25, అక్టోబర్ 2020, ఆదివారం

నిజాయతీగా

 💰💰  సంపద  💰💰


ఒకానొక పట్టణంలో ఒక వ్యాపారి ఉండేవాడు. ఒకరోజు వ్యాపారి దగ్గరికి అతడి గురువు వచ్చాడు. 

‘‘గురూజీ! నా వ్యాపారం వృద్ధి చెందాలని దీవించండి’’ అని అభ్యర్థించాడు వ్యాపారి. ‘‘దేవుడు నీ వ్యాపారంలో వృద్ధివికాసాలు ప్రసాదించుగాక. కానీ, నువ్వు ధాన్యాన్ని తూచేటప్పుడు నిజాయతీగా వ్యవహరించు’’ అని సూచించాడు గురువు.


ఎప్పుడూ తూకంలో మోసం చేసే ఆ వ్యాపారి గురువుగారి ఉపదేశంతో తన వైఖరిని మార్చుకున్నాడు. న్యాయంగా తూచడం మొదలుపెట్టాడు. అనతి కాలంలోనే అతని వ్యాపారం వృద్ధి చెందింది. ధాన్యాన్ని తూచడానికి బంగారంతో తూనిక రాళ్లను చేయించాడు.  దీంతో ఎక్కడెక్కడివారో వచ్చి ఆ తూనిక రాళ్లను చూసి ఆశ్చర్యపోతూ ఉండేవారు.


ఒకరోజు అతడు ఆ తూనిక రాళ్లను తీసుకొని తన గురువు దగ్గరికి వెళ్లాడు. ‘‘గురువు గారూ! మీ ఆశీర్వాదంతో నా వ్యాపారం చాలా బాగుంది. బంగారు తూనికరాళ్లతో ధాన్యాన్ని తూచేంత వృద్ధి సాధించాను’’ అన్నాడు వ్యాపారి. ‘‘ఆ బంగారపు తూనికరాళ్లను తీసుకెళ్లి ఏటిలో పడవేయ్‌’’ అని గురువు ఆజ్ఞాపించాడు.

గురువాజ్ఞ మేరకు బంగారం విలువ గురించి కూడా ఆలోచించకుండా వాటిని ఏరులో పడవేసి ఇంటికి చేరుకున్నాడు. 


ఈ సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత కొందరు రైతులు తమ ధాన్యాన్ని అమ్మడం కోసం పట్టణానికి వస్తున్నారు. రైతులు ఏరు దాటుతుండగా బంగారు తూకం రాళ్లు వారికి దొరికాయి. వాటిని చూడగానే.. ఇవి ఫలానా వ్యాపారివి అని గుర్తించారు. అతడి మంచితనం తెలిసిన రైతులు.. అలాంటి ఉత్తముడి సొమ్ము తీసుకోవడం భావ్యం కాదనుకున్నారు. తూకంరాళ్లను తీసుకెళ్లి ఆ వ్యాపారికి ఇచ్చేశారు.


 మళ్లీ తన దగ్గరికి చేరిన తూకంరాళ్లను గురువు దగ్గరికి తీసుకెళ్లాడు వ్యాపారి. ‘‘నేను వీటిని ఏరులో పారేశాను. మళ్లీ నా దగ్గరికి వచ్చాయి గురువు గారూ’’ అని విన్నవించుకున్నాడు. ‘‘నీవు ఎప్పుడైతే తూకంలో మోసం చేయడం మానేశావో.. దైవం నీ సంపదలో వృద్ధిని ప్రసాదించాడు. 

 నిజాయతీగాసంపాదించావు కనుకనే.. నీ సొమ్ము మళ్లీ నీ దగ్గరికి చేరింద’’న్నాడు గురువు.


🙏🙏🙏🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: