12, నవంబర్ 2024, మంగళవారం

కార్తీక పురాణం - 11

 _*కార్తీక పురాణం - 11వ అధ్యాయము..!!*_

🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅


చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు కార్తీకం కావున దీనిని కార్తీక మాసముగా పిలుస్తారు. కార్తీక మాసము అత్యంత పవిత్రమైంది. మహిమాన్వితమైంది. శివ కేశవులకి ప్రీతికరమైన మాసం.

ఈ మాసంలో ప్రతిరోజూ పర్వదినమే! అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పర్వదినాలు మరింత ఫలప్రదమైనవి. అవే భగినీ హస్తభోజనం, నాగులచవితి, నాగపంచమి, ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ధి ద్వాదశి, కార్తీక పౌర్ణమి మొదలైనవి.


అయితే ఏ తిథిన ఏమి చేస్తే మంచిదో తెలుసుకుని దానిక ప్రకారం ఆచరిస్తే మరిన్ని ఉన్నత ఫలితాలు కలుగుతాయి కార్తీక మాసమంతా కార్తీక పురాణం 30 అధ్యాయాల్లో రోజుకో అధ్యాయం పారాయణం చేయడం శుభప్రదం. కార్తీక మాస మహత్యాన్ని మొదటగా వశిష్ట మహర్షి జనక మహరాజునకు వివరించగా శౌనకాది మునులకు సూతుడు మరింత వివరంగా చెప్పాడు.


*కార్తీకపురాణం - 11వ అధ్యాయం*

*మంథరుడు - పురాణ మహిమ*

*అంతటా వశిష్టుడు ఇలా ఆరంభించారు.*


”ఓ జనక మహారాజా! ఈ కార్తిక మాస వ్రతం మహత్యాన్ని గురించి ఎన్నో ఉదాహరణలు చెప్పాను. ఇంకా దీని గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. ఈ నెలలో విష్ణుదేవుడిని అవిసె పూలతో పూజించినట్లయితే.. చాంద్రాయణ వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది.


విష్ణు అర్చన తర్వాత పురాణ పఠనం చేసినా, చేయించినా, విన్నా, వినిపించినా… అలాంటి వారు వైకుంఠాన్ని పొందుతారు. దీన్ని గురించిన మరో ఇతిహాసాన్ని చెబుతాను. సావధానంగా విను… అని ఇలా చెప్పసాగారు…పూర్వము కళింగ రాజ్యంలో మంధరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఇతరుల ఇళ్లలో వంటలు చేస్తూ, అక్కడే భోజనం చేస్తూ, మద్యమాంసాలను సేవిస్తూ… తక్కువ జాతి సాంగత్యంలో గడపసాగాడు.


ఆ కారణంగా స్నాన, జప, దీపారాధనలను పాటించకుండా, దురాచారుడిగా తయారయ్యాడు.

అయితే… ఆయన భార్య మహా సాధ్వి, గుణవంతురాలు, శాంత వంతురాలు, భర్త ఎంతటి దుర్మార్గుడైనా, పతియే ప్రత్యక్ష దైవమనే ధర్మాన్ని పాటించేది. విసుగు చెందక సకల ఉపచారాలు చేసేది. పతివ్రతాధర్మాన్ని నిర్వర్తిస్తుండేది.


మంథరుడు ఇతరుల ఇళ్లలో వంటలు చేస్తూ, ఆదాయం సరిపోక వర్తకం కూడా చేయసాగాడు. అఖరికి దానివల్ల కూడా పొట్టగడవకపోవడంతో దొగతనాలు చేయడం ఆరంభించాడు. దారికాచి బాటసారుల్ని బెదిరించి, వారిదగ్గర ఉన్న ధనం, వస్తువులను అపహరించి జీవించసాగాడు.

ఒక రోజు ఒక బ్రాహ్మణుడు అడవిదారిలో పోతుండగా… అతన్ని భయపెట్టి, కొంత ధనాన్ని అపహరించాడు. ఆ సమయంలో ఇద్దరిమధ్యా ముష్టియుద్ధం జరిగింది. అంతలో అక్కడకు ఇంకో కిరాతకుడు వచ్చి, ధనాశతో వారిద్దరినీ చంపేసి, ధనాన్ని తీసుకెళ్లాడు.


అంతలో అక్కడ ఒక గుహ నుంచి పులి గాండ్రించుకుంటూ కిరాతకుడి పైన పడింది. కిరాతకుడు దాన్ని కూడా వధించాడు. అయితే పులి చావడానికి ముందు పంజాతో బలంగా కొట్టిన దెబ్బ ప్రభావం వల్ల కొంతసేపటికి తీవ్ర రక్తస్రావంతో అతనుకూడా చనిపోయాడు.

కొద్దిక్షణాల వ్యవధిలో చనిపోయిన బ్రాహ్మడు, మంథరుడు,కిరాతకుడు నరకానికి వెళ్లారు. హత్యల కారణంగా వారంతా నరకంలో నానావిధాలైన శిక్షలను అనుభవించారు.మంధరుడు చనిపోయిన రోజు నుంచి అతని భార్య నిత్యం హరినామ స్మరణం చేస్తూ సదాచారవర్తినిగా భర్తను తలచుకుంటూ కాలం గడిపింది. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక రుషి రాగా…


ఆమె గౌరవంగా అర్ఘ్యపాద్యాలను పూజించి ”స్వామీ! నేను దీనురాలను, నాకు భర్తగానీ, సంతతిగానీ లేదు. నేను సదా హరి నామాన్ని స్మరిస్తూ జీవిస్తున్నాను. నాకు మోక్షం లభించే మార్గం చూపండి” అని ప్రార్థించింది.

ఆమె వినమ్రత, ఆచారాలకు సంతసించిన ఆ రుషి ”అమ్మా… ఈరోజు కార్తీక పౌర్ణమి. చాలా పవిత్రమైనది. ఈ రోజును వృథా చేయకు. ఈ రాత్రి దేవాలయంలో పురాణాలు చదువుతారు.నేను చమురుతీసుకుని వస్తాను. నువ్వు ప్రమిదలు, వత్తులు తీసుకుని రా. దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలితాన్ని నీవు అందుకుంటావు” అని చెప్పారు.


దానికి ఆమె సంతసించి, వెంటనే దేవాలయానికి వెళ్లి శుభ్రం చేసి, గోమయంతో అలికి, ముగ్గులు పెట్టి, తానే స్వయంగా వత్తి చేసి, రెండు వత్తులు వేసి, రుషి తెచ్చిననూనెను ప్రమిదలో పోసి, దీపారాధన చేసింది.


ఆ తర్వాత ఇంటికి వెళ్లి తనకు కనిపించిన వారిని ”ఈ రోజు ఆలయంలో జరిగే పురాణ పఠనానికి తప్పకుండా రావాలి” అని ఆహ్వానించింది. ఆమె కూడా రాత్రి పురాణం విన్నది. ఆ తర్వాత కొంతకాలం విష్ణునామస్మరణతో జీవించి, మరణించింది. ఆమె పుణ్యాత్మురాలవ్వడం వల్ల విష్ణుదూతలు వచ్చి విమాన మెక్కించి వైకుంఠానికి తీసుకెళ్లారు. అయితే ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వల్ల కొంచెం దోషం కలిగింది. కొద్ది నిమిషాలు నరకంలో గడపాల్సి వచ్చింది. దీంతో మార్గమధ్యంలో యమలోకానికి తీసుకెళ్లారు. అక్కడ నరకంలో మరో ముగ్గురితో కలిసి బాధపడుతున్న భర్తను చూసి ఒక్క క్షణం దు:ఖించింది.


విష్ణుదూతలతో ”ఓ విష్ణు దూతలారా! నా భర్త, ఆయనతో పాటు మరో ముగ్గురు నరకబాధలు అనుభవిస్తున్నారు. వారిని ఉద్దరించడమెలా?” అని కోరగా… విష్ణుదూతలు ఇలా చెబుతున్నారు..


”అమ్మా.. నీ భర్త బ్రాహ్మణుడై కూడా స్నానసంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. రెండోవ్యక్తి కూడా బ్రాహ్మనుడే అయినా… ధనాశతో ప్రాణమిత్రుడిని చంపి ధనం అపహరించాడు. మూడో వాడు పులిజన్మను పూర్తిచేసు కున్నవాడు కాగా… నాలుగో కిరాతకుడు. అతను అంతకు ముందు జన్మలో బ్రాహ్మణుడే” అని చెప్పారు. అతను అనేక అత్యాచారాలు చేసి, ద్వాదశిరోజున మధుమాంసాలను భక్షించి పాతకుడయ్యాడు. అందుకే వీరంతా నరకబాధలు పడుతున్నారని చెప్పారు.


విష్ణుదూతలు చెప్పినది విని ఆమె దు:ఖించి ”ఓ పుణ్యాత్ములారా! నా భర్తతోపాటు మిగతా ముగ్గురిని కూడా ఉద్దరించే మార్గముందా?” అని ప్రార్థించింది. దీంతో విష్ణు దూతలు ”అమ్మా! కార్తీక శుద్ధ పౌర్ణమినాడు నీవు వత్తి చేసిన పుణ్యఫలాన్ని ధారపోస్తే వారు నరక బాధల నుంచి విముక్తులవు తారు” అని చెప్పారు. దీంతో ఆమె అదేవిధంగా తన పుణ్యఫలాన్ని ధారపోసింది.దీంతో వారంతా ఆమెతో కలిసి మిగతా నలుగురూ వైకుంఠానికి విమానమెక్కి విష్ణుదూతలతో బయలుదేరారు.


”ఓ జనక మహారాజా! చూశావా? కార్తీకమాసంలో పురాణాలు వినడం, దీపం వెలిగించడం వంటి ఫలితాలు ఎంతటి పుణ్యాన్నిస్తాయో?” అని వశిష్టులు మహారాజుకు చెప్పారు.


ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్య మందలి పదకొండొవ అధ్యాయము పదకొండొవ రోజు పారాయణము సమాప్తము..స్వస్తి..

🍏🍏🍏🍏🍏🍏🍏🍏🍏🍏🍏🍏

ఇక్కడివి ఇక్కడే

ఇక్కడివి ఇక్కడే  

నీవు ఏదైనా పట్టణానికి ఏదైనా పనిమీద వెల్లవనుకో అక్కడ రాత్రి బసచేయవలసి వస్తే ఒక గదిని ఏదైనా వసతిగృహాల్లో (లాడ్జిలో) తీసుకొని ఆ రాత్రి నిద్రించి మరుసటిరోజు ఉదయమే లేచి మరల నీ దారిననీవు వెళ్ళటం సహజంగా అందరం చేసే పనే. మనం వున్న కొద్దీ గంటలో లేక ఒకటి రెండు రోజులో మాత్రం ఆ గదిలో సంబంధం కలిగి ఉంటాము. మనకు తెలుసు గదిలో చేరిన మొదటి నిముషంలోనే ఈ గదిలో నా అనుబంధం కొన్ని గంటలు మాత్రమే అని. అందుకే మనం ఆ గాడిమీద ఎటువంటి సంబంధం పెంచుకోము, కేవలం నాకు కొన్ని గంటలు ఆశ్రయాన్ని ఇచేదిగానే భావించి అక్కడ ఉంటాము. ఎవరైనా ఆ వసతిగృహం గదిని తన సొంతగాడిగా భావించి అక్కడి వస్తువులపై మమకారాన్ని పెంచుకొని సరిగా లేని వాటిని పునరుద్దించాలని అనుకుంటే వాళ్ళను మనం కేవలం ముర్కులుగా భావిస్తాము. అనుడులకు సందేహం లేదు. ఎందుకంటె మనం ఉండేదే కొద్దీ సమయం ఆ కొద్దీ సమయం ఎలానో ఒకలాగా గడిపితే తెల్లారగానే మన ఊరికి వేళ్ళ వచ్చని భావిస్తాము. సాధారణ మానవుల అందరి భావన ఇలానే ఉంటుంది. ఇక విషయానికి వస్తే సాధక మిత్రమా నీవు నేను అని అనుకోని నీ దేహం నీది కాదు.  కానీ నాది అని అనుకుంటున్నాం. కొన్నిరోజులు ( 70 - 90 సంవత్సరాలు) ఉండిపోయే దానిని శాశ్వితమైనదిగా భావించి ఈ శరీరంతోటి, శరీరానికి సంబందించిన వ్యక్తులతోటి సంబంధాలు పెట్టుకొని వాటినే నిత్యమైనవిగా భావించి మన అమూల్య సమయాన్ని వృధా చేసుకుంటున్నాము. 

ఈ ప్రకృతికి ఒక నియమము వున్నది అది ఏమిటంటే "ఎత్ దృశ్యం తత్ నస్యం" అంటే మన కంటికి కనిపించేది ఏదైనాకానీయండి అన్నీ కూడా కాలగతిలో నశించి పోయేవే. కానీ మనం ఏమి అనుకుంటున్నామంటే నా కళ్ళకు కనిపించే వాటిలో నేను లేను అని అనుకుంటున్నాం. నిజానికి నేను కూడా ఈ ప్రపంచంలో ఒకడిని నేను ఈ ప్రపంచానికి బిన్నంగా లేను అనే భావన ప్రతి సాధకునికి రావాలి. 

ప్రపంచం మొత్తం మూడు సూత్రాలకు లోనై నడుస్తున్నది. అది ఆది మధ్య అంత  అంటే ఈ పాంచభౌతిక ప్రపంచం మొత్తం ఏదో ఒక నిర్దుష్ట కాలంలో ఉద్భవించి ఉంటుంది. తరువాత పరిణతి చెందుతుంది. తరువాత ఒక సమయంలో నశించి పోతుంది. ఇది మన కంటికి కనిపించే ప్రతి దానికి అంటే అది నిర్జీవి కావచ్చు సంజీవి కావచ్చు అన్నిటికి అనువర్తిస్తుంది. ఒక నిర్జీవి అది యెట్లా వర్తిస్తుందో చూద్దాము. ముందుగా ప్రకృతి అంటే దానిని దైవసృష్టి అని కూడా అంటారు. ఒక పర్వతమో లేక ఒక పెద్ద రాయో వున్నదనుకోండి అది కాలాంతరంలో బీటలు వారి పగిలి పోవటం లేక నశించిపోవటం జరుగుతుంది.  పూర్వం మేరుపర్వతము ఉండేదని మనకు పురాణాలలో చెప్పారు. మరి అది ఇప్పుడు ఉన్నదా అంటే సందేహాత్మకమే. ఇక మానవ సృష్టి లేక జీవ సృష్టి. మానవుడు నిత్యం అనేకవస్తువులను తన దైనందిక ఉపయోగాల నిమిత్తం నిర్మిస్తున్నాడు. అవి కూడా కాలాంతరంలో నశించి పోతున్నట్లు మన కళ్ళముందు తెలుస్తున్నది. 

ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బాహ్య ప్రపంచ మొత్తం పాంచబౌతికమైనది. ఈ ఐదు భౌతిక పదార్థాల కలయికే ప్రతిదీ. అది సంజీవి కావచ్చు లేక నిర్జీవి కావచ్చు. కాలాంతరంలో మరల అవి వాటి వాటి రూపాలను కోల్పోయి మరల ఐదు పదార్థాలుగా విడి పోవలసిందే. 

సాధకు ఈ సత్యాన్ని తెలుసుకుంటే ఒక నిజం బయటపడుతుంది. అది ఏమిటంటే తన శరీరం కూడా ఈ ప్రపంచంలోంచి ఉద్బవించిందని దానికి ఒక అంతదశ మరణం ఉంటుందని అవగతం అవుతుంది. అప్పుడు తానూ వేరు తన శరీరం వేరు అనే స్ఫురణఁ తట్టుతుంది. ఆ క్షణం నుంచే అసలైన వెతుకులాట మొదలవుతుంది. తాను నిత్యుడు కావటానికి ఏమి చేయాలనే తపన. అదే సాధకుని ముముక్షత్వం వైపు నడిపిస్తుంది. 

ఒక వసతి గృహంలోని గది లాంటిదే తాను వున్నా శరీరం అని సాధకుడు తెలుసుకుని మోక్షార్ధి అయి మోక్షం వైపు అడుగులు వేస్తాడు. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ

108 ప్రాముఖ్యత

 108 ప్రాముఖ్యత ఏమిటి.........!!

మనం ఏదైనా మంత్రం జపించడానికి 108 సంఖ్య ముఖ్యం. అష్తోత్తరాలలో 108 సంఖ్య నామాలతో దేవతలను ఆరాధిస్తాము. ఇందుకు ప్రముఖమైన కారణం 27 నక్షత్రాలు, ప్రతి నక్షత్రానికి 4 పాదాలు = 27 x 4 = 108 అని, ప్రతి మనిషి ఈ 108 నక్షత్ర పాదాలలో ఒకదానిలో పుట్టి ఉంటాడు కావున ఈ సంఖ్యకు అంత ప్రాముఖ్యత అని తెలుసు. కానీ వీటికన్నా మరెన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఈ సంఖ్యతో ముడిపడి ఉన్నాయి. అవేమిటో ఒకసారి చూద్దాము.


ఖగోళ పరంగా

సూర్యునికి, భూమికి ఉన్న దూరం 149.6million kms. ఈ దూరాన్ని  సూర్యుని చుట్టుకొలత 1391000kms  తో భాగిస్తే వచ్చే సంఖ్యా రమారమి 108

అలాగే చంద్రునికి, భూమికి ఉన్న దూరం 38లక్షల కిలోమీటర్లను చంద్రుని చుట్టుకొలత అయిన 3474 kms తో భాగిస్తే వచ్చే సంఖ్య 108

27 నక్షత్రాలు, ప్రతి నక్షత్రానికి 4 పాదాలు = 27 x 4 = 108

12 రాశులు , 9 నక్షత్ర పాదాలు = 12 x 9 = 108


హైందవం ప్రకారం

ముఖ్య శివలింగాలు – 108, అందుకే శైవ మతాలు కూడా 108. 

గౌడియ వైష్ణవంలో బృందావనలో 108 గోపికలను పూజిస్తారు. 

108 వైష్ణవ దివ్య క్షేత్రాలు

కంబోడియాలో ఆంగ్కోర్ వాట్ గుడిలో 108 మంది (అసురులు, దేవతలు) కలిసి సాగరమధనం చేసినట్టు చిత్రింపబడివుంది.

హైందవ భావాలనుండి ప్రేరణ పొందిన బౌద్ధం ప్రకారం పంచేంద్రియాలతో స్పృహ ను కలిపి ఆరు భావాలను, వాటివల్ల కలిగే అంతర్భావాలైన సుఖము, దుఃఖము, స్తిరత్వబుద్ధిని, గుణించి, అవి బాహ్యంగానైనా, ఆంతరంగానైనా భూత భవిష్యద్ వర్తమానాలలో కలిగిన భావనలను గుణిస్తే 6x3x2x3 = 108

ఒక జీవుని ప్రయాణం “పూర్ణమదః పూర్ణమిదం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పుర్ణాత్పూర్ణముదచ్యతే | పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే” ద్వారా ఇన్ఫినిటీ (8) కు చేరుకునే విధానం 108 symbolism.


ఆయుర్వేదం ప్రకారం 108 మర్మ స్థానాలు, శక్తి కేంద్రాలు 

కలారిపయట్టు ప్రకారం ( తరువాత కరాటే గా మారింది) 108 pressure పాయింట్స్

108 డిగ్రీల జ్వరం వచ్చినప్పుడు శరీరంలో ఉన్న అన్ని అవయవాలు చచ్చుబడిపోతాయి.

108 జపం మనస్సును నిర్మలం చేస్తుంది, లోపలున్న భావాలను అణగదోక్కుతుంది.

సంస్కృత భాషలో 54 అక్షరాలు ఉంటాయి. వాటికి శివ, శక్తి తత్త్వాలైన స్త్రీ, పురుష రూపాలుంటాయి. 54x2 = 108

12000 దివ్య సంవత్సరాలు = 43,20,000 మానవ సంవత్సరాలు = బ్రహ్మకు ఒక పగలు = 4000 x 108

108 లో 1 జీవుడిని తెలియచేస్తుంది. 8 జీవుని తత్త్వాలను తెలియ చేస్తుంది. 0 – పరిపూర్ణ భగవత్తత్త్వము. ఈ శరీరాన్ని, జీవుడిని కలిపి నియమించేది పరిపూర్ణ భగవత్తత్త్వము -108.

1+0+8 = 9, చాలా ముఖ్యమైన సంఖ్య. 9 తో ఏది కలిపినా వచ్చిన సంఖ్యలో numberలను కలిపితే చివరకు అదే సంఖ్య వస్తుంది


గణిత పరంగా 

108 ఒక abundant number. అంటే వాటి divisors 1+2+3+4+6+12+18+27+36+54 = 163 > 108

Tetranacci number ( ముందటి నాలుగు fibonacci నమ్బెర్లను కలిపితే వచ్చేది) 0,0,1,1,2,4,8,15,29,56,108

హైపర్factorial 1**1 + 2**2 + 3 **3 = 108

ఒక పెంటగాన్ కోణాలు అన్నీ కలిపితే 108

ఒక refactorable number ( వాటి divisors ఎన్నున్నాయో వాటితో భాగింపపడగలిగేది )

ఇంకా మరెన్నో విశిష్టతలను తనలో ఇముడ్చుకున్న సంఖ్యా


ఇటువంటి వైశిష్ట్యం ఉన్నది కనుకనే మన ఋషులు, ద్రష్టలు ఎప్పుడో 108 సంఖ్య ప్రాముఖ్యతను మనకు నామాలలో, ప్రదక్షిణలలో, జపాలలో విధిగా విధించారు.

పూజారికి దక్షిణ

 పూజారికి దక్షిణ ఇవ్వటం..


ముందుగా దక్షిణ అంటే ఏంటో తెలుసుకుందాము ..దక్షత కలిగిన వారికి సమర్పించుకునేది దక్షిణ ..

ప్రదక్షిణ అనేది మనము మనకుగా భగవంతుడిని ధ్యానిస్తూ భగవంతుడి చుట్టూ తిరుగుతూ ఆయన వైపుగా కదలడము ప్రదక్షిణము,ఆ దక్షత కలిగిన వారు భగవంతుడు మాత్రమే కనుక మనము ప్రదక్షిణము భగవంతుడికి మాత్రమే సమర్పించుకుంటాము.


సమర్పణ ఎందుకు?


సాధారణముగా మనకు ఏ పని చేసి పెట్టినా వారు ఎవరు అయినా వారికి వారి కష్టానికి డబ్బులు లేక వారి కష్టానికి ప్రతిఫలము ఇవ్వడము ధర్మము .ఒకవేళ అలా ఇవ్వకపోతే అది పెద్ద అధర్మం ..

ఇది నేను కాదు, వాల్మీకి రామాయణములో భరతుడు చెప్పిన ధర్మము.ఇప్పుడు పూజారులకు దక్షిణ ఎందుకు ఇవ్వడమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


వేదము అంటేనే దైవము, మానవ నేత్రముకి కనిపించని దైవము మంత్ర రూపములో వేదరాశిలో నిక్షిప్తమయి మనకు వినిపిస్తారు,

మన సాధనకు మార్గము చూపి తనలో మనని తన వైపు నడిపించేదే వేదము. అటువంటి దైవముకి కానీ వేదముకి కానీ వెల కట్టే సొమ్ము ఎంత ?


పూజాదికాలు యజ్ఞ యాగాదులు చేయగలిగే దక్షత కలిగినవారు ఎవరు ?

కేవలము పూజారులే .. పూజారులకు దక్షిణ ఇచ్చేదీ వేదము చదివే దక్షత పొందిన దక్షులు కనుక. వారిలో ఉన్న వేదముకి విలువ, ఆ వేదముకి విలువ కట్టేంత వారము కాదు, ఈ విషయము గ్రహించాలి. వారికి దక్షిణ ఇవ్వడము అంటే మనము ఇవ్వగలిగినంత ఇవ్వడము కానీ 10 రూపాయలో లేక 100 రూపాయలో విలువ కట్టి ఇవ్వడము కానే కాదు. అది తప్పు . గుడిలో పూజ లేక అర్చన లేక హారతి లేక ఇతర ఎటువంటి క్రతువులు చేయించుకున్నా పూజారి గారికి దక్షిణ తప్పకుండా ఇవ్వవలసిందే.నియమం అనరు కానీ ఇది తప్పకుండా పాటించ వలసిన ధర్మం మరియు ఆచారం .. దక్షిణ ఇవ్వకుంటే చేసుకున్న పూజకి పూర్తి ఫలితము ఎలా దక్కుతుంది.. ?


ఇది వాస్తవము మరియు సత్యము. పూజారులకు వారి సంతృప్తి కలిగే దక్షిణ ఇవ్వడము చేత వారు సంతృప్తి చెందడము చేత పొందేవి ఏమిటంటే ?


1) వారి కంఠము, స్వరము , ఊపిరితిత్తులను అనుక్షణమూ నొప్పిస్తూ, అనుగుణముగా లయబద్ధముగా ఉపయోగిస్తూ మంత్రభాగము తప్పు దొర్లకుండా దేవతలను ఆవాహనము చేస్తూ పూజాదికాలు నిర్వహించే వారి కష్టమునకు ప్రతిఫలము, దానికి విలువ ఎంత ఇవ్వగలరో ఊహించి మన ధర్మము కోసము ఇవ్వడము.


2) జీవులను ఉద్ధరించడము దైవ ధర్మము, వేద రూపమున తనను స్మరించి సర్వ మనవాళికి శుభము కలిగించే మనకు మరియు దైవముకు సాధనముగా ఉన్న పూజారులకు వారి సంతృప్తి మేర దక్షిణ ఇస్తే, తన ధర్మము కోసము ఉన్న పూజారి సంతృప్తి చూసి దైవము కూడా సంతృప్తి చెందుతారు. ఏవరికి ఎప్పుడూ ఋణపడి ఉండకూడదు.


3) ఉచితంగా ముహూర్తాలు, జాతకాలు అడగకూడదు.


జ్యోతిష్యునికి,పురోహితునికి ఎప్పుడూ ఋణపడిపోకూడదు.

వారి ద్వారా సేవలను తీసుకున్నప్పుడు తప్పక వారికి దక్షిణ తాంబూలాదులు ఇచ్చి వారిని గౌరవిస్తూ ఉంటే ..

వారి ఆత్మ సంతృప్తి మనకు దీవెనల రూపంలో మంచిని కలుగజేస్తాయి.


🙏 సర్వేజనా సుఖినో భవంతు 🙏

ఉసిరి నిషేధం

 *ఉసిరి నిషేధం ఎందుకు* ?


ఆదివారం & రాత్రిపూట ఉసిరికాయ ఎందుకు తినవద్దంటారో తెలుసా..!


పూర్వం ఇళ్ళలో అందరూ కలిసి భోజనం చేసే సమయంలో భోజనంలోకి ఉసిరియాక పచ్చడి అడిగితే ఆదివారం తినకూడదు అనేవారు.... 

ఎందుకు తినకూడదు అంటే అది అంతే అనే వారు...

ఉసిరికాయ పేరు కూడా మాట్లాడనిచ్చే వారు కాదు...

వారికి కూడా వివరం తెలియక పోయిన సరే తమ తల్లి తండ్రుల నుంచీ వస్తున్న నియమాలని పాటించేవారు...

కానీ ప్రస్తుతం కొందమంది మాత్రమే ఈ నియమాన్ని పాటిస్తున్నారు.... 

అయితే *ఆదివారం ఎందుకు ఉసిరి తినకూడదో అనే సందేహం మాత్రం చాలామంది మెదడుని తొలిచే ప్రశ్న....* 


అందుకే ఆ నియమం లో దాగివున్న అర్ధాన్ని మీ ముందు ఉంచుతున్నాం....

ఆదివారం రోజు, రాత్రి సమయంలో ఉసిరి ఎందుకు తాకకూడదు అంటే.... ఉసిరికాయలో *పుష్కలంగా సి విటమిన్ ఉంటుంది.... ఇది ప్రేగులలోఉండేఆమ్లాన్నిపెంచుతుంది.... దాంతో రాత్రిసమయంలో తిన్న అన్నం సరిగా జీర్ణం కాదు....అజీర్తి చేయడం వలన గుండె మంటగా ఉండటం జరుగుతుంది.... అంతేకాదు ఉసిరి శక్తిని ఉత్పత్తి చేస్తుంది....అందులో ఉండే శక్తి రాత్రి పూట మనల్ని నిద్రపోకుండా చేస్తుంది*


అంతేకాదు రక్త ప్రసరణ వేగంగా ఉండటంతో రాత్రి సమయంలో నిద్ర కూడా సరిగా పట్టక ఇబ్బందులు పడతాము అందుకే రాత్రి సమయంలో ఉసిరిని తినకూడదు అంటారు....

ఉసిరి కాయకి ప్రత్యేకమైన గుణం ఏమిటంటే ఇందులో సూర్య శక్తి దాగి ఉంటుంది...

 *సూర్యుడు రోజైన ఆదివారం నాడు ఉసిరికి మరింత బలం చేకూరుతుంది ... అందుకే ఆదివారం నాడు ఉసిరిని కూడా దూరం పెడుతారు....* 

(ఏకాదశి ఉపవాసం ఉండి మరుసటి రోజు అదే ఫలాని తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.....) 

ఇది సైన్స్ తో కూడిన దివ్య రహస్యం.

ఇక శాస్త్ర ప్రమాణం కూడా చూడండి


శ్లో. *భానువారేదివారాత్రం సప్తమ్యాంచతథాదివా , ధాత్రీఫలంనరస్స్యా ద్యహ్యలక్ష్మీకోభవేత్సదా. వీర్యహానిర్యశోహానిః ప్రజ్ఞాహానిస్తథైవచ. భవేద్యస్మాత్తతోరాత్రౌ ధాత్రీంయత్నేనవర్జయేత్*


ఆదివారంనాడు రాత్రింబగళ్ళు సప్తమినాడుపగటిపూట ఉసిరికపచ్చడి ని తిన్నచో అలక్ష్మీకు డగును కనుక నిషేధము.


పైశ్లోకం ప్రకారం

వీర్యహాని

యశోహాని

ప్రజ్ఞాహాని కూడా పొందుతారు నిషిద్ధ దినాలలో ఉసిరిక తింటే.


🙏🙏🙏

పోలి స్వర్గం కథ*

 🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

         *పోలి స్వర్గం కథ*

🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

*కార్తికమాసం చివరికి రాగానే గుర్తుకువచ్చే కథ ‘పోలిస్వర్గం’.*


*ఇంతకీ ఎవరీ పోలి? ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి? దానిని తల్చుకుంటూ సాగే ఆచారం ఏమిటి? అంటే ఆసక్తికరమైన జవాబులే వినిపిస్తాయి.*


*పోలిస్వర్గం అచ్చంగా తెలుగువారి కథ. కార్తికమాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్నీ సూచించే గాధ.*


*అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్లు ఉండేవారట. వారందరిలోకి చిన్నకోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా, వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం. ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె అహంభావం. అందుకే కార్తికమాసం రాగానే చిన్నకోడలిని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదికి బయల్దేరేది. అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీస్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావల్సిన సామాగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి మరీ బయల్దేరేవారు అత్తగారు.*


*కార్తికమాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనేలేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తిని చేసేది పోలి. దానికి కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేంది. ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు, దాని మీద బుట్టని బోర్లించేంది. ఇలా కార్తికమాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తికమాసం చివరిరోజు కాబట్టి ఆ రోజు కూడా నదీస్నానం చేసి ఘనంగా కార్తికదీపాలను వదిలేందుకు అత్తగారు బయల్దేరింది. వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటిపనులన్నీ అప్పగించి మరీ వెళ్లింది. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటిపనులను చకచకా ముగించేసుకుని కార్తిక దీపాన్ని వెలిగించుకుంది.*


*ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమయినా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చటవేసింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారూ, ఆమె కోడళ్లూ... ఆ విమానాన్ని చూసి, అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి హతాశులయ్యారు. ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లని పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. విమానంలోని దేవదూతలు, పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు.*


*ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తల్చుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటిదొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు, నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి... టబ్బులలో ఈ దీపాలను వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది. ఇలా వదిలిన అరటిదీపాలను చూసుకుంటూ పోలిని తల్చుకుంటారు. కార్తికమాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా, ఈ రోజున 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే.... మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. వీలైతే ఈ రోజున బ్రహ్మణులకు దీపాన్ని కానీ, స్వయంపాకాన్ని కానీ దానం చేస్తుంటారు.*


*తెలుగువారు ఇటు పోలిని, అటు దీపాన్నీ కూడా శ్రీమహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు. అందుకని చాలామంది ఈ పోలిదీపాలను అమావాస్య రోజున కాకుండా, మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు.*


*ఇదీ పోలిస్వర్గం వివరం! కార్తికమాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాత మాట. ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు, మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యంగా తోస్తుంది. భగవంతుని కొలుచుకోవడానికి కావల్సిందే శ్రద్ధే కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది. అన్నింటికీ మించి ఆహంకారంతో సాగే పూజలు ఎందుకూ కొరగానివని హెచ్చరిస్తుంది. అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతినీ బోధిస్తోంది. అందకే ప్రతి కార్తికమాసంలోనూ, ప్రతి తెలుగు ఇంట్లోనూ... పోలిస్వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది.*


*ఓం నమో కార్తీక దామోదరాయ॥*

*ఓం నమఃశివాయ*

🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

అహం

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

           *అహం......!!*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐*మానవుడిలో అంతశ్శత్రువులు ఆరు. వాటిలో మదం ఒకటి. ‘మదం’ అంటే అహం... దీన్ని విడిచిపెడితేనే మనకు ఆనందం లభ్యమవుతుంది. అహం మన చర్మచక్షువునే కాదు, అంతఃచక్షువులనూ మూసేస్తుంది. చిన్నా పెద్దా తారతమ్యాన్ని, వివేచన, విచక్షణలను హరిస్తుంది. మర్యాద రహితుల్ని చేస్తుంది. సత్యాన్ని చూడనీయదు, మాట్లాడనీయదు. అంతేకాదు- దాన్ని దరిదాపులకు చేరనీయక అడ్డుకుంటుంది. ధర్మాన్ని పాటింపనీయదు. మంచి, చెడుల్ని కాననీయదు. క్రోధాన్ని పెంచి ఆవేశపూరితంగా, ఆలోచనారహితంగా మాట్లాడేలా చేస్తుంది. మానవుడి సర్వభ్రష్టత్వానికి మూలమైనదీ శత్రువు.*


*అంతశ్శత్రువులను జయించి తాను ఆనందాన్ని పొంది అందరికీ దాన్ని పంచినవాడిగా వసిష్ఠుడు నిలుస్తాడు. ఆయన బ్రహ్మర్షిత్వానికే వన్నెతెచ్చి దానికి మరింత మహత్వాన్ని ఆపాదించినవాడు. అందుకు విరుద్ధంగా- అహాన్ని వీడక తపశ్శక్తులను, వివేచన, విచక్షణలను తన కోపాగ్ని కీలల్లో ఆహుతి చేసుకున్నవాడు విశ్వామిత్రుడు. అహం పుట్టించే మరిన్ని శత్రువుల్లో అత్యంత ప్రధానమైనది ‘క్రోధం’. కౌశికుడి వృత్తాంతం మనకు బోధపరచేదిదే.*


*అహాన్ని శరీరంలోని అణువునా పోషించి, పెద్ద చేసినవాడు దుర్యోధనుడు. అహం తెచ్చే దుర్గుణాల్లో మూర్ఖత్వమొకటి. పినతండ్రి తనయులకు రాజ్యభాగాన్ని ఇవ్వనన్నాడు. మూర్ఖత్వపు పొరలు కమ్మిన అతడి కళ్లు సత్యాన్ని, ధర్మాన్ని చూడనీయలేదు. వాటి గురించి ఆలోచించనీయలేదు. కడకు మహాసంగ్రామానికి హేతువై అపార జననష్టాన్ని కలిగించిన వాడయ్యాడు. ఎందరికో గర్భశోకం వాటిల్లజేశాడు.*


*అహాన్ని దరిదాపుల్లోకి రానివ్వకూడనివాడు గురువు. తనకున్న పాండిత్యం, బోధనా ప్రతిభ మరెవ్వరికీ లేదన్న ఆలోచన వచ్చిన ఉత్తర క్షణం- అతడు గురుపీఠానికి అనర్హుడు. తాను చెప్పిందే సరైనదనే గర్వంతో పాటు వినయ, విధేయతలకు దూరమవుతాడు. జ్ఞాన సముపార్జనలో వెనకంజ వేస్తాడు. కుశాగ్ర బుద్ధి, జ్ఞానపిపాస కలిగిన విద్యార్థి వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పే ఆలోచన చేయక అతడి ప్రశ్నలే అర్థరహితమంటాడు. అందువల్ల ఆ విద్యార్థి దృష్టిలో చులకనవుతాడు. పొందవలసినంత గౌరవాన్ని పొందలేడు. విద్య వల్ల మన సహజమైన వినయం మరింత శోభిల్లాలి. సుగంధాలను పరివ్యాప్తం చేయాలి.*


*సాధించిన విజయాలు మరింత ఉత్సాహాన్ని నింపాలి. ఆలోచన కొత్తపుంతలు తొక్కి మరిన్ని పనులను చేపట్టి, విజయం సాధించాలి. అలాగాక, అహం తలెత్తిందా తిరోగమనం మొదలైనట్లే. అది విద్యార్థికి, శాస్త్రవేత్తకు, ఆటగాడికి, ఒక లక్ష్యాన్ని చేరుకుని మరిన్ని లక్ష్యాలను చేరుకునే తపన కలిగిన ఎవరికైనా వర్తిస్తుంది.*


*అహం విడిచిన వేళ అంతా ప్రేమమయమే. అది మనల్ని సత్యశోధకులను, ప్రేమికులను చేస్తుంది. మన అవగాహనశక్తిని పెంచి, ఆలోచనాపరులను చేస్తుంది. శత్రుభావనను వీడేటట్లు చేసి అందర్నీ సమభావంతో చూసే ‘చూపు’నిస్తుంది.*


*అహాన్ని వీడి జ్ఞానమనే మహాసముద్రంలో ఈదేవాడికే జీవితం లోతు తెలిసివస్తుంది. అది అతడికి ఒద్దికను నేర్పుతుంది. విధేయుణ్ని చేస్తుంది. జ్ఞాన పిపాసిగా ఉండనిస్తుంది. మోక్షసాధనా మార్గంలో పెద్ద ప్రతిబంధకం ఈ అహం.*


*అహాన్ని విడిచిన మనసు నిర్మలమవుతుంది. అప్పుడే అది భగవంతుడి సన్నిధిని చేరువ చేస్తుంది!*


*శ్రీ గురుభ్యో నమః॥*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

శివలింగాన్ని దర్శించడం

 *నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శించడం వెనుక రహస్యం.*



*శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమేశ్వరునికంటే ముందుగా నందినే దర్శించుకుంటాం. కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచీ పరమేశ్వరుని చూస్తే, మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టాలని చెప్పుకొంటారు.*


*నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనకి అంత ప్రాముఖ్యత. పరమేశ్వరుడికి అనుంగుభక్తుడు నందీశ్వరుడు. అందుకనే ఆలయకారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు.*


*ప్రతి శివాలయంలోనూ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం వుంటుంది.*


*ఆలయంలోని మూలవిరాట్టు దర్శనం చేసుకొనే సమయంలో మనస్సుని భగవంతునిపై కేంద్రీకరించాలి. అందుకే గర్భాలయంలో చాలా చిన్న అఖండదీపారాధన మాత్రమే వాడతారు.*


*మరే ఇతర దేవాలయాలలోనూ లేని విధంగా శివాలయంలో మాత్రమే నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూస్తారు.*


*సాధారణంగా శివాలయానికి వెళ్ళినప్పుడు మనం ఆలయానికి ప్రదక్షిణ చేసి పరివార(ఇతర) దేవతల దర్శనం చేసి పరమశివున్ని దర్శించుకుంటాము. కొందరు భక్తులు నందీశ్వరునికి నమస్కరించి వెళ్ళిపోతారు. కానీ అది అసంపూర్ణం దర్శనం అని శాస్త్రములు చెబుతున్నాయి.*


*పరమ శివుడు ఏ శివాలయంలో అయిన శివలింగ రూపంలో ఉంటాడు. అంటే ఇతర దేవతలలాగ కరచరనాదులు (విగ్రహ రూపం) లేకుండా లింగాకారంగా ఉండే సాకార స్వరూపం. విగ్రహ రూపంలో ఉండే భగవంతుని స్వరూపంను మనస్సు వెంటనే గ్రహించగలదు కానీ, లింగరూపంలో ఉన్న పరమశివుడిని చూస్తూ స్వామి నిజ రూపాన్ని దర్శించడానికి దృష్టిని మనస్సు పై కేంద్రీకృతం చేయాలి.*


*అందుకే ఎప్పుడూ పరమశివుడి ముందు ఉండే నంది శృంగము (కొమ్ముల) నుంచి శివలింగాన్ని చూస్తూ దృష్టిని మనస్సు పై కేంద్రీకరింఛి దర్శనం చేసుకోవాలి. నంది యొక్క పృష్ట భాగంను నిమురుచూ, శృంగముల మధ్య నుంచి స్వామిని దర్శించుకోవడం వలన నంది యొక్క అనుగ్రహం కూడా కలిగి మంచి ఫలితాలు కలుగుతాయి.*


*అంతే కాకుండా నంది చెవులలో కోరికలు చెప్పే విధానంలో కూడా ఒక పద్ధతి ఉంది.*


*కుడిచేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి, నెమ్మదిగా గోత్రము, పేరు, కోరిక చెప్పడం మంచిది. తర్వాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి. గురు, శిష్యుల మధ్య ఎవరూ వెళ్లకూడదు.*


*అందుకనే నంది విగ్రహం పైన కొమ్ముల మధ్యనుంచి శివదర్శనం చేసుకోవాల్సివుంటుంది. శంభుడు త్రినేత్రుడు. ఆయన త్రినేత్రం తెరిస్తే సకలా చరాచర జగత్తు తల్లడిల్లుతుంది అందుకనే నేరుగా శివుని ముందుకు వెళ్లకూడదని పెద్దలు చెబుతారు. దీంతో ముందుగా ఆయన వాహనమైన నంది కొమ్ములపై వేళ్లను ఆనించి దర్శనం చేసుకున్న అనంతరమే మందిరం లోపలికి వెళ్లాలి. దీన్నే శృంగదర్శనం అంటారు.*


*రాశి చక్రంలోని మిథున రాశి గౌరీ శంకర స్వరూపం. వృషభరాశి నందిశ్వర రూపం. రాశి చక్రం ఉదయించే సమయంలో వృషభరాశి, మిథున రాశి కిందుగా, అస్తమించే సమయంలో మిథున రాశి, వృషభరాశి కిందుగాను ఉంటుంది. ఆ కారణం వలనే శివుడు వృషభవాహనుడు, వృషభద్వజుడు అయ్యాడు. వృషభం (నందీశ్వరుడు)యొక్క వృషభ బాగాన్ని స్పృషిస్తూ శివుని దర్శించటం వల్ల విధి విహితం*


*శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివున్ని దర్శించిన వారికీ కైలాస ప్రాప్తి కలుగుతుందని శివ పురాణలో ఉన్నది.*


*ఓం నమః శివాయ॥*

కార్తికదీపాలు

 *కార్తికదీపాలు నీటిలో ఎందుకు వదలాలి?*


*దీని వెనుక ఉన్న ఆంతర్యం తెలుసుకుందాం.*


*దైవభక్తి ఉన్నవారు సంవత్సరం మొత్తం దీపం వెలిగించక పోయినా కార్తిక మాసం నెల రోజులు దీపం వెలిగిస్తే చాలా మంచి దని పెద్దలు చెబుతుంటారు.*


*కార్తికపురాణం ప్రకారం కార్తిక మాసంలో పిప్పలుడు అనే మహారాజు దీపదానం చేయడం వలన సంతానాన్ని పొందా డనీ, వారి కుమారు డైన శత్రుజిత్తు ఈ మాసంలో దీపాన్ని వెలిగించడం వలన కైలాసాన్ని చేరుకున్నా డనీ కథ లున్నాయి.*


*ఈ నెలరోజులూ ఇంట్లో దీపాలు పెట్టడంతో పాటు చెరువులు, నదుల్లో దీపాలు వదులు తుంటారు. ఏ నదీతీరం చూసినా కార్తికస్నానాలు చేసేందుకు వచ్చిన భక్తులతో కళకళలాడు తుంటుంది. సూర్యోదయం అయ్యే సమయానికి నదీతీరం మొత్తం దీపకాంతులతో నిండిపోతుంది. ఇంతకూ కార్తికమాసం నెలరోజులూ నదుల్లో, చెరువుల్లో దీపాలు ఎందుకు విడిచిపెడతారు?*


*నమామీశ్వరం ప్రాణేశ్వరం*

*పంచభూతేశ్వరం*

*అనాదీశ్వరం ఆదీశ్వరం*

*సర్వకాలేశ్వరం*

*శివమ్ శివమ్ భవ హరం హరం*

*శివమ్ శివమ్ భవ హరం హరం*


*ఆకాశం, నీరు, అగ్ని, గాలి, భూమి - పంచభూతాలు, సకల ప్రాణికోటికీ జీవనాధారాలు.*


*శివపంచాక్షరీమంత్రం అయిన న- మః - శి- వా - య అనే పంచ బీజాక్షరాల నుంచి పంచ భూతాలు, వాటి నుంచి సమస్త జగత్తు పుట్టిం దని శాస్త్రవచనం.*


*శివ అనే శబ్దానికి శుభం, క్షేమం, శ్రేయం, మంగళం అని అర్థా లున్నాయి. ఈ జగ త్తంతా శివమయమే అయి నప్పుడు అంతా శివోsహమే.*


*పంచభూతాలను కూడా తనలో లయం చేసుకుని పరమశివుడు కొలు వైన క్షేత్రాలు పంచభూతక్షేత్రాలు.*

*ముందుగా శివం - పంచభూతాత్మకం అని తెలిసి నప్పుడే దీపాలు నీటిలో ఎందుకు వదిలిపెడతా మనేది అర్థ మవుతుంది.*


*ఆత్మను జ్యోతి స్వరూపంగా భావిస్తారు. మనలో ఉండే ఆత్మ, జ్యోతి స్వరూపంగా మారి భగవంతుడిని చేరుతుం దంటారు*


*జ్యోతిస్వరూపం అంటే దీపాన్ని, పంచభూతాల్లో ఒక టైన నీటిలో వదలడం అంటే మన లోని ఆత్మను పంచభూతాత్మకం అయిన పరమేశ్వరుడికి అంకితం చేయడమే.*


*ముఖ్యంగా పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్ర మైన కార్తికమాసంలో దీపాలు వెలిగించి నదుల్లో, చెరువుల్లో వదిలితే పూర్వజన్మలో చేసిన పాపాలతో పాటూ ఈ జన్మలో చేసిన పాపాలూ నశించి పరమేశ్వరుడి సన్నిధికి చేరుతా మంటారు.*


*అందుకే బ్రహ్మ ముహూర్తంలో స్నాన మాచరించి త్రికరణశుద్ధిగా కార్తికదీపాలు నీటిలో విడిచిపెడతారు.*


*అన్ని మాసాల్లో చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాల కన్నా.. కార్తికమాసంలో చేసే ఉపవాసం, స్నానం, దానం ఎన్నో రెట్లు ఫలాన్ని ఇస్తా యని పురాణాలు చెబుతున్నాయి.*


*విష్ణువును తులసి దళాలు, కమలం, జాజి, అవిసెపువ్వు, గరిక, దర్భలతో, శివుని బిల్వ దళాలు, జిల్లేడు పూలతో అర్చిస్తే వారికి ఉత్తమ గతులు కలుగుతా యంటారు.*


*ఈ మాసంలో నిత్యం సూర్యోదయానికి ముందే స్నానం చేసి గుడికి వెళ్లి దీపారాధన చేస్తే అత్యంత పుణ్యఫలం లభిస్తుంది. నెలంతా సాధ్యం కానివారు కనీసం సోమవారం, కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజుల్లో అయినా ఇలా చేస్తే మంచి దంటారు.*


(సేకరణ)

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం  - శరదృతువు - కార్తీక మాసం - శుక్ల పక్షం  - ఏకాదశి - పూర్వాభాద్ర & ఉత్తరాభాద్ర -‌‌ భౌమ వాసరే* (12.11.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*