26, అక్టోబర్ 2023, గురువారం

సిద్ధులను గుర్తించటం ఎలా

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*సిద్ధులను గుర్తించటం ఎలా ?*


భారతదేశం కర్మభూమి.

లౌకిక ఙ్ఞానానికి అతీతమైన సిద్ధులతో,

తమ తపోశక్తితో భారతభూమిని సుసంపన్నం చేసిన సిద్ధులెందరికో, 

ఈ పుణ్యభూమి పుట్టినిల్లు. 


తమ తపోశక్తితో కేవలం, భారతదేశానికే కాక, 

యావత్ మానవాళికి ఉపకారం చేసే సిద్ధపురుషులు ఈనాటికి హిమాలయపర్వతశ్రేణుల్లో ఉన్నారు.


అట్టి మహాత్ముల తపోశక్తి వలననే, 

నేడు భారతావని ఈమాత్రం అయినా సుభిక్షముగా ఉంది. 

వారి తపస్సు వలన కలిగే ప్రకంపనలు వలననే, 

నేటికీ భారతదేశంలో ఇంకా ఆధ్యాత్మికత నెలకొని ఉంది. 


సిద్ధపురుషులు అఙ్ఞాతముగా ఉంటూ, 

మానవునికి ఊహకందని సేవలు చేస్తూఉంటారు.


ప్రకృతి, సూర్యకాంతి, పంచభూతాలు మానవాళికి చేసే ప్రయోజనం ఎటువంటిదో, 

సిద్ధులైన పురుషుల యొక్క తపోశక్తి అంతటి ఉపకారం చేస్తుంటుంది.


1) సిద్ధులను గుర్తించటం ఎలా ?


2) వారి లక్షణాలు ఎమిటి ?


3) వారి నివాసము ఎచ్చట ?


వంటివి ఆసక్తికరమైన ప్రశ్నలు.


అయితే సిద్ధులను గుర్తించటం అంత తేలికైన విషయం కాదు.


భగవద్గీత, బ్రహ్మగీత, సూతసంహిత, భాగవతం, ఇంకా ఉపనిషత్తులతో అక్కడక్కడ సిద్ధులను గురించి చెప్పబడింది. 


భగవద్గీతలో సాంఖ్యాయోగంలో చెప్పబడిన స్థిథప్రఙ్ఞుని లక్షణాలు పూర్తిగా కలిగి ఉన్నవారిని సిద్ధపురుషులుగా పేర్కొనవచ్చు.


భగవద్గీతలో అర్జునుడు, స్థితప్రఙ్ఞుని గురించి నాలుగు ప్రశ్నలు వేశాడు.


1) స్థితప్రఙ్ఞుడు ఎలా ఉంటాడు?

అనగా అతని లక్షణములు ఏమిటి ?


2) స్థితప్రఙ్ఞులు ఏ విధంగా భాషిస్తారు ?


3) స్థితప్రఙ్ఞుడు ఏ రీతిగా ఉంటాడు ?


4) స్థితప్రఙ్ఞుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు ?


పై నాలుగు ప్రశ్నలలో, 

మొదటి ప్రశ్నయే సమగ్రమయినది. 


మిగిలిన మూడుప్రశ్నలు అందులోని భాగమే. 


అత్యంత సమగ్రమైన అర్జునుని ఈ ప్రశ్నకు, 

సాంఖ్యయోగం చివరి వరకూ శ్రీకృష్ణ భగవానుడు సవివరముగ సమాధానం ఇచ్చాడు. 


మనస్సు లోని కోరికలను పూర్తిగా పాలద్రోలి, నిర్మలచిత్తంతో ఆత్మ యందే స్థిరంగా ఉండి సంతుష్టి పొందే స్థితిని, 

స్థితప్రఙ్ఞత్వం అని అంటారు. 


అట్టి స్థితిని చేరుకున్న సిద్ధుని ప్రతీ చర్యలో పవిత్రత, శాంతి, దైవత్వం గోచరిస్తుంది.


అట్టి సిద్ధుని ముఖం ఎల్లప్పుడూ తృప్తి, ఆనందంతో తాండవిస్తుంది.


అతని హృదయం నిత్యం బ్రహ్మానందసాగరంలో తేలియాడూతూ ఉంటుంది.


మనోవికారాలైన రాగభయక్రోధాదులు అతని దరిచేరవు.


శరీరధారులు కనుక, 

కొన్ని భౌతికావసరాలకు తప్ప ఏ వస్తువులు యందు ప్రత్యేకమైన కోరిక గాని, 

అమిత ఇష్టంగాని కలిగి ఉండరు.


సిద్ధులైన మహాపురుషుల దర్శనం వలన కలిగే పుణ్యఫలమును గురించి ఒక చిన్న కథ ఉంది.


ఒకసారి నారదుడు శ్రీమహావిష్ణువును 

”సాధుదర్శనం” 

వలన కలిగే ఫలం ఏమిటి? 

అని ప్రశ్నించాడు. 


దానికి విష్ణువు “నారదా! భూలోకంలో ఇప్పుడే ఒక పేడపురుగు జన్మించింది.

వెళ్ళి దానిని అడుగు. 

నీ ప్రశ్నకు జవాబు లభిస్తుంది”

అన్నాడు.


నారదుడు పేడపురుగు వద్దకు పోయి 

సాధుదర్శనం వలన కలిగే ఫలము ఏమిటి?

అని ప్రశ్నించాడు. 

వెంటనే ఆ పేడపురుగు మరణించింది. 

నారదుడు కంగారుపడి విష్ణువుకు జరిగినదంతా చెప్పాడు.


విష్ణువు 

“నారదా ! భూలోకంలో ఒక గోవు ప్రసవిస్తున్నది. 

వెళ్ళి ఆ ఆవుదూడను ఇదే ప్రశ్నను అడుగు” 

అని పంపాడు. 

నారదుడు తిరిగి భూలోకం వచ్చి, అప్పుడే ప్రసవించిన లేగదూడను తిరిగి ప్రశ్నించాడు. 

ఆ లేగదూడ ప్రశ్న విన్న వెంటనే మరణించింది. 


నారదుడు తనకు గోహత్యా పాపం కలిగింది అని చింతించి,

మళ్ళీ విష్ణువు వద్దకు వెళ్ళి జరిగినది అంతా వివరించాడు. 

వెంటనే, 

శ్రీమహావిష్ణువు,

ఈసారి భూలోకంలో, 

ఫలానా రాజుగారి భార్య ఇప్పుడే ప్రసవించింది.

మగబిడ్డ పుట్టాడు. 

ఆ బిడ్డ ను ఈ ప్రశ్న వెయ్యి, నీకు సమాధానం దొరుకుతుంది. 

అని చెప్పాడు. 


నారదుడు సందేహించి, 

శ్రీమన్నారాయణ! 

ఇప్పటికే నా వలన రెండు మరణాలు జరిగాయని వ్యాకుల పడుతున్నాను. 

నీ మాయ నాకు అర్థం కాకుండా ఉంది. 

మరోసారి నీవు చెప్పినట్లు చెయ్యటానికి ధైర్యం సరిపోవడంలేదు,

నన్ను అనుగ్రహించు తండ్రి ! 

అని ప్రార్థించాడు.


శ్రీమహావిష్ణువు నవ్వి 

ఈ సారి నీ ప్రశ్నకు తప్పక జవాబు లభిస్తుంది. పోయిరమ్ము, 

అని పంపాడు. 


నారదుడు భూలోకానికి తిరిగి వచ్చి అప్పుడే ప్రసవించిన రాకుమారుని, 

సిద్ధపురుషులు దర్శనఫలం ఏమిటి? 

అని ప్రశ్నించాడు. 


వెంటనే ఆ రాకుమారుడు నారదునికి నమస్కరించి, 


మహాత్మా! మీ ప్రశ్నకు, 

నా జీవితమే జవాబు! 

నేను ముందు పేడపురుగుగా జన్మించినప్పుడు, 

మీ దర్శనభాగ్యం వలన ఆవుదూడగా ఉత్తమజన్మ లభించింది. 

తిరిగి మీ దర్శనం వల్లనే ఉత్తమోత్తమైన ఈ మానవజన్మ లభించింది. 

అని జవాబు ఇచ్చాడు.


కాబట్టి, సిద్ధపురుషుల దర్శనం వలన లభించే పుణ్యఫలం ఎంతని చెప్పగలం?


సాధూనాం దర్శనం పుణ్యం,

స్పర్శనం పాప నాశనం

సంభాషణం కోటితీర్థం,

వందనం మోక్ష సాధనం II


సాధువులు అయిన ఙ్ఞానులను దర్శించటం వల్ల పుణ్యం, 

పాదస్పర్శతో పాపనాశనం,

సంభాషించటం వలన అన్ని పుణ్యతీర్థాలలో స్నానము ఆచరించటం వలన కలిగే పుణ్యఫలం, 

నమస్కారం చెయ్యడం మోక్షదాయకమని, 

భాగవతం లో చెప్పబడింది. 


ఏ ప్రదేశాలలో సిద్ధపురుషులు ఆశ్రమాలు నిర్మించుకుంటారో, 

అక్కడి ప్రజలు ఆ సిద్ధుల సాంగత్యంతో, 

పునీతులు అవుతూ ఉంటారు.


ఆత్మఙ్ఞానం పెంపొందించుకునే వాతావరణం సిద్ధపురుషుల ఆశ్రమాలలో లభించగలదు. 


అట్టి మహాపురుషుల ఉనికి అన్నిరకాల తాపత్రయాలను పారద్రోలి, 

శాశ్వతమైన ఆధ్యాత్మిక శాంతిని చేకూర్చుతుంది. 


నిరంతరం సంసార వ్యామోహంలో కొట్టుమిట్టాడే నేటి ప్రజలు, 

అట్టి మహాపురుషుల సాంగత్యం కొరకై తరచూ ప్రయత్నం చేయుట వలన శాంతి సౌఖ్యాలను పొందగలరు. 


పలు సిద్ధపురుషుల జీవితచరిత్రలు దీనికి ఉదాహరణలు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

కామెంట్‌లు లేవు: