13, నవంబర్ 2024, బుధవారం

ఆధార నిలయో ధాతా

 👆 శ్లోకం 

ఆధార నిలయో ధాతా                         

పుష్పహాసః ప్రజాగరః|.                       

ఊర్ధ్వగ స్సత్పథాచారః                   

ప్రాణదః ప్రణవః పణః||.                  


ప్రతిపదార్థ:


ఆధార నిలయ: - సృష్టికి ఆధారమైన పృధ్వి, జలము, తేజము, వాయువు, ఆకాశము అను పంచ మహాభూతములకు ఆధారమైనవాడు.


అధాతా - తానే ఆధారమైనవాడు.


పుష్టహాస: - మొగ్గ పువ్వుగా వికసించునట్లు ప్రపంచరూపమున వికసించువాడు.


ప్రజాగర: - సదా మేల్కొనియుండువాడు.


ఊర్ధ్వగ: - సర్వుల కన్నా పైనుండువాడు.


సత్పధాచార: - సత్పురుషుల మార్గములో చరించువాడు.


ప్రాణద: - ప్రాణ ప్రదాత యైనవాడు.


ప్రణవ: - ప్రణవ స్వరూపుడైనవాడు.


పణ: - సర్వ కార్యములను నిర్వహించువాడు.

మొగలిచెర్ల అవధూత

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...*                                  


*స్తోత్ర పఠనం..విధి విధానాలు..*


*(ఐదవ రోజు)*


శ్రీ స్వామివారు ఆదేశించిన మీదట, ప్రభావతి గారు ఆదిత్యహృదయం స్తోత్రాన్ని రోజూ తాను పఠించే విధంగా గబ గబా చెప్పేసారు..ఈసారి ఎటువంటి తడబాటూ లేదు..ఒక్క అక్షరమూ తప్పు పోలేదు..మొత్తం ముప్పై ఒక్క శ్లోకాలూ గడ గడా చెప్పేసారు..రెండు మూడు నిమిషాల్లోనే పూర్తి స్తోత్రం చెప్పడం అయిపోయింది..


ఆదిత్య హృదయం స్తోత్రం విన్న స్వామివారు..ప్రభావతి గారి వైపు చూసి..ఒకింత అసహనంగా.."ఏమిటమ్మా ఆ వేగం?..అమ్మా!..నువ్వు చదివిన స్తోత్రం నీకు అర్ధమైందా?..ఆ ఆదిత్యుడు కూడా ఈ వేగం అందుకోలేడమ్మా..ఇలా రోజూ పారాయణం చేస్తే ప్రయోజనము వుందా తల్లీ!..తపశ్శక్తి సంపన్నులైన మహర్షుల నోటి నుంచి దేవభాష అయిన సంస్కృతంలో బీజాక్షర సహితంగా రూపుదిద్దుకున్న స్తోత్రాన్ని..నువ్వు ఒక్క క్షణంలో వల్లె వేసావే.. ఆ మంత్రాల్లోని సుస్వరమూ..సంధులూ.. సమాసాలూ..ఒక నియమానుసారంగా వుండి.. ఉచ్ఛారణలో ఆ మంత్ర శక్తి ప్రాణం పోసుకుంటుంది..ఆ మంత్రోచ్ఛారణే మనం పూజించే దైవాన్ని నామరూపాలతో మన హృదయానికి సాక్షాత్కరింపచేసే ఉత్తమ మార్గం అవుతుంది..ఎంతో మహిమాన్వితమైన ఆదిత్యహృదయ స్తోత్రం అగస్త్య మహాముని విరచితం..వాల్మీకి మహర్షి వ్రాసిన ఆదికావ్యం రామాయణం లో చెప్పబడింది..అటువంటి స్తోత్రాన్ని నువ్వు ఎంత తక్కువ సమయంలో అప్పచెప్పుతానా అన్నట్లు చెప్పేసావే..ఇది కాదు పద్ధతి!.." 


"ఒక స్తోత్రాన్ని చేసేటప్పుడు..అందులోని ప్రతి అక్షరము..సంధి..సమాసము..దానిలోని అర్ధమూ..స్పష్టమైన ఉచ్ఛారణతో.. మన మనసుకు తెలుసుకుంటూ చేస్తే..ఆ మంత్రాధి దేవతకు నిజమైన పూజ చేసినట్లు..అంతేకానీ..ఇప్పుడు నువ్వు చదివినట్లుగా..ఇదిగో, ఇన్ని నిమిషాల లోపు ఈ స్తోత్రం చదవడం అయిపోవాలి అని లెక్క పెట్టుకొని చేసేది పూజ కాదమ్మా..అసలు నీ మనసంతా ఎంత సమయంలో పూర్తి చేసామనే విషయం మీద కేంద్రీకృతమైనప్పుడు ఇక భగవంతుడి గురించిన చింత ఎక్కడుంది?..కొద్దిసేపు పూజ చేసినా..ఏకాగ్రచిత్తంతో భగవంతుడిని సాక్షాత్కరించుకునే విధంగా చేయాలి..చిత్తశుద్ధి ముఖ్యం..ఇక మీదట నువ్వు ఏ స్తోత్రాన్ని చేసినా..మెల్లిగా ఆ స్తోత్ర అర్ధాన్ని ఆకళింపు చేసుకుంటూ..ఆ దేవీ దేవుళ్ళ రూపాలను మనసులో ప్రతిష్టించుకొని చేయి..ఫలితం ఉంటుంది.."


"అహంకారం తొలిగిపోనంతవరకూ..మనసు వాసనారహితం కానంతవరకూ..బ్రహ్మజ్ఞానం గోచరం కాదు..అందుకు సద్గురు కృప ఉండాలి తల్లీ!..ఆత్మ సర్వ జీవులలోనూ వ్యాపితమై ఉంటుందని అందరూ చెపుతారు..కానీ ఆ ఆత్మతత్వాన్ని ఎవరూ ఇతమిద్ధంగా వర్ణించలేరు..ఆత్మ సాక్షాత్కారమూ సులభంగా పొందలేరు..గురువు అనుగ్రహమొక్కటే జ్ఞానాన్ని పొందే మార్గాన్ని చూపిస్తుంది..సద్గురువుల, సాధు సత్పురుషుల సాంగత్యం తోనే బ్రహ్మ జ్ఞానాన్ని పొందగలరు..నిత్య నైమిత్తిక కర్మలు యధావిధిగా ఆచరించాలి..శుద్ధమైన మనసుతో, సంస్కారయుతంగా కర్మలను చేయాలి.."


ఇలా చెపుతున్న స్వామివారి వాక్ప్రవాహం అంతటితో ఆగలేదు..శ్రీధరరావు దంపతుల కు ఉపనిషత్తుల గురించి..వాటి లోని ముఖ్యమైన శ్లోకాలు..వాటి అర్ధాలు..వాటి ఉచ్చారణ..భగవద్గీతా శ్లోకాలు..భక్తి, జ్ఞాన యోగాలు..గంగా ప్రవాహంలా ఆయన నోటినుంచి జాలువారుతున్నాయి..   ఉదయం 10 గంటలకు స్వామివారి వద్ద కూర్చున్న ఆ దంపతులిద్దరికీ..సమయమెంత గడిచిందో గుర్తుకురాలేదు..సాయంత్రం 4 గంటల దాకా ఒకే ఆసనంలో కూర్చుని శ్రీ స్వామివారు చేసిన బోధ వాళ్ళిద్దరి హృదయాలలో నాటుకొని పోయింది..


మాలకొండ వచ్చి, పార్వతీదేవి మఠం వద్ద మొదటి సారి ఆ యోగిని దర్శించుకోవడం..ఆయన ఉపదేశము విన్న ప్రభావతి గారికి మనసులో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలై పోయాయి..తాము దర్శించుకున్నది సాధారణ మానవుణ్ణి కాదనీ..సాక్షాత్ జ్ఞాన స్వరూపమే ఈ యోగిపుంగవుడి రూపంలో ఇక్కడ నడయాడుతోందనీ అర్ధమైంది..ఇంతకాలం ఈయన గురించి తన భర్తగారు చెప్పిన ప్రతి మాటా అక్షర సత్యమని బోధపడింది..


"శ్రీధరరావు గారూ..పొద్దుకూకుతోంది.. మీరు మళ్లీ మీ గ్రామం చేరాలి..బైలుదేరండి!..నాకూ జపానికి వేళయింది.." అంటూ శ్రీ స్వామివారు హెచ్చరించాకగానీ...వాళ్ళు ఇహ లోకంలోకి రాలేదు..

దంపతులిద్దరూ వెళ్ళొస్తామని శ్రీ స్వామివారికి చెప్పి, పార్వతీదేవి మఠం వెలుపలికి వచ్చేసారు..శ్రీ స్వామివారు తలూపి..పార్వతీదేవి అమ్మవారికి నమస్కారం చేసుకొని, వీళ్లిద్దరి దగ్గరకూ వచ్చి..ఆశీర్వదించినట్లుగా చేయెత్తి ఊపి..లోపలికి వెళ్లిపోయారు..


మాలకొండ నుంచి తిరిగి ఆ దంపతులిద్దరూ మొగలిచెర్ల కు తమ రెండెడ్ల బండిలో పయనమయ్యారు..దాదాపు ఆరు ఏడు గంటలపాటు శ్రీ స్వామివారి వద్ద గడిపి, తాము పొందిన అనుభూతి ని ఇద్దరూ మాట్లాడుకోసాగారు..


"స్వామి వారి పూర్వాశ్రమం గురించి మీరేమన్నా కనుక్కున్నారా?..వారిది ఏ ఊరు?..తల్లిదండ్రులెవరు?..మాలకొండకు ఎప్పుడు వచ్చారు?.." అని ప్రభావతి గారు భర్తను అడిగారు..శ్రీధరరావు గారు.."కొంత వివరం సేకరించాను ప్రభావతీ..ఇంటికెళ్లి మాట్లాడుకుందాం.."అన్నారు..


శ్రీ స్వామివారి పుట్టుపూర్వోత్తరాలు...రేపటినుంచీ తెలుసుకుందాము...



సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

20 - భజగోవిందం

 *20 - భజగోవిందం / మోహముద్గర*

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🔥


*భజగోవిందం శ్లోకం:-18*


*సురమన్దిర తరుమూల నివాసః శయ్యా భూతల మజినం వాసః|*

*సర్వ పరిగ్రహ భోగత్యాగఃకస్య సుఖం నకరోతి విరాగః భజ 18.*


*ప్రతి||* విరాగః = రాగములేని తనము---అనగా--వైరాగ్యము; కస్య = ఎవనికి; సుఖం = సుఖమును; న కరోతి = కలిగించదు? ( విరాగులందరికీ కలిగిస్తుంది); సురమన్దిర = దేవాలయములందు; తరుమూల = చెట్లమొదళ్ళలో; నివాసం = నివసించే వానికి; భూతల = నేలమీదనే; శయ్యా = పడక కలిగినవానికి; అజినం = చర్మమును; వాసః = ధరించిన వానికి సర్వపరిగ్రహః = ఏదిగాని తనకయి వుంచుకోవట మనే ఊహను; భోగ = అనుభవించాలనే ఊహను; త్యాగః = త్యజించి వేసినవాడు (వీళ్ళందరికీ సుఖాన్ని కలిగిస్తూనే వుంది).


*భావం:-*


దేవాలయాల్లోనూ, చెట్ల క్రింద తలదాచుకొంటూ వట్టి యిసుక మీద పడుకొంటూ మృగ చర్మం ధరిస్తూ ఏ వస్తువుగాని పరిగ్రహించక అనుభవించే కోరిక కూడా లేక వుండే వారందరికి సహా వైరాగ్యమనేది ఎవరికి సుఖమీయదు?


*వివరణ:-*

వెనుక శ్రీ హస్తామలకులవారు మిథ్యాచారులైన సన్యాసి వేషధారుల సంగతి ప్రసంగించారు. ఈ శ్లోకంలో శ్రీ సురేశ్వరాచార్యుల వారు బాహ్య ప్రపంచములోని విషయములమీద కోరికలన్నిటినీ త్యజించినట్టి సత్య నిత్య సన్న్యాసి సంగతి ప్రస్తావిస్తున్నారు.ఉద్రేకాలు, కోరికలు నిజంగా నశించి పోవటమనేది జరిగినట్లయితే ఎవనికయినా ఆ వైరాగ్యస్థితి సుఖాన్నే యిస్తుంది. లేకపోతే దుఃఖం తప్పదు. చక్రవర్తులు దుఃఖిస్తూ వుండడం, ధనవంతులూ బాధపడుతూనే వుండటం; అధికారులు ఆదుర్దా పడుతూనే వుండడం చూస్తాము. 


యోగ్యత సంపాదించినవాడు అసూయ పడుతూనే వుంటాడు. అంతా సుఖం లేనివారే, మరీ వైరాగ్యం వారికి లేదుకదా! అందుకని ఎవరినైనా సుఖపడే వాడెవరని అడిగితే అతడు ఇంకొకరి వంక చూపిస్తాడు, అతడు సుఖపడుతున్నా డంటాడు. తనది బాధ అనుకొన్నప్పుడు ఇంకొకడి సుఖాన్ని చూడ బుద్దవుతుంది. తను సుఖుడని చెప్పుకోగలిగిన వాడు- అలా నమ్మేవాడు ఎవడంటే అంతరాంతరాల్లో సహా కోరికను కోరికను (అనగా) సక్తతను వదిలివేయటానికి అలవాటు పడ్డవాడు, అలాటి వాడు ఒకడు నేను "సీజరులోని సీజరును" అన్నాడట. నేను రాజులోని రాజరికాన్ని అన్నాడట! అతడికి యీ బాహ్య వస్తువులవల్ల సంతోషమేమీ కలగనే కలగదు. (అంటే దుఃఖం కలుగుతుందని కాదు. అసలవి అతడిని కదిలించవని ధ్వని) క్షణభంగుర మైన భ్రాంతి పూర్ణమైన ప్రమోదాలకు చలించడు.


అలాంటి మనిషికి స్వంతమయిన ప్రదేశముండక పోవచ్చు, యే దేవాలయం లో చెట్టు క్రిందనో నేలమీదనో పడుకొని నిద్రపోతాడు. దుస్తులేమున్నా చింతలేదు, లేడి చర్మం చుట్టుకొనైనా వుంటాడు, ఏ వస్తువైనా కావాలని అతడి కుండదు. ఇచ్చినా వదిలేస్తాడు. అసలు మనసులోనే “ఇది నాది" అనే భావన వుండడం మానేసిందిగదా! ఎప్పుడూ స్వయం సమృద్ధిగా వుంటాడు. బాహ్య ప్రపంచానికి సంబంధంలేని వాడు. తన అంతరాంతరాల్లో ఒక మంచి సంతోషం అనే ఊట బావిని కనిపెట్టాడు. నిష్కపటమైన సంతృప్తి అనేది అడుగునుంచి పెల్లుబకటంవుంది. అతడిలో ఇలాంటి మనస్తత్వం కలిగిన వాడెవడు సుఖుడై వుండడు? అని సురేశ్వరాచార్యులు ప్రశ్నిస్తారు.


త్యాగమనేది వట్టి బాహ్యవస్తువుల విషయం మాత్రమే అయి, యింకా విషయలాలన అంతరాంతరాల్లో వుంటే జీవితముయొక్క నిజమైన సంతృప్తి ఎవడు గాని పొందలేడు. ఒక కుశంక ఉదయించవచ్చు. ఈ త్యాగం తపస్సు చేసిన వానికి దానికి ప్రతిఫలంగా యే సంతోషంగాని యివ్వటమనేది లేదన్నమాట అని , అనగా ప్రతిఫలం అననేది లేదు. కనుక సంతోషమూ అతడికి లేదనటం - యిది సరికాదు. మన పూర్వ గ్రంథాలు అలా యెక్కడా చెప్పలేదు. అవి చెప్పేదానికి యీ ఊహ వ్యతిరేకమైనది.


నిజమైన విరాగికి అంతర్గతంగా జీవితం పట్లవుండే అభిప్రాయమూ బాహ్యం గా అతడు ప్రదర్శించే స్వభావమూ ఎలా వుంటాయో యీ శ్లోకంలో చెప్పబడింది. అతడు కోరిక అనేది యేదీకూడా లేని స్థితికి చేరివుంటాడు. ఈ స్థితి అతడికి ఎలా కలిగింది? జీవితం నుంచి పారిపోయినందువల్ల మాత్రం కలగలేదు. లోలోపల స్వయం సమృద్ధిని అనుభవించి దానితో అతడు కలిసి బ్రతకటం చేత కలిగింది. ఈ స్థితిని గీతాకారుడు స్థిత ప్రజ్ఞుడి లక్షణాలు చెప్పేటప్పుడు బాగా వర్ణించారు. * ప్రజహాతి యదాకామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్! ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే” ( గీత 2 అ. 55 శ్లో॥ ) ఎవడయితే కోరికలన్నిటినీ త్యజించి ఆత్మను చూసి సంతోషపడుతూ ఆత్మలోనే విలీనమై వుంటాడో అతడు స్థిత ప్రజ్ఞుడు అన్నారు.


లోపల నిధులుండాలి. బయటివేవీ వద్దనే వాడికి బయట పేద తనం లోపలి సంపదతో సరితూగ లేనప్పుడే అతడు అంతర్గతమైన సమృద్ధికోసం బయటి సర్వం వదలి వేస్తాడు. లేకపోతే అలా వదలటం ఎంత కష్టం? సంభవమా? యదార్థమేదో బయటనే చూడటం చేత కావాలంటే సహించటం తెలిసి అంతర్గతంగా చూడటం చేతనయినప్పుడే అది సంభవం. దీన్ని సాధకుడు సాధించాలి. సత్యపదార్థం కోసం అంతర్గతంగా చూడటం అనేది అందుకే చాలా ప్రధానమైనది.


సన్యాసికి అతడి జీవితం నిరాడంబరమైందిగా వుంటుంది. చెట్టుక్రింద పరుండినా ఎక్కడ నిద్రించినా అతడు చక్రవర్తులకు చక్రవర్తిగా చింత లేకుండా నిద్రిస్తాడు. మనసులో చింతలు లేవు కనక హాయిగా నిద్రిస్తాడు పడక మెత్తగా వుండక పోయినాసరే, అతడికి మాయ తెలీదు. అందరినీ ప్రేమిస్తాడు - ఆ ప్రేమతో శాంతియుతంగా గట్టి నేల మీదయినాసరే సుఖంగా నిద్రిస్తాడు. అతడికి మెత్తని తనం ఎక్కడిది? అది అతడి హృదయంలోని పవిత్రతలోనిది. మంచి తనంలో జన్మించినట్టిది.


అతడు సుఖవంతుడు, సందేహంలేదు. ఐతే ఇక నెవడు సుఖవంతుడు కానిది? ఇతరులంతానని చెప్పాలి. వాళ్ళకు ఎంతో ఆస్తి వుండవచ్చు కాని వాళ్ళ మనసుల్లో కోరికలనే కొఱుకు పుండ్లున్నాయి. వారి తెలివిలో మోసగించటమనే రాచ పంది. అందుకే మాండూక్యోపనిషత్తుతో *"త్యాగేనైకేన అమృతత్వమానశుః*' త్యాగంవల్లనే అమృతత్వం పొందగలగవలెనని అన్నారు.


మరొక యుపనిషత్తులో కూడ *"వైరాగ్యమేవా భయం”* వైరాగ్యం వల్లనే అభయమనేది కలుగుతుందన్నారు.


*ఇధి సురేశ్వరాచార్య కృత శ్లోకం.*


*సశేషం*

🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇

విశాఖపట్నం కి

 *విశాఖపట్నం కి ఆ పేరు ఎలా వచ్చింది ?*


తెలుగు పండితులు తెలిపిన వివరాల ప్రకారం తెలుగు భాషలో ఏ పేరుకైనా పొల్లు(న్,ర్,క్) అక్షరాలు ఉండవు. శతాబ్దాల క్రితం రాజులు పరిపాలించినప్పుడు కూడా ఊరి పేర్లు, మనుషుల పేర్లకు పొల్లు ఉండేవి కాదని తెలుస్తోంది. అప్పట్లో వారు రాసిన శాసనాల ద్వారా ఈ విషయం బయటపడింది. అయితే బ్రిటీష్ పరిపాలన మొదలైనప్పటి నుంచి పేర్లలో చాలా మార్పులు వచ్చాయి. ఆంగ్లేయులకు నోరు తిరగక, పలకడం రాక చాలా పేర్లు మార్చేశారు.


విశాఖ పట్టణానికి ఆ పేరు రావడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఇసుక బాగా దొరకడం వల్ల ఇసుకపల్లి అనే వారని, అది కాస్తా తర్వాత కాలంలో విశాఖపట్నంగా మారిందని చెబుతారు. అయితే దీనికి ఎలాంటి ఆధారాలు లేవు.  మరో కథనం ఏంటంటే ఆరు శతాబ్దాల చరిత్ర ఉన్న వైశాఖ దేవి గుడి ఉండటం వల్ల ఆ అమ్మవారి పేరిట విశాఖపట్నంగా పేరు వచ్చింది. 


పురాణాల ప్రకారం పరమేశ్వరుడి కుమారుడు కుమార స్వామికి విశాఖ పట్టణంలో అప్పట్లో గుడి ఉండేదట. స్వామి వారి నక్షత్రం కూడా విశాఖే కావడంతో విశాఖ పట్టణంగా పిలిచే వారని సమాచారం.


విశాఖ ప్రాంతాన్ని కళింగ రాజులు పాలించారు. అశోకుడు బౌద్ధ మతం తీసుకున్నాక ఈ ప్రాంతంలో బౌద్ధ బిక్షువులు ఎక్కువగా సంచరించేవారు. పచ్చని కొండల మధ్య సముద్రం ఉండటంతో ధ్యానం చేసుకోవడానికి ఈ ప్రాంతం చాలా అనువుగా ఉండేది. దీంతో వారు ఈ ప్రాంతానికి ప్రత్యేక పేరు పెట్టాలని అనుకున్నారు. బుద్ధుడు పుట్టిన నక్షత్రం విశాఖ పేరుతో పిలిస్తే బాగుంటుందని విశాఖ పట్టణంగా పేరు పెట్టారని కొందరు చెబుతుంటారు. 


అదే విధంగా జైనమతం నుంచి బౌద్ధ మతంలోకి మారి తన ఆస్తినంతా బౌద్ధం వ్యాపించడానికి ఇచ్చేసి, సన్యాసిగా మారిన విశాఖ అనే భిక్షువు పేరుతో ఈ ప్రాంతానికి విశాఖ పట్టణం వచ్చిందని చెబుతుంటారు. 


సుమారు 800 సంవత్సరాల క్రితం  ఇశాక్ అనే ముస్లిం ఆధ్యాత్మిక గురువు పేరిట ఇశాక్ పట్టణం ఏర్పడిందని, కాలక్రమేణ విశాఖ పట్టణంగా మారిందని చెబుతారు. ఇవే కాకుండా విశాఖ పట్టణానికి ఆ పేరు రావడం వెనుక మరెన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే చాలా వాటికి ఆధారాలు లేవు. 

ఇక విశాఖ పట్టణం కాస్త వైజాగ్ ఎలా మారిందన్న విషయంలోనూ పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. బ్రిటీష్ వారు పరిపాలించే సమయంలో విశాఖ పట్టణాన్ని వారు పలక లేక వైజాగపట్టణం అని పిలిచే వారట. విశాఖ పట్టణం స్పెల్లింగ్ లో viని వారు "వై" అని, kh ని "గ" పలికేవారట. ఇంగ్లీష్ లో రాసేటప్పుడు కూడా visakha అని రాయకుండా vizaga అని రాసేవారట. షార్ట్ కట్ గా ఉంటుందని vizag అని పలికే వారట. అందువల్ల విశాఖ కాస్తా వైజాగ్ గా మారిందని చెబుతారు. 


దీనికి తోడు 1891 కాలంలో లభించిన మద్రాస్ ప్రెసిడెన్సీ మ్యాప్ లోనూ vizagapatam అని రాసి ఉండటం, వైజాగ్ పేరు ఎలా వచ్చిందనడానికి మరో ఆధారంగా కనిపిస్తోంది. ఇదే కాకుండా 1655 నుంచి vizagapatam జిల్లాగా ఉందని రికార్డుల ద్వారా తెలుస్తోంది.

74. " మహాదర్శనము

 74. " మహాదర్శనము "--డెబ్భై నాలుగవ భాగము --ఖండము అఖండమయితే


74. డెబ్భై నాలుగవ భాగము--  ఖండము అఖండమయితే 



        గార్గి వెళ్ళిపోయిన తరువాత, ఆడవారంతా ఒక్కొక్కరుగా అక్కడనుండీ వెళ్ళిపోయినారు. కాత్యాయనికి భగవానులను సర్వజ్ఞులని అందరూ , లోకమే ఒప్పుకున్నదని సంతోషము. మైత్రేయికి , భగవానుల సర్వజ్ఞత్వము ప్రకటమై బహిరంగమగు దినము వచ్చినది కదా! యని సంతోషము. ఆలంబినికి తన కొడుకు లోకోత్తరుడైనాడని శరీరమంతా ఉబ్బిపోవునంతటి సంతోషము. ఆమెకయితే ఎన్నిసార్లు ఆనందముతో కనులు చెమర్చినాయో తెలియదు. 


         ఇద్దరు శిష్యులు వచ్చి  నమస్కారము చేసి, చేతులు జోడించినారు. భగవానులు , " ఏదో ఉన్నట్లుందే ? ఏమిటి ? " అన్నారు. " జ్ఞాన సత్రములో జరిగినది ఉపనిషత్తు. దానిని లిపిబద్ధము చేసి శాశ్వతము చేయుటకు అనుమతి కావలెను. " అన్నారు. భగవానులు , " ఆలోచించండి. ఇదొక అధ్యాయము. సరే , రాసి ఉంచండి. అయితే ఇంకా రెండు అధ్యాయములు మిగిలినవి. కానిమ్ము , అవికూడా సకాలములో అవుతాయి, తొందర లేదు. " అన్నారు.       


          దేవరాతుడికి కొడుకుకు సర్వజ్ఞాభిషేకమైనది  ఎక్కడలేని ఆనందాన్నిచ్చింది. ఇంటికి రాగానే కొడుకును హత్తుకొని ముద్దాడవలెననుకున్నాడు. అయితే గార్గి ప్రసంగము అడ్డు వచ్చింది. భగవానులు ఆమెతో ఆడిన ప్రతిమాట ఆ వృద్ధునికి తనను గురించే చెప్పినట్లు తోచింది. అందులోనూ చివరగా వారు ఆమెను అడిగిన వరమైతే తనను గురించే చెప్పినట్లు నమ్మకముగా అనిపించింది. " ఇప్పుడు కొడుకుతో కూచొని మాట్లాడవలెనంటే ఎందుకో దిగులవుతుంది. తాను కూడా శాకల్యుడి వలెనే దేవతలను ఎవరికి వారు ప్రత్యేకము అనుకొని ఆరాధించినాడు. అఖండమొకటి ఉందని శాస్త్రము చెప్పుచున్ననూ దానిని అంతగా గమనింపక ఖండ ఖండములనే ఉపాసన చేసినాడు. అఖండోపాసకుడైన కొడుకు దగ్గర తానెలా మాట్లాడేది ?  మాట్లాడునపుడు హెచ్చుతక్కువగా తనకూ శాకల్యునికి అయినట్టే అయితే ? శాకల్యునికైతే సద్గతి దొరకవలెనని కోరుటకు గార్గి ఉంది. తనకెవరు ? "


         దేవరాతుని భ్రాంతులకు అంతులేకుండా పోయింది. ఏమేమో ఊహించుకున్నాడు. చివరికి అందరూ వెళ్ళిపోయి , తానూ కొడుకూ ఇద్దరే కూర్చున్నపుడు ఇక విధిలేక , ఎంత భయమగుచున్ననూ కొడుకుతో మాట్లాడినాడు, " ఏమయ్యా , అట్లయితే ఖండోపాసన వలన ప్రయోజనమే లేదా ? "


         భగవానులు వెంటనే , వినయమును వదలకనే , గురువుకు పాఠమును అప్పజెప్పు శిష్యుడి వలె  అన్నారు : " ఖండోపాసన కామ్యమైతే మాత్రమే చెడ్దది. కామములేని ఆ వస్తువును ఉపాసన చేసినపుడు ఏ కామమును కోరుట ? "


" అయితే ఈ యజ్ఞయాగాదులన్నీ కామమేనేమి ? " 


         " కాక మరేమిటి ? బ్రాహ్మణుడైతే , తన ఆస్తి యైన దేవానుగ్రహము పెరగనీ , తాను చేసిన ఆశీర్వాదములు సఫలము కానీ , అని యజ్ఞ యాగాదులను చేయును. ఇతరులైతే తమకు నేరుగా ఫలము దొరకనీ అని చేయుదురు. ఇలాగ పరార్థ , స్వార్థములు రెండూ లేక , యజ్ఞయాగాదులను చేయువారు ఎవరు ? ఎందుకు చేస్తారు ?"


" అట్లయితే , దేవతలూ మనుష్యులూ పరస్పరము భావిస్తూ , ఇద్దరూ సుఖముగా ఉండవలెను అంటారు కదా ? "


          " నిజము , అయితే ఆ సుఖముగా ఉండుట అన్నారు కదా , అక్కడే ఉంది మర్మము. చూడండి  , సుఖముగా ఉండుట అంటే ఇంద్రియ ప్రపంచము కదా ? ఇది రాజాధిరాజులకు సంభావన ఇచ్చి , వారిని గొప్పవారిని చేసి తానూ గొప్పవాడయినట్టే ! మనము వద్దన్నా , కావాలన్నా , ఏదో ఒక రూపములో ఇది లోకములో జరుగుతున్నదే కదా ? "


" అయితే మరి లోకోద్ధారమంటే ఏమిటి ? "


          " అది భారీ వర్షమును కురిపించునట్టిది. ఖండోపాసన అంటే మన తోటకు మనము నీరు పెట్టుకున్నట్టు ! కానీ భారీ వర్షము అంటే దేశమంతా తడవడము మాత్రమే కాదు , బావులు , చెరువులూ, తటాకములూ , నదులూ అన్నీ నిండుతాయి. అలాగ , అఖండోఫాసన వలన మాత్రమే అగును. అదే లోకోద్ధారము. "


" మనము ఖండము నుండీ అఖండమునకు వెళ్ళుట ఎలాగ ? "


          " మీరు తెలియని వారివలె నన్నడిగితే నేనేమి చెప్పేది ?  మనసులో కామము నుంచుకొని, అఖండోపాసన చేసినా , అది ఖండోపాసనే. కామము లేక దేనిని ఉపాసన చేసిననూ అది అఖండోపాసనే! లేదా, మీరడిగిన దానికి నేరుగా ఉత్తరము నివ్వవలెనంటే , స్వార్థమే కామము . అది తన వరకే ఉండవచ్చును , లేదా , తన కుటుంబము , తన దేశము , తన లోకము, ఏదైనా సరే , కామము కామమే!  ఆ కామము ఉండువరకూ చూచునదంతా వేరే వేరే ! అప్పుడు అన్నీ ఖండ ఖండములే. దానిని వదలిపెట్టితే , ఇంటిని కట్టు గోడలను పడగొట్టితే , ఇల్లు పోయి బయలగునట్లు, అంతా ఒకటవును. అప్పుడు ప్రవాహము వచ్చి , ఎక్కడ చూసినా నీరే నీరు అగునట్లు , ఖండము అఖండమగును. "


          కొడుకు మాటలు వింటుంటే తండ్రికి తాను కూర్చున్న చోటి నుండీ ఎవరో , తనను మోసుకొని పోయి ఏదో ఆకాశ సముద్రములో వేసినట్లు , అక్కడ ’ తాను ’ అన్నపుడు నిండిన కుండ వలె , తాను లేనన్నపుడు పగిలిన కుండ వలె, తోచుచున్నది. ఎక్కడెక్కడ చూచినను ఏదో నిండుదనము , ఏదో శూన్యము. అయితే ఆ శూన్యము ,  ఖాళీగా ఉన్న శూన్యము కాదు. ఇంకేమీ లేనందువలన , అంతా తానే అయినందువలన  కనిపించు నిండిన శూన్యము. అక్కడ ఏమీ అర్థము కాదు. అర్థము కాదా అంటే , ఆ అర్థమేమో తెలియకున్ననూ అర్థమయినట్లే ఉంది. అర్థమే తానైతే , అర్థమయింది అనవలెనా ? లేక అర్థము కాలేదు అనవలెనా ? 


         దేవరాతునికి అదివరకూ అట్టి అనుభవము ఎప్పుడూ అయి ఉండలేదు. తానొక కలకండ ముక్కగా మారి నీటిలో పడినట్లు , ఆ ముక్క ఘడియ ఘడియకూ కరగిపోవు చున్నట్లు అనిపిస్తున్నది. తాను ఎన్నో వర్షముల నుండీ  సంపాదించుకున్న ఆస్తి అంతా వానకు చిక్కిన పచ్చి ఇటుక వలె కరగి పోవుచున్నదే యని దిగులవుతున్నది. దానితో పాటే , ’ పోనివ్వు , మట్టి , మట్టిలో కలసిపోయింది , నష్టమేమిటి ? ’ అని ధైర్యము కూడా ఉంది. అయినా ఆ భీతి-ధైర్యములు ఏదో సముద్రములో లేచే కెరటములవలె , తాను ఆ సముద్రపు అడుగున ఉండి , పైనా కిందా , లోపలా బయటా , చుట్టూరా అంతటా నీరే నీరై చలనములేక ఘనమైనట్టు అనిపిస్తున్నది.  


          దేవరాతుడు మేలుకున్నాడు. అంతవరకూ చూసినది కల కాదు. జాగ్రత్తు అసలే కాదు . కనులు తెరచినాడో , మూసినాడో తెలీదు.  అయితే విచిత్రానుభవము అయినదని బాగా జ్ఞాపకము ఉంది. ఆ అనుభవము ఇంకా అయితే బాగుండును అన్నట్టుందే కానీ , ఇక వద్దు అనిపించలేదు. 


          ఠక్కున ఒక ఆలోచన తట్టింది.  " ఇది ఈతడి సన్నిధానములో ఉన్నందు వలన అయినదా ? " అనిపించింది. " దీనిని పరీక్షించెదను. ఈ అనుభవము ఈతడి సాన్నిధ్యము వల్లనే అయి ఉంటే , నేను ఆశ్రమమునకు వెళ్ళి ఇతడితో పాటే ఉంటాను. " అనుకున్నాడు. భగవానులు అక్కడే ఉన్నారు. 


        ఆచార్యునికి బహిర్ముఖ స్థితి సంపూర్ణముగా కలిగి , " సంధ్యా స్నానపు కాలము ’ అనిపించినది. కొడుకుతో , ’ ఏమిటయ్యా , స్నానానికి వెళదామా ?’ అని అడిగినాడు. సరేనని వారు కూడా లేచినారు. 


" మరచాను , రేపు రాజ భవనమునకు మనమే వెళదామా ? లేక వారు రానీ అని వేచిఉందామా ? " అన్నారు. 


        " వారు వచ్చి పిలిస్తే వెళదాము , తొందరేమిటి ? వారు ఎలాగ చేస్తే అలాగ  సరి యని ఉంటే సరిపోతుంది. " అని సమాధానము వచ్చింది. 


Janardhana Sharma. 

మనమున నూహపోహణలు

 శు  భో  ద  యం🙏


"మనమున నూహపోహణలు మర్వకమున్నె, కఫాది రోగముల్

తనువుననంటి మేనిబిగి తప్పకమున్నె, నరుండు మోక్షసా

ధన మొనరింపగావలయు; తత్త్వవిచారము మానియుండుటల్

తనువునకున్ విరోధమది, దాశరథీ! కరుణాపయోనిధీ!"-

(దాశరథి శతకము  -  రామదాసు)


భావము: మనస్సునకు ఆలోచించే శక్తి  నశించక మున్నే, శ్లేష్మ కఫాదులప్రకోుమున వ్యాధులు దేహమున వ్యాపింపక మున్నే , మానవుడు ఆధ్యాత్మికసాధనతో పరమాత్మను గురించి విచారము చేసి, మోక్షసాధనకుయోగ్యమగు నుపాయములను అన్వేషింపవలెను.  తర్వాత ఇటువంటి ప్రయత్నం చేయుటకు సాధ్యము కాదు" అనుచున్నాడు రామదాసు.

ఈ పద్యములో కవి, మానవుని శరీరము అల్పమైనదని, క్షణికమైనదని, అది ఎప్పటికైనా రోగగ్రస్తము కావచ్చునని, దేహమున సత్తువ యున్నప్పుడే పరమాత్మను గురించి విచారించి, మోక్షసాధనకు మార్గం కనుగొనవలెనని, సందేశము!

                            స్వస్తి

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

తెలుగు చాలా తీయనైన భాష

 


శ్రీభారత్ వీక్షకులకు కార్తిక మాస శుభాకాంక్షలు 🌹మన తెలుగు చాలా తీయనైన భాష అని మనందరికీ తెలుసు. అసలే తీపి.. దానికి అనేక ఇతర భాషల మధురిమలు కూడా కలిస్తే అది మరింత తీపి. అసలు అన్నాం కదా! ఆ మాట మనది కాదు. నకలు, గులాబీ, షికారు, బజారు, కలాసా.. ఇలా మనం రోజంతా వాడే మాటలేవీ మన తెలుగు కాదు.  ప్రముఖ రచయిత్రి డా. తిరుమల నీరజ గారు ఆ ముచ్చట్లన్నీ చెబుతూ ఇతర భాషా పదాలు మనం ఎలా వాడేస్తున్నామో వివరిస్తున్నారు.. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం - శరదృతువు - కార్తీక మాసం - శుక్ల పక్షం - ద్వాదశి - రేవతి -‌‌ సౌమ్య వాసరే* (13.11.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

కార్తీక పురాణం -11

 *కార్తీక పురాణం -11,వ. అధ్యా యం.*

>>>>>>>>>>>>(ॐ)<<<<<<<<<<<<<<<<<<


    కార్తీకమాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని. ఇంకనూ దీనిని గురించి యెంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసె పూలతో పూజించిన యెడల చంద్రాయణ వ్రతము చేసిన౦త ఫలము కలుగును. విష్ణ్యర్చనానంతరం పురాణ పఠనం చేసినా, చేయించినా, వినినా, వినిపించినా అటువంటి వారూతప్పని సరిగా వైకుంఠాన్నేపొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను. శ్రద్దగా ఆలకి౦పుము. అని వశిష్టుల వారు ఈ విధముగా చెప్ప దొడంగిరి.

పూర్వము కళింగ దేశమునకు మంధరుడను విప్రుడు గలడు. అతడు ఇతరుల యిండ్లలో వంటలు చేయుచు అక్కడే భుజించుచు, మద్య మా౦సాది పానీయాలు సేవించుచూ తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నానజప, ధీపారాదనాదికములను ఆచారములును పాటింపక దురాచారుడై మెలుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతమంతురాలు, భర్త యెంత దుర్మార్గుడయిననూ, పతనే దైవముగానెంచి విసుగు చెందక సకలోపచారములు జేయుచు, పతివ్రతా ధర్మమును నిర్వర్తించుచుండెను. మంధరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పని చేయుచున్ననూ ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవక పోవుటచే దొంగ తనములు చేయుచూ, దారి కాచి బాటసారులను బాధించి వారి వద్ద నున్న ధనము, వస్తువులు అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిని బడి పోవుచుండ నతనిని భయపెట్టి కొట్టి ధనమపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని జంపి ధనము మూటగట్టుకొని వచ్చుచుండెను. సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్ర మొకటి గాడ్రించుచు వచ్చి కిరాతుకుని పైబడెను. కిరాతుకుడు దానిని కూడా చంపెను. కానీ అ పులి కూడా తన పంజా తో కిరాతుకకుని కొట్టి యుండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను. ఈ విధముగా ఒక కాలమున నలుగురూ నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమ లోకమున అనేక శిక్షలు అనుభావి౦చుచు రక్తము గ్రక్కుచు భాద పడుచు౦డిరి.


మంధరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యమూ హరి నామ స్మరణ చేయుచు సదాచర వర్తినియై భర్తను తలచుకోని దుఃఖిoచుచు కాలము గడుపుచు౦డెను. కొనాళ్ళుకు ఆమె యిoటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘ్య పాద్యాదులచే పూజించి " స్వామి!నేను దీ నురాలను, నాకు భర్త గాని, సంతతిగానిలేరు. నేను సదా హరి నామ స్మరణ చేయుచు జీవించుచున్న దానను, కాన, నాకు మోక్ష మార్గము ప్రసాదించు" మని బ్రతిమాలుకోనేను. ఆమె వినయమునకు, ఆచారమునకు ఆ ఋషి సంతసించి" అమ్మా! ఈ దినము కార్తిక పౌర్ణమి, చాల పవిత్రమైన దినము. ఈ దినమును వృథాగా పాడు చేసుకోనువద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణము చుదువుదురు. నేను చమురు తీసికొన వచ్చేదను. నీవు ప్రమిదను, వత్తి ని తీసికొని రావాలయును. దేవాలయములో ఈ వత్తిని దెచ్చిన ఫలమును నీ వందుకోనుము" అని చెప్పిన తోడనే అందుకామె సంత సించి, వెంటనే దేవాలయమునకు వెళ్లి శుబ్రముచేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానె స్వయముగా వత్తి చేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనే ప్రమిదెలో పోసి దీపారాధ న చేసెను. అటు తరువాత యింటికి వెడలి తనకు కనిపించిన వారి నెల్ల " ఆరోజు రాత్రి ఆలయ ముందు జరుగు పురాణ కాలక్షేపము నకు" రమ్మని చెప్పెను. ఆమె కూడా రాత్రి అంతయు  పురాణమును వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచు కొంతకాలమున కు మరణించెను. ఆమె పుణ్యత్మురాలగుటచే వల్ల విష్ణుదూతలు వచ్చి విమాన మేక్కించి వైకుంట మునకు దీ సికోనిపోయిరి. కానీ - ఆమెకు పాపత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషముందుట చేత మార్గ మధ్యమున యమలోకమునకు దీ సికోనిపోయిరి. అచట నరక ముందు మరి ముగ్గురితో భాద పడుచున్న తన భర్త ను జూచి " ఓ విష్ణుదూత లారా! నా భర్తా మరి ముగ్గురును యీ నరక  బాధపడుచునారు . కాన, నాయ౦దు దయయుంచి వానిని వుద్ద రింపు "డ ని ప్రాధేయపడెను. అంత విష్ణుదూతలు " అమ్మా! నీ భర్త బ్రాహ్మణుడై యుండియు స్నాన సంధ్యా దులు మాని పాపాత్ముడై నాడు. రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైననూ అతడు కూడా ధనాశ చే ప్రాణహితుని చంపి ధనమపహరించెను. మూడవ వాడు వ్యాఘ్రము నలుగవ వాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినాను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము, మద్య మాంసభక్షణ చేసినాడుగాన పాపాత్ముడైనాడు. అందుకే యీ నలుగురు నరకబాధలు పడుచునారు. " అని వారి చరిత్రలు చెప్పిరి. అందులకు ఆమె చాలా విచారించి "ఓ పుణ్యాత్ములారా! నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరింపు" డని ప్రార్ధించగా , అందులకా దూతలు " అమ్మా! కార్తిక శుద్ధ పౌర్ణమినాడు నీవు వత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు, ప్రమిదఫలము కిరాతకునకు, పురాణము వినుటవలన కలిగినఫలము ఆ విప్రునకు ధారపోసినచో వారికి మోక్షము కలుగు" నని  చెప్పుగా అందులకామె అట్లే ధార పోసేను. ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్లిరి. కావున, ఓరాజా! కార్తికమాసమున పురాణము వినుటవలన, దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగెనో వింటివా? అని వశిష్టులవారు నుడివిరి.


*ఇట్లు స్కాంద పురాణా౦త ర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి*

*పదకొండవరోజు  పారాయణము సమాప్తము.*


        *సర్వేషాంశాన్తిర్భవతు.*

హరేకృష్ణ మహామంత్రం* *యొక్క విశిష్టత*

 🌸 జై శ్రీ రామ్ 🌸


          *హరేకృష్ణ మహామంత్రం*

                 *యొక్క విశిష్టత*

                 ➖➖➖✍️


```అందరూ దయచేసి 2 ని. సమయం వెచ్చించి ఈ క్రింద ఇచ్చిన విశ్లేషణ పూర్తిగా చదవండి...


‘బ్రహ్మాండ పురాణం’ ప్రకారం హరేకృష్ణ మహామంత్రం యొక్క శక్తి అపరిమితమైనదిగా వివరించబడింది.```


*మహామంత్రం*…


"హరేకృష్ణ హరేకృష్ణ

కృష్ణకృష్ణ హరేహరే

హరేరామ హరేరామ

రామరామ హరేహరే!”```


కేవలం ఒకసారి "రామ" నామాన్ని జపిస్తే 1000 సార్లు "విష్ణు" నామాన్ని జపించినప్పుడు వచ్చే ఫలితం వస్తుంది.


ఒకసారి "కృష్ణ" నామాన్ని జపిస్తే 3 సార్లు "రామ" నామాన్ని జపించినప్పుడు కలిగే ఫలితం వస్తుంది. 


"హరేకృష్ణ" మహామంత్రంలో నాలుగు సార్లు "కృష్ణ" నామం మరియు నాలుగు సార్లు "రామ" నామం ఉన్నాయి.


అంటే "హరేకృష్ణ" మహామంత్రంలో నాలుగు సార్లు "కృష్ణ" నామాన్ని జపిస్తాము, అందువల్ల 12 సార్లు "రామ" నామాన్ని జపించిన ఫలితం వస్తుంది.


ఆ విధంగా మహామంత్రంలో 4 "కృష్ణ" నామాలు (అంటే 12 "రామ" నామాలతో సమానం) మరియు మరో 4 "రామ" నామాలు ఉన్నాయి. అంటే మొత్తం కలిసి 16  "రామ" నామాలు ఉన్నట్లు.


1"రామ" నామం =1000 "విష్ణు" నామాలు


16 "రామ" నామాలు =16000 "విష్ణు" నామాలు.


ఒక్క మహామంత్రంలో 16 "రామ" నామాలు = 16000 "విష్ణు" నామాలు ఉన్నట్లు.


అంటే ఒక్కసారి "హరేకృష్ణ" మహామంత్రం జపము చేసినట్లయితే 16,000 సార్లు "విష్ణు" నామాలు జపించడంతో సమానం అవుతుంది.


ఒక మాల జపము అనగా 108 సార్లు జపించడం.


ఒక మాల "హరేకృష్ణ" మహామంత్రం జపము చేసినట్లయితే 108×16000= 17,28,000 సార్లు విష్ణు నామాలు జపించడంతో సమానం అవుతుంది.


16 మాలలు ‌ హరేకృష్ణ మహామంత్రం జపము చేసినట్లయితే 2,76,48,000 సార్లు "విష్ణు" నామాలు జపించడంతో సమానం అవుతుంది.


మన ఆయుష్షు చాలా తక్కువ. అందుకే మనం తక్కువ సమయంలో ఎక్కువ భక్తి, పుణ్యం కలుగాలంటే అపరిమితమైన శక్తి కలిగిన హరేకృష్ణ మహామంత్రం జపము, సంకీర్తన చేద్దాం. భగవద్ధామం చేరుకుందాం, శాశ్వతమైన ఆనందం పొందుదాం.```


*మహామంత్రం*..

🪷🪷🪷🪷🪷

*హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే హరేరామ హరేరామ* *రామరామ హరేహరే*


```ఇప్పుడు ఒక్కసారి అందరం హరేకృష్ణ మహామంత్రం స్మరిద్దాం…✍️```

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

జై శ్రీ రామ్ జై జై హనుమాన్ కంచెర్ల వెంకట రమణ 

         ➖▪️➖