29, జూన్ 2021, మంగళవారం

*12.ఉపమన్యు మహర్షి*

 *🙏మహర్షుల దివ్య చరిత్రలు🙏*

*12.ఉపమన్యు మహర్షి* 


                  ఉపమన్యు మహర్షి కృతయుగంలో వ్యాఘ్రపాదుడు అనే మహర్షికి పెద్దకొడుకుగా పుట్టాడు . ఉపమన్యుకు ధౌమ్యుడనే పేరుకల తమ్ముడుండేవాడు . వీళ్ళిద్దరూ వాళ్ళ అమ్మ చెప్పినట్లు విని బుద్ధిగా , ముద్దుగా ఉండేవాళ్ళు . ఒకరోజు బంధువుల ఇంటికి వెళ్ళి పరమాన్నం తిన్నారు . తిని ఊరుకున్నారా ! ఇంటికొచ్చి అలాంటి పరమాన్నం నువ్వు కూడా చేసి పెట్టు అన్నారు తల్లిని . ఇది మహర్షిగారి ఇల్లు కదా ! రకరకాల వంటలు ఎక్కడ ఉంటాయి . అన్ని కోరికలు తీరాలంటే ఈశ్వరుడి  గురించి తపస్సు చెయ్యండి . ఆయనే మీకేం కావాలన్నా ఇవ్వగలడు అంది తల్లి .


శివుడు ఎలా ఉంటాడు ? అని ఉపమన్యు తల్లిని అడిగాడు . శివుడు ఎలా ఉంటాడో ఆవిడకి తెలిసినంతవరకు వివరంగా చెప్పింది . ఉపమన్యు తల్లికి నమస్కారం చేసి " నేను తపస్సు చేసుకుందుకు వెళ్ళిపోతున్నాను ” అని వెళ్ళిపోయాడు తమ్ముడితో కలసి . అలా వెళ్ళి , వెళ్ళీ ఒక మంచి చోటు చూసుకుని ఎడంకాలి బొటనవ్రేలిమీద నిలబడి తపస్సు చేయడం ప్రారంభించాడు . ఒక వంద సంవత్సరాలేమో పండ్లు తిన్నాడు . ఇంకో వంద సంవత్సరాలు ఆకులు తిన్నాడు . ఇంకో వంద సంవత్సరాలు నీరు మాత్రమే త్రాగి , మిగిలిన సంవత్సరాలు గాలే భోజనం అనుకుని మొత్తం వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు . ఈశ్వరుడు ఇంద్రుడి రూపంలో వచ్చి ఉపమన్యు ! నీ తపస్సుకు నేను చాలా సంతోషపపడ్డాను . ఏం కావాలో కోరుకో అన్నాడు . అపుడు ఉపమన్యు నువ్వు ఈశ్వరుడు కాదు , నన్ను ఈశ్వరుడు వచ్చి ఏదైనా పురుగు అయిపో అంటే పురుగయిపోతాను , చెట్టు అయిపో అంటే చెట్టయిపోతాను , అంతేకానీ , ఇంకెవరయినా వచ్చి రాజ్యాలిచ్చినా నేను తీసికోనన్నాడు . ఈశ్వరుడు కనిపించేవరకు ఎన్ని జన్మలయినా ఇలాగే తపస్సు చేసుకుంటాను గాని , వేరే వాళ్ళు ఏమిచ్చినా తీసికోను అన్నాడు . ఉపమన్యు ,      ఇంద్రుడు డన్నాడు శివుడు , శివుడు అంటున్నావు , అతడు ఎలా ఉంటాడో చెప్పు ? అడిగాడు . మహర్షు లందరూ ఎవరినైతే సత్ , అసత్ , వ్యక్త , అవ్యక్త రూపం 


గలవాడంటారో , ఆది మథ్య అంతములేని వాడెవడో , జ్ఞానవంతుడు , అచింత్యుడు , పరమాత్మ అయినా వాడెవడో , అన్ని సంపదలూ ఎవరినుంచి వస్తున్నాయో , బీజ అబీజ సంభూతుడెవడో , లోకం ఎవరిలో లీనమయిందో వాడే ఈశ్వరుడు . ఆ సర్వేశ్వరుడు వరం ఇస్తే తీసుకుంటాను లేకపోతే లేదు . ఇంకెవరిచ్చినా నాకు వద్దన్నాడు ఉపమన్యు . వెంటనే ఉపమన్యు మహర్షికి తెల్లని తోక , బూడిదరంగులో పర్వతమంత శరీరం , వజ్రాల్లాంటి కొమ్ములు , బంగారు నగలు ఉన్న ఐరావతం అంటే పెద్ద ఏనుగు కన్పించింది . తర్వాత ఎద్దునెక్కి తెల్లటి బట్ట ధరించి మహాతేజస్సుతో పార్వతిదేవితో కలిసి ప్రశాంతమైన ముఖంతో పరమేశ్వరుడు కన్పించాడు . శివుడు అగ్ని శిఖలాగ వెలిగిపోతున్నాడు . ఆయనకి కుడివైపు హంసవాహనం మీద బ్రహ్మ , ఎడమవైపున గరుడవాహనం మీద గద , శంఖం , చక్రంతో విష్ణుమూర్తి , నెమలి వాహనం మీద కుమారస్వామి తల్లి పార్వతి దగ్గర శక్తి ఘంటాలతో రెండవ అగ్నిలా కనిపిస్తూ , ఆయన ఎదుట నంది ఉన్నారు . మనువులు , మహర్షులు ఇంద్రాది దేవతలు శివుడి చుట్టూ ఉన్నారు . సర్వభూత గణాలు , సర్వమాతృకలు ఆయనకు నాలుగు ప్రక్కలా ఉన్నారు . దేవతలు శివుడికి స్తోత్రం చేశారు . బ్రహ్మ , విష్ణువు ఆయన్ని వేదాలో కీర్తించారు . ఇంద్రుడు ఆయన్ని ఎన్నో విధాల కీర్తించాడు . ఇవన్నీ చూసి ఉపమన్యు మహర్షికి ఆనందంతో కళ్ళ నుంచి నీరు ధారగా కారిపోతున్నాయి . ఉపమన్యు పరమేశ్వరుడి పాదాల మీద పడి ఆయన్ని ఆనందంతో  చేశాడు . దాన్నే ఉపమన్యు శివస్తోత్రంగా ఇప్పటికీ మనం చదువుతూ ఉంటాం . 


దేవతలు పుష్పవర్షం కురిపించారు . పరమేశ్వరుడు ఉపమన్యు మహర్షిని మూడు వరాలు కోరుకోమన్నాడు . ఉపమన్యుడు స్వామీ ! మొదటి వరం నాకు ఎప్పుడూ నీమీదే భక్తి ఉండేటట్లు , రెండవ వరం నాకు భూత , భవిష్యత్ , వర్తమాన కాలాల గురించి తెలిసేట్లు , మూడవ వరం నీకు అభిషేకం చేయడానికి క్షీరం ఎప్పుడూ దొరికేటట్లు అనుగ్రహించమన్నాడు . శివుడు సరేనని చెప్పి అంతర్ధానమయ్యాడు . ఉపమన్యు మహర్షి హిమత్పర్వతం మీద చక్కటి ఆశ్రమం ఒకటి వేసుకుని తపస్సు చేసుకుంటున్నాడు . 

ఒకసారి శ్రీకృష్ణుడు పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసి తన భార్య అయిన జాంబవతికి ఒక కొడుకునివ్వాలని ఉపమన్యు ఆశ్రమానికి వచ్చాడు . ఉపమన్యు మహర్షి శివుడి గురించి శ్రీకృష్ణుడికి అన్నీ వివరంగా చెప్పి అక్కడే ఉండి తపస్సు చేసుకోమన్నాడు . శ్రీకృష్ణుడు ఉపమన్యుడికి శిష్యుడై పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసి శివుడి దర్శనం పొందాడు . ఆ సమయంలో శివుణ్ణి అర్ధనారీశ్వరుడుగా ఉపమన్యు స్తోత్రం చేశాడు . ఈ రకంగా ఉపమన్యు పాయసం కోసం మొదలు పెట్టి పరమేశ్వరుడ్నే దర్శనం చేసుకున్నాడు . 

*12.ఉపమన్యు మహర్షి* 


*Note:- మహర్షుల దివ్య చరిత్రను ఫార్వర్డ్ చేసి ప్రతి ఒక్క హిందూ చేత చదివిద్దాం. ఆ మహర్షుల దివ్య ఆశీస్సులు పొందు దాము*🙏

కామెంట్‌లు లేవు: