*శనివారం 29 ఆగస్టు 2026*
*శ్రీమద్భాగవతం - 34/42*
*అరిష్ట, కేశి వధ & అక్రూరుని గోకుల ప్రయాణం*
ఓం నమో భగవతే వాసుదేవాయ!
మన భాగవత అధ్యయనం లో భాగంగా ఈరోజు
శంఖచూడ వధ, అరిష్టాసుర (వృషభం) వధ, కేశి-వ్యోమాసుర సంహారం లాంటి అనేక లీలలు రాబోతున్నాయి బాల్య లీలలు ఈరోజుతో ముగించి ఇక మధుర కు వెళతాం రేపటినుండి.....
1. సుదర్శన గంధర్వుని ఉద్ధరణ & శంఖచూడ వధ
ఒకనాటి శివరాత్రి పర్వదినాన నందగోపాది గోపాలురంతా అంబికావనానికి వెళ్లి సరస్వతీ నదీ తీరాన గౌరీశంకరులను పూజించి అక్కడే శివానుగ్రహం కోసం భూసురులకు అనేక పదార్దాలు సమర్పించి,బ్రహ్మచర్య దీక్ష వహించి ఉపవాసం ఉన్నారు. రాత్రివేళ కూడా సరస్వతి నదీ తీరంలోనే గడిపారు.
ఆ రాత్రి వేళ ఒక పెద్ద అజగరం (కొండచిలువ) వచ్చి నందమహారాజు కాలును మింగడం ప్రారంభించింది. నందుడు "కృష్ణా! కృష్ణా కాపాడు" అని అరవగా, గోపాలురు అంతా భయంతో కొరివి కట్టెలతో ఆ పామును బాదారు, ఎంత కొట్టిన అది నందుని వదలలేదు అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి తన పాదంతో ఆ సర్పమును తాకాడు.
కృష్ణుని పరమ పావన పాదస్పర్శ తాకగానే దాని పాపములు అన్ని పటా పంచలు అయిపోయి దాని సర్పరూపం నశించి, 'సుదర్శనుడు' అనే విద్యాధరుడు (గంధర్వుడు) దివ్యరూపంతో వెలిగాడు. నీవు ఎవరు అని కృష్ణుడు అడగగా...
అంగీరస మునుల రూపాన్ని చూసి సౌందర్య,ధన మదంతో అవహేళన చేసినందుకు సర్పంగా మారిన విద్యాధరుడు అనే గంధర్వుణ్ణి అని, కృష్ణ మీ పాదస్పర్శతో నాకు విముక్తి కలిగింది, నిజానికి వారు శాపం ఇచ్చి ఉండకపోతే నాకు మీ పాదాలు తాకే భాగ్యం దక్కేది కాదు అని తెలిపి ప్రణమిల్లాడు. అనుగ్రహం పొంది తన లోకానికి వెళ్ళిపోయాడు.
గోపాలురు అంతా శ్రీకృష్ణునీ అనితర సాధ్యం అయిన లీలలు చూసి ఆశ్చర్య పోయి ఆ అంబికా వనంలో వ్రత దీక్ష పూర్తి చేసి వ్రజ భూమికి వచ్చారు.
* శంఖచూడ సంహారం: ఒకానొక సమయంలో రాత్రివేళ బల రామకృష్ణులు గోపికలతో పరివృతులు అయి ఒక వనంలో విహరిస్తుండగా కుబేరుని అనుచరుడైన శంఖచూడుడు అనే యక్షుడు గోపికలను అపహరించడానికి ప్రయత్నించాడు.
ఆ గోపికలు 'కృష్ణా! బలరామా! రక్షించు రక్షించు' అని ఎంతగానో మొఱపెట్టుకొనుచుండిరి. సోదరులు తమ ఆత్మీయులను ఎత్తుకొనిపోవుచున్న శంఖచూడుని జూచి, అతని వెంటబడి తరిమారు, శ్రీ కృష్ణుడు పిడిగుద్దుతో అతడిని సంహరించి, ఆయన శిరస్సున ఉన్న దివ్య రత్నాన్ని బలరామునికి బహూకరించాడు.
ఇక్కడ ఒక అధ్యాయంలో గోపికల యుగళ గీతం ఉంటుంది రాత్రి వేళల్లో తమతో ఉండే శ్రీకృష్ణుడు, పగటిపూట గోవులను కాసేందుకు అడవికి వెళ్ళిపోవడంతో గోపికలు తీవ్ర విరహాన్ని అనుభవిస్తూ, ఆయన వేణుగాన మాధుర్యాన్ని, ప్రకృతి లీనమైన తీరును జంటలుగా కీర్తిస్తూ కాలం గడుపుతూ ఉండేవారు.
2. అరిష్టాసుర వధ – వృషభ రాక్షస సంహారం
కంసుని ఆజ్ఞతో అరిష్టాసురుడు అనే రాక్షసుడు ఒక మహా భయంకరమైన ఎద్దు (వృషభం) రూపాన్ని ధరించి గోకులంపైకి దాడి చేశాడు. ఆయన డెక్కల తాకిడికి భూమి కంపించింది,తోకను ఆకాశానికి విసురుతూ, కళ్లతో నిప్పులు కక్కుతూ గర్భవతులైన స్త్రీలకు గర్భస్రావం కలిగించేలా భీకరంగా రంకెలేశాడు.
మొనదేలి మిగుల పదునుగానున్న దాని కొమ్ములను, దాని చేష్టలను గాంచి, గోపికలు, గోపాలురును ఎంతయు భయగ్రస్తులైరి.
పశువులు బయపడుతూ, గోకులమును విడిచి పఱుగులు తీయసాగెను. సమస్త గోవులు, గోపికలు, గోపాలురు 'కృష్ణా! కృష్ణా!' యని మొఱపెట్టుకొనుచు గోవిందుని శరణుజొచ్చిరి.
అప్పుడు కృష్ణభగవానుడు భయవిహ్వలస్థితులకు లోనైన గోకులవాసుల దైన్యమును గమనించి, 'భయపడకుడు,
భయపడకుడు' అని అభయవచనములతో వారిని ఊఱడించి
తాను ఏమాత్రం చలించక ఆ ఎద్దు ముందు నిలబడి చప్పట్లు చేస్తూ ఆ రాక్షసునీ మరింత రెచ్చగొట్టాడు. రెచ్చిపోయి ఆగ్రహంతో దూసుకువచ్చిన అరిష్టాసురుని రెండు కొమ్ములను తన చేతులతో పట్టుకుని వెనక్కి నెట్టాడు. అనంతరం ఒక కొమ్మును పెకిలించి, ఆ కొమ్ముతోనే రాక్షసుడిని కొట్టి నేలకూల్చాడు.
శ్రీకృష్ణుడు దురాత్ముడైన అరిష్టాసురుని వధించి, వ్రజవాసులను ఆనందింపజేసెను. అంతట భవిష్యత్తును దర్శింపగల దివ్యర్షియగు నారదుడు కంసుని దగ్గరకు వెళ్ళి అతనితో "కంసమహారాజా! నీ చేతులనుండి తప్పించుకొని, ఆకాశమునకు ఎగిరిన కన్యక నిజముగ యశోదకుమార్తె వ్రజభూమియందు వర్ధిల్లుచున్న శ్రీకృష్ణుడు
దేవకీపుత్రుడు. అచటనే పెఱుగుచున్న బలరాముడు రోహిణీదేవి కుమారుడు.
వసుదేవుడు నీకు భయపడి శ్రీకృష్ణుని, బలరాముని తన మిత్రుడైన నందునికడ న్యాసముగా ఉంచెను. నీ ప్రేరణతో వెళ్లిన రాక్షసులను అందరిని నిహతులను గావించినది ఆ సోదరులు ఇద్దరే”.అన్నాడు.
నారదుని వలన బలరామకృష్ణుల ఈ సమాచారములను విన్నంతనే కంసుడు మిగుల క్రోధముతో ఊగిపోయెను.అతని ఇంద్రియము లన్నియు పట్టుదప్పెను, వసుదేవుని సంహరిస్తాను అని కత్తి దూసాడు కానీ వారి ఇద్దరిని బందించి చెరసాల లో వేసి కేశి అనే రాక్షసుణ్ణి బలరామ కృష్ణులను చంపడానికి వ్రజ భూమికి పంపాడు.
3. కేశి & వ్యోమాసుర సంహారం
* కేశి వధ (గుర్రపు రాక్షసుడు): కంసుడు పంపిన కేశి అనే రాక్షసుడు మహా వేగవంతమైన గుర్రం రూపాన్ని ధరించి, నోటి నుండి నురుగులు కక్కుతూ కృష్ణునిపైకి లంఘించాడు. శ్రీకృష్ణుడు తన ఎడమ చేతిని ఆ గుర్రం నోట్లోకి చొప్పించి, తన బాహువును అగ్నిగుండంలా పెంచాడు. కేశి పళ్లు ఊడిపోయి, ఊపిరాడక కడుపు బద్దలై రక్తాలు కక్కుకుని ప్రాణాలు విడిచాడు. (కేశిని సంహరించినందువల్ల భగవంతునికి 'కేశవుడు' అనే ప్రసిద్ధ నామం స్థిరపడింది).
*అప్పుడు భాగవతోత్తముడు అయిన నారద మహర్షి అక్కడ ప్రత్యక్షమై: "కృష్ణా! నీవు త్వరలోనే కంసుడిని చంపి, భూభారాన్ని తొలగించి, కురుక్షేత్రంలో ధర్మాన్ని నిలబెట్టబోతున్నావు" అని కీర్తించాడు.(ఇక్కడ నారదుడు జరగబోవు సంఘటనలు అన్ని చెబుతాడు)
* వ్యోమాసుర వధ:పిమ్మట ఒకనాడు గోపాలురు శ్రీకృష్ణునితోగూడి అడవికి వెళ్లిరి. అక్కడ వారు గోవులను మేపుచు ఒక పర్వతసమీపమున నిలాయనక్రీడలను (మేకల ఆటలను లేదా దాగుడుమూతలాటలను) ఆడిరి. ఆ ఆటలలో కొందరు గొర్రెల కాపరులుగను, మఱికొందఱు ఆఱితేణిన దొంగలుగాను నటించుచు ఆ గోపాలురు తమలో తాము నిర్భయముగా క్రీడలు సలుపుచుండిరి
అప్పుడు మయాసురుని కుమారుడైన వ్యోమాసురుడు వారిలో గోపాలుడిగా కలసి దొంగల వేషంలో బాలురను గుహలలో దాచిపెట్టాడు. అలా చివరకు నలుగురు అయిదుగురు మాత్రమే మిగిలారు.శ్రీకృష్ణుడు అతని దొంగతనం గుర్తించి , కొండగుహలో వేసి అదిమి సంహరించి గుహలలో దాచిన స్నేహితులను కాపాడి గోకులానికి చేరాడు.
4. కంసుని ధనుర్యాగం & అక్రూరుని భక్తి ప్రయాణం
రాక్షసులంతా మరణించారని తెలుసుకున్న కంసుడు వణికిపోయాడు. రామకృష్ణులను మధురకు రప్పించి చంపడానికి 'ధనుర్యాగం' అనే కుతంత్ర యజ్ఞాన్ని ప్రకటించాడు.దానికోసం యదువంశ శ్రేష్ఠుడు, నిష్కల్మష భక్తుడైన అక్రూరుడిని పిలిచి: "అక్రూరా! నువ్వు రథంపై వెళ్లి నందగోకులంలో ఉన్న రామకృష్ణులను ఈ ధనుర్యాగానికి తీసుకురా" అని ఆజ్ఞాపించాడు. అది తనకు కలిగిన భాగ్యం అని భావించాడు అక్రూరుడు.
శ్రీకృష్ణుని దర్శనం చేసుకోబోతున్నానని అక్రూరుడు మార్గమధ్యమంతా పరమానందంతో గడిపాడు:
"నేను ఎంతటి పుణ్యం చేసుకున్నాను! మునుల ధ్యానానికి చిక్కని పరబ్రహ్మ పాదపద్మాలను ఈరోజు నేను తాకబోతున్నాను! అంటూ పొంగిపోయాడు.
* గోకులంలో అడుగుజాడలు: గోకులం చేరగానే నేలపై కృష్ణుని ధ్వజ, వజ్ర, పద్మ, అంకుశ లాంఛనాలతో కూడిన పాదముద్రలను చూసి అక్రూరుడు రథం దిగి, ఆ ధూళిలో పొర్లాడుతూ కన్నీళ్లతో ప్రణమిల్లాడు.
అలా నందభవనంలో ప్రవేశించి పీతాంబరధారులైన రామకృష్ణులను చూసి వారి పాదాలపై సాష్టాంగపడ్డాడు. రామకృష్ణులు అక్రూరుని లేవనెత్తి ఆలింగనం చేసుకుని అతిథి సత్కారాలు చేశారు.
5. మధురకు పయనం & యమునలో విరాడ్రూప దర్శనం
కంసుని దురుద్దేశాన్ని, దేవకీ-వసుదేవుల బంధనాన్ని అక్రూరుడు వివరించాడు. నందమహారాజు సమస్త గోపాలురతో పాటు మధురకు కానుకలతో బయలుదేరడానికి సిద్ధమయ్యాడు.
* గోపికల విరహ వేదన: కృష్ణుడు మధురకు వెళ్తున్నాడని తెలిసి గోపికలు రథం చుట్టూ చేరి కన్నీరుమున్నీరయ్యారు: "కృష్ణా! నిన్ను విడిచి మేము క్షణమైనా బ్రతుకలేము" అంటూ రథ చక్రాలకు అడ్డంగా పడుకున్నారు. కృష్ణుడు వారిని ఓదారుస్తూ, "నేను త్వరలోనే తిరిగి వస్తాను" అని మనస్సులలో నిలిచి ఉండే అభయాన్ని ఇచ్చాడు.
*యమునా నదిలో దివ్య దర్శనం*
మార్గమధ్యంలో యమునా నదిలో అక్రూరుడు మధ్యాహ్న స్నానం చేస్తుండగా... నీటి లోపల శ్రీ బలరామకృష్ణులు దర్శనమిచ్చారు. రథంపై చూస్తే అక్కడా ఉన్నారు. మళ్లీ నీటిలో మునగగా... వేయి పడగల ఆదిశేషునిపై శంఖ-చక్ర-గదా-పద్మధారియై, లక్ష్మీ సమేతుడై వెలిగిపోతున్న శ్రీమన్నారాయణుని పరమ దివ్య వైకుంఠ రూపాన్ని దర్శించి అక్రూరుడు పరవశించి స్తుతించాడు.(అక్రూరుని గురించి దాదాపు నాలుగు అధ్యాయాలలో ఉంటుంది, అక్రూర స్తుతి కూడా ఎంతో విశేషమైంది ఇక్కడ కొద్దిగా ఇచ్చాను అంతే)
📝 నేటి ముఖ్య విషయాలు:
* అక్రూరుని దాస్య-వందన భక్తి: భాగవతంలో నవవిధ భక్తులలో 'వందనం' (నమస్కారం/శరణాగతి) అనే భక్తికి అక్రూరుడే పరమ ఆదర్శం.
* పాదధూళి మహత్యం: భగవంతుని పాదముద్రల స్పర్శ రాయిని సైతం పావనం చేస్తుంది; అక్రూరుని వంటి జ్ఞాని ఆ ధూళిని శిరస్సున ధరించాడు.
* బాల్య లీలల పరిసమాప్తి: శ్రీకృష్ణుడు గోకుల బాల్య లీలలను ముగించి, దుష్టశిక్షణ-శిష్టరక్షణ అనే మహా కార్యం కోసం మధురా నగర ప్రవేశానికి సిద్ధమయ్యాడు.
.....సశేషం
🙏🌹🙏
🙏*న్యాయపతి*🙏
*నరసింహారావు*
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి