేయుటకు అనువుగా ఉండును. శరీరం చక్కగా ఎదుగుటకు , గర్భధారణకు , బాలింతలుగా ఉన్న సమయమున ఈ విటమిన్ చాలా అవసరం .


              ఈ "A" విటమిన్ ఎక్కువుగా పాలు , పెరుగు , వెన్న , నెయ్యి , గుడ్లు , చేపలు , పచ్చికూరలు , కాడ్ లివర్ ఆయిల్ , టొమాటో , బొప్పాయి , నారింజపండ్లు , బచ్చలి , తొటకూర మొదలైన వాటిలో ఎక్కువుగా ఉండును.


 *  "B" విటమిన్  -


         ఇది లోపించిన నరముల నిస్సత్తువ , ఉబ్బసరోగం కలుగును.


           ఈ "B" పచ్చికూరలు , మాంసము , పప్పుదినుసులు , గుడ్లు మొదలయిన వాటిలో లభించును. "B6" విటమిన్ తెల్లరక్త కణాలు తయారీకి ఉపయోగపడును. అరటిపండులో , పచ్చటి ఆకుకూరలలో , పప్పుదినుసుల్లో , చిక్కుడు , బంగాళాదుంపలలో ఈ విటమిన్ ఎక్కువుగా ఉండును. "B12" విటమిన్ ఇది లోపించిన పెదవుల్లో పగుళ్లు వస్తాయి. ఎర్రరక్తకణాలు ఏర్పడటానికి , నాడీమండలం వ్యవస్థకు , నీరసం , జ్ఞాపకశక్తి తగ్గటం , నోటిపూత , నరాల కణాలు నశించిపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఈ "B12" విటమిన్ పాలఉత్పత్తుల్లో , సోయాచిక్కుడు పాలలో పుష్కలంగా ఉండును.


 *  "C" విటమిన్ -


          శరీరంలో ఈ విటమిన్ "స్కర్వీ " అను వ్యాధి వస్తుంది. ఈ విటమిన్ యాంటిబయాటిక్ గా పనిచేయును . జీర్ణశక్తిని పెంచును. విటమిన్ C లోపించిన ఐరన్ ను ప్రేగులు గ్రహించలేవు . ఐరన్ లోపిస్తే రక్తహీనత ఏర్పడును . ఈ విటమిన్ ఎక్కువుగా నిమ్మకాయ , ఉశిరికాయ , కొత్తిమీర , పండ్లరసములు , మొలకెత్తిన గింజలలో , కలబందలో , వెల్లుల్లిలో , ముల్లంగిలో , పైనాపిల్ లో , కొబ్బరిబోండాలలో , మునగ ఆకులో పుష్కలంగా లభించును.


 *  "D" విటమిన్ - 


         బిడ్డల ఎదుగుదలకు ఈ విటమిన్ చాలా అవసరం . ఇది లోపించిన బిడ్డలు దొడ్డికాళ్ళు వారగును. ఇది A విటమిన్ తో కలిసి వెన్న , గుడ్డు లొని పచ్చసొనలో ఉండును. ఉదయం , సాయంకాలం శరీరముకు సూర్యరశ్మి తగులుట వలన శరీరానికి కావలసిన D విటమిన్ బాగుగా లభించును. ఈ విటమిన్ శరీరంలో కొంతమొత్తంలో తయారగును.


              ఈ D విటమిన్ మనశరీరంలో ఎముకలు క్షీణించకుండా చూస్తూ వాటిని దృడంగా ఉంచును. రోగనిరోధక శక్తి బలోపెతం చేసేగుణం ఈ విటమిన్ కు ఉండును. ఇన్సులిన్ శరీరం సంగ్రహించుటకు తోడ్పడును. విటమిన్ D కణవిభజనను నియంత్రిస్తుంది. ఫలితముగా క్యాన్సరు నివారణకు తోడ్పడును . విటమిన్ D లోపము వలన పేగు క్యాన్సరు,రొమ్ము క్యాన్సరు , ప్రొస్టేట్ గ్రంథి క్యాన్సరు , క్లోమ క్యాన్సరు ముప్పుని తొలగించును. ఉదయం 6 నుంచి 8 లోపు సూర్యనమస్కారాలు చేయుట మంచిది . ఈ విటమిన్ లోపం ఉన్నవాళ్లు తరచుగా పాలు , గోధుమలు , మరియు దేశివాళీ ఆవునెయ్యిలో తరచుగా తీసికొనవలెను .


 * "E " విటమిన్  -


          ఇది లోపించిన నపుంసకత్వం కలుగును. A విటమిన్ మరియు C విటమిన్లను మరియు ప్రోటీయాసిడ్స్ ని శరీరం నుండి నశించకుండా రక్షించే గుణం పైనాపిల్ లో ఉన్న E విటమిన్ లో ఉన్నది. వేరుశనగలో , బాదంలో , కాయగింజలలో , సొయాచిక్కుడు , గట్టి గింజలలో దొరుకును . గోధుమ , మొలకెత్తిన గింజలలో , మాంసములో ఎక్కువుగా లభించును.


              వీటితో పాటు విటమిన్ K కూడా మనకి ముఖ్యమయినది. ఈ విటమిన్ K రక్తం గడ్డకట్టుటకు ఉపయోగపడింది. ఈ విటమిన్ K లోపించడం వలన రక్తం గడ్డకట్టడం జరగదు. ఈ విటమిన్ K పచ్చిబఠాణీ , ఆవునెయ్యి , క్యారెట్ లలో ఎక్కువుగా ఉండును.


          నేను రాసిన గ్రంథాలలో మరిన్ని అనుభవ యోగాలు ఇవ్వడం జరిగింది. 


   

కామెంట్‌లు లేవు: