9, ఆగస్టు 2020, ఆదివారం

శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం,


శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం, నెమలి,కృష్ణాజిల్లా.

గంపలగూడెం మండలంలోని నెమలి గ్రామంలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం, జిల్లాలోనే ప్రముఖ పుణ్య క్షేత్రంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయంలోని వేణుగోపాలుడు మహిమాన్వితుడుగా విశ్వసిస్తున్నారు. అందువలన ఇక్కడికి విశేష సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.

మానసిక ప్రశాంతత లేనివారు, అంతుచిక్కని వ్యాధుల బారిన పడినవారు, సంతానలేమితో బాధపడేవారు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో గణాచారి వ్యవస్థ కనిపిస్తుంది. అరోగ్య పరమైన సమస్యలకి గల కారణాలను, పరిష్కార మార్గాల గురించి భక్తులు వారి ద్వారా తెలుసుకుని, స్వామివారి దర్శనం చేసుకుని వెళుతూ వుంటారు.

ఆలయచరిత్ర
ఇక్కడ వేణుగోపాలుడు అవతరించిన తీరును తెలిపే స్థానిక కథనం అనుసరించి, 1953 ప్రాంతంలో నెమలి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తికి తన భూమిని అమ్మేశాడు. అదే సంవత్సరంలో, ఆ భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి పొలాన్ని సాగుచేయిస్తుండగా, శ్రీరామనవమిరోజున, శ్రీ వేణుగోపాలస్వామి విగ్రహం బయటపడింది. అయితే స్వామివారి చిటికిన వ్రేలు దెబ్బతినడంతో దానిని సరిచేసి ప్రతిష్ఠకి ఎలాంటి లోపాలు లేకుండా చూసుకున్నారు.

మొదట స్వామివారిని ఓ తాటాకు పందిరిలో వుంచి పూజలు నిర్వహిస్తూ వుండేవారు. ఆ తరువాత గ్రామస్తులంతా కలిసి విరాళాలు వేసుకుని దేవాలయాన్ని నిర్మించారు. 1957లో రథసప్తమినాడు, ఈ నూతన ఆలయంలో స్వామివారి మూలవిరాట్టును ప్రతిష్ఠించారు. కాలక్రమంలో ఆలయాన్ని అభివృద్ధి పరుస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో రాజగోపురం, కళ్యాణ మంటపం, అద్దాల మంటపం, అన్నదాన సత్రం, రథశాల, కల్యాణకట్ట మొదలైనవి రూపుదిద్దుకున్నాయి. ఆలయ అభివృద్ధితో పాటు స్వామివారి మహిమలు కూడా వెలుగు చూశాయి.

ప్రత్యేక పూజలు
సోమవారం, శుక్రవారంల్లో ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ప్రతి యేట ఫాల్గుణ మాసంలో ఆరు రోజుల పాటు రుక్మిణీ - సత్యభామ సమేతుడైన స్వామికి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ వైభవాన్ని తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తుంటారు. భక్తులు తమకి తోచిన రీతిలో స్వామివారికి కానుకలు ముడుపులు సమర్పించుకుంటూ వుంటారు.

బ్రహ్మోత్సవాలు
ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రతి సంవత్సరం, ఫాల్గుణ మాసంలో, ఆరురోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించెదరు. ఈ కార్యక్రమానికి కృష్ణా, ఖమ్మం జిల్లాల నుడియేగాక, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుండి, లక్షలాది మంది భక్తులు తరలివచ్చెదరు

సర్వేజనా సుఖినోభవంతు
🙏😊

కామెంట్‌లు లేవు: