20, మే 2024, సోమవారం

త్రిమతాలు

 ద్వైతం అద్వైతం విశిష్టాద్వైతం

*త్రిమతాలు* 


హిందూమతంలో దక్షిణ భారతదేశంలో *భగవంతుని గురించి మూడు ముఖ్యమైన సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి. వాటిని త్రిమతాలు* అంటారు. ఆయా మతాలను ప్రతిపాదించిన ఆచార్యులను *త్రిమతాచార్యులు* అంటారు.


*అద్వైతం* లేదా *స్మార్తం*


*విశిష్టాద్వైతం* లేదా *వైష్ణవం*


*ద్వైతం* లేదా *మధ్వం*


 అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము అనే పదాలను *సిద్ధాంతాలకూ*


 స్మార్తం, వైష్ణవం, మధ్వం అనే పదాలను *ఆచారాలకూ* ఎక్కువగా వాడుతారు.


*మూడు సిద్ధాంతాలకు మౌలిక కారణాలు*


వేదముల ఉత్తరభాగము ఆధారముగా వెలువడినది *ఉత్తరమీమాంసా దర్శనము. దీనినే వేదాంత దర్శనమనీ, బ్రహ్మసూత్రములనీ అంటారు*. ఇది వేదముల చివరి భాగమైన ఉపనిషత్తులనుండి ఉద్భవించినది. *ఈ దర్శనము జీవాత్మకు, పరమాత్మకు గల సంబంధమును ప్రతిపాదించును*. వ్యాస మహర్షి రచించిన బ్రహ్మసూత్రములను వేర్వేరు భాష్యకారులు వ్యాఖ్యానించిన విధముపై వేర్వేరు శాఖాభేదములు ఏర్పడినవి. ఆ విధంగా *అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము* - అనే మూడు ప్రముఖమైన సిద్ధాంతములు ఏర్పడినవి. మూడు ఆరాధనా మార్గములకూ ప్రబలమైన సాహిత్యమూ, సంప్రదాయమూ ఉన్నాయి. వాటికి అంకితమైన భక్తజనం కూడా అశేషంగా ఉన్నారు.


ఇక్కడ గుర్తించవలసిన విషయమేమంటే *మూడు సిద్ధాంతాలూ వేదాలనూ, ఉపనిషత్తులనూ, బ్రహ్మసూత్రాలనూ ప్రమాణంగా అంగీకరిస్తాయి*. ముగ్గురు సిద్ధాంతకర్తలూ అసాధారణ పండితులు. తమ భాష్యాలతోనూ, వాదాలతోనూ సమకాలీన పండితులను మెప్పించి, ప్రతివాదులను ఓడించి తమ సిద్ధాంతములకు గుర్తింపు, మన్నన సాధించారు. వారికి రాజులనుంచి లభించిన ఆదరణ అంతంతమాత్రమే. కనుక ఈ మూడు సిద్ధాంతాల ప్రావిర్భావమూ హిందూమతంలో సత్యశోధనకూ, పాండిత్యానికీ ఉన్న గుర్తింపుగా అంగీకరించవలసి ఉంది. *మూడు తత్వములకూ ఉన్నతమైన గురు పరంపర, సుసంపన్నమైన సాహితీసంప్రదాయము, దృఢమైన ఆచారములు ఉన్నాయి.*


*అద్వైతం:*


ఇది ఆదిశంకరులుగా ప్రసిద్ధులైన *శంకర భగవత్పాదులు ప్రతిపాదించిన సిద్ధాంతము*.మూడింటిలోను మొదటిది. హిందూమతముపై అత్యంత ప్రభావము కలిగిన ఆలోచనామార్గములలో ఇది ఒకటి.


*బ్రహ్మమొకటే సత్యము. మిగిలినదంతా మిధ్య. జీవాత్మకు, పరమాత్మకు (బ్రహ్మమునకు) భేదము లేదు. అలాగే అందరి లోని ఆత్మ బ్రహ్మ మయమే. మాయవలన అజ్ఙానము, దానివలన భేదభావము కలుగుచున్నవి. త్రాడును చూచి పాము అనుకొన్నవానికి భయము కలుగును. అది తాడు అని తెలియగానే భయము తొలగిపోవును. అలాగే జ్ఞానము వల్ల మాయను అధిగమించి, మోక్షము పొందుట సాధ్యము.*


*విశిష్టాద్వైతం:*


ఇది *రామానుజాచార్యులు* ప్రతిపాదించిన మార్గము. *నిత్యానపాయినియై, నారాయణునితో సదా కలసి ఉండే లక్ష్మీదేవికి వారిచ్చిన ప్రాధాన్యత వల్ల ఈ సిద్ధాంతమును శ్రీవైష్ణవమని అంటారు*. నారాయణారాధనలో కులవివక్షతను పూర్తిగా త్రోసిపుచ్చిన మార్గమిది.


*జీవుడు, ప్రకృతి, ఈశ్వరుడు - మూడూ సత్యములని విశిష్టాద్వైతము అంగీకరిస్తున్నది. 'చిత్' అనబడే జీవునితోను, 'అచిత్' అనబడే ప్రకృతితోను కూడియే ఈశ్వరుడుండును. శరీరములో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉండును. ఆజ్ఞానవశమున జీవుల సంసారబంధమున చిక్కుకొందురు. భగవదనుగ్రహమువలన, సద్గురుకృప వలన, భగవంతునకు శరణాగతులైనవారు అజ్ఞానమునుండి విముక్తులై, మరణానంతరము మోక్షము పొందుదురు. అలా నారాయణ సాన్నిధ్యము పొందినవారికి మరుజన్మలేదు.*


*ద్వైతం:*


ఇది *మధ్వాచార్యులు (ఆనందతీర్ధులు)* ప్రతిపాదించిన తత్వము. మూడింటిలో చివరిది. పై రెండు సిద్ధాంతములనూ క్షుణ్ణముగా అధ్యయనం చేసిన తరువాత ప్రతిపాదింపబడింది.


*జీవుడు, జగత్తు, దేవుడు - ఈ మూడూ వేరు వేరనీ, వాటి మధ్య భేదం ఎప్పుడూ ఉంటుందని ప్రతిపాదించింది. సకల కల్యాణ గుణ సచ్చిదానంద మూర్తియైన శ్రీమహావిష్ణువే సమస్తమునకు ఆధారము. వారివారి గుణకర్మలననుసరించి జీవులు తమోయోగ్యులు, నిత్య సంసారులు, ముక్తియోగ్యులు అను మూడు విధములు. దేవునకు, జీవునకు గల సంబంధము యజమానికి, దాసునకు మధ్య గల సంబంధము వంటిది.*

డా:ఆర్.వి.కుమార్ గారి సౌజన్యంతో🙏🙏

కామెంట్‌లు లేవు: