27, అక్టోబర్ 2025, సోమవారం

తెలియని వన్ని తప్పులని

 తెలియని వన్ని తప్పులని దిట్ట తనాన సభాంతరంబునన్

పలుకగ కాదు రోరి పలు మారు పిశాచపు పాడె గట్ట నీ

పలికిన నోట దుమ్ము వడ భావ్య మెరుంగక పెద్దలైన వా

రల నిరసింతురా ప్రగడ రాణ్ణరసా విరసా తుసా భుసా !!

(".... భావ్యమెరుంగవు ... నిరసింతువా..." అని పాఠాంతరం)

Panchaag


 

తేనె గురించి

 తేనె గురించి సంపూర్ణ వివరణ - ఉపయోగాలు .

      

     తేనె వలన మనకి అనేక ఉపయోగాలు ఉన్నాయి. ప్రాచీన కాలం నుంచి తేనె మన ఆహారంలో భాగం అయినది. ఈజిప్టు పిరమిడ్లలో 

మమ్మీల పక్కన తేనెతో కూడినటువంటి పాత్రలు కనుగొన్నారు. ఎంతకాలం ఉన్నను చెడిపోనటువంటి ఒకేఒక ఆహారపదార్ధం తేనె . ఆయుర్వేద ఔషధాలలో తేనెని విరివిగా వాడటం జరుగుతుంది. తేనె జీర్ణక్రియతో సంబంధం లేకుండా గ్లూకోజ్ మాదిరి సరాసరి రక్తంలో కలియును. కావున వెంటనే శక్తిని కలిగించును.

         

         ఇప్పుడు మీకు తేనె గురించి సంపూర్ణంగా వివరిస్తాను.

 

° తేనె ఉత్పత్తి -

        

     తేనె వివిధ పుష్పముల నుంచి తేనెటీగల ద్వారా సేకరించబడును. ఇది ఎక్కువుగా అడవుల్లో చెట్లకు , గుట్టలు కు దొరుకును. తేనెటీగలు వివిధ పుష్పములనుంచి సేకరించిన తేనెను చెట్లకు గాని గుట్టలకు గాని తెట్టెలుగా చేసుకుని అందులో భద్రపరుచుకొనును. అట్టి తెనే తెట్టలకు జాగ్రత్తగా పొగపెట్టి తేనెటీగలు ను పారదోలి తేనెతెట్టలను సేకరించెదరు . కాని తెట్టలను తేనెటీగ గుడ్లతో మరియు ఈగలతో సహా పిండెదరు ఇలా సేకరించి సేవించిన తేనె ఆరోగ్యానికి చాలా హానికరం. కావున తేనెటీగలు గుడ్లు పుట్టకముందు తేనెని సేకరించాలి. ఇటువంటి తేనె ఆరోగ్యానికి హానికరం మరియు మధురంగా ఉండును. దీనిని నిలువ కూడా చేసుకోవచ్చు. కాని గుడ్లతో ఉన్న తెట్టల నుంచి తీసిన తేనె కొద్దిరోజుల్లోనే పులిసిపోవును. అందువలనే దాని రంగు , రుచిలో మరియు వాసనలో తేడా వచ్చును. కావున తేనెని సంగ్రహించేప్పుడు తగు జాగ్రత్త వహించవలెను.

 

     స్వచ్చమైన తేనెని పరీక్షించు విధానం -

       

       తేనె వివిధ రుతువులలో వివిధ రంగులుగా ఉండును. అదేవిధంగా దాని సాంద్రత , రుచి కూడా వేరువేరుగా ఉండును. కొన్ని తేనెలు ఎర్రగాను , కొన్ని తేనెలు తెల్లగాను , కొన్ని తేనెలు కొంచం నల్లగాను ఉండును. కొన్ని తేనెలు పలుచగాను , కొన్ని తేనెలు చిక్కగాను ఉండును. అనగా తేనె ఒకే రంగు , ఒకే రుచి , ఒకే వాసన ఎప్పుడూ ఉండదు కావున అది స్వచ్ఛమైనదా లేక నకిలీదా అన్నది గుర్తించడం చాలా కష్టం. కాని ఎల్లప్పుడూ తేనె వాడువారు గుర్తించగలరు.

  

 తేనెని పరీక్షించు విధానం -

        

       స్వచ్చమైన తేనె పైన ఈగ వాలినను దానికి అంటకుండా లేచిపోతుంది. అదేవిధంగా తేనెని ఒక కాగితం పైన వేసిన కిందిభాగం తడి కాదు అదే కల్తీ తేనె అయినచో కాగితం కింది భాగం తడిచిపోవును. 

      

           వీలుంటే మీ కళ్ళముందే తేనె తుట్టెని పిండించుకోండి .

 

 తేనెలో రకాలు -

      

         తేనెలో వివిధ రకాలు కలవు. కాని అందులో రెండు ముఖ్యమైనవి అవి.

                  

                 * చిన్న తేనె * పెద్ద తేనె                                  

          

       చిన్న తేనెటీగలు చాలా వాడిగా , చురుకుగా ఉండును. అవి కుట్టినచో చాలా మంట పుట్టును. ఈ తేనె చాలా తక్కువుగా అరుదుగా లభించును.

            

        పెద్ద తేనె ఇది చెట్లకు , గుట్టలకు చాలా ఎక్కువుగా లభించును.మరియు ఇది అన్ని ఋతువుల్లో లభించును.

 తేనె ఉపయోగాలు -

 

* మలబద్దకం కలవారు ఉదయమున గోరువెచ్చని నీటిలో రెండుచెంచాలు తేనె వేసుకొని తాగినచో సుఖవిరేచనం అగును.

 

* అతిసారం వల్ల నీళ్ల విరేచనాలతో భాధపడువారు రెండు చెంచాల తేనె రోజుకు మూడుసార్లు తీసుకున్నచో అతిసారం తగ్గును.పొట్ట నొప్పి మరియు గ్యాస్ నివారణ అగును.

 

* గ్రహణి రోగం అనగా బంకవిరేచనాలతో బాధపడేవారు తియ్యని మజ్జిగలో రెండు చెంచాలు తేనె కలుపుకుని త్రాగినచో రెండుమూడు రోజుల్లొ తగ్గును.


 * అమీబియాసిస్ సమస్యతో ఇబ్బంది పడువారు నీళ్లలో తేనె కలుపుకుని తాగుచున్న బలహీనత తగ్గును.శక్తి వచ్చును.రోగనివారణ అగును.

 

* దగ్గు, అలర్జీ , ఆస్తమా ఉన్నవారు ఉదయం , సాయంత్రం వేడినీటిలో రెండు చెంచాలు తేనె వేసుకొని తాగినచో వ్యాధి నివారణ అగును. తేనె కఫమును నివారించును.


 * జ్వరం , టైఫాయిడ్ , మలేరియా , మశూచి , ఆటలమ్మ మొదలగు వ్యాధులలో నీళ్లతో కలిపి తేనెని తీసుకోవడం వలన మంచి శక్తి వచ్చును. జ్వరమును తగ్గించును .

 

* గుండెజబ్బులు కలవారు తేనెని వాడటం వలన గుండెజబ్బులు నివారణ అగును. కొలెస్ట్రాల్ తగ్గించును .

 

* బలహీనంగా ఉండువారుకి తేనె అత్యద్భుతమైన ఔషధం , వీర్యవృద్ధిని కలిగించును.

 

* మధుమేహ సమస్యతో ఇబ్బంది పడువారు కూడా తేనెని వాడవచ్చు. మధుమేహరోగులు స్వచ్ఛమైన తేనె వాడవచ్చు . తేనె వాడితే షుగరు పెరుగుతుంది అనేది కేవలం అపోహ మాత్రమే . రక్తమును శుద్ది చేయును కావున ముత్ర విసర్జన సక్రమముగా జరుగును.

 

* చర్మవ్యాధులు , మొటిమలు , పుండ్లు , గాయాలు , కాలినపుడు , క్యాన్సర్ కణితులకు కూడా తేనె రాసిన నివారణ అగును.

 

* వాంతులు , వెక్కిళ్లు, వేవిళ్లు అగుచున్నప్పుడు రెండు చెంచాలు తేనె తిన్నచో నివారణ అగును.

 

* గర్భిణి స్త్రీలు ప్రతిరోజూ ఉదయం రెండు చెంచాలు తేనె మంచినీటిలో కాని , కుంకుమపువ్వుతో కాని తీసుకున్నచో మంచి ఎరుపు , తెలుపు కలిగిన ఆరోగ్యవంతమైన శిశువు జనించును.

 

* ప్రతిరోజు రెండుసార్లు చిన్నపిల్లలకు తేనె తాగించినచో వారికి మలబద్దకం , అజీర్ణం , కడుపునొప్పి , అతివిరేచనములు వచ్చే అవకాశం ఉండదు.


 * ప్రతినిత్యం స్త్రీ , పురుషులు ఇరువురు ఉదయాన్నే కాఫీ, టీ లకు బదులు నిమ్మకాయ , తేనె కలిపి తాగినచో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు.

         

         తేనెలో ఉండు ఔషధ గుణాలు అన్నియు ఆ తేనెటీగలు తిరిగే స్థలంలో ఉండు మొక్కలపై అధారపడి ఉండును. అవి తిరిగే స్థలం నందు ఔషధ మొక్కలు ఎక్కువ ఉన్నచో ఆ తేనె యందు ఔషధ విలువలు ఎక్కువుగా ఉండును.

                       

             

         ******* సమాప్తం ********


 మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .  

గమనిక -

     

 నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

           

. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

    

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

        

. 9885030034

26, అక్టోబర్ 2025, ఆదివారం

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝     *సంపదః స్వప్రసంకాశాః*

            *యౌవనం కుసుమోపమ్|*

            *విధుఛ్చచంచలమాయుష్యం*

            *తస్మాత్ జాగ్రత జాగ్రత||*


తా𝕝𝕝 *మన సంపదలన్నియు ఒక కలవంటివి, యౌవనము ఒక పూవు వలె మనజీవితములో స్వల్ప కాలము మాత్రమే ఉండునది... ఈ జీవితమూ మెరుపు వలె క్షణ భంగురము.. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము....*


✍️💐🌸🌹🙏

Panchaag

 


జ్ఞానము

 *జ్ఞానము అనంతము 5*


సభ్యులకు నమస్కారములు.


11) *పంచాగ్ని విద్య* :- ఆకాశము, మేఘము, భూమి, పురుషుడు, స్త్రీ అనేవి పంచాగ్నులు. వీటి యందు శ్రద్ధ, సోమ, వృష్టి, అన్నము, రేతస్సు అను పంచ ద్రవ్యములను లేక పంచ ఆహుతులను హోమము చేయగా ఉదకములు (వృష్టి) పురుష రూపము చెందుతున్నవి. జీవుడు శరీర బీజములైన సూక్ష్మ బీజములలో చేరి క్రమముగా ఆకాశము మీద శ్రద్ధా రూపంలో చేరి, వర్ష రూపంలో భూమిపై పడి అన్నం రూపంలో పురుషునిలో చేరి, రేతస్సు రూపంలో స్త్రీ గర్భం యందు ప్రవేశించి, అక్కడ పురుషుడుగా వ్యక్తమగుచున్నాడు. శ్రద్ధ అనగా జీవుడు జీవ రూపంలో ఉండుట ధర్మము.

12) *దహార విద్య* :- బ్రహ్మ రంధ్రము నుండి చిన్న కమలము. ఆ కమలము మధ్యన సూక్ష్మమైన శూన్య స్థానము. ఆ శూన్యమే *దహరాకాశ* మనబడును. దీనిని తెలుసుకున్న వాడు బ్రహ్మను తెలుసుకొనగలుతాడు. 

ఈ విద్యనే *దహర* 

విద్య లేక *ప్రాణ* 

విద్య అందురు. జ్ఞానులు తమ హృదయంలో భగవంతుని ఉపాసన చేసేటప్పుడు,హృదయంలో పుండరీకాక్షుని  రూపంలో స్వామిని ఉపాసన చేస్తారు. ఇది *దహర* విద్య కారణంగానే సాధ్యము.

13) *సంవర్గ - వాయు సంవర్గ విద్య* :- వాయువు ఆనగా హిరణ్యగర్భుడు. ఇతడితోనే ప్రపంచ మంతా పుట్టి, స్థితిని, కల్గి లయించుచున్నది. . సంవర్గమనగా ప్రవిలయము. అనగా అతడి (సృష్టి, స్థితి, లయకారుడు) లో చేరి ఉండుట. సకల దేవతలు, జీవులు, జడ ప్రకృతి అంతా ప్రళయ కాలములో చేరి ఈ వాయువుగా వ్యక్తమగుచున్నవి. ఇట్టి వాయు సంవర్గమును ఉపాసన చేయుచు, తాను గూడా లేనివాడుగా అవ్యక్తమగుటను వాయు సంవర్గ విద్య అందురు. 

14) *మధు విద్య*;-

 సర్వ దేవతలలో ఉండే దైవత్వమును మధువు అందురు. త్రిగుణాత్మకమైన నామ, రూప, క్రియా నటనలను వదిలి, అందలి సారమైనటువంటి ఆత్మ చైతన్యమును గ్రహింపజేయునది మధు విద్య. ఆ సారమే దైవత్వము లేక మధువు లేక అమృతము.  మధు విద్యోపాసకులకు  బ్రహ్మానందము సిద్ధించును.

15) *అపర విద్య* :- 

గడ్డి పరక మొదలు సృష్టి కర్తవరకు గల ప్రకృతి  గుణములను వివేకంతో సరిగ్గా గ్రహించి కార్యసిద్ధిబడయుట.  ధర్మాధర్మములను తెలుసుకొనుట. ఈ రెండింటికి సంబంధించిన విద్యనే అపర విద్య.


శ్లో! *అభ్యసేన క్రియా: సర్వా: !అభ్యాసాత్ సకలా: కళా! అభ్యాసాత్ ధ్యాన మౌనాది: కిమభాసస్య దుష్కరమ్* 


భావం:- అభ్యాసంతో అన్ని పనులు సాధ్యమవుతాయి. అభ్యాసంతో సకల కళలు సాధించవచ్చు. అభ్యాసంతోనే  ధ్యానం, ఆలాగే మౌనం సాధ్యం. అసలు అభ్యాసంతో సాధ్యం కానిదేమిటి. అభ్యాసం మానవుడిని పరిపూర్ణుడిని చేస్తుంది.


ధన్యవాదములు.

*(స్వస్తి)*

శివస్తుతి

 *శివస్తుతి - కార్తికమాసం-విశ్వావసు*


సీ॥

తలపైన గంగమ్మ తాండవంబాడగా 

ఉలుకకుందువు నీకు నోర్పు మెండు 

నాగులెన్నియొ మీద నర్తించి తిరుగాడ 

భూషలందువు గొప్ప పోడిమౌర! 

వ్రేలు పుఱ్ఱెలదండ ప్రీతిగా తలుతువు 

వైరాగ్య మెంతగా ప్రబలెనయ్య! 

వటవృక్షమూలాన వరలు ధ్యానముతోడ 

నిత్యతపము సల్పు నియతి నీది 

తే.గీ.

జాయ పార్వతి తగ్గదై సహకరించ

లోటు లేదయ్య విశ్వేశ లోకములను 

ప్రోచి పాలించు నిన్నేను మ్రొక్కి గొలుతు 

మోక్ష మీయవె దయతోడ వ్యోమకేశ! -6

===========

పోడిమి=ప్రవర్తన

*~శ్రీశర్మద*

నవ్వుకుందాం

 సరదాగా కాసేపు నవ్వుకుందాం 


మన తెలుగు భాష పై చమత్కారం తో కూడిన మాటలు


 నెలవంక ఉంటుంది గానీ

 "వారం వంక" ఉండదు అదేంటో!!!


 "పాలపుంత" ఉంటుంది గానీ

 "పెరుగుపుంత" ఉండదు.


 "పలకరింపు" ఉంటుంది గానీ

 "పుస్తకంరింపు" ఉండ దెందుకు?


 "పిల్లకాలవ" ఉంటుంది గానీ

 "పిల్లోడి కాలవ" ఉండదు. ఎందువల్లనో?

 

 "పామాయిల్" ఉంటుంది గానీ

 "తేలు ఆయిలు" ఉండదు.


 "కారు మబ్బులు" ఉంటాయి గానీ

 "బస్సు మబ్బులు" ఉండ వేమిటో!


 "ట్యూబ్ లైటు" ఉంది గానీ

 "టైర్ లైటు" ఉండదు.


 "ట్రాఫిక్ జామ్" ఉంటుంది గానీ

 "ట్రాఫిక్ బ్రెడ్" ఉండదు.


 "వడదెబ్బ" ఉంటుంది గానీ

 "ఇడ్లీ దెబ్బ" ఉండదు 


 "నిద్రగన్నేరు చెట్టు" ఉంటుంది గానీ

 "మెలకువ గన్నేరు చెట్టు" ఉండదు.


 "ఆకురాయి" ఉంటుంది గానీ

 "కొమ్మరాయి" ఉండదు 


 "పాలపిట్ట" ఉన్నది గానీ

 "పెరుగు పిట్ట", గానీ, "మజ్జిగ పిట్ట" గానీ ఉంటే ఒట్టు.


 "వడ్రంగి పిట్ట" ఉంది గానీ

 "ఇంకో వృత్తి పిట్ట" లేదు ఎందుకనో 


చుట్టరికాలు మాత్రమే ఉంటాయి గానీ

 "సిగరెట్టరికాలు" ".బీడీరికాలూ" ఉండ వేమిటో.


 "రంగులరాట్నం" ఉంటుంది గానీ

 "బ్లాక్ అండ్ వైట్ రాట్నం" ఉండ దెందుకని?


 "ఫైర్ స్టేషన్" లో ఫైర్ ఉండదు 


"పులిహారలో" పులి ఉండదు 


 "నేతి బీరకాయ" లో నెయ్యి ఉండదు.


 "మైసూర్ పాక్" లో మైసూర్ ఉండనే ఉండదు.

మైసూర్ బజ్జి లో మైసూర్ వుండదు 


 "గాలిపటంలో" గాలి ఉండదు 


 "గల్లాపెట్టెలో" గల్లా ఉండదు.


చివరాఖరుగా

 "ఫేసు బుక్కులో" పుస్తకం వుండదు 

"యూ ట్యూబులో" గొట్టం ఉండదు !


హాస్యం మనస్సును ప్రశాంతత చేస్తుంది..!

సంపూర్ణ శ్రీ కాశీ ఖండము

 ...:

*🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩*



*శ్రీవేదవ్యాస ప్రణీత శ్రీ స్కాంద మహాపురాణాంతర్గత*


*సంపూర్ణ శ్రీ కాశీ ఖండము*


*అధ్యాయం - 4*


*పతివ్రతాఖ్యాన వర్ణనము :*


సూతుడు చెప్పాడు-


మహామునీ! అగస్త్య మునీంద్రుడు అడుగగా దేవతలేమి చెప్పారు. సమస్తలోకాల మేలుకోసం దాన్నిచెప్పండి. దేవతలందరు అగస్త్యునిమాటవిని గౌరవపూర్వకంగా బృహస్పతివైపు చూశారు. 


మహానుభావా! అగస్త్య మునీంద్రా! దేవతల రాకకి కారణాన్ని విను. నీవు ధన్యుడవు. కృతకృత్యుడవు. మహాత్ములకు కూడ నీవు మాన్యుడవు. 


మునిశ్రేష్ఠుడా! ప్రతి ఆశ్రమం ప్రతి పర్వతం, ప్రతి అరణ్యంలోను తపోధనులున్నారు. కాని నీమర్యాద భిన్నమైనది. నీలో తపోలక్ష్మి, బ్రహ్మతేజస్సు రెండూ స్థిరంగా ఉన్నాయి. 


పుణ్యలక్ష్మికూడ ఉత్కృష్ట రూపంలో నీలో ప్రకాశిస్తున్నది. ఔదార్యం, మనస్విత కూడ నీలో ఉన్నాయి. తనకథని లోకంలో పుణ్యాన్ని కలిగించేది, నీ సహ ధర్మచారిణి, కల్యాణి అయిన మహాపతివ్రత లోపాముద్రాదేవి నీ శరీరానికి నీడలా నీతోపాటుగా 'ఉంటున్నది. 


అరుంధతి, సావిత్రి, అనసూయ, శాండిల్య, సతి, లక్ష్మి, శతరూప, మేనక, సునీతి, సంజ్ఞ, స్వాహ మొదలైన పతివ్రతల్లో ఈ లోపాముద్రని శ్రేష్ఠురాలిగా చెపుతున్నారు. 


మరి ఇతరులెవ్వరులేరు. ఇది నిశ్చయం, మునీంద్రా! నీవు భుజించిన తరువాత భుజిస్తుంది. నీవు కూర్చున్న తరువాత కూర్చుంటుంది. 


తనను తాను అలంకరించు కోకుండా ఎన్నడు నిన్ను చూడదు. పనిమీద పొరుగూరికి వెళ్ళినప్పుడు అన్నివిధాల ఆభరణాల్ని విడిచిపెతుంది. 

నీ ఆయువు వృద్ధికావడానికి ఎన్నడు నీ పేరును పలుకదు. ఎన్నడు పరపురుషుని పేరునుకూడ తలవదు. కోపంతో పట్టుకున్న ప్పటికి బాధపడదు. కొట్టినప్పటికి ప్రసన్నంగానే ఉంటుంది. 


ఈ విధంగా చెయ్యమనగానే స్వామీ! చేసినట్లుగా తెలుసుకొనండని చెపుతుంది. పిలిచినప్పుడు ఇంటి పనుల్ని విడిచిపెట్టి వెంటనే వస్తుంది. 


నాథా! ఎందుకు పిలిచారో అనుగ్రహంతో చెప్పండి అని అడుగుతుంది. ద్వారంలో చాలసేపు నిలుచుండదు, కూర్చుండదు. నీవు ఇవ్వనిదాన్ని ఎన్నడు ఎవ్వరికి ఇవ్వదు. 


నీవు చెప్పకుండానే పూజాసామగ్రిని స్వయంగా సమకూరుస్తుంది. మడినీళ్ళు, దర్భలు, పత్రాలు, పుష్పాలు, అక్షతలు మొదలైనవాటిని అవసరానికి అనుకూలంగా కంగారుపడకుండగా చాలసంతోషంతో సర్వాన్ని సమకూరుస్తుంది. 


భర్త తినగా మిగిలిన అన్నం, పండ్లు మొదలైన వాటిని తాను తింటుంది. భర్త ఇచ్చినదాన్ని మహాప్రసాదమని స్వీకరిస్తుంది. దేవతలకు, పితృదేవతలకు, అతిథులకు, సేవకులకు, గోవులకు, యాచకులకు పెట్టకుండగా ఎన్నడు భుజించదు. 


ఇంటి ఇల్లాలికి అవసరమైన వస్తువుల్ని, అలంకారాల్ని చక్కగా దాచి ఉంచడంలో సమర్థతకలిగి అనసవరమైన ఖర్చుని చెయ్యకుండా ఇంటి సంపదని పెంచుతుంది. 


నీఅనుమతి లేకుండా వ్రతాల్నికాని ఉపవాసాల్నికాని చెయ్యదు. ఆమె సమాజాన్ని, ఉత్సవాల్ని చూడటాన్ని దూరంనుంచే విడిచిపెడుతుంది. 


తీర్థయాత్రలకు, వివాహం మొదలైన వాటిని చూడటానికి వెళ్ళడు. భర్త సుఖంగా నిద్రిస్తున్నప్పుడు కాని, సుఖంగా కూర్చున్నప్పుడు మూడురాత్రులు తన ముఖాన్నే చూపించదు. 


స్నానం చేసి పరిశుద్దురాలైనంత వరకు తన మాటని వినపడనీయదు. చక్కగా స్నానం చేసి భర్తముఖాన్నే చూస్తుంది కాని ఇతరుల ముఖాన్ని చూడదు. లే


కపోతే మనసులో భర్తని ధ్యానించి సూర్యుని చూస్తుంది. పసుపు, కుంకుమ, సిందూరం, కాటుక, రవిక, తాంబూలం, మంగళ ప్రదములైన ఆభరణాలు, కేశసంస్కారం, జుట్టుముడి, అనేవాటిని భర్త ఆయుష్షుని కోరే పతివ్రత విడిచిపెట్టదు. 


పతివ్రత చాకలిస్త్రీతోకాని, సత్కర్మలకి విరుద్ధంగా మాట్లాడే స్త్రీతోగాని, బౌద్ధభిక్షుకురాలితోగాని, దురదృష్టవంతు రాలైన స్త్రీతోకాని ఎన్నడు స్నేహం చెయ్యదు. 


పతివ్రత భర్తని ద్వేషించే స్త్రీతో ఎన్నడు మాట్లాడదు. ఒంటరిగా ఎన్నడు ఉండదు ఎన్నడు నగ్నంగా స్నానంచెయ్యదు. 


రోటి పై కాని, రోకలి పైకాని, చీపురుమీదకాని, రాతిమీదకాని, గోధూమాదుల్ని చూర్ణంచేసే రాతిమీదకాని, గడపమీదకాని ఎన్నడు కూర్చుండదు. 


సంభోగ సమయంలో తప్ప మరెప్పుడు ప్రౌఢంగా సంచరించదు. ఎల్లప్పుడు భర్తకిష్టమైన విషయాల్లోనే ప్రేమని కలిగి ఉంటుంది. భర్తమాటని అతిక్రమించకుండా ఉండటమే స్త్రీలకు ఒకటే వ్రతం అదే పరమ ధర్మం అదే దేవపూజనం అవుతాయి. 


వీర్యహీనుడైనా, కష్టదశలో ఉన్నా, రోగగ్రస్తుడైనా, ముసలివాడైనా, మంచిస్థితిలో ఉన్నా, చెడ్డస్థితిలో ఉన్నా భర్తనొక్కనిని స్త్రీ అతిక్రమించ కూడదు. 


భర్త సంతోషంగా ఉన్నప్పుడు తాను సంతోషంగాను, భర్త నీ బాధతో ఉన్నప్పుడు తాను బాధతోను, సంపదలోను, ఆపదలోను పుణ్యవతి అయిన స్త్రీ ఒక్క రూపంగానే ఉంటుంది. 


నెయ్యి, ఉప్పు, నూనె మొదలైనవి లేకపోయినప్పటికి పతివ్రత అయిన స్త్రీ లేవని భర్తతోచెప్పకూడదు. భర్తకి కష్టాన్ని కలిగించకూడదు. 


తీర్ధ స్నానం చెయ్యాలనే కోరిక కలిగిన స్త్రీ భర్తపాదజలాన్ని త్రాగాలి. ఈశ్వరునికంటే, విష్ణువుకంటే స్త్రీలకు భర్త ఒక్కడే అధికుడు. 


భర్తని వ్యతిరేకించి వ్రతాల్ని, ఉపవాసాల్ని ఆచరించిన స్త్రీ తన భర్తఆయుష్షుని హరిస్తుంది. తరువాత తాను మరణించి నరకానికి వెళుతుంది.

25, అక్టోబర్ 2025, శనివారం

అద్భుతమైన పద్యం

 

అద్భుతమైన పద్యం 

పోతన వ్రాసిన భాగవతంలోని ప్రతి పద్యము ఆణిముత్యమే అనటంలో సందేహం లేదు. అది కందము కానీయండి, మత్తేభం కానీయండి, సేసం కానీయండి. ప్రతి పద్యం చదవటానికి అనువుగా, వినసొంపుగా అర్ధవంతంగా ఉంటాయి అనటంలో సందేహం లేదు. చిన్న చిన్న పద్యాలలోకూడా ఎంతో భావాన్ని అర్ధవంతంగా పొందుపరచటంలో పోతనకు సాటి వేరొకరు రారు అనటంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ చూడండి ఒక చిన్న కంద పద్యంలో అన్నే లోకాలను చుట్టుముట్టి వచ్చాడు. 

కం||
లోకంబులు లోకేశులు
లోస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం
జీటి కవ్వల నెవ్వం
డే కాకృతి వెలుఁగు నతని నే సేవింతున్.

 

లోకాలు అంటే మనకు తెలుసు చతుర్దశ భువనాలు అంటే 7 ఊర్ధ్వ లోకాలు 7 అదో లోకాలు వెరసి 14 లోకాలు ఉన్నట్లు మనకు శాస్త్రోవాచ అటువంటి అన్ని లోకాలకు పరిపాలించే రాజులు అంతేకాదు ఆ లోకాలలో నివసించేవారు అన్నీకూడా సృష్టి అంతంలో నశించినప్పుడు అంటే ప్రళయం సంభవించినప్పుడు లోకాలు వుండవు, రాజులు వుండరు, లోకాలలో వుండే జనాలు వుండరు అంతా నశించిపోయి కారు చీకట్లు కమ్మి ఉంటాయి అని సృష్టి వినాశనాన్ని గురించి చెపుతారు. అప్పుడు ప్రకాశించే సూర్యుడు, చంద్రుడు కూడా నశించిన తరువాత పూర్తిగా అంధకార బంధురంగా ఉంటుంది. అటువంటి చీకట్లలో చీకటికి అవతల ఉన్నటువంటి వెలుగే పరమేశ్వరుడు అని శాస్త్ర ఉవాచ అంటే కేవలం ఈశ్వరుడు తప్ప ఇంకా ఏమి ఉండదు. ఆ పరమేశ్వరుడు మరల సృష్టి కార్యం చేపట్టి క్రొత్తగా సృష్టిని అంటే మరల లోకాలను, లోకేసులను, లోకస్తులను సృష్టిస్తాడన్నమాట. అటువంటి దివ్యమైన శక్తివంతమైన పరమేశ్వరుడిని నేను సేవిస్తాను అని ఇక్కడ కవి అంటున్నాడు. అది ఎంతటి అద్భుతమైన భావనో చుడండి.  

మరిన్ని ఇటువంటి విషయాలకోసం వేచిచూడండి 

 ఓం తత్సత్ 

శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ 

భార్గవ శర్మ