1, ఆగస్టు 2020, శనివారం

రామాయణమ్ .. 17

ఒక్కసారిగా తన కూతుళ్ళందరకూ వికృత రూపం ప్రాప్తించినా కుశనాభుడు ఆందోళన చెందక వారి వివాహం గూర్చి మంత్రులతో ఆలోచన చేశాడు.
.
గొప్ప తపఃసంపన్నుడైన చూళికి సోమద అనే గంధర్వస్త్రీయందు జన్మించిన బ్రహ్మదత్తుడు తగిన వరుడు అని నిశ్చయించి ఆతనికిచ్చి పాణిగ్రహణము జరిపించాడు ! .
.
ఆతని కరస్పర్శ అందరు యువతుల వికృతరూపాన్ని పోగొట్టి తిరిగి నవయవ్వనసౌందర్యాన్ని ప్రసాదించింది!..
.
కన్యాదానము చేసిన పిమ్మట కుశనాభుడు పుత్రకామేష్టి చేశాడు ,అప్పుడు కుశుడు ,కుశనాభుతునితో పుత్రా నీకు తగినవాడు ,ధార్మికుడు అయిన పుత్రుడు జన్మిస్తాడు అని వరమిచ్చి అంతర్ధానమవుతాడు.
.
అంత కుశనాభునకు గాధి అనే పేరుగల కుమారుడు జన్మించాడు!
.
ఆ గాధి యే మా నాయనగారు అని పలికి ,రామా,! ఇప్పటికే అర్థరాత్రి అయినది ,చెట్లు అన్నీ కూడ నిశ్చలంగా ఉన్నాయి,పక్షుల కదలిక ఏమాత్రమూ లేదు,మింటచుక్కలు మెరుస్తున్నాయి! చంద్రుడు పూర్తిగా ఆకాశంలోకి వచ్చి చల్లని కాంతితో ప్రాణులను ఆనందింప చేస్తున్నాడు ,రామా ఇక నిదురపోవయ్యా! అని పలికి మహర్షి తానుకూడా విశ్రమించాడు!
.
తెలతెలవారింది సంధ్యావందనాది కార్యక్రమములు పూర్తి చేసుకొని మరల నడక సాగించారు!
అలా నడచి,నడచి గంగా తీరాన్ని చేరారు అందరూ!
.
ఆ గంగా నది శాంతగంభీరంగా ప్రవహిస్తున్నది ,పుణ్యజలాలతో ,హంస,సారస పక్షులతో  మనస్సుకు ఆహ్లాదాన్ని జనింపచేసే ఆ నదిని చూసి రాముడు ఆశ్చర్యంతో మునిని ప్రశ్నించాడు! గంగ మూడులోకాలను ఎట్లా ఆక్రమించింది? సముద్రంలో ఎలా ప్రవేశించింది తెలుసుకొన గోరుతున్నాను స్వామీ అని అడిగాడు!


(పాణి గ్రహణము అంటే చేతిని స్పర్శించటం ! స్పర్శ కలుగజేసే స్పందనలు అనేకము! స్త్రీ, పురుష విచక్షణ లేకుండా ఎంత మందితో పాణిగ్రహణం చేస్తున్నాం మనం ! మనం గొప్పగా చెప్పుకొనే సంస్కృతి ఉన్నట్లా గంగలో కలిసినట్లా?).
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

కామెంట్‌లు లేవు: