23, సెప్టెంబర్ 2023, శనివారం

సుధామూర్తి

 #సుధామూర్తి 


 కార్యక్రమాల్లో... వెజ్ , నాన్ వెజ్ కి సెపరేట్ గరిటలనీ కూడా ఉంచితే బాగుంటుందీ.. అని సుధామూర్తి గారు ఓపెన్ గా చెప్పడాన్ని పూర్తి  శాఖాహారులు లక్షల్లో పూర్తిగా ఏకీభవిస్తారు..శాకాహారులకు సమాజంలో ఉండే ఇబ్బందుల గురించి.. అనుభవాలతో కూడిన వివరణ చదవండి 

 

పూర్తి శాకాహారులు..  బయట ఆహారం తినేందుకు ఇష్టపడరు.. ఒకవేళ బయట తినాల్సి వస్తే , వెజ్ , నాన్ వెజ్ కలిసి ఉండే హోటల్స్ వైపు కన్నెత్తి చూడరు.. పూర్తి శాఖాహార హోటల్ లో తినడానికె ఇష్టపడతారు.. 

రెండూ కలిసి ఉండే చోట తింటే ఏమవుతుంది?  అనే సందేహం చాలామందికి వస్తుంది.. అటు నాన్ వెజ్ వడ్డించేందుకు వాడిన గరిటలతోనే... ఇటు వెజ్ పాత్రలలో కూడా వాటినే ఉపయోగించి, వడ్డిస్తూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం.. 


అలా కాకుండా..

వారంలో 6 రోజులు శాకాహారం తిని , ఒకరోజు నాన్ వెజ్ తినే వారికి.. తేడా ఏం తెలీదు.. గరిటే లో ఏముందిలే అనేసుకుంటారు..


కానీ అసలు మాంసాహారం తినని,  పూర్తి శాకాహారులకి అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది


పూర్తి శాఖాహారం అలవాటు ఉన్నవారి ఇళ్ళలో .. నూటికి 75% ఉల్లి , వెల్లుల్లి నిషిద్ధం.. ఉద్యోగ వ్యాపారాలు చేసేవారు.. ఉల్లి, వెల్లుల్లి కూడా శాకాహారమే కదా.. అని... వాడుతూ ఉన్నారు.. కాలానుగుణంగా పరిస్థితి  వలన కొందరు మారడం సహజం.. 


కొందరు వెల్లుల్లి ఘాటు మోతాదుకు మించి ఉంటే తినలేరు.. సరికదా.. ఆ వాసన కూడా వెగటుగా ఉండి తలనొప్పి కూడా వస్తుంది.. 


 దేవాలయాల్లో వంటకు సాధారణంగా వెల్లుల్లి వాడరు కదా  .. గానీ  ఓ తమిళనాడు దేవాలయంలో పెట్టిన అన్నం లో చింతపండురసంతో కలిపిన ముద్ద నోట్లో పెట్టుకోగానే ..  వెల్లుల్లి వేయడంతో  ఆ ఘాటు కు కడుపులో తిప్పేసి సాయంత్రం దాకా వికారం తోనే ఉండాల్సి వచ్చింది.. ఎప్పుడన్నా వెల్లుల్లి తినే అలవాటు ఉన్న నా పరిస్థితే ఇలా ఉంటే.. అసలు అవి... వాడనివారికి.. 

అందునా... మాంసాహారం అనేదే తెలీని శాకాహారికి.. ఆ వాసన ఇంకెంత... ఇబ్బందిగ ఉంటుందో.. అర్ధం చేసుకోండి.. 


చాలామంది మాంసాహారులు వంటల్లో ఇంగువ వాడరు.. ఇంగువ వేసిన పచ్చడి తిన్నా , చారు తిన్నా నోరు పాడయింది.. ఛీ.. అంటూ ఉంటారు.. ఎందుకంటే వారికి ఇంగువ అలవాటు లేకపోవడం వల్ల.. ఆ రుచి నచ్చక, వాసన పడక.. ఇబ్బందిగా ఉంటుంది.. ఇంగువ పోపుతో చేసిన చారు తిని కక్కేసిన వారిని కూడా ఉంటారు.. వారికి ఇంగువ ఎలాగో.. వీరికి... మసాలాలు..  నాన్ వెజ్ లు .. అలాగే వికారం చేస్తాయి మరి..


ఎవరన్న  తినేటప్పుడు..నాన్ వెజ్ తినేవారు పక్కనే కూర్చున్నా. లేదా పక్కింట్లో ఎవరన్న వండేప్పుడు....    కూడా.. ఆ వాసన చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.. మాంసాహారం  తినేవారికి ఈ ఇబ్బంది ఏంటో అర్ధం కాపోవచ్చు.. కానీ.. ఆ వాసన కూడా ఆలవాటులేనివారికి... అదెంత ఇబ్బంది అనేది.. పడేవారికి  మాత్రమే తెలుస్తుంది..


శాకాహారుల్ని స్కూల్స్ లో.. కాలేజెస్ లో.. టీజ్ చేయడం చాలామందికి తెలీదు ఏమో... అవి కూడా భరించిన అనుభవాలన్నీ ఇప్పుడు చెప్పలేం.

ప్రయాణాలలో శాఖాహారం ఆహార అలవాట్ల వల్ల చాలా ఇబ్బందులే ఎదుర్కొంటూ ఉంటాను.

నాకు ఇష్టమైన శాకాహారాన్ని నేను స్వీకరించే విషయంగా ఎన్నో అవహేళనల్ని ఎదుర్కొన్నాను. అయినా నా అలవాటు మార్చుకునే ప్రసక్తే లేదు..


"మీ కులం వారు చాలామంది తింటారే?" అని నవ్వుతూ అడుగుతూ (నీకేం పోయేకాలం? అని మనసులో )

"ముక్క రుచి ఒకసారి చూస్తే వదలవు తెలుసా "


"మీ పప్పు తిని ఎలా బ్రతుకుతారు అసలు "


"శాకాహారి గా ఉన్నావంటే నమ్ముతామా, రావమ్మా  తిందువు గానీ"

"మేక శాకాహారే! మేక తో వండాం తిందువు రా "


సమాజంలో భోజనం టైం లో  ఎదుర్కొన్న అనేక మాటలు 


నా ఆహారం ... నా ఇష్టం...నేను నాకు ఇష్టమయిన... అలవాటు అయిన శాఖాహారం మాత్రమే తింటాను..


ఫైనల్ గా... చెప్పొచ్చేదేంటంటే..

సమాజం మారుతుందో.. మారదో తర్వాత సంగతి.. 

ఒకరి ఇబ్బందిని వ్యక్తం చేస్తున్న కూడా.. అదేదో  గొప్పతనం గా  చెప్పేవారికి పెద్ద 🙏.

ఈ ఒక్క ఆహార విషయంలో ఎంతో మంది ఎన్నో కార్యక్రమాలకే దూరంలో ఉంటూ ఉండటం కూడా మనం చూస్తూనే ఉంటాము. అసలు మనమొక పండుగ చేసుకుంటూ ఉంటే అనేక జీవరాశుల కు ప్రాణహాని కలిగించడం న్యాయమా అని కూడా ఆలోచించకుండా, మనతో బాటు ఉండే మూగప్రాణులు కూడా సంతోషించి ప్రకృతి ఆనందించే విధంగా మన కార్యక్రమాలు నిర్వహించుకోలేమా!!?? మన సంతోషం కోసం కొన్ని జీవుల ప్రాణాలను తీయడం సమంజసమా!!?? అని ఆత్మ విమర్శ చేసుకుంటే మనతో మన మిత్రులు, సాటి జీవరాశులు అన్నీ సంతోషం గా కలిసి మెలిసి ఆనందం పంచుకునే అవకాశం ఉంటుంది కదా!!


సర్వేజనాస్సుఖినోభవంతు...

స్వస్తి...


#I_support #sudhamurthi

పూర్వం జీవన శైలి.

 60 ఏళ్ళ  పూర్వం ఆనాటి జీవన శైలి....


ఉదయం పళ్ళు తోముకోవడానికి వేప్పుల్లలను ఉపయోగించే వారు. వీటినే పందొం పుల్లలు అని కూడా అనే వారు.


కొంతమంది కచ్చిక,  (ఆవు పేడ పిడకలను కాల్చగా వచ్చిన పొడి), పళ్ళ పొడితో పళ్ళు తోముకునే వారు. తాటాకులు చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకుని వాటిని నాలిక శుభ్రపరచు కోవడానికి ఉపయోగించేవారు.


మగ వాళ్ళు చాలా మంది నూతి దగ్గరే,  నీళ్ళు చేదలతో తోడుకు పోసుకొనే వారు. ఆ చన్నీటి స్నానం చాలా హాయి నిచ్చేది. చలి కాలంలో మాత్రం వేడి నీళ్ళు ఉండేవి.


ఉదయం నీళ్ళు కాచుకొనేoదుకు కర్రల పొయ్యి, లేదా పొట్టు పొయ్యి ఉండేది. పొట్టు పొయ్యిలో పొట్టు కూరడం చాలా చిత్ర మైన విషయం. Rs.3/- కి ఒక పొట్టు బస్తా వచ్చేది. పొట్టు బస్తాలను ఎడ్ల బండి మీద పట్టుకొచ్చి ఇంటి దగ్గర అమ్మే వారు.


కాఫీ డికాషన్ కి వేడి వేడి నీళ్లలో కాఫీ పొడి వేసి, కొంచం సేపు ఆగాక, పైన తేరిన నీటినే డికాషన్ గా ఉపయోగించే వారు. పాలు శేరు లెక్కన అమ్మే వారు.


బొగ్గుల కుంపటి మీద కాఫీ. కుంపటి విసరడానికి ఓ వెదురు విసినకర్ర. కొంతమంది వత్తుల స్టౌ,  పంపు స్టౌ వాడేవారు కిరసనాయిలు ది.


అదే విధంగా గా బరువులను వీశ (1400 గ్రా), ఏబులం (అర వీశ), పదలం( పావు వీశ)గా తూచే వారు.


ఇంట్లో దేవుడి పూజలు అవీ సామాన్యంగా ఉండేవి. మడి, తడీ మాత్రం పాటించే వారు బాగా. వంట అంతా ఇత్తడి గిన్నెల తోనే. అందరి ఇళ్లలోనూ  రాచ్చిప్పలు ఉండేవి. ఈ రాచ్చిప్పల్లో పచ్చి పులుసు,  ఉల్లిపాయల పులుసు, పప్పుపులుసు కాచే వారు. ఆ రుచి అమోఘంగా ఉండేది. అన్ని పచ్చడులూ రుబ్బురోట్లోనే.


అప్పుడు బియ్యంలో మట్టి బెడ్డలు, వడ్లు, ఎక్కువుగా ఉండటంతో వాటిని బియ్యం నుండి ఏరేసుకుని వండుకునేవారు. రోజూ మధ్యాహ్నం ఆడవాళ్ళు అందరూ కలసి బియ్యం చేటల్లో పోసుకుని, వడ్లూ బెడ్డలూ ఏరుకునేవారు. అదే వారికి ఇరుగింటి పొరుగింటి వాళ్లతో కాలక్షేపం, పిచ్చాపాటి.


అదేవిధంగా అన్ని సామాన్లు అంటే, ఆవాలు, జీలకర్ర ఇలాoటివి కూడా బాగు చేసుకుని డబ్బాల్లో పోసుకొనేవారు.


బియ్యం లో అక్కుళ్లు, ఆట్రగడ్డలు, వంకసన్నాలు, కిచిడి అనే రకాలు ఉండేవి. ఆక్కుళ్లు, ఆట్రగడ్డలు అంటే ముతక బియ్యం. వంక సన్నాలు, మధ్య రకం. కిచిడి బియ్యం అంటే సన్నబియ్యం. మసూరీ బియ్యం ఇంకా ఖరీదు.


సీతారామాభ్యానమః అని యాయవారం బ్రాహ్మణుడు ఉదయమే అందరి ఇళ్ళకు వచ్చి తిథి వార నక్షత్రాలు చెప్పి వెంటనే వెళ్లి పోయేవారు. వెళ్లిపోయే లోపులో గృహస్థులు అందరూ గుప్పెడు బియ్యం వేసే వారు. ఒక వేళ, రాలేకపోతే,  అయితే ఏదో తప్పు చేసినట్లుగా, అపరాధ భావనతో ఉండి, మర్నాడు ముందే రెడీగా ఉండి, రెండు గుప్పెళ్లు వేసేవారు బియ్యం.


రాత్రిపూట7, 8 గంటలకు మాదాకవళం తల్లీ అంటూ వచ్చేవాళ్లకి ఆరాత్రి తినగా మిగిలిన అన్నం, కూరలు ఇచ్చేవాళ్ళు. చిన్న పిల్లలు పేచీ పెడుతుంటే మాదాకవళం అబ్బాయికిచ్చేస్తానని భయపెట్టేవారు తల్లులు.


టిఫిన్స్ ఉండేవి కావు. ఒక్క శనివారం మాత్రం మినపరొట్టి / ఎర్ర నూక ఉప్మా లాంటివి ఉండేవి.


పిల్లలు అందరూ 3 పూటలు అన్నం తినే వారు. భోజనం ఎప్పుడూ వంటింట్లో నేల మీద పీట వేసుకునే. తినడం అయ్యేక తిన్న చోట నీళ్ళు జల్లి శుద్ధి చేసేవారు. ప్రతి రోజూ రాత్రి వంటిల్లు కడిగి ముగ్గు పెట్టడం అలవాటు.


ఎప్పుడైనా చుట్టాలు వస్తే ఇంట్లో పిల్లలు వంటింట్లో పెద్దలు పడుకొనే వాళ్ళం బొంతలు వేసుకుని. చుట్టాలు లోపలిగదిలో పడుకునే వారు.


డబుల్ బెడ్రూం, సింగిల్ బెడ్రూం అనే పదాలే తెలియవు. చాలా మటుకు 3 గదుల ఇళ్లే. కొంచం స్థితి మంతులు ఐతే 4 గదులులోనూ, ఇంకా పెద్ద పెద్ద ఇండ్లలో ఉండే వారు. గదులు కూడా చాలా పెద్దవి.


3 వరుస గదుల ఇల్లు అద్దె నెలకి - 27 రూపాయలు. కరెంటు -1 బల్బు కి నెలకు 1 రూపాయి. అలాగ మొత్తం కరెంటుతో కలిపి నెలకి 30 అద్దె ఉండేది.


వైద్యం కి డాక్టర్స్ చెయ్యి పట్టుకు చూసి, బిళ్ళలు, అరకు ఇచ్చే వారు. జ్వరం తగ్గే వరకూ లంఖణమే. తర్వాత బన్ను, జావ, ఆ తర్వాత రోజు చారు అన్నం తినమనే వారు. డాక్టర్  భుజం తట్టి తగ్గిపోతుందిలే అనేమాటకే సగం జ్వరం తగ్గిపోయేది.  అదే ప్రభుత్వాసుపత్రికి పోతే రంగు రంగుల ఔషథాలిచ్చేవారు.


ఇంకా, పిల్లల చదువుల మీద ఎక్కువ వత్తిడి ఉండేది కాదు. బాగా చదువుకోమని చెప్పే వారు.  అంతే.   ఊరికే చదివావా చదివావా అని ఏ తల్లిదండ్రులు పిల్లలని టెన్షన్ కి గురి చేసే వారు కాదు.


పుస్తకాలు ఎప్పుడు, వేరే వాళ్ళు వాడినవే.    పై తరగతి పాసైన వాళ్ళ దగ్గర సగం రేట్ కి టెక్స్ట్ బుక్స్ కొనే వారు. నోట్స్ అన్నీ తెల్ల కాగితాల పుస్తకాలే. సింగిల్ రూల్లు, బ్రాడ్ రూళ్లు, పెన్సిల్ తో కొట్టుకోవడమే. క్రితం ఏడు నోట్ బుక్స్ లో మిగిలిన తెల్ల కాగితాలు అన్నీ చింపి, ఒక కొత్త బుక్ లా కుట్టించుకుని నెక్స్ట్ ఇయర్ లో రఫ్ బుక్ గా వాడుకునే వారు.


రాత్రి 9 గంటలకు రేడియోలో వచ్చే ఇంగ్లీష్ న్యూస్ వినే వారం.  అర్థం అయినా కాకపోయినా, రాత్రి పెందలాడే, నిద్ర.   వేసవి కాలం అయితే ఆరుబయట, మిగిలిన కాలాల్లో లోపల పక్కలమీద. ఉంటే ఫ్యాన్ ఉండేది లేకపోతే విసనకర్రే."*


ఇంకోటి ఏమిటంటే అప్పుడు సైకిల్ కి కూడా లైసెన్స్ ఉండేది.  రెండు రూపాయలు పెట్టి,  ఒక లైసెన్స్ రేకు బిళ్ళ కొనుక్కుని సైకిల్ కి బిగించేవారు.


అదీ ఆరోజుల్లో జీవన శైలి.

ఎవరికీ ఏ చీకూ చింతా ఉండేది కాదు. జీవితంలో ఏది ఎలా వస్తే అలాగే స్వీకరించే వారు. సంతోషంగా కాలం గడిపేసే వారు. ఆనందంగా భాద్యతలు  నిర్వహించేవారు.


అప్పట్లో ఎన్నో ఉమ్మడి కుటుంబాలుండేవి 

వారాలబ్బాయిలు వీథి దీపాల చదువులు… మనుషులంత ఒక్కటిగా ఉండే వాళ్ళు.  ప్రజలంతా అమాయకంగా ఉండేవాళ్ళు.


కక్షలూ కార్పణ్యాలు.  కోప తాపాలు కుళ్ళూ కపటం.   ఈర్ష్యా ద్వేషాలు  వాళ్ళకుంది మాకులేదని ఏనాడూ అనుకునే వారే లేరు.   అహంకారం ప్రతీకారం అనేవే తెలీదు అప్పటి జనాలకి.


వెనక్కి తిరిగి చూచుకుంటే ఆ రోజులే బాగున్నాయనిపిస్తుంది. ఇప్పుడున్నన్ని సౌకర్యాలు, విలాసాలు లేకపోయినా, ప్రకృతికి దగ్గరగా, ఆరోగ్యంగా గడచిన రోజులు.

Flying machine

 


నవగ్రహా పురాణం🪐* . *34వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *34వ అధ్యాయం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*పురాణ పఠనం ప్రారంభం*

 

*శుక్రగ్రహ జననం - 1*


భృగుమహర్షి ఆశ్రమ ప్రాంగణంలో చెట్టు నీడలో అరుగు మీద కూర్చుని , ప్రాతఃకాల అనుష్టానం పూర్తి చేశాడు. అది గమనించిన పులోమ ఆయన దగ్గరగా వచ్చింది.


*"చూశావా , నీ కొడుకులు మనం చెప్పకుండానే దర్భలూ , సమిధలూ సేకరించడానికి వెళ్తున్నారు !”* ఆశ్రమం నుండి , అరణ్యం వైపు వెళ్ళే కాలిబాటలో నడుస్తున్న కుమారుల్ని చిరునవ్వుతో చూస్తూ అన్నాడు భృగుమహర్షి. ఆయన కంఠంలో పుత్రోత్సాహం లీలగా ధ్వనించింది.


*"మీరన్నట్టు , వాళ్ళు నా కొడుకులు కారు. మీ కొడుకులు. ముమ్మార్తులా !"* పులోమ చిరునవ్వుతో అంది.


భృగుమహర్షి కళ్ళు ఆమె వైపు చూస్తూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి. *"అంటే...?”*


*“అంటే - ఆ తాపస లక్షణాలూ , ఆ సాత్వికగుణం , ఆ సౌమ్యతా - మీలో వున్నాయి. మీ కొడుకుల్లో కనిపిస్తున్నాయి !"* పులోమ నవ్వుతూ అంది.


*"అంటే... అవన్నీ నీ లక్షణాలు కావా , పులోమా ?"* భృగువు నవ్వాడు. 


*“మీరే చెప్పండి... ఒకసారి నేను జన్మించిన వంశాన్ని గుర్తు చేసుకుని !"* పులోమ ఆయన మొహంలోకి చిలిపిగా చూస్తూ అంది.


భృగుమహర్షి పెద్ద పెద్ద కళ్ళు ఆశ్చర్య దర్పణాల్లా అయ్యాయి.


పులోమ నవ్వింది. *“అర్థం కాలేదా స్వామీ ?* మన బిడ్డలు కేవలం సాత్వికులు !...


నేను కోరుకున్న లక్షణాలున్న పుత్రుడు నాకు ఇంకా పుట్టలేదు !"* పులోమ నునుసిగ్గుతో తల కొద్దిగా వాల్చుకుంటూ అంది.


భృగువు బొమలు ముడివేస్తూ చూశాడు. *"నువ్వు కోరుకున్న లక్షణాలా ! రా... ఇలా కూర్చో.... చెప్పు !”*


పులోమ భృగుమహర్షి సమీపంలో కూర్చుంది. *“ఎంత అమాయకులు స్వామీ , మీరు ? చ్యవనుడితో ప్రారంభించి , ఇప్పటిదాకా మనకు పుట్టిన కొడుకులు నలుగురూ సత్వగుణం పాలు ఎక్కువగా వున్నవాళ్ళే...”*


*"ఔను... ,"* భృగువు అన్నాడు ఆమెనే చూస్తూ.


*"నేను కోరుకుంటున్న కుమారుడు కేవలం సాత్వికుడే కాకూడదు. ఆత్మవిశ్వాసం , ఆత్మగౌరవం , ఆత్మాభిమానం , స్వయం నిర్ణయశక్తి , శాసించే లక్షణం , సునిశితమైన తీక్షణమైన బుద్ధి , సాహసం , పట్టుదలా , కార్యదక్షతా - ఇంకా ఇలాంటి ప్రత్యేక లక్షణాలన్నీ కలిసి మూర్తీభవించిన 'అగ్నికోణం' లాంటి అద్వితీయుడైన పుత్రుడు కావాలి నాకు !"* తనలోంచి పొంగిపొర్లుతున్న ఆవేశాన్ని గుర్తించి , ఆశ్చర్యపోయింది. పులోను తీక్షణంగా మెరుస్తున్న ఆమె కళ్ళలోకి క్షణంలో ప్రశాంతత వచ్చి చేరింది. ముఖం మీద అంతసేపూ నాట్యం చేసిన గాంభీర్యాన్ని చిరునవ్వు చెరిపి వేసింది. *"నాకు... నాకు అలాంటి కుమారుణ్ణి ప్రసాదిస్తారా , స్వామీ ?”*


*"పులోమా ! నీకు తెలుసా ? సాత్విక , రాజస , తామస లక్షణాల సమ మేళన స్వరూపాన్ని కోరుతున్నావు నువ్వు"* భృగువు ఆమెనే చూస్తూ అన్నాడు. 


*"ఆ నిష్పత్తి నాకు అంతగా తెలీదు. సునిశితమైన ఖడ్గధారలాంటి మేధస్సుతో , రాజసం ఉట్టిపడే ప్రవర్తనతో నీతినీ , నియమాలను నిర్దేశించే శక్తితో - గొప్పవాడైన కొడుకు కావాలి , స్వామీ నాకు !"*


*"కోరిన కొడుకుని ఎత్తుకునే అధికారం ప్రతి తల్లికీ వుంటుంది. పులోమా !"* అంటూ భృగుమహర్షి అరుగుమీంచి కిందికి దిగి , ఆశ్రమం వైపు అడుగులు వేశాడు.


పులోమ ఆశ్రమ ప్రాంగణంలోని పూల మొక్కలకు నీళ్ళు పోస్తోంది. లేడి శరీరాన్ని వాత్సల్యంగా నిమురుతున్న భృగుమహర్షి చూపులు పులోమను వెంటాడుతున్నాయి. సాయంకాలం నీరెండ ఆమె శరీరం మీద పడి ప్రతిఫలిస్తోంది. గతంలో వివాహానికి ముందు ఆమె ఆర్జించిన తపశ్శక్తి - ఆమె మనసునే కాకుండా తనువునూ పటిష్టంగా వుంచింది ! చూపుల్ని ఆలోచనల్నీ ఆకర్షించే పులోమ శరీర సౌష్టవం తనను ఆశ్చర్య పరుస్తూనే వుంది.


లేడి తన శరీరాన్ని భృగుమహర్షి కాళ్ళకేసి రుద్దుతూ , ఆయన దృష్టిని మళ్ళించింది. భృగుమహర్షి ఆప్యాయంగా లేడి కళ్ళల్లోకి చూశాడు. ఆశ్యర్యం ! ఆ కళ్ళల్లో పులోమ కళ్ళు ప్రత్యక్ష మవుతున్నాయి !


చల్లటిగాలి శరీరానికి గిలిగింతలు పెడుతోంది. చతుర్దశి చంద్రుడు నీలాకాశం లోంచి భూ సౌందర్యాన్ని చూస్తున్నాడు. ఆశ్రమ సమీపంలోని పూల తోటలోని పువ్వులు రకరకాల సౌరభాల సమ్మేళనంతో మత్తెక్కిస్తున్నాయి.


ప్రశాంత వాతావరణంలో తోటలో అటుయిటూ అడుగులు వేస్తున్న భృగుమహర్షి , ఆగి , కిందికి చూశాడు. ఆకాశం వైపు తలయెత్తి , బొమ్మలా కూర్చుంది పులోమ. అడుగుల చప్పుడు వినిపించక పోయే సరికి , తల వాల్చి చూసింది. తన ఎదురుగా తననే చూస్తూ నిలుచున్న పతిదేవుణ్ని చూస్తూ , లేచి నిలుచుంది.


*"రండి ! మీకు నిద్రా సమయం అయ్యింది"* అంటూ ఆశ్రమం వైపు తిరిగి నడవ బోయింది.


భృగుమహర్షి కుడి చెయ్యి , ఆమె ఎడమ చేతిని పట్టుకుని ఆపింది. పులోమ తలతిప్పి , ప్రశ్నార్థకంగా చూసింది. భృగువు చెయ్యి ఆమె చేతిని పట్టుకునే వుంది. భర్త మొహంలోకి ప్రశ్నార్థకంగా చూస్తూ పులోమ ఆయన వైపు తిరిగింది.


భృగుమహర్షి మాట్లాడకుండా వెనక్కి తిరిగి , కొంచెం దూరంలో వున్న పొదరిల్లు వైపు నడవసాగాడు. పులోమ పాణి గ్రహణాన్ని కొనసాగిస్తూ. 


వృషభరాజాన్ని వెన్నంటి నడిచే హోమధేనువులా అడుగులు వేస్తూ అనుసరిస్తోంది భర్తను పులోమ.


నిండు చూలాలైన హోమధేనువు , చప్పుడు విని , తలతిప్పి చూస్తూ పలకరింపుగా 'అంబా' అంది.


రెండు చేతుల్లో క్షీరాన్న పాత్రను పట్టుకున్న పులోమ నవమాసాల గర్భభారాన్ని మోస్తూ నెమ్మదిగా అడుగులు వేస్తోంది.


భృగుమహర్షి ఆశ్రమంలోంచి గుమ్మంలోకి వచ్చాడు. ఆగి , అటు యిటూ చూసి , తన చూపుల్ని ఒక వైపు తిప్పి ఆపాడు. ఆయన ముఖం మీద చిరునవ్వు ప్రత్యక్షమైంది. ఇద్దరు నిండు గర్భిణులు ఒకేచోట వున్నారు , కళ్ళకు విందులు చేస్తూ. ఒకరు ఆశ్రమ ధేనువు , ఒకరు ఆశ్రమ లక్ష్మి !


భృగుపత్ని పులోమ బాలుణ్ని ప్రసవించింది. ఒక శుభ ముహూర్తంలో. ఆశ్రమంలో ఆనందం తాండవం చేస్తున్న ఆ శుభదినాన , నారదుడు ఆగమించాడు. పంచమ పుత్ర జననాన్ని పురస్కరించుకుని భృగు దంపతులను అభినందించాడు. నామకరణ మహోత్సవానికి బ్రహ్మ , విష్ణువు , మహేశ్వరులు సతీ సమేతంగా వస్తారని తెలియజేశాడు.


*"త్రిమూర్తులా ! నా బిడ్డడి నామకరణానికి !"* భృగుమహర్షి నిలువునా ఆశ్చర్యపోయాడు.


*"దేవదేవుల రాకకు ప్రత్యేక కారణముంది ! అది వారే మీకు తెలియజేస్తారు !"* అన్నాడు నారదుడు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

Panchaag


 

Jokes




 

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 55

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 55🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*తిరుమల పుష్కరిణి:*


శ్రీవారి ఆలయం సమీపాన ఉత్తరంగా ఉన్న ఈ పుష్కరిణిలో స్నానంచేసి, స్వామి దర్శనానికి వెళ్ళాలనే నియమం ఉంది. వైకుంఠం నుంచి కలియుగ వైకుంఠం అయిన తిరుమలకొండ మీదకు వేంకటేశ్వరుడు దిగివచ్చేవేళ, తన జలక్రీడల కోసం, వైకుంఠం నుంచి భువికి స్వామి స్వయంగా తెప్పించుకున్న తీర్థమిదేనని భావన. సకల పాపనాశనిగా స్వామి పుష్కరిణికి పేరు. తారకాసురుని వధించి బ్రహ్మ హత్యాదోషానికి గురైన సుబ్రహ్మణ్యస్వామి సైతం ఈ పుష్కరిణిలో స్నానంచేసి ఆ పాపాన్ని పోగొట్టుకున్నట్లు చెప్తారు. ముల్లోకాలలోని సకల తీర్థాలు స్వామి పుష్కరిణిలోనే కలిసి ఉంటాయని స్వయంగా వరాహస్వామి, భూదేవికి వివరించినట్లు వరాహ పురాణంచెబుతోంది. ధనుర్మాసంలో ముక్కోటి ద్వాదశి నాడు, ముక్కోటి తీర్థాలూ స్వామి పుష్కరిణిలోకి ప్రవహిస్తాయని భక్తుల విశ్వాసం. స్వామి పుష్కరిణిలో పవిత్ర చక్రస్నానంతర్వాతనే బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నదీ గమనార్హం.


*తిరుమల హుండీ:*


తిరుమలలో కొలువైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఉన్న హుండీ తిరుమల హుండీగా సుప్రసిద్ధం. వడ్డీకాసుల వాడు, ఆపదమొక్కుల వాడు అని పేరొందిన తిరుమల వేంకటేశ్వరునికి భక్తులు ధనకనకాలను గురించి మొక్కుకుని వాటిని తీర్చుకునేందుకు వచ్చి హుండీలో వేయడం పరిపాటి. ప్రపంచవ్యాప్తంగా వాటికన్ తర్వాత అంతటి ఆదాయం కలిగిన ప్రార్థనాస్థలంగా తిరుమల ప్రసిద్ధి కలిగింది.

తిరుమలలో కొలువైన వేంకటేశ్వరస్వామికి భక్తుల్లో ఉన్న వడ్డీకాసులవాడు, ఆపదమొక్కులవాడు వంటి పేర్లు ధనరూపంగా ఆయన హుండీలో మొక్కు చెల్లించుకోవడాన్ని సూచిస్తాయి. పౌరాణిక గాథల ప్రకారం శ్రీనివాసుడు పద్మావతిదేవిని వివాహం చేసుకునేందుకు తన వద్ద డబ్బులేకుంటే పెళ్ళిఖర్చుల కోసం ఇక్కట్లు పడ్డాడు. లక్ష్మిదేవిని వైకుంఠంలో విడిచి రావడంతో ఆయనకు సంపదలేకపోయింది. పెళ్ళికి అవసరమైన డబ్బు కుబేరుడువేంకటేశ్వరునికి అప్పుపెట్టారు. వేంకటేశ్వరస్వామి ఆ బాకీ తీర్చలేకపోగా ఏటేటా వడ్డీ మాత్రం తీరుస్తున్నాడు. ఆ వడ్డీ డబ్బును ఈ హుండీ సొమ్ములోంచే ఇస్తున్నాడని ప్రతీతి.


ఆపదలు వచ్చినప్పుడు మొక్కులు మొక్కుకుంటే ఆయన తీరుస్తాడని నమ్మిక. ఒంటిపై వేసుకుని వచ్చిన బంగారం, సొమ్ముతో పళంగా పర్సు మొత్తం హుండీలో వేసేయడాన్ని నిలువు దోపిడీ అని వ్యవహరిస్తారు. తిరుపతిలో నిలువు దోపిడీ చెల్లించుకుంటానని మొక్కుకుని, మొక్కు తీర్చుకుంటూంటారు. శంకరాచార్యులవారు తిరుమల యాత్రలో శ్రీవారి హుండీ క్రింద 'శ్రీచక్రం' ప్రతిష్టించారని ఒక ప్రతీతి. 1950 వ దశకం లో ఆలయ జీర్ణోద్దారణ సమయంలో పూర్వం నేలపై వున్న రాళ్ళను (ప్లోరింగ్) తొలగించి కొత్త రాళ్ళను వేసే సమయం లో ఆ శ్రీచక్రాన్ని అలానే వుంచి దానిపై రాళ్ళను పేర్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానాల పత్రిక "సప్తగిరి" పేర్కొంది

తిరుమల సంకీర్తనా భాండాగారం

తిరుమల తిరుపతి దేవాలయంలో బంగారు వాకిలికి ఎదురుగా కుడిచేతి వైపు భాష్యకారుల సన్నిధి, దానిని ఆనుకొని తాళ్ళపాక వారి అర అనే పేర ఒక సంకీర్తన భండగారము ఉంది.

1922లో, 14,000 అన్నమయ్య కీర్తనలు, ఇతర రచనలు లిఖించిన 2,500 రాగిరేకులు తిరుమల సంకీర్తనా భాండాగారంలో లభించాయి. ఇది తిరుమల హుండీకి ఎదురుగా ఉన్న ఒక రాతి ఫలకల గది.


దాచుకో నీ పాదాలకు తగ నేజేసిన పూజలివి

పూచి నీ కీరితి రూపు పుష్పము లివియయ్యా !

ఒక్క సంకీర్తనే చాలు ఒద్దికై మము రక్షింపగ

తక్కినవి భండారాన దాచి ఉంచనీ...

అన్నమయ్య రచించిన పై ఆధ్యాత్మ సంకీర్తనను పరిశీలించినట్లయితే అన్నమయ్యే ఈ రచనలను ఈ భాండాగారములో దాచేవాడని తెలుస్తుంది.



*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 47*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 47*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

*సిద్ధుల తిరస్కృతి*


ఒక రోజు శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి విడిగా పంచవటికి తోడ్కొనిపోయి

అతడితో, "ఇలా చూడు, ఏళ్ల తరబడి నేను చేసిన తపఃఫలంగా నాకు అణి మాది అష్టసిద్ధులు లభించాయి. కాని బట్ట జారిపోకుండా చూసుకోలేని నా లాంటి వ్యక్తికి వీటిని ఉపయోగించుకోవడానికి తీరిక ఎక్కడ? తన అనేక కార్యాలను నువ్వు చేయబోతున్నావని జగజ్జనని నాతో చెప్పింది. కనుక ఆమెకు విన్నవించి ఆ సిద్ధులను నీకు ఇవ్వగోరుతున్నాను. ప్రస్తుతం నువ్వు పుచ్చుకొంటే అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఏమంటావు?" అని అడిగారు.


నరేంద్రుడు కాసేపు యోచించిన తరువాత, "మహాశయా! భగవదనుభూతిని పొందడంలో ఇవి నాకు ఉపకరిస్తాయా?" అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు, "ఉపకరించవు. భగవదనుభూతికి ఉపకరించకపోయినా, భగవత్సాక్షాత్కారానంతరం భగవత్కార్య నిర్వహణలో ఇవి ఎంతో ఉపకరిస్తాయి" అన్నారు. తక్షణమే నరేంద్రుడు, "అలా అయితే ఈ సిద్ధులతో నాకు ప్రయోజనం లేదు.


మొదట భగవదనుభూతి కలుగనివ్వండి, ఆ తరువాత వాటిని స్వీకరించాలో వద్దో నిర్ణయించుకొంటాను. అద్భుత శక్తులను ఇప్పుడే స్వీకరించినందువలన లక్ష్యాన్ని విస్మరించి, స్వార్థంతో దుష్ప్రేరణకు లోనై వాటిని దుర్వినియోగం చేయవచ్చు. అలాంటప్పుడు అంతా వ్యర్ధమయిపోతుంది కదా!" అని జవాబిచ్చాడు. శ్రీరామకృష్ణులు నిజానికి ఆ దివ్యశక్తులను నరేంద్రునికి ఇవ్వాలనుకొన్నారా లేక నరేంద్రుని మనోవైఖరిని పరీక్షించదలచారా? ఏది ఏమైనప్పటికీ నరేంద్రుడు వాటిని తిరస్కరించడం, శ్రీరామకృష్ణులకు ఎనలేని ఆనందాన్ని కలిగించిందనడం మాత్రం నిజం.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* *శ్లోకం - 30*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 30*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*స్వదేహోద్భూతాభి ర్ఘృణిభి రణిమాద్యాభిరభితేః*  *నిషేవ్యే నిత్యే త్వామహమితి సదా భావయతి యః |*

*కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతేః*

 *మహాసంవర్తాగ్ని ర్విరచయతి నీరాజనవిధిమ్ ‖*


జీవ బ్రహ్మైక్య ప్రతిపాదన చేస్తున్నారు ఈ శ్లోకంలో.


అమ్మా


స్వదేహోద్భూతాభిః = నీ శరీరం నుండి వెలువడుతున్న


ఘృణిభిః = కిరణములు


అణిమాద్యాభిరభితః = అణిమాది సిద్ధులు

  ఇవి


నిషేవ్యే= నిన్ను సేవిస్తున్నాయి.


*అణిమాదిభిరావృతామ్ మయూఖైః* అని అమ్మవారి నామం.


నిత్యే = నిత్యమైన తల్లీ


త్వామహమితి = నీవే నేనని నీలో వున్న చిచ్ఛక్తియే కదా నాలో చైతన్యముగా వుండి నన్ను జీవింపజేస్తున్నది.


సదా భావయతి యః = ఎవడు సదా భావిస్తాడో

*అహమిత్యేవవిభావయే భవానీం* అని అమ్మవారి నామాలు.


తస్య త్రినయన సమృద్ధిం తృణయతః = ముక్కంటివాడి సంపదను (ముల్లోకాల సంపదను) కూడా తృణప్రాయంగా చూస్తాడు.


మహాసంవర్తాగ్నిః =  మహా ప్రళయకాలంలో ఉద్భవించే బడబాగ్ని కూడా


విరచయతి నీరాజనవిధిమ్ = అట్టి యోగికి నీరాజనం పడుతుందమ్మా!


కిమాశ్చర్యం = ఆశ్చర్యం ఏముంది? అంటే ఇది తథ్యము అని.


 అణిమాది అష్ట సిద్ధులు ఏమిటి అంటే 


అణిమ = శరీరాన్ని అణువంత చేయటం 


మహిమ = శరీరాన్ని అనంతముగా పెంచటం 


గరిమ = శరీరాన్ని విపరీతంగా బరువు పెంచివేయటం 


లఘిమ = శరీరాన్ని దూదిపింజ వలె తేలిక చేయటం 


ప్రాప్తి = కోరుకున్న ఏ ప్రదేశానికైనా అనాయాసంగా వెళ్లగలగటం 

ప్రకామ్య = కోరుకున్నదేదైనా సాధించగలగటం   

ఈశిత్వ = తిరుగులేని ప్రభుతను (అధికారాన్ని) పొందగలగటం


వశిత్వ = అందరినీ తన వశంలో ఉంచగలగటం.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

⚜ శ్రీ హాటకేశ్వర్ మందిర్

 🕉 మన గుడి : నెం 586





⚜ ఛత్తీస్‌గఢ్ : రాయపూర్


⚜ శ్రీ హాటకేశ్వర్ మందిర్ 


💠 ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశం వరకు ప్రతి పట్టణంలో మహాదేవుని పూజిస్తారు. భోలేనాథ్‌ని దేశవ్యాప్తంగా వివిధ రకాలుగా పూజిస్తారు. అనేక దేవాలయాలలో మహాదేవుని ఆరాధన మరియు స్థాపనకు అనేక నమ్మకాలు ఉన్నాయి. ఇందులో ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో వందల ఏళ్ల నాటి హట్‌కేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంది


💠 ఈ ఆలయం రాయ్‌పూర్ నుండి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖారున్ నది ఒడ్డున మహాదేవ్ ఘాట్ లో ఉంది. 

దూరంలో ఉంది.

హిందువులకు ప్రత్యేకించి శైవులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం

 

⚜ స్థల పురాణం ⚜


💠 మహాదేవ్ ఘాట్‌లో శివలింగ ప్రతిష్ఠాపన కథ పాతది. ఆలయ పూజారులు దీనిని త్రేతా యుగానికి సంబంధించినది అని అంటారు.

హనుమంతుడు మహాదేవుడిని తన భుజంపై వేసుకుని ఇక్కడికి తీసుకొచ్చాడని కూడా ఒక నమ్మకం.  ఈ కథ కారణంగా ఈ దేవాలయం చాలా వరకు ప్రసిద్ధి చెందింది.  

శ్రీరాముడు అరణ్యానికి వెళ్లే సమయంలో ఈ ఆలయాన్ని ఏర్పాటు చేసినట్లు చెబుతారు.  

ఈ శివలింగాన్ని లక్ష్మణుడు తన వనవాస సమయంలో చత్తీస్‌గఢ్‌లోని ఈ ప్రాంతం గుండా వెళ్ళినప్పుడు స్థాపించాడు.  స్థాపన కోసం, హనుమాన్ తన భుజంపై శివుని విగ్రహంతో బయలుదేరాడని చెబుతారు, తరువాతి బ్రహ్మ దేవుడిని ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు, చాలా ఆలస్యం అయింది.  ఇక్కడ లక్ష్మణుడికి ఆలస్యమైనందుకు కోపం వచ్చింది, ఎందుకంటే సంస్థాపన సమయం ఆలస్యమైంది. 

 స్థాపన సమయాన్ని దృష్టిలో ఉంచుకుని, అనుకున్న చోట ఏర్పాటు చేయకుండా, ఖారున్ నది ఒడ్డున ఏర్పాటు చేశారు.

ఈ కారణంగా ఈ ఆలయం రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దేశం నలుమూలల నుండి బోల్నాథ్ భక్తులు దర్శనం కోసం వస్తుంటారు. 

ఆలయ ప్రాంగణంలో శివలింగానికి సమీపంలో రామ్, జానకి మరియు లక్ష్మణ విగ్రహాలు ఉన్నాయి.


💠 అదే సమయంలో, 500 సంవత్సరాలుగా ఆలయంలో అఖండ ధుని నిరంతరం మండుతూనే ఉంది. మహాదేవుని భక్తులు ప్రతిరోజూ తమ నుదుటిపై పూసుకోవడానికి ఇక్కడి ధునిని ఇంటికి తీసుకువెళతారు.


💠 మత విశ్వాసాలతో పాటు పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, రాష్ట్ర ప్రభుత్వం మహాదేవ్ ఘాట్ వద్ద నదికి రెండు చివరలను కలుపుతూ లక్ష్మణ్ ఝులాను నిర్మించింది. 

నదిపై భక్తుల కోసం నిర్మించిన రాష్ట్రంలో ఇది మొదటి లక్ష్మణ్ జూలా. రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలు ఇక్కడికి చేరుకుని ఉదయం నుండి సాయంత్రం వరకు లక్ష్మణ్ జూలాను ఆనందిస్తారు. 


💠 పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరాలని ఖారున్ నది మధ్యలో పిండ ప్రధానాలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు. గయ, కాశీ లాగానే ఇక్కడ కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.


💠 రాయ్‌పూర్‌ నగరం యొక్క ప్రారంభ స్థావరం ఖరున్ నది ఒడ్డున ఉన్న మహాదేవ్ ఘాట్ ప్రాంతంలో జరిగింది. రాయ్‌పూర్‌కు చెందిన కల్చూరి రాజులు మొదట ఈ ప్రాంతంలో తమ రాజధానిని స్థాపించారు. 

ప్రస్తుతం ఖరున్ నది ఒడ్డున అనేక చిన్న మరియు పెద్ద దేవాలయాలు నిర్మించబడ్డాయి. కానీ చాలా ముఖ్యమైనది హటకేశ్వర్ మహాదేవ్ ఆలయం. ఈ ఆలయం వెలుపలి నుండి ఆధునికంగా కనిపిస్తుంది, కానీ మొత్తం నిర్మాణాన్ని చూస్తే ఇది మధ్యయుగ కాలం నాటిదని అంచనా వేయవచ్చు. 

కార్తీక పూర్ణిమ సందర్భంగా ఇక్కడ పెద్ద జాతర నిర్వహిస్తారు. 

వివేకానంద ఆశ్రమ స్థాపకుడు స్వామి ఆత్మానంద (1929-1981) సమాధి కూడా మహాదేవ్ ఘాట్‌లోనే ఉంది.


💠 ఆలయ బయటి గోడలపై రామాయణం మరియు మహాభారత కథలు చిత్రించబడ్డాయి.  ఇది కాకుండా చాలా చిత్రాలు కూడా ఉన్నాయి.  ఆలయ గోడపై వివిధ జంతువులు, నృత్యకారులు మరియు సంగీతకారుల శిల్పాలు ఉన్నాయి.  ఆలయ సముదాయం చాలా పెద్దది.

  

💠 ఈ ఆలయానికి ఉన్న ఇంకొక  ఆదరణ వింటే ఆశ్చర్యం వేస్తుంది

మహాదేవుని దర్శనం కోసం ఉజ్జయినిలోని మహాకాల్‌కు వెళ్లలేని భక్తులు, బ్రహ్మ ముహూర్తంలో ఇక్కడ హృదయపూర్వకంగా ప్రార్థిస్తే, వారి ప్రార్థనలన్నీ అంగీకరించబడతాయి మరియు వారి ప్రతి ప్రార్థనను మహాదేవ్ అంగీకరిస్తాడు అని నమ్మకం.


💠 ఆలయంలోకి ప్రవేశించడానికి అనేక మెట్లు ఎక్కినప్పుడు ఈ ఆలయ గర్భగుడి కనిపిస్తుంది.  ఆలయ గర్భగుడిలోకి వెళ్లే దారిలో ఎన్నో శిల్పాలు కనిపిస్తాయి.  ప్రజలు ఈ ఆలయానికి దర్శనం కోసం వెళ్ళినప్పుడు, వారు తమతో పాటు కొంత బియ్యాన్ని లోపలికి తీసుకుని, గర్భగుడిలోకి వెళ్ళే మార్గంలో ఉన్న అన్ని విగ్రహాలకు అన్నం పెడతారు. 


💠 ఇక్కడ జరుపుకునే ప్రధాన పండుగ మహా శివరాత్రి.  ఈ సమయంలో ఛత్తీస్‌గఢ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి వస్తుంటారు.  

వారు దేవతకు పాలు, తేనె, తీగ ఆకులు, పువ్వులు మరియు పండ్లు సమర్పిస్తారు.  పరిశుభ్రమైన మనస్సుతో పూజించిన వారికి ఇక్కడి పరమేశ్వరుడు  స్పందిస్తారని ప్రజలు నమ్ముతారు.


 *సేకరణ:- శ్రీ శర్మద గారి పోస్టు*