*మంగళవారం 25 ఆగస్టు 2026*
*శ్రీమద్భాగవతం - 30/42*
*ధేనుకాసుర వధ, కాళీయ మర్దనం & దావాగ్ని ప్రాశనం*
ఓం నమో భగవతే వాసుదేవాయ!
భాగవత అధ్యయనం లో అప్పుడే 30 రోజులు గడిచి పోయాయి అసలు సమయమే తెలియదు స్వామి లీలలలో పడితే, నిన్నటి రోజున బ్రహ్మమోహన లీల తెలుసుకున్నాం ఈరోజు మరికొన్ని లీలల గురించి తెలుసుకుందాం.
1. ధేనుకాసుర వధ – తాళవన ప్రవేశం
బలరామ కృష్ణులు తమ పౌగండ వయసుకు చేరిన పిమ్మట అంటే ఆరవ ఏట ఆవులను మేపసాగిరి. బృందావనం లో గోవులు కాస్తూ తమ పవిత్ర పాదస్పర్శ చేత ఆ ప్రదేశాన్ని పునీతం చేశారు.
శ్రీకృష్ణభగవానుడు తన మాయాప్రభావమున నిజ దివ్యవైభవమును బయల్పడనీయక, నిత్యజీవనమున సామాన్య గోపబాలునివలె ప్రవర్తించుచుండెను. వైకుంఠమున లక్ష్మీదేవిచే పాదసేవలను అందుకొను ఆ మహాత్ముడు ఇప్పుడు గ్రామీణ జనులలో తానుకూడా ఒక్కడై మసలుకొనుచుండెను. ఐన ఆ ప్రభువు యొక్క అద్భుతలీలలు అప్పుడప్పుడు ప్రకటితములు అగుచునే యుండెను.
బలరామకృష్ణులకు గాఢమిత్రుడైన శ్రీదాముడు, సుబలుడు, చిట్టికృష్ణుడు (ఇతడు శ్రీకృష్ణునకు భిన్నుడు) మొదలగు గోపబాలురు ప్రేమతో ఒకనాడు వారితో ఇట్లనిరి–"మిత్రులారా! దగ్గరలోని తాళవనంలో ఎంతో రుచికరమైన తాటిపండ్లు ఉన్నాయి. కానీ అక్కడ ధేనుకాసురుడు అనే గాడిద రూపంలోని రాక్షసుడు తన అనుచరులతో కాపలా కాస్తూ ఎవరినీ రానివ్వడం లేదు" వాడు నరమాంస భక్షకుడు, అందుకే పక్షులు సైతం అటు వెళ్ళడానికి బయటపడతాయి,కానీ ఆ పండ్ల వాసనలు గుబాళిస్తూ ఉంటాయి,వాటిని ఇంతవరకు ఎవరు కనీసం రుచి కూడా చూసీ ఉండలేదు,ఓ కృష్ణా నీవు సర్వసమర్దుడవు మాకు ఆ భాగ్యం కలిగించవా అని అడిగారు
బలరామకృష్ణులు గోపబాలురతో కలిసి తాళవనానికి వెళ్లారు.
అందులోనికి వెళ్ళగానే బలరాముడు తన బాహుబలంతో తాటిచెట్లను గట్టిగా ఊపగా పండ్లన్నీ నేలరాలాయి. ఆ శబ్దానికి క్రోధంతో పరుగెత్తుకు వచ్చిన ధేనుకాసురుడు బలరాముని తన వెనుక కాళ్లతో తన్నాడు.
అంతట బలరాముడు ఆ గాడిద రాక్షసుని రెండు కాళ్లను ఒంటిచేత్తో పట్టుకుని, గిరగిరా తిప్పి తాటిచెట్ల పైకి విసిరికొట్టాడు. ఆ దెబ్బకు చెట్లు కూలి ధేనుకాసురుడు మరణించాడు ఆయన అనుచరులైన రాక్షసులంతా ఉక్రోషంతో మీదకు వస్తె వారిని కూడా అలాగే సంహరించాడు.నాటి నుండి గోపాలురు, పశువులు భయం లేకుండా తాళవనంలో సంచరించారు.
2. కాళీయుని విషజ్వాలలు
పరీక్షిన్మహారాజా! ఈవిధముగా శ్రీకృష్ణభగవానుడు బృందావనమునందు తన అద్భుత లీలలను ప్రదర్శించుచుండెను. ఒకనాడు ఆ స్వామి తన యన్నయగు బలరాముడు లేకుండా, తోడి గోపబాలురతోగూడి యమునానదీ తీరమునకు చేరెను. అప్పుడు వేసవితాపముచే గోవుల యొక్క గోపకుమారులయొక్క గొంతు లెండిపోయెను. మిగుల దప్పికగొనియున్న ఆవులును, బాలకులును విషపూరితములైయున్న యమునానదీ జలములను త్రాగిరి.
యమునా నదిలో ఒక లోతైన మడుగులో వేయి పడగలు కలిగిన మహా విషసర్పం కాళీయుడు నివాసముండేవాడు.
* ఆయన విషపు వేడిమికి యమునా జలాలు మరిగిపోయి, నీటి నుండి విషపు ఆవిర్లు లేచేవి. ఆ ఆవిర్లు తగిలిన పక్షులు ఆకాశం నుండి నేలకూలి మరణించేవి; ఒడ్డున ఉన్న చెట్లు ఎండిపోయాయి.
* ఆరోజు ఆ విషపు నీటిని తాగిన ఆవులు, గోపబాలురు విషప్రభావంతో నేలపై పడి ప్రాణాలు విడిచారు. కరుణామయుడైన శ్రీకృష్ణుడు తన అమృతతుల్యమైన దృష్టితో వారిని స్పృశించి తిరిగి బ్రతికించాడు.
3. కాళీయ మర్దనం – పడగలపై శ్రీకృష్ణుని దివ్య నాట్యము
యమునా జలాలను పవిత్రం చేయడానికి చిన్నికృష్ణుడు నిర్ణయం తీసుకుని ఒడ్డున ఉన్న ఒక కదంబ వృక్షంపైకి ఎక్కి, నడుముకు పీతాంబరాన్ని బిగించి, గంభీరంగా జబ్బలు చరుస్తూ కాళీయ మడుగులోకి దూకాడు.
కృష్ణుని దూకుడుతో నీరు ఉవ్వెత్తున ఎగిసిపడింది. కాళీయుడు తీవ్రమైన కోపంతో కృష్ణుడిని చుట్టుముట్టి, ఆయువు పట్టు మీద కాటు వేస్తూ బంధించాడు. గోకులవాసులు, యశోదానందులు ఇది చూసి హాహాకారాలు చేస్తూ యమునా తీరానికి పరుగెత్తుకు వచ్చారు. అప్పుడు గోకులంలో ఉన్న ఆవు,దూడ, గోపాలకులు, నందుడు ఎంతో వేదన చెందారు, కృష్ణుడికి ప్రమాదం వచ్చింది అని తమ ప్రాణాలే పోయినట్టు తల్లడిల్లారు.
అప్పుడు కృష్ణుని తమప్రాణముగా (సర్వస్వముగా) భావించెడి నందుడు మొదలగు గోపాలురు అందఱు బాధపడుచు ఆ హ్రదమున(మడుగులోకి) ప్రవేశించుటకు సిద్ధపడిరి. కాని మహాత్ముడైన బలరాముడు శ్రీకృష్ణమహిమలను ఎఱిగిన వాడగుటచే ధైర్యము వహించి, తగినరీతిగా ఓదార్చి, వారిని ఆ ప్రయత్నమునుండి నివారించెను.
గోకులవాసులకు ఏకైక శరణ్యుడైన శ్రీకృష్ణుడు తనకారణముగా స్త్రీలు, వృద్ధులు, బాలురు అందఱును దుఃఖితులగుటను గమనించెను. స్వామి క్షణకాలము సామాన్యమానవునివలె పాముపట్టులో ఉండి,(ఉన్నట్టు నటించి)వెంటనే వేగముగా దానిపట్టునుండి పైకి లేచెను.
అంతర్యామియైన శ్రీకృష్ణుడు కాళీయుని పట్టు నుండి సులభంగా విడిపించుకుని, ఆ సర్పం యొక్క వేయి పడగలపైకి ఎక్కాడు.
శ్రీకృష్ణుడు తన దేహమును పెంచుచున్నప్పుడు ఆ సర్పశరీరము తట్టుకొనలేని బాధకు లోనయ్యెను. అప్పుడు కాళియుడు శ్రీకృష్ణుని విడిచిపెట్టి కుపితుడై తన పడగలను పైకెత్తి నిలబడెను. బుసలుకొట్టుచున్న అతని నాసారంధ్రములనుండి విషజ్వాలలు పెల్లుబుకుచుండెను. దిక్కుతోచని స్థితిలోనున్న అతని చూపులు కాలుచున్న కొరవులవలె ఎఱ్ఱబాఱి యుండెను.
అతడు తదేకదృష్టితో ఆ బాలకృష్ణుని చూస్తూ ఉండెను,ఆ సమయమున శ్రీకృష్ణుడు తన వాహనమైన గరుత్మంతునివలె ఆ సర్పముయొక్కపడగలపై క్రీడించుచు చిందులు వేయసాగెను. అప్పుడు
దేవతలు ఆకాశం నుండి మృదంగ, దుందుభి నాదాలు చేస్తుండగా, రత్నాలు పొదిగిన కిరీటధారియై కృష్ణుడు కాళీయుని పడగలపై లయబద్ధంగా అద్భుత తాండవ నాట్యం చేశాడు!
101 పడగలు కల ఆకాళీయుడు ఇంతవరకు ఎవరికి తలవంచి ఉండడు,కానీ స్వామి అతను ఏ పడగనైతే పైకెత్తుతాడో, ఆ పడగపై తన పాదంతో బలంగా తొక్కుతూ గర్వాన్ని అణచివేశాడు.
* కాళీయుని నోటి నుండి రక్తపు ధారలు కారాయి; శరీర బలం నశించి నేలకూలాడు.మూర్చపోయాడు.
4. నాగపత్నుల స్తుతి & కాళీయునికి అభయం
కాళీయుని దైన్యస్థితిని చూసి ఆయన భార్యలైన నాగపత్నులు తమ పసిపిల్లలతో సహా కృష్ణుని ముందు సాష్టాంగపడి చేతులు జోడించి కన్నీళ్లతో ప్రార్థించారు:
"ఓ పరమాత్మా! నీవు ధర్మరక్షణ కోసం అవతరించావు. దుర్మార్గుడైన నా పతికి నీవు వేసిన దండన నిజానికి శిక్ష కాదు... ఆయన సమస్త పాపాలను హరించే గొప్ప అనుగ్రహం! మహాయోగుల తపస్సుకు దక్కని నీ చరణ స్పర్శ ఈరోజు నా పతి శిరస్సుకు దక్కింది. మా మాంగల్యాన్ని కాపాడి నా పతికి ప్రాణభిక్ష పెట్టు!"
నాగపత్నుల భక్తికి కృష్ణుడు కరుణించి కాళీయుడిని వదిలిపెట్టాడు. కృష్ణానుగ్రహం తో తిరిగి స్వస్తుడు అయిన
కాళీయుడు చేతులు జోడించి తప్పు తెలుసుకున్నాడు. స్వామిని స్తుతించాడు,అప్పుడు కృష్ణుడు..
"కాళీయా! యమునా జలాలను విడిచి నీ పరివారంతో కలిసి సముద్రంలోని 'రమణక ద్వీపానికి' వెళ్ళిపో. నీ శిరస్సుపై నా పాదముద్రలు ఉన్నాయి కాబట్టి, ఇకపై నీ శత్రువైన గరుత్మంతుడు నిన్ను ఏమీ చేయడు" అని అభయమిచ్చాడు.
(కాళీయుడు మొదట రమణక ద్వీపం లోనే ఉండేవాడు, పూర్వం గరుత్మంతుడు కనపడ్డ ప్రతీ సర్పాన్ని తినేస్తుంటే సర్పాలన్నీ కలసి ఆయనతో ఒప్పందం కుదుర్చుకుని అమావాస్య, పౌర్ణమి వంటి రోజుల్లో నీకు ఒక సర్పం ఆహారం గా ఇస్తాం అని ఒప్పందం చేసుకున్నాయి, అయితే 101 పడగలు గల కాళీయుడు నేనే బలవంతున్నీ అని ఆ గరుడ ప్రసాదం ఈయనే స్వీకరించే వాడు దాంతో గరుత్మంతుడు రమణక ద్వీపం మీద దాడి చేసి కాళీయుని చితక బాదాడు, ఎక్కడ ఉన్న తనకు చావు తప్పదు అని భావించి
ఈ మడుగులోకి వచ్చి ఆశ్రయము పొందాడు,ఈ మడుగు వైపు వస్తె మరణిస్తాడు అని గరుత్మంతుడు కి సౌబరి మహర్షి శాపం ఉంది, ఇప్పుడు శ్రీ కృష్ణ పాద స్పర్శ ఉంది కనుక గరుత్మంతుడు ఏమి అనడు)
అలా శ్రీకృష్ణ పరమాత్మ మడుగు నుండి బయటకు వచ్చాక, తమ కోరికలు నెరవేరిన వారు ఎంత సంతోషం పొందుతారో అంత సంతోషం పొందారు ఆ వ్రజ వాసులు.ఆ రాత్రి ఆ నదీ తీరంలోనే అంతా సేదతీరారు,ఆ సమయంలో తీవ్ర దావాగ్ని ఒకటి పుట్టి అడవిని దహించి వేస్తూ ఉంటే దాన్ని స్వీకరించి అందరిని కాపాడాడు స్వామి.
ఎంత ప్రేమించారండి స్వామిని.
5. ప్రలంబాసుర వధ
ఆ తరువాత బలరామకృష్ణులు తోటిబాలుర తో కలిసి ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ, కుస్తీ పడుతు ఒకరిని ఒకరు భళా భళా అనుకుంటూ, గోవులు కాస్తూ సమయం గడుపుతూ ఉన్నారు అలా ఒకరోజు అడవిలో గోవులు కాస్తూ ఉండగా
ప్రలంబాసురుడు అనే రాక్షసుడు బలరామకృష్ణులను అంతం చేయడానికి ఒక గోపబాలుని వేషంలో వచ్చి వారితో స్నేహం నటించాడు.
అది గమనించిన శ్రీకృష్ణ పరమాత్మ, అందరిని పిలిచి
మనం రెండు జట్లుగా విడిపోయి ఆటలు ఆడదాం.ఓడిపోయిన జట్టువారు గెలిచిన వారిని తమ వీపుపై ఎక్కించుకుని ఒక నిర్దిష్ట స్థానం వరకుమోయాలి.అని నిబంధన పెట్టాడు, దాని ప్రకారం ఓడిన వారు గెలిచిన వారిని మోస్తూ క్రీడిస్తూ ఉన్నారు.
కృష్ణుడి బలం తెలిసిన ప్రలంబాసురుడు బలరాముడిని ఎత్తుకెళ్లాలని నిర్ణయించుకునీ ఆటలో ఓడిపోయినట్లు నటించి, బలరాముడిని వీపుపై ఎక్కించుకుని అడవి వైపు వేగంగా పరుగులు తీశాడు.
కానీ పర్వతమంత బరువున్న ఆ బలరాముని వాడు మోయలేక పోయాడు,భారం పెరగడంతో రాక్షసుడు తన భయంకరమైన నిజరూపాన్ని ధరించాడు. బలరాముడు ఏమాత్రం భయపడకుండా, తన వజ్రసమానమైన పిడికిలితో ప్రలంబాసురుడి తలపై బలంగా ఒక్క దెబ్బ కొట్టాడు.ఆ దెబ్బకు రాక్షసుని తల పగిలి రక్తం కక్కుకుంటూ ప్రాణాలు విడిచాడు. బలరాముడి పరాక్రమాన్ని చూసి గోపాలురు, దేవతలు పూలవర్షం కురిపించారు.
* దావాగ్ని ప్రాశనం
**దావాగ్ని రక్షణ
ఒకనాడు ఆటల ధ్యాసలో పడి ఆవులను పట్టించుకోలేదు దాంతోఅవి 'ఇషీకాటవి' (తుంగ అడవి) అనే దట్టమైన ప్రాంతంలోకి వెళ్ళాయి దారితప్పారు.
ఆ ముంజారణ్యం లో దారి తప్పిన పశువులను వాటిని వెతుక్కుంటూ వెళ్ళిన గోపాలురు ఎంత పిలిచినా అవి జాడలేదు, అప్పుడు
శ్రీ కృష్ణ పరమాత్మ యే స్వయంగా పిలువగా ఆ పశువులు అంబ అంబా అంటూ పరుగులు పెట్టుకుంటు వచ్చాయి.
ఆ సమయంలోనే వేసవి ఎండల వల్ల ఆ అడవిలో అకస్మాత్తుగా భయంకరమైన దావాగ్ని (అడవి మంటలు) చెలరేగి, నాలుగు వైపుల నుండి గోపాలురను, పశువులను చుట్టుముట్టింది.
తప్పించుకునే దారి లేక ప్రాణభయంతో అందరూ శ్రీకృష్ణుడిని రక్షించమని వేడుకున్నారు.
శ్రీకృష్ణుడు వారిని ఏమాత్రం భయపడవద్దని చెప్పి, అందరినీ **కళ్ళు మూసుకోమని** ఆజ్ఞాపించాడు. వారు కళ్ళు మూసుకోగానే ఆ భయంకరమైన మంటలన్నింటినీ క్షణంలో తన నోటితో మింగివేశాడు.
గోపాలురు కళ్ళు తెరిచి చూసేసరికి మంటలన్నీ మాయమై, తామంతా సురక్షితంగా భాండీర వృక్షం(అంతసేపు ఆటలు ఆడిన ప్రదేశం)
వద్ద ఉండటం చూసి శ్రీకృష్ణుని లీలకు ఆశ్చర్యపోయారు.
ఆ తదుపరి సాయంసమయమున గోవులను మఱలించుకొని, తనను గోపబాలురు ప్రస్తుతించుచుండగా వేణునాదమొనర్చుచు వ్రజభూమియందు ప్రవేశించెను. యశోదాది గోపాంగనలు అందఱును పగలంతయును శ్రీకృష్ణుని దర్శనభాగ్యము లేక ప్రతిక్షణమును నూఱు యుగములుగా గడపిరి. సాయం సంధ్యాకాలమున గోవులతో వ్రజభూమికి చేరిన ఆ ప్రభువుయొక్క దర్శనమైనంతనే వారెల్లరును పరమానందభరితులైరి.
📝 నేటి ముఖ్య విషయాలు:
* విష నివారణ – కాళీయ మర్దనం: మానవ హృదయమే యమునా మడుగు; అందులోని కామ, క్రోధ, మత్సరాలనే విష సర్పాలను భగవంతుని నామస్మరణ అనే పాదస్పర్శతో మాత్రమే అణచివేయగలం.
* భగవంతుని పాదముద్రల రక్షణ: కాళీయుని తలపై కృష్ణుని పాదం పడటంతోనే గరుడ భయం నశించింది. ఎవరి హృదయంలో భగవత్పాదం నిలుస్తుందో వారికి సంసార మృత్యు భయం ఉండదు.
* సర్వభక్షకుడైన అగ్నినే మింగిన పరమాత్మ: భౌతిక అగ్నిని తానే మింగివేయడం ద్వారా, భక్తులను సంసార దావాగ్ని తాపాల నుండి రక్షించేది పరమాత్మే అని నిరూపించాడు.
....సశేషం
🙏🌹🙏
🙏*న్యాయపతి*🙏
*నరసింహారావు*
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి