6, ఫిబ్రవరి 2021, శనివారం

శీఘ్ర ద‌ర్శ‌నం టిక్కెట్లు

 ఆర్టీసీ బ‌స్సుల్లో శీఘ్ర ద‌ర్శ‌నం టిక్కెట్లు

* ఛార్జీపై అద‌నంగా రూ.300 చెల్లించి టిక్కెట్లు బ‌స్సుల్లోనే పొందే వీలు

* శ్రీవారి భ‌క్తుల‌కు అమూల్య‌మైన అవ‌కాశం క‌ల్పించిన తితిదే

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో తిరుమల వెళ్ళి దైవ దర్శనం చేసుకునే ప్రయాణికుల సౌకర్యార్థం, ప్రతి రోజు ఆయా బస్సుల్లో 1000 దైవ దర్శనం టికెట్లు అందుబాటులోకి వచ్చాయ‌ని ఏపిఎస్ ఆర్టీసీ వైస్ ఛైర్మ‌న్ అండ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఆర్పీ ఠాకూర్ గురువారం విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఏపిఎస్ ఆర్టీసీ బస్సుల్లో తిరుమల వెళ్లే ప్రయాణికులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అమూల్యమైన ఈ అవకాశం కల్పించారు. ఆర్టీసీ బస్సుల్లో తిరుపతి వెళ్ళు ప్రయాణికులు ఛార్జీతో పాటు రూ.300 అదనంగా చెల్లించి బస్సులోనే శీఘ్ర దర్శనం టికెట్టును పొందవచ్చు. ప్రతి రోజు ఉదయం 11 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ఈ శీఘ్ర దర్శనం ఏర్పాటు చేసింది. తిరుమల బస్‌స్టేషన్ చేరుకున్న అనంత‌రం శీఘ్ర దర్శనం చేసుకునేందుకు ప్రయాణికులకు ఆర్టీసీ సూపర్ వైజర్లు సహాయ‌స‌హ‌కారాలు అందిస్తారు. ఈ క్ర‌మంలో తిరుపతి వెళ్లే ప్రయాణికులు ముందుగా ఆర్టీసీ బస్సుల్లో శీఘ్ర దర్శనం టికెట్టును పొంద‌ అవకాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆర్టీసీ అధికారులు కోరారు.

*( ప్రజా రవాణా విభాగం గ్రూప్ సమాచారం)*

 ప్రతి రోజు తిరుపతికి ఆర్టీసీ సంస్థ 650 బస్సులు నడుపుతుంది. ప్రతి డిపో నుండి తిరుపతికి బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. బెంగుళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ మొదలైన నగరాల నుండి దైవ దర్శనం కోసం విచ్చేసే ప్రయాణికులకు ఇది చాలా మంచి సౌకర్యంగా ఉంటుంది. ఈ సంద‌ర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఈ సదవకాశం కల్పించిన తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ కే.ఎస్.జవహార్‌రెడ్డికి ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

కామెంట్‌లు లేవు: