24, నవంబర్ 2023, శుక్రవారం

క్షీరాబ్ధి ద్వాదశి

 🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

*క్షీరాబ్ధి ద్వాదశి (చిల్కు ద్వాదశి)*

🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔



క్షీరాబ్ధి ద్వాదశి (చిల్కు ద్వాదశి) ...రేపే ఈ పర్వదినం 

కార్తీక మాసము అత్యంత పవిత్రమైంది. మహిమాన్వితమైంది. శివ కేశవులకి ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో ప్రతిరోజూ పర్వదినమే! అయితే ఈ కార్తీక మాసంలో క్షీరాబ్ధి ద్వాదశి (చిలుకు ద్వాదశి) అత్యంత పవిత్రమైంది. 

కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కృతయుగంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని ప్రారంభం చేసిన రోజు కనుక ఈ రోజును" క్షీరాబ్ధి ద్వాదశి "అని పిలుస్తారు. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరమథనం ప్రారంభించినది ఈరోజే. అందుకే ఈ రోజుకి" మధన ద్వాదశి" అని, అమృతం కోసం సాగరాన్ని మందర పర్వతంతో చిలికారు. కనుక చిలుకు ద్వాదశి అని అంటారు. ఈ రోజునే "దామోదరద్వాదశి", "యోగీశ్వరద్వాదశి "అని కూడా అంటారు. 


"ఉత్థానైకాదశి" అంటే శ్రీ మహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషుని పాన్పుపైన ఆషాడ శుద్ధ ఏకాదశినాడు తన యోగనిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశినాడు కనులు విప్పి యోగ నిద్ర నుండి మేల్కొన్న రోజుకే "ఉత్థాన ఏకాదశి "అనే పేరు. ఉత్థాన ఏకాదశి( రేపు) నాడు శ్రీమహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొని బ్రహ్మతో కలసి తన ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలోకి ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు. అందుచేతనే తులసి మొక్క వద్ద క్షీరాబ్ధి ద్వాదశి నాడు దీపములు వెలిగించి పూజలను జరపడం అనాదిగా వస్తున్న ఆచారం. కనుక స్త్రీలు ఈ రోజు వారి సౌభాగ్య సంపదల కోసం తులసీ ధాత్రి (తులసికోట) దగ్గర విశేష దీపారాధనలు చేసి షోడశోపచారాలతో తులసీధాత్రి లక్ష్మీనారాయణులను పూజిస్తారు. 


ఈ రోజున తులసి మొక్క వద్ద శ్రీమహావిష్ణువు స్వరూపంగా ఉసిరి మొక్కను ఉంచి పూజలు చేస్తారు. ముఖ్యంగా చాలామంది చేసే పెద్దపొరపాటు ఉసిరి చెట్టులేదని బజార్లలో అమ్మే ఉసిరి కొమ్మలను తీసుకొని వెళ్లి తులసి వద్ద పెట్టి పూజ చేస్తుంటారు. అది శాస్త్ర విరుద్ధం. ఉసిరి చెట్టు వద్దనే పూజ చేసుకోవడం లేదా నర్సరీ (చెట్టు పెంచే)వద్ద చిన్న కుండీల్లో ఉసిరి చెట్టును తెచ్చుకునైనా పూజచేసుకుంటే మంచిది. కార్తీకమాసంలో ఎట్టిపరిస్థితుల్లో ఉసిరి చెట్టు కొమ్మలను విరవడం, నరకడం వంటి పనులు చేయకూడదని శాస్త్రవచనం. క్షీరసాగర మధనములో జన్మించిన తేజోభరితమైన అమృతకలశహస్తయై సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీమహావిష్ణువు దేవ దానవ సమక్షములో వివాహమాడుతాడు . అందుకనే కొన్ని ప్రాంతాలలో ఆచారమును బట్టి శ్రీ మహాలక్ష్మికి, శ్రీమన్నారాయుణునికీ వివాహము చేసెదరు. 


బృందా దేవి శాపము వల్ల లోకానికి మహోపకారం జరిగి శ్రీమహావిష్ణువు సాలగ్రామ రూపమును ధరించినది .ఈ మహోత్కృష్టమైన రోజే ఈ కార్తీక శుద్ధ ద్వాదశి.

క్షీరాబ్ధి ద్వాదశి నాడు శివకేశవ అభేదంగా ఉదయం శ్రీమహావిష్ణువును కార్తీక దామోదరునిగా భావించి పూజలను చేసి, సాయంత్రం తులసి, ఉసిరి మొక్కలకు సభక్తి పూర్వకంగా పూజలనుచేసి సాలగ్రామ, దీపదానములను చేయుటవల్ల గత జన్మలలో చేసిన పాపరాశి ధ్వంసం అవుతుందని ప్రతీతి.

కామెంట్‌లు లేవు: