2, నవంబర్ 2020, సోమవారం

- దుర్గా సప్తశతి

 *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 2  / Sri Devi Mahatyam - Durga Saptasati - 2 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


అధ్యాయము 1

*🌻. మధు కైటభుల వధ వర్ణనము - 2 🌻*


అతణ్ణి ఇలా ప్రశ్నించాడు : నీవు ఎవరు? ఇక్కడికి రావడానికి కారణము ఏమిటి? శోకగ్రస్తునిలా, ఖిన్నునిలా, కానిపిస్తున్నావెందుకు? సస్నేహంగా పలుకబడ్డ ఈ రాజవాక్యాలను విని వైశ్యుడు వినయపూర్వకంగా (శిరస్సు) వంచి రాజుకు ఇలా బదులిచ్చాడు. (18-19)


వైశ్యుడు పలికెను : నేను సమాధి అనే పేరుగల వైశ్యుణ్ణి, ధనికుల ఇంట జన్మించాను. ధనంపై దురాశతో అసాధువృత్తిని అవలంబించి నా భార్యాపుత్తులు నన్ను విడనాడి, నా ధనాన్ని అపహరించి, నన్ను తరిమేసారు. 


భార్యాపుత్తులను ధనాన్ని కోల్పోయి, ఆప్త బంధువులచే విడనాడబడి దుఃఖీ పహతుడనై నేను ఈ అడవికి వచ్చాను. ఇక్కడ ఉండటం వల్ల నా స్వజనుల, భార్యాపుత్రుల కుశలాకుశలాలు నాకేమీ తెలియడంలేదు. (20-23)


ఇంటివద్ద వారిప్పుడు క్షేమంగా ఉన్నారా, క్షేమాన్ని కోల్పోయి దుర్దశను అనుభవిస్తున్నారా? వారిప్పుడు ఎలా ఉన్నారు? నా సుతులు సత్ప్రవర్తనులై ఉన్నారా? దుష్ప్రవర్తనులై ఉన్నారా? (25)


రాజు పలికెను : లోభంతో నీ ధనాన్నపహరించి నిన్ను నిరసించిన నీ

పుత్త దారాదులయెడల నీ మనస్సు ఎలా స్నేహబంధం కలిగి ఉంది?

వైశ్యుడు పలికెను : మీరు ఇప్పుడు ఎలా పలికారో అలాగే, ఆ భావమే, నాకు కూడా స్ఫురించింది. నేను ఏం చేయగలను? నా మనస్సు కాఠిన్యం వహింపకుంది. ధనంపై పేరాసతో తండ్రిపై నెయ్యాన్ని, స్వజనంపై ప్రేమను, పూర్తిగా విడనాడి భర్తయైన నన్ను వెళ్ళగొట్టిన వారిపైనే అది గాఢానురాగము కలిగి ఉంది. (26–31)


నాకిది తెలిసినా, ఇది దోషమని గ్రహించలేకున్నాను, ఉదార చిత్తుడవైన ఓ రాజా! బంధువులు దుర్గుణులైనా చిత్తం వారిపై ప్రేమాయత్తమై ఉంటోందే, ఏం చిత్రం! వారికై నేను నిట్టూర్పులు విడుస్తూ భేదం పొందుతున్నాను. ఆ అప్రీతిపరులపై నా మనస్సు నిష్ఠురత పూనకుంది. నేను ఏం చేయగలను? (32–34)


మార్కండేయుడు పలికెను : ఓ విప్రా ! అంతట సమాధి అనే ఆ వైశ్యుడూ, సురథుడు అనే ఆ రాజసత్తముడూ కలసి మేధసముని వద్దకు వచ్చి సముచిత మర్యాదలొనరించి, కూర్చొని అనేక విషయాలను గూర్చి (ఆయనతో) ప్రసంగించారు. (35–38)


సశేషం...

🌹 🌹 🌹 🌹

కామెంట్‌లు లేవు: