20, జూన్ 2021, ఆదివారం

పరిషేచన ఏమిటి

 #ఈ పరిషేచన ఏమిటి? అన్నం తినే ముందు తినే పళ్ళెం చుట్టూ అలా మంత్రం చదివి నీళ్ళేందుకు చల్లి అలా మెతుకులు నోట్లో వేసుకుంటున్నారు? 


ఇలా కంచం చుట్టూ నీళ్ళు పొయ్యడం వలన చీమలు దోమలు మనం తినే ఆకు మీదకు రావు, కంచంలోకి రావు. 


ఇప్పుడు అసలు విషయానికి వద్దాం.

ఇలా భోజనం ముందు పరిషేచన చెయ్యడంలో

ఒక పెద్ద రహస్యం దాగి వుంది. 

మనం తినే ప్రతీ మెతుకు మీదా మన పేరు రాసి ఉంది అంటారు పెద్దలు. అది మనకు ప్రాప్తం ఉండబట్టే అన్నం తినగలుగుతున్నావు, అరాయించుకోగలుగుతున్నావు.  ఒక బ్రాహ్మణుడు సాత్వికాహారం పరిశుద్ధంగా తీసుకుని తనలోని సాత్త్విక శక్తిని ఉద్దీపింపచేసుకోవాలి.

అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం తినే మనం మన ప్రాణం నిలబెట్టుకోగలుగుతున్నాము. శక్తిని సంపాదించి పనులు చెయ్యగలుగుతున్నాము. ఇలా మనలోని అన్నం అరగాలన్నా, అన్నం శక్తిగా మారాలన్నా జఠరం సరిగ్గా పని చెయ్యాలి. ఇలా చేస్తున్న ఈ జీర్ణవ్యవస్థ మనకు దేవుడు పెట్టిన భిక్ష. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు. 

“”అహం వైశ్వానరో భూత్వాప్రాణినాం దేహమాశ్రితః ! ప్రాణాపానస మాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ !! (5-14)””

అంటే: నేనే ప్రాణాపానసంయుక్తమైన వైశ్వానరుడు అనే అగ్ని రూపములో సర్వప్రాణుల శరీరములయందుండి నాలుగు విధములైన ఆహారములను జీర్ణము చేయుచుందును.

ఆయన మనలో ఉండి అగ్నిరూపంలో మన ఆహారాన్ని జీర్ణం చేసి మనకు శక్తిని ఇస్తున్నాడు.మనలో దేవుడు ఉన్నాడు అని అనుకుంటున్నవారికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏమి కావాలి. 


మడిగా వంట చెయ్యడం కూడా ఒక యజ్ఞం, ఇంటి ఇల్లాలు శుచి శుభ్రత పాటిస్తూ తనను, తన పరిసరాలను శుచిగా ఉంచుతూ ఆ అగ్నిభట్టారకుని సహాయంతో ధర్మంగా సంపాదించిన దినుసులతో, కూరగాయలతో వంట చేస్తుంది. మడిగా ఉంటూ కేవలం భగవదారాధన తన మనస్సంతా నింపుకుని చేసిన వంట ముందుగా ఆ భగవంతునికి నివేదించి వీరు తింటారు. వంట చేసేవారి మానసిక స్థితి ఆ తినే వారి మానసిక స్థితిమీద ప్రభావం చూపుతుంది అని నిన్న మొన్న ఒక గొప్ప university వారు కనుక్కున్నారు.  ఇది మనం ఎప్పటినుండో ఆచరిస్తున్న ఒక సదాచారం. 


మరి భోజనం చెయ్యడమో? అది కూడా ముమ్మాటికీ యజ్ఞమే. ఇక ఆ భోజనాన్ని భుజించేవారు కూడా తాను తింటున్న ఆహారాన్ని లోనున్న ఆత్మారాముని సంతృప్తి పరుస్తున్నానని, లోన అగ్ని రూపంలో ఉన్న వైశ్వానరుడికి (జఠరాగ్ని లో హవిస్సు వేసినట్టు మనం మన భోజనం అందిస్తే ) యజ్ఞంతో పరిషేచన చేసి భోంచేస్తారు.

మనం తింటున్న ఆహారం కూడా ఒక పూజ,

ఒక యోగం. మనలో ఉన్న దేవునికి మనం హవనం చేస్తున్నానని నమ్మి తింటే అది కూడా పూజే. అందుకే కంచం ముందు కూర్చున్నప్పుడు ఇతర విషయాలు మాట్లాడకుండా కేవలం భోజనం మీద మనస్సు లగ్నం చేసి తినమని ఆయుర్వేదం చెబుతుంది. మనం భోజనం

ఒక పూజలా చేస్తే మనలో ఉన్న ఆ వైశ్వానరుడు త్రుప్తి చెంది మనకు తగిన శక్తినిచ్చి ఆయుష్షుని అభివృద్ధి చేస్తాడు. 


మన తర్వాతి తరాలకు చెప్పవలసిన విషయం చెప్పేవిధంగా చెబితే తప్పక గౌరవించి పాటిస్తారు.

ఇది మనందరి కర్తవ్యం.

కామెంట్‌లు లేవు: