9, ఆగస్టు 2020, ఆదివారం

*రంగమహల్, బృందావనం*



ఉత్తర ప్రదేశ్‌లోని మథుర బృందావనాలు అణువణువునా కృష్ణ భక్తిరసంతో నిండి ఉంటాయి.
ఇప్పటికీ బృందావనంలోని "నిధి వనంలో" ప్రతి రోజు రాత్రి వేళల్లో శ్రీకృష్ణుడు గోపికలతో రాసలీల జరుపుతారు, అలాగే నిధివనంలోనే ఉన్న "రంగ మహల్" అనే ఆలయంలో రాత్రికి రాధమ్మతో విశ్రమిస్తారు.

ఈ రంగమహల్‌లో రాధాకృష్ణులకోసం అనుదినం సాయంత్రం శయ్య (మంచం) పై దుప్పటి సర్ది, పక్కనే లడ్డూ మిఠాయిలు, తాంబూలాలు, త్రాగడానికి మంచినీరు పెట్టి మందిరానికి తాళం వేసి వెళతారు.

మర్నాడు ఉదయన్నే పూజారిగారు వచ్చి రంగ మహల్ తాళంతీసి తలుపులు తెరిచే సరికి మంచంమీది బట్టలు చిందరవందరగా ఉంటాయి, అలాగే కొంత తిని వదిలేసిన లడ్డూ మిఠాయిలు, తాంబూలాలు, కొన్ని త్రాగి వదిలిపెట్టిన మంచినీరు దర్శనమిస్తాయి...

(ఇక్కడ పెట్టిన వీడియోలో పూజారిగారు పైన చెప్పిన వాటినే చూపిస్తున్నారు, దర్శించి తరించండి)

ఆ ఫ్రభాత సమయంలో అక్కడ ఉన్న భాగ్యవంతులైన భక్తులకు అవన్నీ ప్రసాదంగా లభిస్తాయి...

రాధాకృష్ణుల అనుగ్రహముతో ఇప్పటికీ ఇవన్నీ ఇలాగే జరుగుతున్నాయి... సతతం అలాగే జరపాలని రాధాకృష్ణుల దివ్య చరణాలకు ప్రణమిల్లి ప్రార్థిస్తున్నాను.

బృందావనంలోని నిధివనంలో సాయం సంధ్యా సమయం వరకే భక్తులకు అనుమతి, ఆ తర్వాత అక్కడ ఎవరూ (ఏ జీవులు) ఉండడానికి వీల్లేదు, ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మానవమాత్రులనైతే నిలువరించగలం, కానీ పశుపక్ష్యాదులను ఎవరాపగలరు, కానీ అవి (కోతులు, పక్షులు) కూడా భగవత్ స్ఫురణతో సంధ్యా సమయానికి అక్కడి నుండి నిష్క్రమిస్తాయి.

అక్కడ పగలు అసంఖ్యాకంగా కోతుల గుంపులు తిరుగుతుంటాయి, ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా చేతిలోని వస్తువులు, ముఖ్యంగా కళ్ళజోడు లాక్కెళతాయి, అక్కడి వాళ్ళు లోపలికి వెళ్ళే ముందే కళ్ళజోడు జాగ్రత్త అని చెబుతారు.

అలాంటి కోతులు పక్షులు అన్నీ కూడా సాయంత్రం చీకటి పడే వేళకి కనబడకుండా ఎక్కడికో పోతాయి మళ్ళీ ఉదయాన్నే ప్రత్యక్షమవుతాయి.

రాత్రి అక్కడ ఏ జరుగుతుందో చూద్దామని రహస్యంగా నిధివనంలోనే దాగి ఉండి చాటుగా గమనించే ప్రయత్నిం చేసిన వారిలో కొందరు మృత్యువాత పడితే ఇంకొందరు మతిస్థిమితం కోల్పోయారు, ఓసారి ఒకరు ఇలాగే చేసి దృష్టి మరియు మాట కోల్పోయి ఉదయాన్నే అందరూ గుమిగూడగానే తాను చూసింది వ్రాయడానికి పెన్ను పేపరు తెమ్మని సైగ చేసి దానిపై వ్రాసి ప్రాణాలు వదిలేసాడు.

గురుకృపతో రాధాకృష్ణుల అనుగ్రహముతో స్వయంగా నిధివనంలో రంగ మహల్ మందిరం, రాసలీల జరిగే చోటు ఇంకా ఎన్నో దర్శించే భాగ్యం కలిగింది.

అలాగే నియమాన్ని ఉల్లంఘించి అసువులు బాసిన కొందరి సమాధులను (నిధివనంలోనే) కూడా చూడడం జరిగింది.

బృందావనంలోని నేలను మట్టి అని గాని, విష్ణు పదం నుండి భువికి దిగిన గంగను జలమని గాని, పూరి జగన్నాథ్‌లో ప్రసాదాన్ని అన్నమని గాని మరియు గురువును మానవుడని గాని భావిస్తే అది మహాపాపమని శాస్త్ర వచనం...

కామెంట్‌లు లేవు: