24, సెప్టెంబర్ 2024, మంగళవారం

Panchaag

 


పరిమళ వైద్యము

 ఆయుర్వేదము నందలి భాగమైన పరిమళ వైద్యము గురించి సంపూర్ణ వివరణ -


     పరిమళ ద్రవ్యముల చరిత్ర అత్యంత పురాతనమైనది. రమారమి మూడువేల సంవత్సరాల క్రితమే వేదములలో వర్ణింపబడిన  " పరోమ" విధానమున పరిమళ పుష్పముల యొక్క మరియు సుగంధద్రవ్యముల యొక్క ప్రస్తావన కలదు.  ఋషులు పరిమళభరితమైన ధూపము దేవతలను ఆవాహనకు ఉత్తమ సాధనగా భావించిరి. ఆనాడు హోమధూపమును వాతావరణము నందలి కల్మషము ప్రక్షాళణ చేయుటకు , దుర్గన్ధమును , రోగాసాంక్రమిక క్రిములను పారద్రోలుటకు సాధనాభూతముగా ఉపయోగించేవారు. 


              వరాహమిహిరుడు తన బృహత్సంహిత నందు పరిమళ ద్రవ్యముల గురించి వివరించెను. ఆనాడు శ్రీగంధం ఎక్కువుగా వాడుక నందు ఉండేది. జాజి , దవనం , మరువం , కస్తూరి , కర్పూరం , కుంకుమపువ్వు మున్నగు వస్తువులు కూడా ఉపయోగించేవారు .


      ప్రముఖ మరాఠ కవి గంగాధరుడు  "గంధసార - గంధపాత" అను గ్రంథముల యందు పరిమళ ద్రవ్యముల గురించి తెలుపుచూ వాని తయారీ మరియు వినియోగించే విధానం గురించి వివరించాడు. దాదాపు 1500 సంవత్సరముల నాటి పంచతంత్రమున విష్ణుశర్మ సుగంధద్రవ్యముల వర్తకము , బంగారు వర్తకము కంటే లాభసాటిది అని చెప్పుటను గమనిస్తే ఆకాలము నందు వాటిపై ప్రజలకు గల ఇష్టాన్ని మనం గమనించవచ్చు .


         ఈ మధ్యకాలంలో ఇజ్రాయిల్ దేశము నందలి కుమ్రాన్ గుహలలో తవ్వకాలు జరిపినపుడు పురాతన శాస్త్రవేత్తలకు ఒక పాతనూనె సీసా కనిపించింది. ఆ సీసాను పరిశోధించినప్పుడు అది 2000 సంవత్సరాల పూర్వమునకు చెందినది అని తేలింది . అప్పటి మహారాజులు పరిమళద్రవ్యముగా ఆ సీసా నందలి తైలమును వాడేవారు అని బయటపడినది. ఇన్ని సంవత్సరాలు గడిచినను ఆ సీసా నందలి పరిమళద్రవ్యము ఘుమఘుమలాడుచుండెను. 


                   ప్రాచీన కాలము నందు భారతదేశము , పర్షియా , ఈజిప్టు సుగంధద్రవ్యముల తయారీలో అగ్రగాములుగా ఉండెను . వారు ఆకులు , పువ్వులు , వ్రేళ్లు దంచి చమురులో నానబెట్టి పరిమళద్రవ్యములు తయారుచేసెడివారు. పరిమళ వస్తువులు రోగనివారణలో ప్రముఖ పాత్ర వహించునని ఆయుర్వేద తంత్రకర్త చరకుడు తన చికిత్సాసారమున తెలిపి గంధము , గోరింట , వట్టి వేళ్లు , తామర , కలువలు మున్నగు వానితో సిద్ధము చేసిన తైలములతో చికిత్స చేయు విధానమును వివరించెను. 


                   సుఖాంతి అను పుష్ప పరిమళము నిర్ణీత సమయమున నిత్యం వాసన చూసుట వలన ఉబ్బసం వంటి శ్వాశకోశ వ్యాధులు నయం అగును. చంద్రమోహ పుష్పముల సుగంధము మానసిక వ్యాధులకు విరుగుడుగా పనిచేయును . పవనాలి అనే పుష్పముల సుగందము రక్తపోటుకు విరుగుడుగా పనిచేయును . ఈ పువ్వులన్నియు హిమాలయముల యందే లభించును. కొన్ని రకాల పుష్ప సుగంధములను లోపలికి పీల్చుట చేత తలనొప్పి నుండి గుండెపోటు వరకు అనేక రోగములను నయం చేయవచ్చు .


           తరవాతి పోస్టు నందు మనదగ్గర లభించే కొన్ని రకాల పుష్పాల యొక్క సువాసనలు పీల్చుటచేత నయం అయ్యే రోగాల గురించి సంపూర్ణముగా వివరిస్తాను.


    

      మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

*శ్రీ శనీశ్వర రాహు-కేతు ఆలయం*

 🕉 *మన గుడి : నెం 450*




⚜ *కేరళ : ఎరమత్తూరు : అలెప్పి*




💠 హైందవ భక్తులు అత్యంత భయంతో మాత్రమే చూసే గ్రహం శనీ. 

 కష్టకాలంలో భక్తులు ఎక్కువగా భయపడే శనిదేవుడిని పూజించే ఆలయాలు చాలా అరుదు.  

పాప గ్రహంగా భావించే శనిని పూజించే ఆలయం కేరళలో ఉంది. 

 కేరళలోని ఏకైక శనీశ్వర దేవాలయంగా పేరొందిన ఇరమతుర్ శని ఆలయాన్ని సందర్శించడం శుభప్రదమని నమ్ముతారు. ఇక్కడ శని దోషాలను వదిలించుకోవడానికి భక్తులు వస్తారు.


💠 ఈ ఆలయంలో శనీశ్వరుడే కాకుండా ఆదిగురువు త్రిమూర్తి స్వరూపుడు, పితృదోష నివారిణి అయిన శ్రీ దత్తాత్రేయ భగవానుడు, శనీశ్వరుడు మిత్రులైన రాహు-కేతువులు, సిద్ధపంచముఖి హనుమంతుడు కలవు.


💠 ఆలయ ప్రధాన దైవం కాకివాహన శనీశ్వరుడు

హిందూ పురాణాలలో, శని గ్రహాన్ని శని అని పిలుస్తారు. భారతీయ సంస్కృతిలో గ్రహానికి ప్రత్యేక హోదా ఇవ్వబడినందున, శనిని 'ఈశ్వరుడు' లేదా 'శనీశ్వరుడు' అని పిలుస్తారు.


💠 'శని' అనే పదం సంస్కృత పదం 'శనైః చరహ' అంటే 'నెమ్మదిగా కదిలేవాడు' నుండి వచ్చింది. శని అనేది భౌతిక ప్రపంచాన్ని సన్యాసం లేదా పరిత్యాగానికి సూచిక.


💠 భారతీయ జ్యోతిషశాస్త్రంలో, శనీశ్వరుడు క్రమశిక్షణ, అధికారం, వృద్ధాప్యం, సన్యాసం, కష్టాలు, కార్మికులు, ఆలస్యం, ఆశయం, నాయకత్వం మరియు అధికారం, సమగ్రత, కీర్తికి ప్రధాన గ్రహ దేవతగా సూచించబడ్డాయి.


💠 నవగ్రహాలలో (తొమ్మిది గ్రహాలు) శనీశ్వరుడు నెమ్మదిగా కదులుతున్న గ్రహం .

రాశిచక్రంలో శని యొక్క గ్రహాల స్థానాల ప్రకారం, వివిధ రాశులలో జన్మించిన వ్యక్తులు శనీశ్వరుడు ఆపాదించబడిన మంచి / చెడు ప్రభావాలను అనుభవిస్తారని చెప్పబడింది.


💠 శనిచే పాలించబడే వ్యక్తులు (జనన జాతకాలలో అనుకూలమైన స్థానాల్లో శనీశ్వరుడు ఉండటం) వారు భౌతిక సుఖాల కోరికను నియంత్రించడానికి మరియు ఉన్నత సంకల్పానికి లొంగిపోవడానికి సిద్ధంగా ఉంటే, అత్యధిక విజయాన్ని పొందవచ్చు మరియు అజేయంగా మారవచ్చు. 

శనీశ్వరుని గ్రహప్రభావాల సమయంలో, స్థానికుడు సత్కార్యాలు చేస్తే, వృద్ధులను గౌరవిస్తూ, తన సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు మరియు పేదలకు దానం చేస్తే, అపారమైన సంపదను మంచి కీర్తితో పొందవచ్చు. 


💠 శని ప్రతికూల స్థానాల్లో ఉన్నప్పుడు అత్యంత హానికరమైన గ్రహంగా పరిగణించబడుతుంది, కానీ నిస్సహాయులు మరియు పేదల పట్ల దయ చూపడం, తప్పు చేసేవారిని క్షమించడం మరియు భౌతిక ఆస్తులు మరియు సౌలభ్యాల పట్ల అనుబంధాలను వదులుకోవడం ద్వారా దాని కోపాన్ని నిరోధించవచ్చు.


💠 శ్రీ శనీశ్వరక్షేత్రంలో నిర్వహించబడే సంస్కృత కర్మలు

వేదపాఠశాల

విద్యారంభం

అన్నప్రాశం

చిత్రరాంతి మహాహవనం

గృహప్రవేశనం


💠 శని దోషం నుండి ఉపశమనం కోరుకునే వారు శనీశ్వర ఆలయాన్ని సందర్శించి, ప్రార్థనలు చేసి, పై పరిహారాలు చేయాలి.


💠 ఇరమత్తూరు శనీశ్వర దేవాలయం అరుదైన విశేషాలకు, నమ్మకాలకు ప్రసిద్ధి.  

శని దోషాల నుంచి విముక్తి పొందాలంటే ఇక్కడికి వచ్చి పూజిస్తే సరిపోతుందని విశ్వాసం.  

శనిదోష భక్తులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ ప్రార్థనలు మరియు పూజలు నిర్వహిస్తారు.


🔆 *ఆలయ చరిత్ర*


💠 మతవిశ్వాసాలు, ఆచార వ్యవహారాలను పరిశీలిస్తే ఈ ఆలయం చాలా పురాతనమైనది.  పురాతన కాలంలో బ్రాహ్మణులు కలిసి ఉండే ప్రదేశం ఇది.  

పూజలు, ఆచారాలు, త్యాగాలు వారి జీవితంలో భాగమయ్యాయి.  

ఇక్కడ అనేక యాగాలు జరిగాయని నమ్ముతారు.  

60 సంవత్సరాల క్రితం వరకు, ఈ ప్రాంతం సమీపంలోని మఠంలో భాగంగా ఉండేది.  

వీరు తమిళనాడు నుండి వలస వచ్చి ఇక్కడ శని ఆరాధనను ప్రారంభించినట్లు వారి ద్వారానే ఇక్కడ పూజలు కొనసాగుతున్నాయని నమ్ముతారు. 

  

💠 చెన్నితల అనే గ్రామం పేరు కూడా ఇక్కడి శని దేవాలయం నుండి వచ్చిందని నమ్ముతారు.  

శని నివాసమైన శనితల నుండి చెన్నితల వచ్చారు.


💠 అనేక పూజలు మరియు ఆచారాలు నిర్వహించబడే ఈ ఆలయంలో శని మరియు ఆదివారాల్లో మాత్రమే ప్రజల ప్రవేశం అనుమతించబడుతుంది.  


💠 ఆలయ సమయాలు ఉదయం 6.30 నుండి 10.30 వరకు మరియు సాయంత్రం 5.30 నుండి 7.15 వరకు.


💠 శనిదేవుడు ముఖ్యమైన పూజలు ఇక్కడ ప్రధానంగా జరుగుతాయి.  

మకర మాసంలో బృహత్ అగ్నిహోత్ర మహావనం, తిలమషన్నం, పొంగళ, బలివైశ్వదేవయాజ్ఞ, మేధాసూక్త సరస్వతీహవనం, శనిదోష నివారణ క్రియలు, కాలసర్పేష్టి హవనం మొదలైనవి ఇక్కడ ప్రధాన పూజలు.


💠 ఇక్కడ కుడుంబ దోషం, అపమృత్యు దోష నివారణ, ఏడు తరాల శాపాలు, పాప దోషాల హరణం, కండకశని, అష్టమాసని, మృత్యు దోష నివారణ మొదలైన వాటికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.


💠 ఈ ఆలయం అలప్పుజా జిల్లాలోని ఇరమత్తూర్ నయన్యంబలం జంక్షన్‌లో ఉంది.  నాదల అనేది ఆలయం ఉన్న ప్రదేశానికి పేరు.  చెన్నితాల సమీప ప్రధాన పట్టణం. 

పూర్తి శ్లోకాలు*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*వాడుకలోని సంస్కృత వాక్యాలు*

      *వాటి పూర్తి శ్లోకాలు*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

     *బ్రాహ్మణానా మనేకత్వం*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*పూర్తి శ్లోకం:~*


*గజానాం మంద బుద్ధిశ్చ*

*సర్పాణా మతి నిద్రతా।*


*బ్రాహ్మణానా మనేకత్వం*

*త్రిభిర్లోకోపకారకమ్॥*


*భావం:~*


*1) ఏనుగులకు మందబుద్ధి,,*


*2) సర్పములకు అతినిద్ర,*


*3) బ్రాహ్మణులకు ఐక్యత లేకుండుట*


*ఈ మూడు లక్షణాలు లోక ఉపకారం చేయటానికే। అని ఈ శ్లోకం భావం*


*శ్రీ గురుభ్యో నమః।*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

కవితా మాధుర్యం

 


భావ  కవితా  మాధుర్యం !


            చ: "  అలరుచు మల్లికా పరిణయంబని  వచ్చిరి  పువ్వుఁబోండ్లు ,  కో


                    యిల  సవరించె  గొంతు ,  తమయేలికకై  విరి తేనె పానకం 


                    బళి తతి గూర్చె , పుప్పొడుల  నత్తరులన్  బవనుండు  చేర్చె, కో


                      మల  జలజాత  పత్రముల   మాటున   నేటికి   దాగినాఁడవో ?


                              

                             ప్రకృతికి  ప్రణయాన్ని  అనుసంధానం చేయటమే  భావకవితా తత్వం. సర్వ ప్రకృతియు  భావకవులకు  ప్రణయమూర్తిగానే  దర్శనమిస్తుంది. అందుకే  ప్రకృతితో  కలసిపోవాలని  వారియారాటం. కృష్ణశాస్త్రి  స్వభావ కవియైనను,

భావకవిగా స్థిరపడినాడు. కలంకదలించి ప్రకృతిలోని  రమణీయమైన ప్రణయ తత్వాన్ని  తనకవితలో ఆవిష్కరించాడు  కవితా చిత్రాలుగా. అందులో  ఒక అక్షర చిత్రం  పై పద్యం.


                           గాలికి తలలూపే పూలబాలలు, విలాసంగా,కులాసాగా పచారులుచేసే తుమ్మెదలూ, కొమ్మపై గొంతుసారించే  కోయిలలు. గాలికి రేగే పరాగాలు. సరాగమాడుతూ ఉంటే,

ఆసుందర ప్రకృతి యంతా వారికి  పెళ్ళిపందిరిగా  ఊహాలోకంలో  తళుక్కున మెఱసింది. అంతే  పైపద్యం అవతరించింది  కవితా

చిత్రాంగా .


              భావము: మల్లికకు పెళ్ళియని సంతోషపడుతూ  పూలన్నీ పేరంటాళ్ళై  విచ్చేశాయి. కోకిల గొంతు సవరించి సన్నాయి వాయి

స్తోంది. తమదొరకోసం తేనెటీగలు  పానకం సిధ్ధంచేశాయి. అత్తరు ,గంధము మొ:నవి సమీరుడు ,సమీకరించి తెచ్చాడు. అన్నీ సిధ్ధం చేసి కొన్నాం ఓపెళ్ళికొడుకుగారూ( తుమ్మెదరాజా!)  మీరెందుకండీ  లేత తామర ల చాటున దాగినారు.  రండి రండి ,యని పెండ్లికొమరుని 

యాహ్వానిస్తున్నారు కవిగారు.


            పెళ్ళి యేర్పాట్లు  చక్కగా వర్ణించారు శాస్త్రి గారు. మల్లిక పెళ్ళికూతురు, తుమ్మెదరాజు పెండ్లికొమరుడు. పూలన్నీ పెళ్ళికి పేరంటాండ్రు .కోకిల కూతలు సన్నాయిలు. తేనె పానకం  పూలపుప్పొడుల గంధాలు. ఇలా యెదురు సన్నాహానికి కావలసిన వన్నీ సర్దుబాటు చేశారు. పెళ్ళిళ్ళలో  వరుడు అలగటం దాగుకోవటంకూడా ఒక భాగమే  దానిని కూడా  శాస్త్రిగారు విడిచి పెట్టలేదు.


                            ఈవిధంగా  ఒక  చంపక  మాలతో  మనోజ్ఙంగా  మల్లికకు తుమ్మెద వరునితో  వివాహం 


                                           జరిపించేశారు. ఎంత  ముచ్చటగా ఉందీపద్యం! 


                                                ఇదండీ భావ  కవితా  మాధుర్యం!


                                                         స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

25. " మహా దర్శనము

 25. " మహా దర్శనము " --ఇరవై ఐదవ భాగము--ఉపనయనము --1


25. ఇరవై ఐదవ భాగము-- ఉపనయనము --1



          చైత్ర శుద్ధ చతుర్థిన దేవరాతుని ఇంట్లో దేవతా సమారాధన. రాజధానిలోనున్న సర్వులకూ సంతర్పణ ఆహ్వానము వెళ్ళింది . "బ్రాహ్మణ భోజనము అయినవెంటనే రాజువారికి వర్తమానమును పంపవలెను . అంతవరకూ మహారాజులు ఉపవాసముతో వేచియుంటారు " అని భార్గవుడు అందరినీ తొందర చేయుచున్నాడు . 


         సకాలములో బ్రాహ్మణులు భోజనానికి కూర్చున్నారు . రాజ భవనమునకు ఆచార్యుడూ , భార్గవుడూ స్వయముగా వెళ్ళి చెప్పి వచ్చినారు . ఆ దినము సూర్యుడు దిగే సమయమునకు వైశంపాయనులు , ఉద్ధాలకులు , బుడిలులూ , భార్గవులూ , దేవరాతులూ అందరూ ఒక చోటికి చేరినారు . ఎక్కడో ఉన్న మహిదాసులను కూడా పిలిపించుకున్నారు . ఆరు మందీ కూర్చొని , మరుసటి దినము చేయవలసినదానిని గురించి ముచ్చటించుకుంటున్నారు . 


        దేవరాతుడు  ప్రసన్నముగా నవ్వుతూ , " బుడిలులు పురోహితులన్న తర్వాత యజమానుని భారము తగ్గిపోయింది . మీరు చెప్పినట్లు చేస్తే చాలు , అంతే కదా ? " అన్నాడు . 


         బుడిలులు అతని నవ్వుకు ఉత్తరముగా ఒక నవ్వు నవ్వినా , గంభీరముగా , " ఏమయ్యా , కలియుగపు బ్రాహ్మణుల  వలె అంతటినీ పురోహితుల నెత్తిపై వేస్తానంటున్నావే ? అలాగ కారాదు . ఇక్కడ ఎంతైనా , నువ్వు యజమానుడవు . నేను నీ ఋత్త్విజుడను . కాబట్టి , రేపు జరగవలసినదంతా ఈ దినమే నిర్ధారించుకో . ఇది తర్క పాదము కాదు , క్రియాపాదము . ఏమంటావు ? " అన్నారు . 


         వైశంపాయనులు అన్నారు , " సరే , ఆచార్యా , బుడిలులు అనుజ్ఞనిచ్చినారు , సరిపోయింది . ఏదో మొక్కుబడిగా , తూతూ మంత్రముగా ఉపనయనమని చేసి , మంత్రములు చెప్పి , కర్మము ముగించుట ఒక విధము . అయితే , మాతా పితరుల నుండీ వచ్చిన జన్మమును శుద్ధి చేసి , ఇంకొక మంత్ర జన్మమును ఇచ్చి , తల్లిదండ్రుల వంశములు రెండింటినీ ఉద్ధారమగునట్లు చేసి , వటువును కూడా ఉద్ధరించుట మన పద్దతి . నువ్వు అధ్వర్యుడవై వచ్చినపుడు , దేవతా సాక్షాత్కారము చేసుకొని , హోమము చేసి దీక్షితుడిని ఉద్ధరించుట కన్నా ఎక్కువ కార్యమిది . " 


        ఉద్ధాలకులు అన్నారు : " ఇది, ఎంతైనా , వటువు రెండవ జన్మ యెత్తు సందర్భము . మీరు కూడా , తెలిసినవారు , ఆస్తికులు , శ్రద్ధావంతులు . కాబట్టి పూర్వభావియై , ఏమేమి చేయవలెనో తెలుసుకొని ఉండండి , తప్పేమి? " 


         దేవరాతుడు భార్గవుని ముఖము చూచినాడు . అతడు మహిదాసునికి సైగ చేసి చూపించినాడు . మహిదాసుడు తలయెత్తి చూసి , తనవైపుకు చూస్తున్న ఆచార్యుని చూసి , " అవశ్యము , పెద్దవారు చెప్పినది సరిగ్గా ఉంది " అన్నారు . ఆచార్యుడు సమాహితుడై కూర్చున్నాడు . 


         ఆ వేళకు మహిదాసుని కొడుకు శాండిల్యుడు వచ్చినాడు . మహిదాసుడు వాడిని పిలచి  బుడిలుడు మాట్లాడుతున్న విషయమును చెప్పి , " కూర్చో , విను , ఈ మహానుభావుల మాటలు వినే భాగ్యము మరలా ఎన్నటికో "  అన్నాడు .


         బుడిలులు ఆరంభించినారు :  " ఇది , అంటే ఈ ఉపనయనము అనేది , అగ్ని, వాయు , ఆదిత్యుల తేజస్సును  సంగ్రహించు కార్యము . దేహములో అగ్ని , వాయు , ఆదిత్యులు ఉన్నారు . నోరు , నాసిక , కన్నులలో వారు ఉండి వ్యాపారమును చేయుచుండుట యే కొద్ది మందికో తప్ప ఎవరికీ తెలియదు . ఈ ముగ్గురే భౌతిక ప్రపంచములో భూమి , అంతరిక్ష , ఆకాశములలో ఉన్నారు . ఈ ముగ్గురు దేవతల అనుగ్రహమును తండ్రి కొడుకుకు సంపాదించి ఇచ్చు సంస్కారము ఈ ఉపనయనము . ఉపనయనమైన వెంటనే వటువు స్వతంత్రుడగును . స్వయముగా అగ్ని , వాయు ఆదిత్యులను ఆరాధించువాడగును . రేపటి దినము మొదటి పని అగ్నిని ఆరాధించుట. రెండవది , ప్రాణమునకు పదే పదే వచ్చి ఆవరించు అశౌచమును పోగొట్టుటకు ఆచమనము చేయుటను నేర్పుట. మూడవది , ఆదిత్యుని చూపించి , అతని సావితృ  కిరణమును సంగ్రహించి దానిని హృదయము నందు నింపుకొనుట . ఈ ముగ్గురు దేవతలను వేరే వేరే అనుకొని కర్మ చేసి కృతకృత్యుడయితే కర్మకాండలో కృతార్థుడగును . వీరంతా ఒకరే అనుకొని చేస్తే జ్ఞాన కాండమగును . ఇలాగ , రేపటి దినమున జరగబోవు కార్యము , కాండద్వయమునకు బీజమును ఆపాదించునది . "


         శాండిల్యుడు లేచి బుడిలులకు నమస్కారము చేసినాడు . : ఈ మాటలన్నీ మాకు ఏదో ఒక రీతిలో పరిచితములే . అగ్ని , ఆదిత్య , వాయువులు మేము అహర్నిశలూ అనుసంధానము చేసుకొను దేవతలు . వారిని వేరే వేరేగా చూచుట , ఒక్కటిగా చూచుట , ఇది మాకు అర్థముకాని విషయము . కాబట్టి నామీద కృపతో దీనిని ఇంకొంచము వివరముగా చెప్పండి " అని ప్రార్థించినాడు . 


         బుడిలులు అటులనేనని తలయూపి చెప్పనారంభించినారు : " ఈ ఉపనయనము చేసుకున్నవాడు ద్విజుడవుతాడు . గురు , వేద , వ్రత , దేవతా సామీప్యమును పొందును . ఈ ఒక్క కర్మలో మాత్రమే , ఆచార్యుడు , శిష్యుడూ ఇద్దరూ కర్మాధికారులుగా ఉండునది . ఆచార్యుడు కావలసినవాడు పన్నెండు వేలసార్లు గాయత్రీ మంత్రజపము చేస్తేనే , అతడికి శిష్యునికి ఉపదేశము చేసే అధికారము వచ్చేది . కాబట్టి మన ఆచార్యులు మొన్నటినుండీ పట్టుదలతో కూర్చొని , పన్నెండు వేల సార్లు గాయత్రి జపము చేసినారు . రెండవది , ఆచార్యుడూ , శిష్యుడూ ఇద్దరూ కృఛ్రమును - అదికూడా మూడు సార్లు - చేసుకోవలెను . ( కృఛ్రము అంటే , మూడు దినములు పగటి పూట మాత్రమే , మరి మూడు దినములు రాత్రి పూట మాత్రమే భోజనము చేసి, ఇంకో మూడు దినములు అయాచిత భోజనము చేసి , తరువాత మూడు దినములు ఉపవాసముండుట. దీనినే సాంతపన వ్రతము అని కూడా అంటారు ) ఆచార్యుడు అజ్ఞాతముగా సంభవించిన పాపపు ప్రాయశ్చిత్తముగాను ,  శిష్యుడు కామాచారము , కామమైన కామ భక్షణాది దోషములకు ప్రాయశ్చిత్తముగానూ !.  తరువాత , దేవతలనూ , పితరులనూ పూజించి , వటువుకు చౌల భోజనములను చేయించి , ఆచార్యుని వద్దకు సుముహూర్తములో పిలుచుకు వస్తారు . అనగానేమి ? ప్రాణమునకు అన్నమునిచ్చి , దానిని సంతృప్తి పరచిన తరువాతనే మిగిలిన కార్యక్రమము . ఇదంతా అర్థమయిందా ? "  


" అయింది , తరువాతివి అనుజ్ఞనియ్యవలెను . " 


         " అనంతరము ఆచార్యుడు శిష్యుడి కోసమై హోమము చేయుటకు లౌకికాగ్నిని తెప్పించి దానిని మంత్రాగ్నిగా చేయును . దానిలో హోమము చేసి వటువుకు కౌపీన ధారణము చేసి  , వాడికి రెండవ జన్మ రానియ్యమని , మాతృ గర్భమునందున్న ఉల్బము ( మాంసపు తిత్తి ) ను పోలియుండు కొత్త బట్టలను ధరింపజేసి , కప్పును . అప్పుడు చెప్పు మంత్రములకు దేవతలు ఎవరో తెలుసా ? మిత్రావరుణులు . మిత్రావరుణులంటే ఎవరు ? పగటికీ , ప్రాణవృత్తికీ దేవత మిత్రుడు ( సూర్యుడు ) . రాత్రికీ , అపాన వృత్తికీ దేవత వరుణుడు . అంటే , రాత్రింబగళ్ళనూ  ప్రాణాపానములనూ అనుసంధానము చేయునది ఈ కౌపీన వస్త్ర ధారణ..... ఆ ? "


         " అనంతరము యజ్ఞోపవీత ధారణము . యజ్ఞోపవీత ధారణ మంత్రమునకు అధిదేవత ఆ పరమాత్మయే ! ఆ మంత్రపు అర్థమేమి ?  " ఓ యజ్ఞోపవీతమా !  మమ్మల్ని అవిద్యాది దోషములనుండీ తప్పించు . నువ్వు ప్రజాపతితో పాటూ పుట్టినవాడవు . మమ్మల్ని , యజ్ఞ స్వరూపుడైన విష్ణువు వద్దకు పోవునట్లు చేయి . బలిష్ఠుడవైన నిన్ను ధరించుట వలన నాకు బ్రహ్మ వర్ఛస్సు లభించనీ ! అని దాని అర్థము . తరువాత , ఆచమనము . ఆచమనము అంటే ఏమిటి ? ప్రాణమును కప్పుకొనుట / రక్షించుకొనుట . అంటే , ప్రాణానికి సంజీవని వంటిది ఆచమనము . ఆ తరువాత , తన కుడిచేతిని పట్టుకొని తనను నడిపించవలెనని , పవమానాగ్ని , ప్రజాపతులకు హోమము చేయును . అంటే , అగ్నిని గురించి , ప్రాణాగ్నుల జనకుడైన విరాట్పురుషుడిని గురించి హోమము చేయును . అర్థమైనదా ? " 


         " అప్పుడు ఆచార్యుడు , సూర్యాత్ముడూ , అగ్న్యాత్ముడూ యై , తన ముందున్న కుమారుడు శుచి కావలెనని సూర్యదేవతా ప్రీతి కోసము అంజలి క్షాళనము చేయును ( చేతులు కడుగును ) . అప్పుడు చెప్పే మంత్రపు అర్థము ఏమిటి ? ’ మేము సవితృదేవుని వైపు వారము . శ్రేష్ఠమూ , సర్వమునూ ఇచ్చునదీ , శత్రు నాశకరమూ అయిన ఆతని ధనమును పొందెదము గాక " అని . ఇక్కడ శత్రు నాశకరము అంటేనేమి ? శత్రువంటే కామము . కామము లేకుంటే పూర్ణము కాగల చేతనమును ,  కామము అపూర్ణము చేయును అన్నతర్వాత , ఇక కామమున కన్నా   పెద్ద శత్రువుంటుందా ? ఈ మంత్రమును చెప్పి, తన పాత్రలోని నీటిని వటువు పాత్రలోకి , వటువు చేతులనుండీ  ఆచార్యుడు వదలును . దీనివలన ఏమగును ? ఆచార్యుని దేహములోనున్న శక్తి నీటి ద్వారా వటువును చేరును . అప్పుడు వటువు దానిని గ్రహణము చేసి శిష్యుడగును . అలాగ , అప్రత్యక్షముగా సిద్ధమైన శిష్యత్వమును ప్రత్యక్షము చేసుకొనుట హస్త గ్రహణము . అది కూడా అటులనే ! సవితృ దేవుని అనుజ్ఞతో అశ్వినీ దేవతల బాహువులనుండీ , పూషుని హస్తములతో, " హే , ఇంతటి దేవా , నీ హస్తమును పట్టుకొనెదను " అని మంత్రము . మరలా రెండు సార్లు పాత్రలో నుండీ నీరు దోసిళ్ళతో శిష్యుడి పాత్రకు వదలినపుడు " సవితృడు నీ హస్తమును పట్టుకున్నాడు .  అగ్ని నీకు ఆచార్యుడైనాడు " అని చెప్పును . దీన్ని క్రియాపదము అంటారా ? లేక పొద్దు గడుపుటకు ఆడే మాటలంటారా ? "


        ఈ సారి మహిదాసుడు మాట్లాడినాడు ,  "  అగునా మరి ? ఆచార్యుడైన వాడు తనలో అశ్వినులనూ , పూషుడినీ , అగ్నినీ ఆవాహించుకోక పోతే ఈ శిష్యత్వము సిద్ధమగునా మరి ? కాబట్టి ఇది క్రియా పదమే , సందేహము లేదు ".


         బుడిలులు కొనసాగించినారు : " అనంతరము వటువును వ్రతపతియైన ఆదిత్యునికి ఇచ్చెదను అని సంకల్పించి , ఆచార్యుడు వటువును ఆదిత్యునికి చూపి , " సవితృ దేవుడా ! ఈ బ్రహ్మచారి నీవాడు . వీడిని కాపాడు ’ అని వటుదానము చేయును . అనంతరము శిష్యాచార్యులు ఇద్దరూ అగ్ని వద్ద పరస్పర అభిముఖముగా నిలచి , ఆచార్యుడు ’ నువ్వు భాస్కరుడి బ్రహ్మచారివి . ప్రాణుడి బ్రహ్మచారివి . భాస్కరుడు భాస్కర రూపుడవైన నిన్ను ఉపనయనము చేసినాడు ( తనవద్దకు చేర్చుకున్నాడు ) ఆ భాస్కరుడికి నిన్ను ఇచ్చెదను "  అని ప్రతిజ్ఞ చేయును . తదనంతరము , వాడిని ’ శ్రేయస్వి యవనీ ’ అని పూర్వాభిముఖముగా చేసి ’ ధీరులూ , కవులూ అయినవారు మనఃపూర్వకముగా వీడిలో దేవతలు ఉండునట్లు చేసి రెండవ జన్మను ప్రసాదించగలరు ’ అని వాడి భుజములను తాకి , తరువాత వాడి హృదయమును తాకును . తాను భుజముల ద్వారా అనుగ్రహించిన దేవతాంశములు వాడి హృదయములో ఎప్పటికీ నిలచి ఉండనీ అని దాని రహస్యము . 


         " అప్పుడు ఆచార్యుడు కుమారుడిని దక్షిణములో కూర్చోబెట్టుకొని వాడిచేత అగ్ని కార్యమును చేయించును . వటువు అగ్ని దేవునితో , " ఓ జాతవేదుడా , అనగా , పుట్టినపుడే సర్వమునూ తెలిసికొనియే పుట్టు అగ్ని దేవుడా ! నేను నీకు సమిధలను ఆహుతినిచ్చెదను .   నువ్వు సమిధల వలన వర్ధిల్లునట్లే , మనము -గుర్తుంచుకో , ’ నేను ’ కాదు , -మనము బ్రహ్మవర్ఛస్సు తో , అనగా ధ్యానముతో వర్ధిల్లెదము . " అని సమిధాదానము చేయును . అనంతరము అగ్నికి అరచేతులను చూపించి , మూడు సార్లు , నీ తేజస్సు నాకు కూడా రానీ ! యని తన ముఖమును తుడుచుకొనును . అక్కడ కూడా ఒక రహస్యముంది . అగ్ని , వాయు , ఆదిత్యులు ముఖ , నాసిక , చక్షువులలో ఉందురు . అగ్నియొక్క తేజస్సు ఆ ముగ్గురిలోనూ కనపడనీ ! యని ఒక అభిప్రాయము . "


          అంతా తలలూపారు. బుడిలులు మరలా  , :   అనంతరము అగ్నిని ఉపస్థానము చేసి , అనగా లేచి నిలబడి స్తుతి చేసి ’ నాకు మేధనూ , ప్రజ్ఞనూ ఇవ్వు . అగ్ని తన తేజస్సునూ , ఇంద్రుడు ఇంద్రియమునూ , సూర్యుడు ప్రకాశమునూ ఇవ్వనీ ! . హే అగ్ని దేవుడా ! నీ దయవలన నేను తేజస్విగనూ , వర్ఛస్విగనూ , హరస్విగనూ , దానపాత్రుడిగనూ ( దానమునకు అర్హుడు ) కానిమ్ము . ’ అని ప్రార్థించి అనంతరము రుద్రుడిని రక్షణార్థము వేడుకొనును . రుద్రుడనగా మరేమిటో , మరెవ్వరో కాదు , ’ ప్రాణానాం గ్రంధిరసి రుద్రః’.   ప్రాణములు ఒకదానినొకటి సంధించిన వెంటనే చెలరేగిపోవును . అదే రుద్రుడు . మన ఇంద్రియముల నుండీ బయలువెడలు వృత్తులన్నీ ప్రాణములే . మనము కార్యాంతరములో నున్నపుడు మనసు అందులో నిమగ్నమై ఉన్నందువలన , వృత్తులు  మననుండీ బయటికి వెదజల్ల బడుతున్నది మనము చూడలేము . అలా చూచినవారికి రుద్ర దర్శనమగును. ఆ రుద్రుడు పుట్టిన వెంటనే , ’ దేనిని చంపవలెను ? , దేనిని ఘాతము చేయవలెను ? ’ అనియే కార్యోన్ముఖుడగును . కాబట్టి ఆ రుద్రుడిని , " ఓ రుద్రా ! , మా పిల్లలను , మనవలనూ చంపవద్దు  , మా గోవులను , అశ్వములనూ చంపవద్దు . మా వీరులను చంపవద్దు . నీకు హవిస్సులను ఇచ్చి ప్రసన్నుడిని చేసుకొనెదము ’ అని రుద్రుని నుండీ రక్షా యాచన చేయును . అక్కడ రక్షను తీసుకొని యథా స్థానములలో ఉంచుకొనును . " 

Janardhana Sharma

శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 22

 _*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 22 భాగము*_

🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄


*యకులు బందీకృతులగుట:*


రాజు హఠాత్తుగా ఏ హేతువు లేకుండా మృతి చెందడం చాలా అనుమానాలకు దారి తీసి మంత్రులు గాయ కులను బంధించి తెమ్మని ఆనతిచ్చారు.


ఆ బందీకృతులైన గాయకులనిలా ప్రశ్నించాడు మంత్రి:


మంత్రి : మీరు లోనికి పోవుటకు ఎవరి అనుమతి పొందారు?


గాయకులు : అయ్యా! మహారాజు గారే మమ్మల్ని పిలిపించు కొన్నారు.


మంత్రి : మీరు పాడిన పాట లేమి?


గాయకులు: భ్రమరగీతలండి. 


మంత్రి : ఈ పాట లోని భావ మేమిటి?


గాయకులు: మాకు తెలియదండి. మేము తెలివిగల వాళ్ళం కామండి.


మంత్రి : మీరు నిజంగానే తెలివిలేని వారే! నిజం చెప్పండి.


గాయకులు : ప్రభో! లోకమే నిజం కాదు. ఇంక మా మాటలు నిజమని ఎలా చెప్పగలం?


మంత్రి: గాయకులారా! ఒకటి మాత్రం నిశ్చయం. పాటలు పాడి మా రాజు ప్రాణాలు తీశారు.


గాయకులు: స్వామీ! మేము పాటలు పాడినపుడు రాజు గారికి చాలా దూరంలో ఉన్నామే! రాజుగారి ప్రాణాలు తీయడం ఎలా సాధ్యం?


భటులతో గాయకులను కట్టడిలోనే ఉంచి జాగ్రత్తగా చూడమని చెప్పి మంత్రి నిస్పృహ తో నిష్క్రమించాడు. ఇంతలో రాజభటులు వచ్చి శంకరాచార్యుడు తమకు దొరకిన మృతదేహంలో ప్రవేశిం చిన ఉదంతం భయకంపిత గాత్రులై మంత్రులకు తెలిపారు. మంత్రి కూడ భయంతో తిరిగి గాయకుల దగ్గరకు వచ్చి క్షమించు డని ప్రార్థించాడు.


పద్మపాదాదులు జరిగిన  వృత్తాంతం మిగిలిన శిష్యులు వచ్చి చెప్పగా విని ఆనందం తో పరుగు పరుగున గురుసన్నిధి చేరు కున్నారు.


 *‘జితాస్మి’:*


శంకరాచార్యస్వామి గగనమార్గంలో మండనమిశ్రుని గృహం

చేరుకొన్నారు గడువు పూర్తి అయ్యేసరికి. మండనమిశ్రుడు అత్యంత గౌరవంతో శంకరునికి ఎదురేగి వందనములాచరించి షోడషోపచారములతో పూజించి గురువులను ఉద్దేశించి “జగద్గురు దేవా! తమ కరుణా కటాక్షము వలన పరమేశ్వర తత్త్వం తెలిసికో గలిగాను. నా ఇల్లూ, వాకిలీ, నా ధనమూ, నా సర్వస్వం మీ అధీనం. తమరే నా గతి. వేరొండు గతి లేదు. ఈ దీనుని శాసించుడు. తమ ఆజ్ఞకు సర్వదా బద్ధుణ్ణి” అని వేడుకొన్నాడు మండన మిశ్రుడు. 


నగరంలోని వారందరూ శంకరుడు వచ్చిన వార్త విని ఒకరొకరే వచ్చి పాదాభివందనం చేసి కొంటున్నారు. ఇంతలో ఉభయభారతి వచ్చి “సకల విద్యలకు ఆలవాలమైన శ్రీభగవానుడా! సర్వభూతములకు ఆధారమైన పరబ్రహ్మ స్వరూపా! ఆచార్య దేవా! అనుకొన్నటుల నాతో వాదించ వలదు. సర్వశాస్త్రములలో పూర్ణుడవై యున్న నీతో మానవులు వాదించ నుద్యుక్తులగుట వెర్రితనము!


మీ తోటి వాదము మీ కొఱకు నా కొఱకు కాదు గదా! భాస్కర ప్రభ ముందు దివిటీల వలె మా ప్రతిభ వెలవెలబోతుంది. మీతో అపజయమే మాకు ధన్యతనిస్తుంది. జితాస్మి!" అని పలికెను. దానికి బదులుగా శంకరుడు ఉభయభారతితో "తల్లీ! నీవు ఆదిజుడైన బ్రహ్మ ఇల్లాలివి. విద్యలకు సామ్రాజ్ఞివి. నీకు తెలియనిది విశ్వంలో లేదు. నీ కరుణతోనే ఎవరైనా తెలివి నార్జించేది. నీవు బ్రహ్మలోకానికి తిరిగి వెళ్ళినా ఈ లోకంలో జ్ఞానరూపంలో ఉండా లని నా ప్రార్థన.” అని అడగగా ఉభయభారతి సరేనని వరమిచ్చి బ్రహ్మలోకానికి చేరుకొంది.


*మండనమిశ్రుని సన్న్యాసాశ్రమము:*


అటు ఉభయభారతి నిజలోకానికి తిరిగి వెడలగానే మండన మిశ్రుడు తను చేయవలసిన కర్మలను ముగించుకొని, నిత్య కర్మాచరణలను మనస్సులో విడనాడి అగ్నిని తనలో ఐక్యం చేసికొని, తనకున్న ధన భాగ్యాలను బ్రాహ్మణు లకు, పేదలకు పంచి పెట్టివేశాడు. ఇంక తన కనేదేదీ ప్రాపంచిక పరమైన వస్తువులు లేకుండా త్యజించాడు. ఒకప్పుడు తాను నిరసించిన సన్న్యాస ధర్మాన్ని శంకరుల కరుణతో చేపట్ట నున్నాడు. ముందుగా ఆ తురీయాశ్రమ ధర్మాలను పరిశీలించు కొన్నాడు. వాటిని నిరవశేషంగా ఆకళిం చుకొని, శంకరాచార్య స్వామిని సన్న్యాస ఆశ్రమము నిప్పించ మని మనఃపూర్వక ముగా వేడుకొన్నాడు. ఆచార్యస్వామిముందు శాస్త్రీయముగా శిఖా యజ్ఞోపవీతములు విసర్జించి, కాషాయ వస్త్రధారియై, దండ కమండలములు చేకొని గురుదేవునికి సాష్టాంగ ప్రణామము చేసి శిష్యుడయ్యాడు. ఈ పరిణామము కేవలము వాదపరీక్షలో ఏర్పరచు కొన్న కట్టడినను సరించి కాక నిష్కల్మష బుద్ధితో మనశ్శుద్ధితో కోరుకొని నిశ్చయించు కొన్న నిర్ణయం. ఆ క్షణంలో ఆయనకు పూర్వాశ్రమం ఒక కలలా అనిపించింది. ఇన్నాళ్ళుఅంధకారంలో ఉండి నేడు ఆచార్యుల తేజస్సులో వెలుగు లోనికి వచ్చినట్ల యింది. మండనుని పూర్వపు శిష్యులు కూడా శంకరుని శరణుజొచ్చారు. క్రొత్త ఆశ్రమంలో మండన మిశ్రుడు ‘సురేశ్వరాచా ర్యుడు' అయ్యాడు.


*మహావాక్యోపదేశము:*


శిష్యుని తనంత వానిగా చేయాలని గురువులనుకుంటారు. మోక్షమార్గమును చూపువాడు గురువు. సురేశ్వరాచార్యునికి  శంకరులు ఈ విధంగా బోధించారు. 


“నాయనా! మనం నిద్రలో కలలు కంటాము. మెలకువ రానంతవరకు అవి నిజముగానే తోచును. మెలకువ రాగానే అవి అసత్యములని తెలు స్తుంది. ఈ సంసారం కూడా ఒక పెద్ద కల. తెరపై బొమ్మలు వస్తాయి. అవి రకరకాలుగా ఆడుతాయి. నిన్ను నవ్విస్తాయి, ఏడిపి స్తాయి. అంతా అయిన పిమ్మట ఏమీ ఉండదు. బొమ్మలను ఆడించే వాడు మనకు కనబడడు. తెరవెనుక ఉంటాడు. మొదట గాని, మధ్యలో గాని, చివర గాని నీకు కన్పట్టడు. అట్టిదే ఈ జనన మరణ క్రీడ. ఇదంతా ఉన్నది ఉన్నట్లు తెలిసికొనడమే తెలివికి సార్థక్యం. ఈ చూచుచున్నదీ లేదు. ఈ శరీరమూ లేదు.


జననమూ లేదు. మరణమూ లేదు. అన్ని కాలములలో ఉన్నది ఒకటే. అది సద్వస్తువు. అదే నీవు. దానినే ఆత్మ అంటారు. అదిఅంతటా నిండి ఉంటుంది. జీవుడు వేరు, ఆత్మ వేరు అనుకోవడం అవివేకం. అజ్ఞానంతో ఈ శరీరాన్ని 'నేను' అని తలుస్తున్నావు. వస్త్రం చిరిగినపుడు పారవేసి క్రొత్త బట్ట కట్టుకొన్నట్లుగానే ఈ శరీరం నశించిన తర్వాత మరో శరీరాన్ని ఆశ్రయిస్తావు. కనిపించే వన్నీ నశ్వరాలే. శరీరం కూడా కనిపించేదే కాబట్టి అది కూడ నశ్వరమే. 'నేను చిక్కాను, బలిశాను, మగవాణ్ణి, ఆడదాన్ని, ముసలివాడనయ్యాను.ఇత్యాదులు అన్నీ శారీరకములే కాని, 'నీకు' చెందవు. ఆత్మకు ఆదిమధ్యాంతములు లేవు. 'దేహమే ఆత్మ, ఇంద్రియాలే ఆత్మ, ప్రాణమే ఆత్మ, మనస్సే ఆత్మ, బుద్ధియే ఆత్మ,.' ఈ విధంగా ఆత్మను ఎన్నిటి యందో ఆరోపించే మతములు ఉన్నవి. దేహము, ఇంద్రియములు, బుద్ధి, ప్రాణము, మనస్సు, ఇవి జడపదార్థములు. అందువల్ల ఇవి ఏవీ ఆత్మ కానేరవు. ఆత్మ వీటికి అన్నింటికీ అతీతముగా సాక్షీ భూతముగా ఉంటుంది. ఆత్మకు వికారములు ఉండవు. చైతన్యముతో స్వయంప్రకాశముగా ఉంటుంది. అదియే 'నీవు'. సర్వజగత్తుకూ ఆత్మయే కారణమై ఉన్నది. అది పరిపూర్ణము. పరిపూర్ణ మైన వస్తువు ఒకటియే గాని రెండుగా ఉండదు. 


ఈ సంగతులు ఉపనిష త్తులలో కలవు. తెలియని వారు వేర్వేరు విధములుగా వచిస్తారు. ఆ పలుకులు నమ్మిన మూలాననే నాస్తిక భావనలుమొలకెత్తాయి. పరమాత్మకు నిర్దిష్టమైన గుణములు లేవు. అందువలననే నిర్గుణుడన్నారు.


సురేశ్వరా! నీకు అనుమానములు మెండుగా ఉన్నవి. 'సంశయాత్మా వినశ్యతి' అన్నట్లు సంశయం గలవానికి నాశనం తప్పదు. కాబట్టి నీ సంశయాల నన్నిటినీ తక్షణమే  విడనాడుము. తెలిసి కొనే తెలివే ఆత్మ. ఆత్మవస్తువును నేనే అని నమ్మినవారలు అరుదు. 


శ్రీకృష్ణభగవానుడు తానే ఆత్మగా లోకానికి వెల్లడి చేశాడు. ముత్యాలహారంలో సూత్రమున్నది. సూత్రములో ముత్యాలు ఉండవు. సూత్రం తెగినచో ముత్యాలు వేరవు తాయి. జగత్తు ముత్యాల వంటిది. ఆత్మ సూత్రము. 'తత్ - త్వం' అనే ఈ రెండు పదములే జీవేశ్వరులు. పదములు వేరయినా అందులోనున్న చైతన్య మొక్కటే! ఉపాధులకు అదిష్టానంలో ఏకత్వా న్ని చూచుకోవాలి. కుండకూ మట్టికీ అధిష్ఠానం ఒక్కటే. అట్లుగానే 'తత్ - త్వం' లోని వాచ్యార్థాన్ని విడచి లక్ష్యార్థాన్నే గ్రహించ వలెను”.


అప్పుడు సురేశ్వరునికి ఒక సందేహం పొడ చూపింది: "గురుదేవా! బ్రహ్మపదార్థం ఉంది కాని మనకందరికీ కనిపించే ఈ జగత్తే లేదంటున్నారు. అది ఎట్లా? ఉన్నది తెలియబడుచున్న దానిని లేదు అంటు న్నారు. కనిపించని

ఆత్మపదార్థమే ఉన్నది అంటున్నారు. ఇది ఎలాగ? దయతో సెలవిస్తారా?”


శంకరాచార్యులు ఈ విధంగా ఆ శంకకు ఉత్తర మిచ్చారు: “సురేశ్వరా! భావాభావాలు, ఉనికి లేములు వ్యవహారదశ లోనివి మాత్రమే. పరమార్థంలో ఇది వర్తించదు. లేనిది అనుకొన్నది తెలియ బడవచ్చును. ఉన్నది తెలియబడాలనే నియమం లేదు. జగత్తు లేకపోయినా తోచవచ్చు చున్నది. ఈ తోచబడేది అంతా ఆత్మయే. 'రజ్జు సర్ప భ్రాంతి' వలె సర్పభ్రాంతికి కారణము త్రాడే. ఈ మాట చాలా చోట్ల విశదంగా కనిపిస్తుంది. బంగారం తో తయారైనది ఉంగరం. మట్టితో తయారయినది కుండ. నీటి స్వరూపమే మంచు గడ్డ. ఇలాంటి వస్తువులలో నీకు పూర్వరూపం కనిపి స్తుందా? కాని వాటికి వీటికి తేడా మృగ్యం. ఆ పూర్వావస్థ ప్రచ్ఛన్నంగానే ఉంటున్నది. 'సర్వభూతేషు ఆత్మని’ అని శ్రుతి. ఆత్మ యందు జగత్తు ఉన్నది. సర్వశరీరాలలో ఉన్న ఆత్మ ఒక్కటే! ఇన్ని శరీరాలలో పెక్కు ఆత్మలు లేవు. సూర్యుని ప్రతిబింబం జలాలలో చూచినపు డు అనేకంగా గోచరించి నా సూర్యుడొక్కడే కదా! జీవులను ప్రకాశింప జేసేది ఆత్మ ఒక్కటే. అది బుద్ధినీ, ఆ బుద్ధి ఇంద్రియా లనూ ప్రకాశింప జేస్తున్నాయి. ఈ మూడింటికీ సాక్షి ఆత్మ ఒక్కటే. ఇంకొక మాట. ఆత్మతత్త్వం తెలిసి కొనాలనే సంకల్పం అందరికీ కలగదు. బహు పుణ్యం చేసు కొన్నవానికి గాని కలుగదు. 'సర్వం బ్రహ్మ' అని ప్రతి వానికి చెప్పరాదు” మరొక సంశయం లేవనెత్తాడు సురేశ్వరుడు: "స్వామీ! బ్రహ్మము మారి జగత్తు అయిందా?”


శంకరాచార్యుడు: “నీ వన్నట్లు అట్లనేవారు లేకపోలేదు. కాని నిజం వేరుగా నున్నది. పెరుగు వెనుతిరిగి పాలు అవుతుందా? ఎన్నటికీ కాదు. ఇది సాంఖ్యుల మతం. మట్టి కుండ అయినట్టు, నూలు పోగులు వస్త్రమయి నట్లు, బంగారం నగ అయినట్లు ఆత్మ జగత్తుగా అయినది. కాని జగత్తు వలె కన్పట్టును. కాని జగత్తుగా పరిణామం పొందలేదు. జగత్తు రూపంలో మిథ్య, ఆత్మరూపంలో సత్యము. త్రాడు రూపం సత్యం. సర్పరూపం మిథ్య. బ్రహ్మం ఉన్నదని, తానే ఆత్మ అని గ్రహించడం పరోక్ష జ్ఞానం. 'తానే పరమాత్మ' అనుకోవ డం అపరోక్షజ్ఞానం. దీనినే పరమానందస్థితి లేక స్వస్వరూపస్థితి అంటారు. జగద్భావన విడచి బ్రహ్మభావననే చేయుము”


కాలడి శంకర

కైలాస శంకర 

శ్రీ ఆది శంకరాచార్య 

చరిత్రము 

22 వ భాగము 

సమాప్తము 

आ*☘️🌸☘️🌸☘️


🪔🪔 గృహస్థుడు🪔🪔


🌹మన సనాతన ధర్మం మానవ జీవితాన్ని నాలుగు దశలుగా విభజించింది. ఏ దశలో ఏ విధి నిర్వహించాలో నిర్దేశించింది. ప్రతివ్యక్తీ తన జీవితాన్ని తాను చక్కగా అనుభవిస్తూనే సమాజానికి సేవ చేయడానికి ఉపయోగపడేలా ఒక మంచి వ్యవస్థను ఊహించింది. దాని ప్రకారం మనిషి జీవితాన్ని వయోధర్మాన్ని బట్టి బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలనే నాలుగు దశలుగా విభజించింది. ప్రతిదశలోనూ వ్యక్తి తన వ్యక్తిగత, సామాజిక బాధ్యతల్ని నిర్వహిస్తూనే జీవిత ధ్యేయాన్ని సాధించుకోవడానికి కృషిచేసే అవకాశం ఉంది.


🌹సన్యాసాశ్రమం అందరికీ సాధ్యం కాదు. బ్రహ్మచర్యం తరవాత సన్యాసాశ్రమం తీసుకున్నవారూ అరుదుగా ఉన్నారు. ఆధునిక కాలంలో వానప్రస్థాశ్రమం ఉనికిని కోల్పోయింది. పూర్వకాలంలో రుషులు, రాజర్షులు ఉండేవారు. కొన్ని మతాలు, భావనలు సన్యాస జీవితాన్ని ప్రోత్సహిస్తాయి. సంసార జీవితాన్ని అంతగా అంగీకరించవు. భార్యాబిడ్డలు ఆధ్యాత్మిక జీవితానికి అడ్డంకి అని భావించేవారు అన్ని కాలాల్లోనూ ఉంటారని చరిత్ర గతిని చూసినప్పుడు బోధపడుతుంది. 


🌹వివాహం చేసుకున్నవారు యోగసాధనకు పనికిరారని భావించేవారూ ఉన్నారు. గృహస్థ జీవితానికి, ఆధ్యాత్మిక సాధనకు పొంతన కుదరదనేవారు ఉన్నారు. కానీ, సనాతన సంప్రదాయాన్ని పరిశీలించినప్పుడు ఈ అభిప్రాయం ఆధారం లేనిదని తెలుస్తుంది.


🌹వేదమార్గాన్ని దర్శించిన రుషుల్లో పవిత్రమైన గృహస్థ జీవితాన్ని గడిపిన వారెందరో ఉన్నారు. వేద ధర్మాన్ని అనుసరించిన రుషులు చాలా మంది నాలుగు ఆశ్రమాల నిర్వహణలో జీవితం పరిపూర్ణత చెందాలని దర్శించి నిర్దేశించినవారే. కొందరు మాత్రం తమ స్వభావాలను బట్టి గృహస్థాశ్రమాన్ని స్వీకరించక ఆజన్మ బ్రహ్మచారులుగా ఉండేవారు. అయితే వారు తమ ప్రణాళికకు తగిన మార్గాన్ని అనుసరించారుగాని, గృహస్థాశ్రమ స్వీకరణ దోషమని చెప్పలేదు.


🌹 గృహస్థాశ్రమం మనిషి జీవితంలో కీలకదశ. సమాజ జీవితానికి కేంద్రం గృహస్థాశ్రమం. దాని ఆధారంగానే మిగిలిన జీవన శాఖలు పెరిగి వృద్ధి చెందుతాయి. అందరూ ఆ కల్పవృక్షాన్ని ఆశ్రయించి బతుకును కొనసాగిస్తారు. గృహస్థ ధర్మానికి మూలం కుటుంబం. కుటుంబ ధర్మానికి మూలాధారం దాంపత్య ధర్మం. కాలగతిలో ఎన్ని పరిణామాలు ఎదురవుతున్నా ఈ ధర్మమే పరంపరను నిలబెట్టింది.


🌹బ్రహ్మచారులకు, భిక్షువులకు, సాధు సన్యాసులకు, అంగవికలురకు పోషణ స్థానం గృహస్థుడే. | గృహస్థుడి వల్లనే మిగిలిన ఆశ్రమాలవారికి సుఖజీవనం సాధ్యమవుతోంది. గృహస్థుడు తన ధర్మాన్ని ఏమాత్రం అలక్ష్యం చేసినా సమాజ జీవనం అస్తవ్యస్తమవుతుంది. వైదిక సంస్కృతి గృహస్థుడికి అగ్ని ఉపాసన నిత్యవిధిగా పేర్కొంది. అతడు పంచయజ్ఞాలు నిర్వహించవలసి ఉంది. తన ఉనికికి, మనుగడకు కారణమవుతూ దృశ్యంగా, అదృశ్యంగా ఉన్నవాటన్నింటికీ మనిషి కృతజ్ఞత ప్రకటించడమే ఈ యజ్ఞాల లక్ష్యం. 


🌹అవి దేవ, పితృ, భూత, మనుష్య, బ్రహ్మ యజ్ఞాలు. దేవతల పట్ల కృతజ్ఞత ప్రకటించడం దేవయజ్ఞం. తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతా ప్రకటనం పితృయజ్ఞం. ఇది తర్పణ శ్రాద్ధాదుల ద్వారా జరుగుతుంది. తల్లిదండ్రుల స్థానం దేవతలతో | సమానమైనదిగా ఇతిహాస పురాణాలు చెబుతున్నాయి. ప్రకృతిలో మనతోపాటు పెరుగుతున్న ప్రాణులు మన జీవనానికి సహకరిస్తున్నాయి. ఆ జీవకోటికి ఆహారం అందించడాన్ని 'బలిహరణం' అంటారు. మనుష్య యజ్ఞమంటే అతిథి సత్కారం. బ్రహ్మయజ్ఞం అంటే వేదాధ్యయనం.


కాలంతోపాటు ఎన్నో వికృతులు ప్రవేశించి కుటుంబ జీవితం పూర్వపు ఉన్నతిని కోల్పోతోంది. ధర్మశాస్త్రానుసారం గృహస్థాశ్రమం నిర్వహించగలిగినప్పుడు సమాజంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. అదే భారతీయ చింతన.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 21

 _*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము 21 వ భాగము*_ 

🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗


*పట్టమహిషి అనుమానము:*


వివేకి, బుద్ధి కౌశలములు కలది పట్టపురాణి. తానెరిగిన అమరకునికీ చచ్చి బ్రదికిన ఇప్పటి రాజుకీ ఏ విధమైన సామ్యం లేకపోవడం. ప్రతిభలో గాని, శాస్త్ర వైదుష్యంలోకాని, వచనా చాతుర్యములో గాని, నడవడిక సొబగులో గాని, తేజస్సంపదలో గాని నేటి రాజుకు పూర్వపు రాజుకు అణు మాత్రం పోలిక లేదు. పైగా ఇతడు చూడగా చూడగా ఏ మహా మహితాత్ముడో, జగద్భాంధవుడనదగ్గ కారుణ్య నిధియో అనిపిస్తోంది.


తన అనుమానమును ప్రధానమంత్రితో విచారిం చ దలచుకొన్నది ఆ నిపుణురాలు. మహారాణి ఆజ్ఞ అందిన అమాత్య శేఖరుడు వచ్చి నమస్కరించి నిలబడి వేచియున్నాడు. మహారాణి అడుగుతోంది అతడిని: “అమాత్య వర్యా! దేశంలోని విశేషాలు ఏమిటి? మన రాజ్యపాలన గురించి ప్రజలు ఏమని తల పోస్తున్నారు?” 


అమాత్యుడు “మహా రాణీ! దేశం ఎల్లవిధాలా పరమశోభాయ మానంగా మున్నెన్నడు జరుగని రీతిలో సుఖసంపదలకు ఆకరమై ఉన్నది. ఈ మధ్యనే మంత్రి మండలి లో సమీక్ష చేసినాము. ఒక వంక అత్యంత సమ్ముదము కలిగి ఉన్నా వేరొకవంక మమ్ములను అనుమానభావము పీడి స్తున్నది. మన రేడు ఆనాడు పునర్జీవితుడైన పిదపనే ఈ ఆనందకర మైన మార్పులు సంభ వించినవి కదా!" 


మహారాణి: “ఆ భావము మిమ్ములను ఎందుకు పీడించాలి? మార్పుల వలన మేలు కలుగు తోంది కదా?”


మహామంత్రి : " అమ్మా! మహారాజు చనిపోయి మరల జీవించిన తరుణంలో ఏ మహనీ యుని దివ్యతేజమో రాజులో ప్రవేశించినదని మా ఊహ.


మహారాణి : "అగు గాక! దానికి చింతించనేల?”


మహామంత్రి: "మహారాణీ! మీరన్నట్లు మేలైన ఈ పరిణామం ఎప్పుడు మన చేయి జారి పోతుందోనన్న భీతియే మా బాధకు హేతువు”


మహారాణి: "మీ అభిప్రాయము శ్రేయోదా యకమైనది. పరిస్థితు లను కనిపెట్టి రాజ్య క్షేమంకోసం పాటుపడడం మీ బాధ్యత. అందుకు తాము సర్వ సమర్థులని మాకు విదితము.ఈవిషయములు పరమ రాజ రహస్యములని మీకు నేను వేరుగా చెప్ప నక్కర  లేదు”


మహామంత్రి : “ముమ్మాటికీ ఇది పరమ రహస్యము. మహారాణి వారి ఆజ్ఞ శిరోధార్యము. నేను సదా ఆ యత్నం లోనే ఉండి నా విధి నిర్వహిస్తాను”.


పట్టపురాణితో మాట్లా డినతర్వాత ప్రధానామా త్యుడు సెలవు తీసికొని వెళ్ళాడు. వెను వెంటనే కార్యాచరణకు ఉపక్రమిం చాడు. అమరకుని దేహంలోనికి పరకాయ ప్రవేశము చేసిన మహా వ్యక్తి తిరిగి తన దేహంలోనికి ప్రవేశించగల అవకాశాన్ని అరికట్టాలి. అందుకు చేయవలసినది ఆ వ్యక్తి యొక్క పూర్వకాయాన్ని లేకుండా చేయడమే.అందుకై ఆజ్ఞలు జారీ చేశాడు. 'రాజ్యములో నున్న మృతదేహాల నన్నిటినీ స్వాధీనం చేసికొని ప్రభుత్వపు ఖర్చుతో వాటిని దహనం చేయండి' అని సమర్థులయిన సేవక బృందాన్ని ఈ పనిలో పెట్టాడు. 'ఈ మీ కర్తవ్యంలో ఏవిధంగా అవరోధము వచ్చినా లెక్కచేయవద్దు. రహస్య ముగానున్న శవములను కనిపెట్టి వాటిని కూడా ఆలస్యం లేకుండా దగ్ధం చేయండి’ అని వారికి స్పష్టమైన నిర్దుష్టమైన ఆజ్ఞ లిచ్చాడు.


జనులీ వార్తలు విని మనరాజు ఎంత దయా మయుడు! అనాథ ప్రేత సంస్కారం చేయిస్తున్నా డని మురిసి పోతున్నారు జనులు అసలు రహస్యం ఎరుగక.


*శంకరశిష్యుల అన్వేషణ:*


గుహలో భద్రపరచిన గురువు గారి శరీరాన్ని జాగరూకతతో కాపాడు తున్న శంకరాచార్యుల శిష్యులు 'రావలసిన గడువు దాటిపోతోంది. వచ్చే జాడలు కానరావు. ఏమయింది? ఎందులకీ విలంబనము?' అని పరి పరి విధాల ఆవేదన పడుతున్నారు. 'మన గురుడు మనకు తిరిగి ప్రాప్తించునా లేదా? మహోత్తముడైన గురు సాన్నిధ్యం దొరకినదని సంబరపడ్డాము. ఇప్పుడు మనకు ఏమి గతి?' 'స్వామీ! మా అవస్థ చూచి యైనా తిరిగి వచ్చి మమ్ము కాపాడు. నీకన్న కరుణాహృద యుడు ఎవరున్నారు? నీవే రక్ష!'. ఈ రీతిగా వేదన పడుతున్న సహశిష్యులను చూచి పద్మపాదుడు వారిని చూచి "మిత్రులారా! ఎందులకీ విలాపములు? మన గురుదేవుల ఉనికిని కనుగొని మన వంతు మన విధిని చేసే ప్రయత్నం చేద్దాము. హనుమంతుడు సీతా దేవి కోసం వెదకినట్లు మన గురువును మనము కనుగొనే యత్నం చేద్దాము. యత్నంతో సమకూడని పనులుండవు.


నా భావము ప్రకారము మనం గురుదేవుని ఉనికి తెలుసు కొనడానికి ఎక్కువ శ్రమపడ నవసరముండదు. అజ్ఞాత వాసంలోనున్న పాండవులను ఎలా తెలిసికొనగలం అన్న ప్రశ్నకు భీష్ముడు చెప్పిన రీతిగానే మనం మన గురుదేవుని సులువుగా తెలిసికోవచ్చునని నా అభిప్రాయం. గురువుల రూపురేఖలు కనిపించక పోయినా వారున్న ప్రదేశం వారి  తేజోవైభ వాలతో ప్రభావితం కాక మానదు. అదే మనకు కావలసిన సంకేతం” అని చెప్పి మిగతా శిష్యులకు ధైర్యం నూరిపోశాడు.అప్పుడు పద్మపాదుడు కొందరు శిష్యులను శంకరుని శరీరాన్ని కాపాడ డానికినియమించి, మరి కొందరు సహాధ్యాయులతో కలిసి శంకరుల అన్వేషణలో బయలు దేరాడు. కొండ దిగి దగ్గర నున్న గ్రామాలు చూస్తూ వెదకడం మొదలు పెట్టారు. క్రమంగా అమరక మహారాజు నగరం చేరారు. వేళ అతిక్రమించకుండా ఒక బ్రాహ్మణుని ఇంటఅతిథు లుగావెళ్ళారు. గృహస్థు ఈ శంకర శిష్యులను చూచి "అయ్యలారా! మీరెవ్వరు? ఏ ఊరి నుండి వచ్చారు? మీ రాకకు కారణ మేమిటి? మీరు చూడగా విశిష్ట విప్రులులా ఉన్నారు” అని అడిగిన ప్రశ్నకు పద్మపాదుడు ఈ విధంగా సమాధాన మిచ్చాడు: 


"మహాత్మా! మా నివాసం కాశి. గురుధనం కోసం వచ్చి ఉన్నాము.


ఈ దేశాన్ని పాలించే రాజు ఎవరు? ఆయన ఎట్టివాడు? పండితులను సన్మానించునా? ఆయన ఏయే విద్యలలో నిష్ణాతుడు? ఏ విద్య యందు ఆయనకు అభిరుచి మెండు?” అని తిరుగు ప్రశ్నలు వేసెను. అందులకు సమాధానం గా ఆ ఇంటి యజమాని ఇలా అన్నాడు: "మహాత్ములారా! మా రాజు మంచి వాడనే అనాలి. ఆయన పేరు అమరకమహారాజు. సకల విద్యలలోను ఆరితేరిన వాడు. రామ రాజ్యమునే మైమర పించు పరిపాలనము. ఇప్పుడు మా కెవరికీ ఏ కొరతా లేకుండా బ్రదుకుతున్నాము”.


"మీ రాజునకు వయస్సు ఎంత?” అని అడిగిన ప్రశ్నకు “వయస్సుచే పెద్దవాడైనను చూపరులకు చిన్నవాడి లాగునే కన్పట్టును” అని బదులు చెప్పాడు గృహస్థుడు. అప్పుడు పద్మపాదుని అనుమానము బలమై, మరల ఇలా అడిగాడు: “విప్రోత్తమా! మీ మాటలు కొంచెము సంశయాత్మకంగా ఉన్నాయి. మీ రాజు పాలన ఇదివరకు సరిగా లేదా? ముసలివాడై ఉండి యౌవనవంతు డిలా కనబడడ మేమిటి? దయతో నా అనుమానం నివారణ చేయండి స్వామీ!” అందుకు గృహస్థుడు ఇలా అన్నాడు. "తేజోనిధీ! నీ అనుమానానికి కారణం లేకపోలేదు. మా రాజుకు వేట అన్న పిచ్చి. క్రూరమృగాలను వేటా డడం రాజధర్మమే కదా! ఒకప్పుడు వేటకు వెళ్ళి పగలంతా వేటాడి రాత్రి అయ్యేసరికి అలసి ఒక చెట్టుమొదట జేర్లబడి కన్ను మూసాడు. తెల్ల వారిన తర్వాత వచ్చిన పరిజనం నిద్రలో ఉన్నా డనుకొని వేచి వేచి చివరకు తెలుసుకొన్నారు అది శాశ్వతనిద్ర యని. అందరూ దుఃఖంతో పరితపించినవారే. కడకు చితి పేర్చి కళేబరాన్ని దానిపై ఉంచారు దహనక్రియకు. ఇంతలో అందరూ చూస్తుండగనే ఆ దేహము కదలి లేచి కూర్చున్నాడు రాజు. నేనూ చూశాను ఆ దృశ్యం. పరమాద్భు తంగా మారాజు పునర్జీవితు డయ్యాడు. ఈ సంగతి రాజుకు విన్నవించగా సకల మర్యాదలతో పురికి వచ్చి తిరిగి తన కోరిక మేరకు పట్టాభిషిక్తు డయ్యాడు. అప్పటి నుండి పరిపాలనా విధానమే మారిపోయింది. రాజ్యపాలనా భారం అంతా ప్రధానామాత్యు నిపై పెట్టి రాజు అంతఃపుర రాణులతో శృంగారలీలలు సలుపుతూ ఉంటాడు. అందు వలన మీ వంటి వారికి రాజ దర్శనం దొరకడం బహుదుర్లభం. సంగీత విద్వాంసులకు మాత్రం దర్శనం సులభమని ప్రతీతి. ఈ కథనువిన్న పద్మపాదాదు లకు సందేహం పోయింది. రావలసిన చోటికే వచ్చామని తెలిసింది.


*గాయక వేషధారులు:*


పద్మపాదుడు, కూడా వచ్చిన శిష్యులు, గాయకుల్లా వేషాలు వేసికొని వీధిన బడి శ్రోత్ర మధురంగా పాటలు పాడుకొంటూ రాజవీధు లలో వెడలడం చూచిన కొందరు అంతఃపుర కాంతలు ఆ విషయం రాజు చెవిన వేసి గాయకులను రాజ భవనంలోనికి తీసికొని వచ్చారు. సింహాసనంపై కూర్చున్న మహారాజు చుట్టూ రాణులు పరివేష్టించగా తారల మధ్యనున్న చంద్రుడిలా వెలిగి పోతున్నాడు. నవరత్నఖచిత కిరీటము ధరించి శ్వేతచ్ఛత్రము క్రింద సుందరీమణులు వింజామరలు వీస్తుండగా మధురగానాలు వింటూ తన్మయుడై దివ్య కాంతులతో ప్రకాశిస్తు న్నాడు. చూచీ చూడగనే నమ్రులై నమస్కరించారు మన కపటగాయకులు. ఉచితాసనాలపై కూర్చుండ బెట్టిన తరువాత గానము వినిపించుటకు అనుమతి ఇచ్చాడు రాజు. మొదటగా గురుప్రార్థన చేశాక గానం ప్రారంభం చేశారు. ఒకమిథ్యాఘట్టాన్ని ఈ విధంగా సృష్టించారు. పరివారమును విడిచి పోయిన భ్రమరరాజము తోడి ఎడబాటు భరించలేక చిన్న భ్రమరములు మొరపెట్టు కొను ఘట్టము. "ఓ భ్రమర రాజమా! మన మధు వనంలో ఉండి మనందరికి విందు చేస్తూ మాతోబాటు అద్భుత సుఖాన్ని పంచుకొనే సమయాలు గుర్తు తెచ్చుకో. నీ ఎడబాటు సహించక వెదక రాని పొదలన్నీ వెదకి వెదకి కడకు నిన్ను కను గొన్నాము. మాతో ఇదివరకు పంచిన సౌఖ్యాన్ని మరచి ఈ క్రీకారణ్యంలో చెట్ల చిటారున నీ వాసం ఎన్నుకొన్నావు. మత్తెక్కించు మధువు గ్రోలుతూ ఝంకారాలు చేస్తూ ఇక్కడ స్థిర నివాసం  చేసికొంటివా! నీవు ఏ కారణంగా ఈ చోటుకు వచ్చావో నీకే తెలుసును. వచ్చిన పని ముగియలేదా? గడువు దాటునన్న ధ్యాస లేదా! ఓ భ్రమరాగ్రణీ! నీ రాక కోసం నీ వారు ఎదురు తెన్నులు చూస్తున్నారని తెలిసికో. నీకు నిజానికి తెలియని వేమీ లేవు!"


గాయకులు వినిపించిన భ్రమర గీతం విని శంకరుడు పూర్వ స్మృతి తెచ్చుకొన్నాడు. అంతలో సింహాసనంపై ఒరిగి కన్ను మూసాడు. 


గానమాధుర్యంలో మైమరచి పడ్డాడను కొన్నారు మొదట. తర్వాత తెలిసింది ఇక మహారాజు లేవడని. 


శంకరుడు ఆ శరీరాన్ని విడచి పెట్టేశాడు. దేశ మంతా గాలించి దొరకిన శవాలనెల్లా దహనం చేసి వస్తున్నారు రాజభటులు. తిరుగు యానంలో వారి కంటబడింది శంకరుని శరీరం. శిష్యులెంత అడ్డుపడినా ప్రయోజన ము లేకపోయింది. శంకరుని శరీరాన్ని పట్టి చితి పేర్చి నిప్పు ముట్టించే తరుణానికి ఆకాశం నుండి దివ్య తేజస్సు ఆ శరీరంలో ప్రవేశించింది. లేచికూర్చు న్నారు గురులు! ఒక్క ఉరకలోవెళ్ళి గురువు లను దింపుకొన్నారు శిష్యులు. ఆసమయంలో శంకరాచార్యులు సంకట నాశన లక్ష్మీనృసింహ స్తోత్రం చెప్పారు.


*కాలడి శంకర కైలాస శంకర*


*శ్రీ ఆది శంకరాచార్య చరిత్రము*

*21 వ భాగము సమాప్తము*

🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴

సమస్యకు నాపూరణ

 *కోతిని తల్లిగా దలచె కోమలి కెంతటి కోర్కె గల్గెనో*

ఈ సమస్యకు నాపూరణ 


*త్రిజట*


పూతచరిత్ర సీత గని పుచ్చుకొనెన్ గద యానవాలునే


చేతలు వీరమై నిలిచె- చింతలు లంకకు - చూడ చిన్నదౌ


కోతిని - తల్లిగా దలచె - కోమలి కెంతటి కోర్కె గల్గెనో


భాతి జనించె మోమునను భావి గనంబడెనేమొ భాగ్యమై.


అల్వాల లక్ష్మణ మూర్తి.

సమస్య పూరణ.

 *ఓడిన వైరిc గాంచి భయమొందెను గెల్చిన వాcడు వింతగన్*

ఈ సమస్యకు నాపూరణ. 


*పురుషోత్తముడు - అలెగ్జాండర్*


"రేడును పూరుషోత్తముడ రీతిగ గౌరవ మీయగావలెన్


వేడుక గాదు రాజసమె వీరుడ ధర్మపరాయణత్వ" మం


చాడగ గ్రీకువీరు డపుడచ్చెరు వందెను   తెల్లబోవుచున్


ఓడిన వైరిc గాంచి భయమొందెను గెల్చిన వాcడు వింతగన్.


అల్వాల లక్ష్మణ మూర్తి.