*శుక్రవారం 28 ఆగస్టు 2926*
*శ్రీమద్భాగవతం - 33/42*
*గోపాలురకు వైకుంఠ దర్శనం, పంచాధ్యాయి – దివ్య రాసలీల & గోపికాగీత*
ఓం నమో భగవతే వాసుదేవాయ!
భాగవత అధ్యయనం లో ఈరోజు రమణీయ రాసలీల ఘట్టం స్మరించి తరించే ప్రయత్నం చేద్దాం రండి.
వరుణ పాశాలు - వైకుంఠ దర్శనం
ఒక కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నందమహారాజు ఎంతో భక్తితో ఏకాదశి ఉపవాసం పూర్తి చేశాడు. మరుసటి రోజు ద్వాదశి ఘడియలు దాటిపోకముందే స్నానం చేసి పూజ ముగించాలనే తొందరలో, తెల్లవారకముందే అర్ధరాత్రి వేళలోనే నదిలోకి దిగాడు. అది రాక్షసులు తిరిగే అశుభ సమయం కావడంతో, జలాలకు అధిపతి అయిన వరుణ దేవుని సేవకుడు అయిన అసురుడు ఒకడు నందుడిని బంధించి వరుణ లోకాలకు తీసుకుపోయాడు.
ఉదయం చూసేసరికి నందుడు కనిపించక గోకులమంతా కన్నీరుమున్నీరైంది. నందుడిని ఎవరో జలరాక్షసులు పట్టుకుపోయారని తెలిసి ప్రజలంతా శ్రీకృష్ణుడి దగ్గరకు పరుగుతీశారు. వెంటనే శ్రీకృష్ణుడు దివ్య దృష్టి తో అంతా తెలుసుకుని,సరాసరి వరుణుడి లోకానికి చేరుకున్నాడు.
జగన్నాథుడైన శ్రీకృష్ణుడే స్వయంగా తన లోకానికి వచ్చేసరికి వరుణ దేవుడు ఆనందంతో, భయభక్తులతో స్వాగతం పలికాడు. శ్రీకృష్ణుడి పాదాలకు నమస్కరించి, అర్ఘ్య పాధ్యాదులు ఇచ్చి"స్వామీ! నా సేవకుడు అజ్ఞానంతో చేసిన తప్పును క్షమించి, నీ తండ్రిని స్వీకరించు" అంటూ నందుడిని ఎంతో మర్యాదతో అప్పగించాడు.
తిరిగి ఇంటికి వచ్చిన నందుడు, దేవతలే శ్రీకృష్ణుడి పాదాలపై పడి మొక్కుతున్న ఆ అద్భుతాన్ని గోపాలురందరికీ చెప్పాడు. అది విని గోపాలురు ఆశ్చర్యపోయి... "మనతో ఆడుతూ పాడుతూ తిరిగే ఈ చిన్నారి కృష్ణుడు సామాన్యుడు కాడు, సాక్షాత్తు పరమాత్ముడు! మరి ఆయన నివసించే ఆ పరమ లోకం ఎలా ఉంటుంది? మనలాంటి సామాన్యులకు అది చూసే భాగ్యం దక్కుతుందా?" అని తమలో తాము పరితపించసాగారు.
వారి మనసులోని అమాయకమైన, నిష్కల్మషమైన భక్తిని శ్రీకృష్ణుడు గుర్తించాడు. వారందరినీ యమునా నదిలోని పవిత్రమైన బ్రహ్మహ్రధం అనే మడుగు వద్దకు తీసుకెళ్లి, నీటిలో మునిగి లేవమని చెప్పాడు.
గోపాలురు ఆ నీటిలో మునిగి పైకి లేవగానే... వారి కళ్ళముందు భౌతిక ప్రపంచానికి అతీతమైన దివ్య లోకం సాక్షాత్కరించింది. కోట్ల సూర్యుల తేజస్సుతో వెలిగిపోతున్న ఆ లోకంలో, చతుర్భుజాలతో, శంఖుచక్రాలతో వెలిగిపోతున్న పరమాత్ముడిని దేవతలు, మునులు స్తుతిస్తుండటం చూసి గోపాలురు పరవశించిపోయారు. ఆ దేవదేవుడే తమ కళ్లముందు చిరునవ్వుతో ఉన్న కృష్ణుడని గ్రహించి, ఆనందభాష్పాలతో శ్రీకృష్ణుడి పాదాలకు నమస్కరించారు. (పూర్వం అక్రూరుడు ఇదే హ్రధం లో మునిగి స్వామి దర్శనం పొందాడు.)
శరత్కాల వేణుగానం & గోపికల ఆగమనం
ఇది వరకు గోపికలు కాత్యాయనీ వ్రతం చేసిన సందర్భంగా వారితో మీ వ్రతం ఫలించింది రాబోవు శరత్కాలంలో మీతో రాసక్రీడ జరిపి మిమ్మల్ని అనుగ్రహిస్తాను అని చెప్పాడు కదా ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోవడం కోసం సంసిద్ధుడు అయ్యాడు స్వామి..
నిర్మలమైన ఆకాశం, పూర్ణచంద్రుని వెన్నెల కురుస్తున్న శరత్ పూర్ణిమ రాత్రి వేళ, శ్రీకృష్ణుడు తన యోగమాయను ఆశ్రయించి యమునా నదీ తీరాన వేణునాదం ప్రారంభించాడు. ఆ దివ్య నాదం భౌతికమైనది కాదు అది పరమాత్మ జీవులను తన వైపు పిలిచే ప్రణవ నాదం!
ఆ వేణుగానం విన్న మరుక్షణమే గోపికలు తాము చేస్తున్న పనులను మధ్యలోనే వదిలేశారు — పాలు కాచేవారు పాలను అలాగే వదిలారు, పిల్లలకు పాలిచ్చేవారు పక్కన పెట్టారు, భోజనం వడ్డించేవారు చేతి పాత్రలను విడిచిపెట్టారు.
* లోకనిందలను, బంధువుల అడ్డుకట్టలను, చివరకు దేహస్మృతిని సైతం విస్మరించి బృందావనం వైపు పరుగెత్తుకు వచ్చారు. కొందరు గృహాలలో బంధించబడిన గోపికలు తీవ్రమైన కృష్ణ ధ్యానంలో తమ ప్రాకృత దేహాలను త్యజించి సూక్ష్మరూపంలో పరమాత్మను చేరుకున్నారు.
సహింపశక్యము గాని తీవ్రమైన కృష్ణవిరహతాపముచే వారిలోని అశుభసంస్కారములు సమసిపోయెను. ధ్యానముచే పొందబడిన, అచ్యుతుని ఆలింగనమువలన మహదానందమును అనుభవించుటచే వారి పుణ్యకర్మలును క్షయమయ్యెను. అంతేగాక, ఆ పరమాత్మను జారబుద్ధితో కలిసికొన్నవారలు త్రిగుణముల కార్యమగు దేహములను విడిచి పెట్టి, వెంటనే సమస్తకర్మబంధములనుండి విముక్తిని పొంది, భగవంతునిలో ఐక్యము నొందిరి.
2. శ్రీకృష్ణుని పరీక్ష & గోపికల నిశ్చల ప్రేమ
గోపికలు ఎదుటకు రాగానే శ్రీకృష్ణుడు లోక ధర్మాన్ని పరీక్షించడానికి ఇలా అన్నాడు:
"గోపికలారా! మీకు స్వాగతం. కానీ అర్ధరాత్రి వేళ అడవికి రావడం స్త్రీలకు ధర్మం కాదు. మీ భర్తలు, పిల్లలు వెతుకుతుంటారు. వెంటనే మీ ఇళ్లకు తిరిగి వెళ్ళండి!"పైగా ఇక్కడ సింహాలు, పులులు తిరుగుతూ ఉంటాయి. గృహాలలో మీకోసం పసి పిల్లలు ఏడుస్తూ ఉంటారు, ఆవు దూడలు అంబా అంటూ అరుస్తూ ఉంటాయి.మీరు నాపై నిష్కపట ప్రేమతో వచ్చారు బహు సంతోషం కానీ కుటుంబ పాలన మీ ధర్మం కదా.నా పక్కన ఉంటేనే నాపై భక్తి వస్తుంది అనుకోవద్దు, ఎల్లపుడు నా లీలలు స్మరిస్తూ,నా రూపం ధ్యానిస్తూ,నా నామం పలుకుతూ ఉండటం వల్ల అనన్య భక్తి కుదురుతుంది మీరు తిరిగి వెళ్ళండి అన్నాడు.
ఆ మాటలు విన్న గోపికల ముఖాలు వెల వెల పోయాయి, నోట మాట రాలేదు, గోపికలు శ్రీకృష్ణునీ పొందటం కోసం తమ ఐహిక సుఖ భోగాలు, సకల కోరికలు త్యజించి ఉన్నారు, అందువల్ల తమకు అత్యంత ప్రీతి పాత్రుడు అయిన శ్రీకృష్ణుడు అలా పలికే సరికి
గోపికలు కన్నీళ్లతో గద్గద స్వరంతో ఇలా సమాధానమిచ్చారు:
"స్వామీ! పూజ్యులైన కృష్ణ ప్రభూ మీరు ఇలా పరుషంగా మాట్లాడటం ఏ మాత్రం తగదు మేము మా సర్వస్వం వదిలేసి నిన్నే నమ్ముకుని,నీ పాదములను ఆశ్రయించడానికి వచ్చిన భక్తురాండ్రము, దయతో మమ్మల్ని విడిచి పెట్టకు
లౌకిక భర్తలు, బంధువులు దేహానికి సంబంధించిన వారు మాత్రమే. కానీ సమస్త ప్రాణులకు ఏకైక నిజమైన పతి, ఆత్మ నీవే! సమస్తాన్ని త్యజించి నీ పాదపద్మాలను ఆశ్రయించిన మమ్మల్ని తృణీకరించకు."
ప్రభూ! సురలోకమును (సమస్త దేవతలను) రక్షించుటకై శ్రీమన్నారాయణుడు ఉపేంద్రుడై (వామనుడై) అవతరించినట్లు మా వ్రజవాసుల ఆర్తిని హరించుటకై నీవు ఈ గోకులమున జన్మించితివి ఇది ముమ్మాటికి నిజము.
దుఃఖనివారకా! మేము తనివిదీర నిన్ను భజించుటకై ఎంతో ఉవ్విళ్లూరుచున్నాము. అందుకై మా ఇండ్లు వాకిండ్లను విడిచిపెట్టి నీ పాదములను ఆశ్రయించితిమి. అట్టి మా యెడ ప్రసన్నుడవు కమ్ము. పరమపురుషా! మనోహరమైన నీ ఈ చిఱునవ్వులను దర్శించుటకై నిరీక్షించుచు మన్మథతాపములకు లోనైతిమి. అందువలన మమ్ము
నీ దాసీలనుగా స్వీకరించి మా తాపములను చల్లార్చుము.అని అనేక రకాలుగా వేడుకున్నారు
శ్రీకృష్ణుడు సనకాదిమహాయోగులకును ఈశ్వరుడు. ఆ స్వామి ఆ గోపభామినులు ప్రేమపారవశ్యముతో మొరపెట్టుకొనుచు పలికిన విలాపవచనములను శ్రద్దగా ఆలకించెను. ఆత్మయందే రమించునట్టి ఆ ప్రభువు ఆ గోపికలపై జాలిగొని, చిఱునవ్వును చిందించుచు అందఱిలోను శ్రీకృష్ణరూపుడై వారితో క్రీడించెను.
.🌟సౌభాగ్య మదం & శ్రీకృష్ణుని అంతర్ధానం
గోపికలు మహాత్ముడైన కృష్ణభగవానుని చేరి తనివిదీర సుఖానందములను పొందారు. వారి మనోరథములన్నియును ఈడేరెను. అంతట వారు ఈ లోకములోని స్త్రీలలో తమ యంతటి భాగ్యశాలినులు లేరనియు తామే గొప్పవారమనియు తలంచుచు పొంగిపోసాగిరి.
అప్పుడు శ్రీకృష్ణుడు గోపికలయొక్క సౌభాగ్య మదమును, దురభిమానమును గమనించెను. వారి గర్వమును అణచివేయుట ద్వారా వారిని అనుగ్రహించుటకై వారి మధ్య నుండి **అంతర్ధానమయ్యాడు (మాయమయ్యాడు)!**
4. గోపికల విరహం & గోపికాగీత
కృష్ణుని వియోగంతో గోపికలు పిచ్చివారయ్యారు. బృందావనంలోని చెట్లను, లతలను, జింకలను, పూలను "మా శ్యామసుందరుడు ఏడి?" అని వేడుకుంటూ వెతికారు. కృష్ణుని లీలలనే తాము స్వయంగా అభినయించారు (తాండవం, పూతనా వధ, గోవర్ధనోద్ధరణం మొదలైనవి).
చివరకు అలసిపోయి యమునా సైకత తీరాన కూర్చుని, కన్నీటి ధారలతో కృష్ణుని కోసం పరమ పవిత్రమైన **'గోపికాగీత'** ను గానం చేశారు:
**"జయతి తేఽధికం జన్మనా వ్రజః శ్రయత ఇందిరా శశ్వదత్ర హి |**
**దయిత దృశ్యతాం దిక్షు తావకాస్త్వయి ధృతాసవస్త్వాం విచిన్వతే ||"**
**"తవ కథామృతం తప్తజీవనం కవిభిరీడితం కల్మషాపహమ్ |**
**శ్రవణమంగళం శ్రీమదాతతం భువి గృణంతి తే భూరిదా జనాః ||"**
**తాత్పర్యం:** "ఓ ప్రాణనాథా! నీ పాదస్పర్శతో వ్రజభూమి వైకుంఠమైంది. నీ కథామృతం సంసార తాపాలలో కాలిపోయే మానవులకు పరమ సంజీవని. నీ వియోగంలో ఒక్క క్షణం కూడా మాకు యుగంలా గడుస్తోంది. దర్శనమిచ్చి మా ప్రాణాలను కాపాడు!"చాలా అద్భుతమైన స్తుతి చేశారు (దాదాపు 19 శ్లోకములు ఉంటుంది)
5. శ్రీకృష్ణ పునరాగమనం & మహారాస మహోత్సవం
గోపికల అహంకారం పూర్తిగా నశించి నిష్కల్మష శరణాగతి మిగిలిన క్షణంలో... పీతాంబరధారియై, మురళీధరుడై, చిరునవ్వు చిందిస్తూ శ్రీకృష్ణుడు వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు!
అప్పుడు ముముక్షువులు బ్రహ్మజ్ఞాని లేదా పరమాత్మ సాక్షాత్కారమును పొంది, తాపత్రయమునుండి బయట పడినట్లుగా, గోపికలు అందఱును శ్రీకృష్ణ దర్శనోత్సవముతో పరవశించిపోవుచు, తమ విరహతాపములనుండి విముక్తలై ఎంతయు మనశ్శాంతినీ
పొందిరి.
పిమ్మట శ్రీకృష్ణ పరమాత్మ వారిని యమునా నదితీరాన గల ఇసుక తిన్నెల వద్దకు తీసుకు పోయి ఆనందించాడు.
ప్రియమైన గోపికలారా! మీ ప్రేమ నిష్కపటమైనది. నాపై మీరు చూపిన ప్రేమకు మీ అమాయికమైన కృత్యములకు ప్రత్యుపకారము చేయుటకు నేను సమర్థుడనుకాను. దేవతల ఆయుర్దాయమును పొందినప్పటికినీ మీ ఋణము తీరేదికాదు. మీరు నన్ను చేరుటకై విడదీయరాని, దృఢమైన ఇండ్లు - వాకిండ్లు అనే సంకెళ్ళను పూర్తిగా తెగగొట్టితిరి.
నిర్మలమైన మీ ప్రేమభావమును నాయందే సమర్పించితిరి. కావున, మీరు మీ సాధుస్వభావముతో, నిష్కపటమైన ప్రేమతో నన్నుఋణవిముక్తుని చేయవచ్చును. కాని, నేను మాత్రము మీ ఋణమును తీర్చుకొనలేను. కాదు, కాదు ఎప్పటికీ నేను మీకు ఋణగ్రస్తుడనయ్యే ఉండెదను.(సర్వస్య శరణాగతి యే రాసలీల)
* **రాస మండలం:** యమునా నదీ తీరాన వేలాది గోపికలు గుండ్రంగా వలయంగా (రాస మండలంగా) ఏర్పడ్డారు.
* **శ్రీకృష్ణుని విస్తరణ:** ప్రతి ఇద్దరు గోపికల మధ్య ఒక శ్రీకృష్ణుడు ఆవిర్భవించాడు! వందలాది మంది గోపికలు ఉండగా, ప్రతి గోపికా **"శ్రీకృష్ణుడు నా పక్కనే ఉండి నాతోనే నాట్యం చేస్తున్నాడు"** అని భావించేలా స్వామి అనేక రూపాలను ధరించాడు.
* **దివ్య నాట్యం:** దేవతలు విమానాలలో నిలిచి పుష్పవృష్టి కురిపించారు. గంధర్వులు గానం చేయగా, పరమశివుడు ఈ రాసలీలను తిలకించడానికి గోపికా రూపం (గోపేశ్వర మహాదేవుడు) ధరించి వచ్చాడు. ఆ రాత్రి బ్రహ్మదేవుని ఒక కల్ప కాలమంత సుదీర్ఘంగా విస్తరించింది.(లీల చాలా పెద్దగా ఇక్కడ అంతా ఇవ్వలేను ఈ వేదిక పై అవసరం కూడా లేదు ఇది ఎవరికి వారు చదువుకుని అనుభవించాల్సిన లీల)
పరీక్షిత్తు మహారాజు కు మనకు వచ్చే శంకే రాగా శుకమహర్షి స్పష్టం చేశారు: *"రాజా! శ్రీకృష్ణుడు ఆప్తుడు, నిష్కాముడు, ఆత్మారాముడు. ఆయన చేసినది ప్రాకృత కామక్రీడ కాదు. ఆయన పరమాత్మ, గోపికలు జీవాత్మలు. జీవాత్మ పరమాత్మతో లీనమయ్యే పరమ ఆధ్యాత్మిక బ్రహ్మానంద తాదాత్మ్యమే రాసలీల!"*
అగ్ని హేయములు, అహేయములు అగు పదార్దములను అన్నింటిని భక్షించుచున్నను ఆయనకు ఎట్టి మాలిన్యమూ అంటుటలేదు గదా! తేజోమూర్తుల శక్తిసామర్థ్యములు కూడా అట్టివే. సామాన్యుడు (సమర్థుడు కానివాడు) ఇట్టి కార్యమును గూర్చి మనస్సులోగూడ సంకల్పింపరాదు మూర్ఖత్వముతో అట్లు చేసినచో, అతడు నశించుట తథ్యము. సర్వేశ్వరుడైన శంకరుడు సముద్రమునుండి పుట్టిన హాలాహల విషమును పానము చేసినట్లు అసమర్థుడు చేసినచో తత్క్షణమే అతడు భస్మమగును.
ఒక పసివాడు తన ప్రతిబింబములతో ఆడుకొనునప్పుడు అతనిలో ఆనందహేల తప్ప ఎట్టి వికారములును ఉండవు. అట్లే శ్రీకృష్ణుడు తన ప్రతిబింబములైన గోపికలతో క్రీడించుచున్నప్పుడు ఆ స్వామిలో' ఎట్టి వికారములకు తానే లేకుండెను. ఏలయన, గోపికల హృదయములలో శ్రీకృష్ణభగవానుడే ప్రతిబింబించుచుండెను. అనగా భగవంతునకును, భక్తులకును మధ్యగల అవినాభావ సంబంధములు అట్టివి.
పరమేశ్వరుడు సకలప్రాణులను అనుగ్రహించుటకొరకే మానవదేహమును ధరించెను. కావున, ఆ దేహమునకు తగినట్టి లీలలనే ప్రకటించును. అట్టి లీలావైభవములను విన్నవారు భగవత్పరాయణులు అగుదురు.
గోకులవాసులగు జనులకు శ్రీకృష్ణునియెడల దోషబుద్ధి కలుగనేలేదు. ఏలనన, ఆయన యోగమాయచే మోహితులైనవారికి తమ తమ భార్యలు తమ ప్రక్కనే ఉన్నట్లుగా తోచెను.
ఇంతలో బ్రాహ్మముహూర్తము ఆయెను. వసుదేవుని కుమారుడగు శ్రీకృష్ణుడు తనకు ప్రీతిపాత్రులగు గోపికలు వెళ్ళుటకు అనుమతి నిచ్చెను. ఆ ప్రభువు ఆజ్ఞమేరకు తమ తమ ఇండ్లకు వెళ్ళిరి.
పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు వ్రజభామినులతో నెఱపిన ఈ రాసలీలలను గూర్చి పదేపదే శ్రద్ధగా వినినవారు, వాటిని ప్రస్తుతించినవారు ఆ పరమాత్ముని పాదపద్మములపై ప్రగాఢమైన భక్తికి నోచుకొందురు. తత్ప్రభావముచే వారు తమ జీవితకాలమున జితేంద్రియులు అగుదురు. అతి శీఘ్రముగా కామవికారాది హృద్రోగములనుండి విముక్తులగుదురు.
📝 నేటి అంతరార్థం / ముఖ్య విషయాలు:
1. **మధుర భక్తి పరాకాష్ఠ:** గోపికల ప్రేమ దేహ సంబంధమైనది కాదు; అది ఆత్మ సమర్పణ రూపమైన అత్యున్నత భక్తి.
2. **అహంకారం ఉంటే హరి దక్కడు:** భగవంతుని సన్నిధిలో ఉన్నా సరే, అహంకారం తలెత్తితే పరమాత్మ వెంటనే దూరమవుతాడు; సంపూర్ణ శరణాగతితో మాత్రమే ఆయనను తిరిగి పొందగలం.
3. **రాసలీలా శ్రవణ ఫలం:** ఎవరైతే ఈ రాసలీలను శుద్ధ మనస్సుతో వింటారో, వారి హృదయంలోని కామ వికారాలన్నీ నశించి పరమ భక్తి లభిస్తుందని భాగవత ఫలశ్రుతి.
....సశేషం
🙏🌹🙏
🙏*న్యాయపతి*🙏
*నరసింహారావు*
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి