30, ఆగస్టు 2026, ఆదివారం

శ్రీమద్భాగవతం - 35/42*

 


*శ్రీమద్భాగవతం - 35/42* 


*మధురా ప్రవేశం మరియు కంస సంహారం*


ఓం నమో భగవతే వాసుదేవాయ!


భాగవత అధ్యయనం లో భాగంగా నిన్న శ్రీకృష్ణ పరమాత్మ మధురా నగరానికి బయలు దేరాడు ఈరోజు మధురా ప్రవేశం కంస సంహారం జరుగుతుంది.


1. మధురా నగర ప్రవేశం & భక్తుల అనుగ్రహం


రామకృష్ణులు నందాది గోపబాలురు మధురా నగరం దగ్గర గల ఉపవనం లో బస చేసారు, ఇష్టం లేకపోయినా అక్రూరుడు కృషుణ్ణీ వీడి ముందుగా నగరంలోకి వెళ్ళి కంసునికి విషయం తెలియచేసి తన నివాసానికి వెళ్ళాడు.


ఆ తర్వాత రోజు నగర సౌందర్యం చూడటానికి గోపాలురు, బల రామకృష్ణులు నగరంలోకి ప్రవేశించారు.ఇన్ని రోజులు 

ఆ నగర వనితలు కృష్ణభగవానుని లీలామహత్త్వములను గూర్చి పదేపదే వినుచు ఆయన దర్శనమునకై తమ మనస్సులలో ఎంతో తహతహపడుచుండిరి. ఇప్పుడు ఆ స్వామిని ప్రత్యక్షముగా దర్శించుటతోవారిలో సంతోషము పొంగులువారింది.ఆనందంతో నగర స్త్రీలంతా మేడలపైకి ఎక్కి వారిపై పూలవాన కురిపించారు.


గోపికలు నిజముగా ఎంత ధన్యాత్మలోగదా! మానవాళికి పరమానందదాయకులైన ఈ మహానుభావులను నిత్యము దర్శించెడి భాగ్యమునకు నోచుకొనిన ఆ గోపవనితలు ఎంతటి తపస్సులను ఆచరించిరోయేమో అని తమలో తాము అనుకున్నారు.


ఇంతలో వస్త్రములను శుభ్రముగా ఉతికేవాడు, వాటికి రంగులు అద్దె వాడైన ఒక చాకలి శ్రీకృష్ణునకు కనబడెను. అప్పుడు ఆ స్వామి, 'మేలైన ఉతికిన వస్త్రములను ఇమ్ము' అని అడుగుచు అతనితో ఇట్లనెను- “మిత్రమా! అర్హులమైన మా ఉభయులకును కొన్ని మంచి వస్త్రములను ఇమ్ము. గుడ్డలను ఇచ్చినందున నీకు చక్కని శ్రేయస్సు కలుగును. ఇది ముమ్మాటికిని నిజము”.అన్నాడు


కానీ కంసుని రాజవస్త్రాలు ఉతికే ఆ చాకలివాడు (రజకుడు) అహంకారంతో అడవులలో, గుట్టల్లో తిరిగే గోపాలులారా మీకు మేలైన వస్త్రాలు కావాలా, కళ్ళు నెత్తికి ఎక్కాయా ఇవి రాజులు ధరించే వస్త్రాలు అంటూ యుక్తాయుక్తములు మరచి ఇష్టారీతిన పలుకుతూ 

అవమానించగా కృష్ణుడు అరచేతి దెబ్బతో వాడి శిరస్సును ఖండించాడు. 


ఇతర సేవకులు ఉత్తమ వస్త్రాలను అందించగా, దర్జీవాడు (వాయకుడు) వాటిని రామకృష్ణులకు తగినట్లు కుట్టి అలంకరించి భగవదనుగ్రహం పొందాడు.


*సుదాముడనే మాలాకారుడు*

అనంతరం బలరామ కృష్ణులు పూల వ్యాపారియైన సుదాముడు ఇంటికి వెళ్ళారు.అతను రామకృష్ణులను భక్తితో తన ఇంటికి ఆహ్వానించి, దివ్యమైన పూలమాలలతో పూజించి సాష్టాంగ నమస్కారం చేసి సేవించాడు. స్వామి ఆయనకు అచంచల భక్తిని, వంశాభివృద్ధిని వరంగా ఇచ్చాడు.


*కుబ్జ (త్రివక్ర)కు సౌందర్య ప్రదానం*

శ్రీకృష్ణుడు సుదాముని అనుగ్రహించిన పిదప రాజమార్గం గుండా సాగిపోవుతూ ఒక యువతిని చూసాడు.


ఆమె మూడు వంకర్లు తిరిగిన శరీరంతో (కుబ్జ), కంసునికి సుగంధ లేపనాలు తీసుకువెళ్తున్న 'సైరంధ్రి' అనే యువతి. కృష్ణుడు ఆమెను ఆపి చందనం అడిగాడు. ఆమె పరవశించి తన వద్దనున్న దివ్య చందనాన్ని రామకృష్ణులకు పూసింది. కృష్ణుడు ఆమె కాలి బొటనవేలుపై తన పాదం ఉంచి, గడ్డం కింద రెండు వేళ్లు పెట్టి పైకి ఎత్తగానే... ఆమె వంకరలు అన్నీ పోయి అత్యంత సౌందర్యవతిగా మారిపోయింది. శ్రీకృష్ణునీ ఆమె గృహానికి రమ్మనగా ఆమెను సమాధాన పరచి ముందుకు సాగుతూ ధనుర్యాగ స్థానం తెలుసుకుని అందులో ప్రవేశించాడు.


2. శివ ధనుర్భంగం


కంసుడు ఏర్పాటు చేసిన 'ధనుర్యాగ' శాలకు రామకృష్ణులు వెళ్లారు. అక్కడ పూజలందుకుంటున్న మహా భయంకరమైన, ఇంద్రధనుస్సు వంటి శివధనుస్సును చూశారు.


అనేకమంది కావలిభటులు వారిస్తున్నా వినకుండా, శ్రీకృష్ణుడు ఆ భారీ ధనుస్సును సమీపించి ఒక చిన్న చెరకుగడను విరిచినట్లు అలవోకగా ఎత్తి నారి సంధించి మధ్యకు విరిచివేశాడు!


* **కంసుని భయం:** 

ధనుస్సు విరిగినప్పుడు వచ్చిన భయంకర శబ్దానికి మధురా నగరమే కంపించింది.కంసుని గుండెలు పగిలినంత పనైంది. ధనుస్సును కాపలా కాస్తున్న సైనికులు రామకృష్ణులపై దాడి చేయగా, విరిగిన ధనుస్సు ముక్కలతోనే వారిని సంహరించి రామకృష్ణులు సాయంత్రానికి నగరం వెలుపల ఉన్న తమ శిబిరానికి చేరుకున్నారు.


3. కువలయాపీడ గజ సంహారం & రంగాగ్ర ప్రవేశం

బలరామ కృష్ణులు అవలీలగా ధనుస్సు విరిచి, బటులను సంహరించిన సంగతి విన్నది మొదలు కంసుడి భయం రెట్టింపు అయినది,ఆ రాత్రి నిద్రకూడా పట్టలేదు, కనులు మూసిన తెరచిన మృత్యువును సూచించే అపశకునాలే కనపడ్డాయి. ఎలాగో ఆ రాత్రి గడిచింది.


మరుసటి రోజు ఉదయం కంసుడు మల్లయుద్ధ రంగాన్ని సిద్ధం చేసి, సింహాసనంపై కూర్చున్నాడు. రంగద్వారం వద్ద రామకృష్ణులను తొక్కించి చంపడానికి **'కువలయాపీడము'** అనే మదపుటేనుగును మావటివానితో నిలబెట్టాడు.


శ్రీకృష్ణుడు, బలరాముడు ప్రాతః కాలస్నానాది విధులను నిర్వర్తించుకొని.మల్లయోధుల భుజాస్ఫాలనాది ధ్వనులను, దుందుభి మొదలగు వాద్యముల ఘోషలను విని, రంగస్థల విశేషములను స్వయముగా తిలకించుటకై బయలుదేఱిరి.రంగస్థల ద్వారం దగ్గరకు రాగానే అక్కడ కువలయా పీడం అనే ఏనుగును చూసాడు కృష్ణుడు 


గజ సంహారం:ఆ ఏనుగు కృష్ణునిపైకి మావటి ప్రేరణతో దూసుకురాగా, స్వామి దాని తోకను పట్టుకుని తిప్పి, దాని దంతాలను పెకిలించి ఆ దంతంతోనే ఏనుగును, మావటివాడిని సంహరించాడు.


రక్తసిక్తమైన ఏనుగు దంతాన్ని భుజాన ధరించి రామకృష్ణులు మల్లరంగంలోకి ప్రవేశించారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు అక్కడ ఉన్నవారికి రకరకాల భావాలతో దర్శనమిచ్చాడు:


మల్లురకు **వజ్రాయుధంలా**, పురుషులకు **నరశ్రేష్ఠుడిగా**, స్త్రీలకు **మన్మథునిగా**, గోపాలురకు **మిత్రుడిగా**, కంసునికి **సాక్షాత్తు మృత్యువులా**, యోగులకు **పరతత్త్వంగా** కనిపించాడు.


4. చాణూర-ముష్టిక వధ & కంస సంహారం

కంసుడు ఎంతో దైర్యం కలవాడే కానీ, అత్యంత శక్తివంతమైన కువలయా పీడం కూడా కృష్ణునీ చేతిలో మడిసిపోవడంతో అతనిలో భయం రెట్టింపు అయినది.


అప్పుడు ప్రసిద్ధ మల్ల యోధులు అయిన చానూర, ముష్టికులను బలరామకృష్ణులతో మల్ల యుద్ధానికి ఉసి గోల్పెల చేయమని ఆదేశించాడు.


ప్రసిద్ధ మల్లురైన చాణూరుడు కృష్ణునితో, ముష్టికుడు బలరామునితో మల్లయుద్ధానికి దిగారు.


* **మల్లయుద్ధం:** చిన్న బాలురతో భారీకాయులైన రాక్షసులు పోరాడటం చూసి సభలోని స్త్రీలు "ఇది అధర్మం" అని బాధపడ్డారు. కానీ శ్రీకృష్ణుడు చాణూరుని చేతులను పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి సంహరించాడు. బలరాముడు ముష్టికుడిని పిడిగుద్దులతో చంపేశాడు. కూటుడు, తోశలకుడు మొదలైన ఇతర రాక్షస మల్లురంతా సంహరించబడ్డారు.ప్రాణములమీది తీపిచే, బ్రతుకుజీవుడా యనుచు శరవేగముతో మిగతా మల్లురు పిక్కబలము చూపిరి.  


ప్రత్యర్థులైన మల్లురను మట్టిగఱపించిన బలరామకృష్ణులు తమ మిత్రులగు గోపాలురను చేరబిలిచిరి. ఒకవైపు తూర్యములు మొదలగు వాద్యములు మ్రోగుచుండగా వారు గోపాలురతోగూడి నృత్యము లొనర్చిరి. అప్పుడు వారి కాలి అందెల రవళులు మధురముగా నినదించెను. 


* **కంస వధ:** 

ఇది చూసి భయపడిన కంసుడు పిచ్చివాడిలా లేచి: "ఈ బాలురను నగరం నుండి వెళ్ళగొట్టండి! నందుని సంపదను లాక్కోండి! అతడినిబంధించండి;వసుదేవుని, ఉగ్రసేనుడిని చంపండి!"వాధ్యములు ఆపండి అని అరిచాడు.


కంసుడు ఇలా పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉండగానే కోపంతో

కంసుని మాటలు పూర్తికాకముందే శ్రీకృష్ణుడు ఒక్క ఉదుటున ఎగిరి కంసుని ఎత్తైన సింహాసనంపైకి లంఘించాడు.కంసుడు కత్తి దూసి ఎదిరించే ప్రయత్నం చేశాడు కానీ ఒడుపుతో కంసుని కిరీటాన్ని తన్ని, ఆయన జుట్టును గట్టిగా పట్టుకుని రంగస్థలంపైకి విసిరికొట్టాడు.


* **ప్రాణాపహరణం:** అక్కడి నుండి కంసుని గుండెలపై దూకి ఒక్క గుద్దు గుద్దగానే కంసుడు రక్తాలు కక్కి ప్రాణాలు విడిచాడు. నిరంతరం భయంతోనైనా కృష్ణుడినే ధ్యానించినందువల్ల కంసునికి సారూప్య ముక్తి లభించింది.


అప్పుడు కంసుని సోదరులైన కంకుడు, న్యగ్రోధుడు మొదలగువారు ఎనిమిదిమంది మిక్కిలి క్రుద్ధులై తమ అన్న ఋణము తీర్చుకొనగోరి (అన్నను హతమార్చిన శ్రీకృష్ణునిపై పగదీర్చుకొనుటకై) ఆ బలరామకృష్ణుల మీదికి దాడిచేసిరి. 


అలా దూసికొనివచ్చుచున్న కంకాదులను జూచి, బలరాముడు ఇనుపకట్ల గుదియను చేబూని, సింహము పశువులను వలె వారిని అందఱిని సంహరించెను. 


అప్పుడు శ్రీహరియొక్క విభూతి స్వరూపులైన బ్రహ్మాది దేవతలు ఆనందముతో బలరామకృష్ణులపై పూవులను చల్లుచు ప్రశంసలను కురిపించిరి. ఆకాశమున దుందుభులు మ్రోగెను. అప్సరసలు నృత్యములొనర్చిరి.


రాజ పత్నులు అక్కడికి చేరి గుండెలు బాదుకుని ఏడ్చారు.శ్రీకృష్ణుడు దుఃఖితలైయున్న ఆ రాజపత్నులను అనునయ వచనములతో ఓదార్చెను. మృత్యువుపాలైన కంసాదులకు ఆ ప్రభువు లోకరీతిని అనుసరించి ఉత్తరక్రియలను జరిపించెను


5. తల్లిదండ్రుల విముక్తి & ఉగ్రసేన పట్టాభిషేకం

కంస వధ అనంతరం రామకృష్ణులు కారాగారానికి వెళ్లి, తమ తల్లిదండ్రులైన దేవకీ-వసుదేవుల కాళ్లకు ఉన్న సంకెళ్లను తొలగించి వారి పాదాలకు ప్రణమిల్లారు. దేవకీ వసుదేవులు ఆనందబాష్పాలతో బిడ్డలను గుండెలకు హత్తుకున్నారు.(దేవకి వసుదేవులు ఇంతకాలం కృష్ణుడు సాక్షాత్ పరమాత్మ అని ఉపాసించారు, ఇప్పడు ఆ భావం ఉంటే పుత్ర వాత్సల్యం చూపలేరు అని మాయ చేత వారి నుండి ఆ భావం తొలగించి పుత్ర ప్రేమ పెట్టాడు)


* **ఉగ్రసేనునికి రాజ్యం:** కృష్ణుడు స్వయంగా రాజ్యాధికారాన్ని చేపట్టకుండా, కారాగారంలో ఉన్న కంసుని తండ్రి ఉగ్రసేన మహారాజును విడుదల చేసి, యదువంశానికి చక్రవర్తిగా పట్టాభిషేకం చేశాడు.


శ్రీకృష్ణుడు (శ్రీహరి) విశ్వసృష్టికి కారకుడు. కంసుని దురాగతములకు భయపడి నలుదిక్కులకు పాఱిపోయిన యదు, వృష్టి, అంధక, మధు, దాశార్హ, కుకురాది వంశీయులైన తన బంధువులను అందఱిని ఆ ప్రభువు మధురకు పిలిపించెను. ఇంతవఱకును కాందిశీకులై విదేశములలో బిక్కుబిక్కుమనుచు తలదాచుకొనుచున్న వారినందఱిని సగౌరవముగా ఆహ్వానించి, ఆ స్వామి ఆత్మీయతతో ఓదార్చెను. పిమ్మట వారిని ధనాది సంపదలచే తృప్తిపఱచి, వారివారి గృహములలో నివసింపచేసెను. 


శ్రీకృష్ణబలరాముల అనుగ్రహముతో వారి మనస్తాపములు తీఱిపోయెను, మనోరథములన్నియును ఈడేరెను. ఆ నందకుమారుల బాహు బలచ్చాయలో వారు సురక్షితులై యుండిరి. అందువలన ఆ యదు ప్రముఖ వంశీయులందఱును తమ తమ గృహములలో హాయిగా నుండిరి. 


*నందునికి వీడ్కోలు*

పిమ్మట కృష్ణభగవానుడు, బలరాముడు నందగోపునిజేరి, ఆయనను కౌగిలించుకొని,తండ్రీ! నీవును, తల్లి యశోదయు, మిగుల ప్రేమ వాత్సల్యములతో మమ్ము లాలించి, పోషించితిరి. మాతాపితలు తమ సంతానమును ప్రాణములకంటెను మిన్నగా చూచుకొందురు. అందు ఏమాత్రమూ సందేహము లేదు.  


కన్న తల్లిదండ్రులును, తదితర బంధువులును తమ శిశువులను పోషించుటకును, రక్షించుటకును (లాలన, పాలనలకు) వీలుకాని పరిస్థితులలో వదలివేసినప్పుడు, వారిని చేరదీసి ప్రేమాదరములతో పెంచి పోషించిన వారే. నిజమైన తల్లిదండ్రులు. 


నాయనా! ఇక మీరు వ్రజభూమికి వెళ్లిరండు. మేము మీ యెదుట లేనందున మీరు మిక్కిలి బెంగపడుదురను మాట వాస్తవమే. అందువలన మేమును ఇక్కడి బంధుమిత్రులకు ఆత్మీయతతో | సుఖసంతోషములను గూర్చిన పిదప, మారాకకై అనుక్షణము నిరీక్షించుచు తపనపడుచుండెడి మీ అందఱిని చూచుటకై అక్కడికి మేము తప్పక వత్తుము”. అని చెప్పి..


కృష్ణభగవానుడు నందునకును, తదితర వ్రజవాసులకును ఈవిధముగా ఊఱటగూర్చి, వస్త్రాభరణములను, కంచుపాత్రలను సమర్పించి, వారిని సాదరముగా పూజించెను. ఎంతో బాధతో నందుడు వారిని వీడ్కోనీ వ్రజ భూమికి చేరాడు.


* **గురుకుల ప్రవేశం:** 

ఇదివఱలో కంసుడు వసుదేవుని గోసంపదను అన్యాయముగా లాగుకొనియుండెను. బలరామకృష్ణులు జన్మించినప్పుడు ప్రజ్ఞాశాలియైన (ధర్మబుద్ధిగల) వసుదేవుడు బ్రాహ్మణులకు గోదానములను చేయుటకు సంకల్పించి యుండెను. 


ఆ సంకల్పమును అనుసరించి, కంసుని మరణముతో తనకు స్వాధీనమైన ఆ గోవులను ఇప్పుడు భూసురోత్తములకు దానము చేశాడు . 


యదువంశమునకు ఆచార్యుడైన (పురోహితుడైన) గర్గమహర్షిచే జరిపింపబడిన ఉపనయన సంస్కారముల ద్వారా బలరామకృష్ణులకు ద్విజత్వము ప్రాప్తించెను. ఆ మహామునినుండి గాయత్రీ మంత్రోపదేశమును పొందిన పిమ్మట సోదరులు బ్రహ్మచర్యవ్రతమును ఆచరింపదొడగిరి.


అనంతరం బలరామకృష్ణులు అవంతి నగరంలోని **సాందీపని మహర్షి** వద్దకు వెళ్లి కేవలం అరవై నాలుగు (64) రోజులలో సమస్త వేదాలు, వేదాంగాలు, 64 కళలను అభ్యసించారు. 


గురుదక్షిణ సమర్పిస్తాను అని వారు అడగగా వీరి అపార మహిమలు ఎరిగిన సాందీపని ముని ప్రభాస తీరంలో సముద్రంలో మునిగిపోయిన పుత్రుడినీ బ్రతికించి ఇవ్వండి అన్నాడు.


బలరామ కృష్ణులు ఇద్దరూ సరే అని ప్రభాస తీర్థం కి వెళ్ళి సాగరా నీ ఉత్తుంగ తరంగాల లో మా గురు పుత్రుని దాచావు మాకు ఇవ్వు అని ఆదేశిస్తే, కృష్ణ పంచజనుడు అనే రాక్షసుడు మీ గురు పుత్రుని అపహరించాడు అని చెపితే, సముద్రంలోకి ప్రవేశించి వాడిని సంహరించాడు కానీ వాడి ఉదరంలో గురు పుత్రుడు లేడు కానీ పాంచజన్యం అనే శంఖం వాడి శరీరం నుండి పుట్టింది దాన్ని తీసుకుని, యమ లోకానికి వెళ్ళి శంఖం పూరించాడు. యముడు శ్రీకృష్ణునీ గుర్తించి సేవించి గురు పుత్రుని ఇచ్చాడు, శ్రీకృష్ణ పరమాత్మ ఆ బాలుని తీసుకుని గురువుకు అప్పగించి గురువర్య ఇంకా ఏమి కావాలో తెలుపండి అని వినయంగా అడిగాడు.


గురువు వారిని ఆశీర్వదించి, నాయనా మీ కీర్తి అజరామరం, సమస్త లోకాల్లో మీకు తిరుగుండదు అని ఆశీర్వదించి పంపాడు.వారు రథాలపై ఎక్కి తిరిగి మధురకు చేరుకున్నారు.


📝 నేటి ముఖ్య విషయాలు:


1. **భావగ్రాహీ జనార్దనః:** పత్రం, పుష్పం, ఫలం, తోయం... లేదా కుబ్జ సమర్పించిన చందనం, సుదాముడు ఇచ్చిన పూలమాల అయినా సరే నిష్కల్మష భక్తితో సమర్పిస్తే భగవంతుడు సర్వస్వాన్నీ అనుగ్రహిస్తాడు.


2. **అధర్మ నాశనం:** బలవంతుడైన కంసుడు ఎంతటి భద్రతలను ఏర్పాటు చేసుకున్నా, అధర్మ మార్గంలో నడిచినందువల్ల భగవత్ సంకల్పం ముందు క్షణంలో నేలకూలాడు.


3. **నిస్వార్థ ధర్మం:** కంసుడిని చంపినప్పటికీ శ్రీకృష్ణుడు సింహాసనాన్ని ఆశించక, ఉగ్రసేనుడికి పట్టాభిషేకం చేయడం ద్వారా నిస్వార్థ ప్రజాపాలనా ధర్మాన్ని చాటాడు.


రేపు ఉద్ధవ గీత వస్తుంది వేచి ఉండండి శ్రీకృష్ణ శరణం మమ 


.....సశేషం

🙏🌹🙏


       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*

కామెంట్‌లు లేవు: