8, నవంబర్ 2020, ఆదివారం

విష్ణు_సహస్ర_నామ_మహిమ

 🙏#విష్ణు_సహస్ర_నామ_మహిమ🙏


పూర్వం పూరీ నగరం లో జగన్నాధ చలాపురం లో ఒక మహా పండితుడు భార్య తో ఒక పూరి గుడిసెలో నివాసo ఉండేవాడు.. ఇతను శ్రీ మహావిష్ణువు నకు పరమ భక్తుడు . పూట గడవని దారిద్ర్యస్థితి అతనిది.., ప్రతి నిత్యమూ #విష్ణు_సహస్ర_నామ స్తోత్ర పారాయణ చేసి ఈతడు ఆ ఊరిలో మూడిళ్ల వద్ద భిక్షాటన కు వెళ్లేవాడు. , ఆ వచ్చిన దానితో కుటుంబాన్ని పోషించుకునేవాడు.. భార్య మాత్రం పరమ గయ్యాళి.. దైవం పట్ల నమ్మకం లేనిది , ఎటువంటి నియమాలనూ పాటించనిది.. ఇంటి లో భార్య పోరు ఎంత ఇబ్బందిగా ఉన్ననూ ఈతడు హరి నామ స్మరణ ను విడువలేదు..


ప్రతినిత్యమూ చేయుచున్న విధముగా ఆరోజు కూడా #విష్ణు_సహస్రనామ పారాయణo చేయుచుండగా భార్య వచ్చి భర్త తో " ఏమిటి చేస్తున్నావు ? " అని గద్దించి అడిగింది .దానికి ఆ భర్త "విష్ణు సహస్ర నామాలను " స్తోత్రం చేస్తున్నానన్నాడు . అందుకు ఆ భార్య " ప్రతీ రోజూ స్తోత్రం చేస్తూనే ఉన్నావు కదా ! ఏమిచ్చాడు ఆ శ్రీ మహావిష్ణువు ? అడుక్కోవడానికి భిక్షపాత్ర తప్ప అన్నది.. అక్కడితో ఆగక " ఏదీ ! నువ్వు చదువుతున్నదేమిటో చెప్పు " అన్నది .


అందుకు ఆ భర్త " వెయ్యి నామాలే ! ఏమిటి చెప్పేది ? నీకేమిటి అర్ధమౌతుంది ? ఎప్పుడూ పాడు మాటలే మాట్లాడే నీకు విష్ణు సహస్ర నామాలేమి అర్ధమౌతాయి ? " అన్నాడు . ఆ భార్య మాట్లాడుతూ " వెయ్యి నామాలు ఆక్కరలేదు.., మొట్టమొదటిది చెప్పు చాలు " అన్నది. అందుకు ఆ భర్త " విశ్వం విష్ణుః " అని ఇంకా చెప్పబోతూ ఉంటే భార్య " ఆపు అక్కడ ! దీనర్ధమేమిటో చెప్పు " అన్నది.. అందుకు ఆ భర్త " విశ్వమే విష్ణువు , ఈ ప్రపంచమంతా విష్ణుమయమే " అని వివరించగా "ప్రపంచమంతా విష్ణువే అంటున్నావు , అందులో నువ్వూ , నేనూ ఉన్నామా ?ఉంటే యాచిస్తే గాని తిండి దొరకని కటిక పేదరికాన్ని అనుభవిస్తూ , పూరిగుడిసె లో జీవితాంతం దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉండి కూడా ప్రతీ రోజూ నువ్వు ఆ శ్రీ మహావిష్ణువుని గానము చేస్తున్నావే.అయినా నీ విష్ణువు నిన్నేమైనా కరుణించాడా ? కనుక నువ్వు చెప్పిన మంత్రానికి అర్ధం లేదయ్యా ! " అన్నది..  


భార్య మాటలకు సందేహములో పడిన భక్తుడు " నా భార్య మాటలు కూడా నిజమేనేమో ? విశ్వమంతా విష్ణువే ఐతే మా పరిస్థితి ఇలాగ ఎందుకు ఉండాలి ? కనుక ఈ మంత్రంలో "విశ్వం" అనే పదాన్ని చెరిపేస్తానని నిశ్చయించుకుని ఒక బొగ్గు ముక్క తో ఆ విశ్వం అనే పదాన్ని కనబడకుండా మసి పూసి ( తాటాకు ప్రతి ఉండేదట ఈ భక్తుడి ఇంట్లో ) ఎప్పటిలాగే యాచన కై బయలుదేరి వెళ్లిపోయినాడట..


ఆ తరువాత వైకుంఠంలో ఒక విచిత్రం జరిగింది..ప్రతి నిత్యమూ పాల సముద్రములో శ్రీమహావిష్ణువు ను శ్రీమహాలక్ష్మి సేవిస్తున్నట్లు గానే ఆరోజు కూడా స్వామి ని సేవిస్తూ ఒకసారి స్వామి ముఖాన్ని చూసి అమ్మవారు ఫక్కున నవ్విందిట ! అందుకు శ్రీమహావిష్ణువు " ఏమిటి దేవీ ? ఈరోజు నన్ను చూసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు ? " అని అడిగితే అమ్మవారు... " నాధా ! మిమ్ములను నల్లని వాడని , నీలమేఘశ్యాముడని అందరూ స్తుతించడం విన్నాను కానీ అంత మాత్రము చేత ఆ నల్లటి రంగును ముఖానికి కూడా పూసుకోవాలా " అని పరిహాసమాడగా శ్రీమహావిష్ణువు పాల సముద్రం లో తన ప్రతిబింబాన్ని చూసుకుంటే తన ముఖానికి పూసిన నల్లరంగు కనబడిందిట . వెంటనే శ్రీమహావిష్ణువు జరిగినదంతా దివ్యదృష్టి తో గమనించాడుట.. 


లక్ష్మీదేవి " ఏమిటి స్వామీ ఆలోచిస్తున్నారు ? మీ ముఖము పై ఆ నల్లరంగు కు గల కారణమేటో తెలిసినదా ?" యని అడుగగా స్వామి " దేవీ ! ఇది నా పరమ భక్తుడు చేసిన పని " యని పలికాడు. లక్ష్మీదేవి " అదేమిటి స్వామీ ! పరమభక్తుడంటున్నారు ? అతడు ఎందుకిలా చేస్తాడ ని యడుగగా స్వామి తన భక్తుని జీవిత దీన స్థితి ని వివరించగా...


 లక్ష్మీదేవి అంతటి పరమ భక్తుని దీనస్థితి కి కారణమేమి ? మీరాతనిని ఉద్ధరింపలేరా ? స్వామీ ! " అని యడుగగా " దేవీ ! గత జన్మ లో ఈ భక్తుడు గొప్ప ధనవంతుడే ఐనప్పటికీ ఎన్నడూ ఎవరికీ దానమిచ్చి యెరుగడు.. కనుకనే ఈ జన్మలో భక్తుడైననూ దరిద్రo అనుభవించుట తప్పలేదు.. అయిననూ నీవు కోరితివి కనుక నేటితో ఈతనికి కష్టములు తొలగించెదనని పలికి మానవ రూప ధారియై ముఖానికి వస్త్రము చుట్టుకొని విష్ణుమూర్తి కొంతమంది పరివారముతో సరాసరి భక్తుడి ఇంటికి వచ్చి తలుపు తట్టగా అప్పటికే ఆ భక్తుడు యాచనకై ఇల్లు వదిలి పోయాడు .


 ఇంటి ఇల్లాలు వచ్చి తలుపు తీయగా ఎదురుగా మారువేషము లోనున్న శ్రీ మహావిష్ణువు ఆ ఇల్లాలి తో " అమ్మా ! నీ భర్త వద్ద నేను అప్పు గా తీసుకున్న సొమ్ము ను తిరిగి తీర్చుటకు వచ్చితిని , సొమ్మును తీసికొనవలసినదని చెప్పగా ఆ ఇల్లాలు.. నీవెవరవో నాకు తెలియదు కానీ మేమే కటిక దారిద్ర్యములో ఉన్నాము, నా భర్త ఒకరికి అప్పు ఇచ్చేంత ధనవంతుడు కాదు, ఎవరనుకుని మాఇంటికి వచ్చారో, వెళ్లిపొమ్మని తలుపు వేయబోతూ ఉండగా స్వామి " లేదమ్మా ! నేను పొరబాటు పడలేదు , అసత్యమసలే కాదు.., నీ భర్త వద్ద అప్పు గా తీసుకున్న సొమ్ము ఇదిగో ! నువ్వు స్వీకరించు , నీ భర్తకు నేను తరువాత వివరిస్తానని ఆమెకు అశేష ధన , కనక , వస్తు వాహనములు , మణిమాణిక్యాలు , సేవక జనం, తరాలు తిన్నా తరగని ఆహార ధాన్యాలూ కానుకలు గా ఇచ్చి వెళ్లిపోబోతూ ఉండగా ఆ ఇల్లాలు " ఓయీ ! నీ ముఖం మీద కప్పియున్న వస్త్రాన్ని తొలగించి నీ ముఖాన్ని నాకు ఒకసారి చూపించు ! నా భర్త కు చెప్పాలి కదా ! నువ్వు ఎలా ఉంటావో ? " అని పలుకగా.... స్వామి " అమ్మా ! నా ముఖాన్ని నీకు చూపలేను.. నా ముఖం మీద ఎవరో నల్లరంగు పూశారమ్మా ! నేనెవరో నీ భర్తకు తెలుసులే !" అని పలికి విష్ణుమూర్తి వెనుదిరిగి వెళ్లి కొంతదూరం పోయాక అంతర్ధానమైనాడు .


 ఇంతలో ఊరిలో యాచన కు వెళ్లిన భక్తుడు ఇంటికి తిరిగి వచ్చి చూడగా అతని పూరిగుడిసె ఉండాల్సిన ప్రదేశములో కళ్లు మిరుమిట్లు గొలిపే అద్భుతమైన భవంతి దర్శనమిచ్చింది, అనేకమంది సేవకులూ , ఉద్యానవనాలతో కళకళలాడిపోతోంది ఆ భవనం. ఇంతలో ఈతని భార్య లోపలి నుండి వచ్చి లోపలికి రమ్మని భర్త ని ఆహ్వానించగా ముందు తన భార్యని గుర్తుపట్టలేక పోయాడు. ..


అసలు ఆ సంపద ని ఎందుకు స్వీకరించావు ? మనము ఎవరికో అప్పివ్వడమేమిటి ? అది తిరిగి వారు తీర్చడమేమిటి ? మన దీన స్థితి నీకు తెలియనిదా ?" అంటూ భార్య పై ప్రశ్నల వర్షం కురిపించగా అనంతరం జరిగినదంతా భార్య నోటి వెంట విన్న తరువాత తన కళ్లను , చెవులను తానే నమ్మలేకపోయాడు . అయితే ఆ వచ్చినవాడు ఎలా వున్నాడు ? అతడి ముఖము ఎలాగ ఉన్నది ? అని భార్యని ప్రశ్నించగా... నేను అతడి ముఖాన్ని చూడలేదు... అతడి ముఖం పై ఎవరో నల్లని రంగు పులిమారట...ముఖము చూపించ లేనంటూ వస్త్రముతో ముఖాన్ని కప్పుకున్నాడు.. అయినా అతడు వెళుతూ వెళుతూ నా గురించి నీ భర్త కు పూర్తిగా తెలుసమ్మా అని చెప్పి వెళ్లిపోయాడన్నది..


 అది వినిన భక్తుడు హతాశుతుడై భార్యతో .. వచ్చిన వాడు మరెవరో కాదు , మారువేషంలో వచ్చిన సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే ! ప్రతి నిత్యమూ నేను విష్ణువును స్తుతిస్తున్నా ఆ స్వామిని నేను దర్శించలేకపోయాను..ఏ జన్మ లో చేసుకున్న పుణ్యమో నీకు స్వామి దర్శన భాగ్యం కలిగింది" అని పలికి ఇంటి లోపలికి వెళ్లి ఉదయము విష్ణు సహస్రనామాలలో మొట్టమొదటి " విశ్వం " అనే నామంపై పులిమిన నల్లరంగు ను తొలగించాడు..


 తరువాత భార్య తో " నీతో మాట్లాడిన తరువాత ఆ వ్యక్తి ఏ దిక్కుగా పోయినాడనగా భార్య చెప్పిన దిక్కుగా భక్తుడు బయలుదేరి పోవగా సముద్రము ఒడ్డు కు చేరుకున్నాడు . అక్కడ సముద్రము వైపునకు తిరిగి ఊర్ధ్వ దిక్కుగా చేతులు జోడించి శ్రీమహావిష్ణువు నుద్దేశించి స్తోత్రగానం చేశాడు . అప్పుడు అశరీరవాణి " భక్తా ! పూర్వ జన్మ కర్మ ఫలముల కారణంగా ఈ జన్మ లో నీకు భగవద్దర్శనము కలుగదు... మరణానంతరం నీవు వైకుంఠానికి చేరి జన్మరాహిత్యాన్ని పొందెదవు " అని పలికినది...


#విష్ణుసహస్త్రనామ నిత్యపారాయణ వలన కలుగు ఫలితమిదని అందరూ గ్రహించండి... ప్రతి నిత్యమూ పఠించండి... అవసరార్ధులకు సహాయం చెయ్యండి..


🙏🙏ఓం నమో నారాయణాయ 🙏🙏

కామెంట్‌లు లేవు: