*శ్రీమద్భాగవతం - 18/42*
*శ్రీ నరసింహ ఆవిర్భావం, హిరణ్యకశిప వధ & నరసింహ స్తుతి*
ఓం నమో భగవతే వాసుదేవాయ!
మన భాగవత యాత్రలో
నిన్నటి రోజున మహాభక్తుడైన ప్రహ్లాదుని జననం, నవవిధ భక్తి మార్గాలు మరియు హిరణ్యకశిపుడు చేసిన ఘోర రాక్షసృత్యాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు **సప్తమ స్కంధం – అధ్యాయాలు 8 నుండి 10** ఆధారంగా శ్రీమద్భాగవతంలోని పరమ పవిత్రమైన ఘట్టం — **శ్రీ నరసింహావిర్భావం, రౌద్ర రూపంతో హిరణ్యకశిపుని వధ, ప్రహ్లాదుని నరసింహ స్తుతి మరియు స్వామి ప్రశాంతత** గురించిన వివరాలుతెలుసుకుందాం.
1. "ఎక్కడున్నాడు నీ హరి?" – హిరణ్యకశిపుని గర్వాంధకారం (7వ స్కంధం – 8వ అధ్యాయం)
ప్రహ్లాదుడిని చంపడానికి తాను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవ్వడంతో హిరణ్యకశిపుడు తీవ్రమైన క్రోధంతో రగిలిపోయాడు.
గురువులు మరొక్కసారి ప్రయత్నం చేస్తాం అని గురుకులానికి తీసుకుపోతే అక్కడ ఉన్న తోటి విద్యార్థులకు కూడా హరి భక్తి మహిమ బోధించాడు ప్రహ్లాదుడు.ఆ విషయాన్ని గురువులు చెప్పగా విన్న హిరణ్య కశిపుడి కోపం కట్టలు తెంచుకుని ఇక స్వయంగా తానే కుమారుని సంహరించాలి అని నిర్ణయం తీసుకునీ ప్రహ్లాదుడిని తన రాజసభలోని ఒక స్వర్ణ స్తంభం ముందుకు తీసుకువచ్చి, ఖడ్గాన్ని దూసి గర్జించాడు:
"రాక్షసాధమా! నా మాట వినకుండా, నిరంతరం ఆ 'హరి' బలంతోనే నేను బతుకుతున్నానని దంబాలు పలుకుతున్నావు. సమస్త లోకాలకు నేనే ఈశ్వరుడిని! నన్ను మించిన వాడు ఎవడు లేడు, ఎడి నీ హరి ఎక్కడున్నాడు? ఈ సభలో ఉన్నాడా? **ఈ స్తంభంలో ఉన్నాడా?** చూపించు.. లేదా ఈ రోజే నీ తలను నరికి ఆ హరి వద్దకు పంపుతాను!"
ప్రహ్లాదుడు ప్రశాంతంగా, నిశ్చల భక్తితో చేతులు జోడించి ఇలా అన్నాడు:
ఇందుఁ గలఁ డందు లేఁ డని, సందేహము వలదు
చక్రి సర్వోపగతుం డెందెందు వెదకి చూచిన,
నందందే కలఁడు దానవాగ్రణి వింటే
"తండ్రీ! ఆయన ఎక్కడో లేడు. సర్వాంతర్యామి అయిన శ్రీహరి అణువణువునా ఉన్నాడు. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఈ సమస్త విశ్వంలో ఉన్నాడు... **సాక్షాత్తు నీవు చూపిస్తున్న ఈ స్తంభంలో కూడా ఉన్నాడు!**"నేను అన్ని లోకాలు జయించాను అంటున్నావు కానీ పది ఇంద్రియాలు అనే బందిపోటు దొంగల చేత నీవు ఈడ్చబడుతూ అసలు సత్యాన్ని తెలుసుకోలేక పోతున్నావు. వీటిని అదుపు చేసినవారికి ఆయన లేని చోటు లేదు అన్నాడు.
2. *స్తంభ విస్ఫోటనం & లక్ష్మీనరసింహ ఆవిర్భావం* (8వ అధ్యాయం)
ప్రహ్లాదుని మాటలు విన్న హిరణ్యకశిపుడు అహంకారంతో నవ్వి, "అయితే ఈ స్తంభంలో నీ హరిని చూపించు" అంటూ తన చేతిలోని గదతో **రాతి స్తంభాన్ని గట్టిగా చరిచాడు!**
ఆ క్షణంలోనే... సకల బ్రహ్మాండాలు పగిలిపోతున్నాయా అన్నట్లు ఘోరమైన బ్రహ్మాండ భాండ విస్ఫోటనం (భయంకర శబ్దం) సంభవించింది. దేవతలు, దిక్పాలకులు భయపడ్డారు. స్తంభం మధ్య నుండి ఫెలో ఫెల ఫట ఫట శబ్దాలు వడ్డాయి**సాక్షాత్తు శ్రీమహావిష్ణువు "శ్రీ నరసింహ" రూపాంలో ఆవిర్భవించాడు!**
భగవంతుడైన శ్రీహరి తన భక్తుడైన ప్రహ్లాదుని, బ్రహ్మదేవుని మరియు సనకాదుల మాటలను నిలబెట్టుటకును, తన సర్వవ్యాపకత్వమును నిరూపించడానికి ఆ స్తంభమునుండియే ఒక విచిత్రరూపముతో ప్రకటితుడు అయ్యెను.
భగవంతుడు అయిన శ్రీ నృసింహస్వామి భగవాన్ కీ జై!!
* **రూప విశేషం:** ఆయన నరుడూ కాడు, మృగమూ కాడు! సింహం ముఖం, మానవ శరీరం; భయంకరమైన జ్వాలల వంటి కళ్లు, ఆకాశాన్ని తాకే జటాజూటం, పర్వతాల వంటి దంష్ట్రలు (కోరలు), వేల చేతులలో దివ్యా ఆయుధాలు!
3. హిరణ్యకశిపుని విచిత్ర సంహారం (8వ అధ్యాయం)
హిరణ్యకశిపుడు ఖడ్గం ధరించి నరసింహస్వామిపైకి లంఘించాడు. స్వామి ఆయనతో కొద్దిసేపు లీలగా యుద్ధం చేసి, సూర్యాస్తమయ సమయం (సంధ్యా సమయం) ఆసన్నమవ్వగానే రాక్షసుడిని పట్టుకున్నాడు.
బ్రహ్మదేవుడు ఇచ్చిన సమస్త వరాలను ఒక్కటి కూడా ఉల్లంఘించకుండా స్వామి సంహారాన్ని పూర్తి చేశాడు:
1. **నరుడు కాడు, మృగం కాడు:** *నరసింహ రూపం (సగం నరుడు, సగం మృగం).*
2. **ఇంట కాడు, బయట కాడు:** *సింహాసన ద్వారం (గడప) మీద కూచుని*
3. **పగలు కాడు, రాత్రి కాడు:** *సంధ్యా సమయంలో.*
4. **భూమిపై కాడు, ఆకాశంలో కాడు:** *తన తొడలపై (తొడలపైన) కూర్చోబెట్టుకున్నాడు.*
5. **దేవ, దానవ, మానవ ఆయుధాలు కావు:** *తన వాడియైన గోళ్లతో (నఖములతో).*(జీవం ఉన్నవి కాదు జీవం లేనివి కాదు)
6. **బ్రహ్మ సృష్టించిన ఏ ప్రాణీ కాడు:** *స్వయంభూ అయిన పరమాత్మ.*
ఇలా నరసింహస్వామి హిరణ్యకశిపుని ఉదరాన్ని తన వాడియైన గోళ్లతో చీల్చి, రాక్షసుడి ప్రేగులను హారంగా ధరించి సంహరించాడు. అధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని నిలబెట్టాడు!
4. *రౌద్ర నరసింహుని ప్రశాంతత & ప్రహ్లాద స్తుతి* (9వ అధ్యాయం)
రాక్షస సంహారం తర్వాత కూడా నరసింహస్వామి ఉగ్రరూపం శమించలేదు. ఆయన రౌద్ర జ్వాలలకు దేవతలు, బ్రహ్మదేవుడు, పరమశివుడు, లక్ష్మీదేవి సహితం దగ్గరకు వెళ్లడానికి భయపడ్డారు.సిద్ధులు, యక్షులు దేవతలు, ఋషులు అందరూ స్వామిని స్తుతించారు. అయినా శాంతించలేదు
అప్పుడు బ్రహ్మదేవుడు ప్రహ్లాదుడిని చూసి "పుత్రా! స్వామి కోపాన్ని శాంతపరచగల సమర్థుడివి నువ్వే" అని చెప్పాడు.
* **ప్రహ్లాదుని శరణాగతి:** ఐదేళ్ల పసిబాలుడైన ప్రహ్లాదుడు ఏమాత్రం భయం లేకుండా ఉగ్ర నరసింహుని పాదాల చెంత సాష్టాంగ నమస్కారం చేశాడు.
* **వాత్సల్యం:** భక్తుడిని చూడగానే నరసింహస్వామి హృదయం ద్రవించింది. రౌద్రం నశించి వాత్సల్యం ఆవహించింది. స్వామి తన దివ్యమైన హస్తాన్ని ప్రహ్లాదుని శిరస్సుపై ఉంచి, అమృతతుల్యంగా నిమిరాడు.
* **దివ్య స్తుతి:** స్వామి స్పర్శతో ప్రహ్లాదుడు మైమరచి, పరమ పవిత్రమైన నరసింహ స్తుతి చేశాడు:(ప్రహ్లాదుడు చేసిన స్తుతి ఎంతో మహత్తరమైనది)
ఆ స్తుతి కి సంతసించి స్వామి అన్నాడు
ప్రహ్లాదా! నీవు పరమకల్యాణ స్వరూపుడవు. నీకు శుభమగుగాక. నీకు ప్రసన్నుడనైతిని. అసురోత్తమా! నీకు ఇష్టమైన వరమును కోరుకొనుము. నేను మానవులకు కోరికలను ప్రసాదించువాడను.
ఆయుష్మంతుడా! నన్ను ప్రసన్నుని చేసికొనని వానికి నా దర్శనము దుర్లభము. నా దర్శనము ఐనంతనే ప్రాణుల హృదయముల యందు ఎట్టి పరితాపములు ఉండవు.నేను సమస్తమనోరథములను ఈడేర్చువాడను. కనుక శ్రేయస్కాములు, అదృష్టవంతులైన సత్పురుషులు జితేంద్రియులై తమ వృత్తులయన్నింటి ద్వారా నన్నుప్రసన్నుని చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు.
జనులు ఎక్కువగా ఆశించునట్టి | వరములద్వారా నృసింహ భగవానుడు అసురోత్తముడైన ప్రహ్లాదుని ప్రలోభపెట్టెను. ఐన, భగవంతునియందు ఏకాంతమగు భక్తి కలిగినట్టి ఆ భక్త శిరోమణి ఎట్టి వరములను కోరుకొనలేదు.
స్వామీ! నీవు వరములను అనుగ్రహించుటలో శ్రేష్ఠుడవు. నేను కోరుకొనిన వరమును ప్రసాదింపదలచినచో, నా హృదయమున ఎట్టి కోరిక అంకురింపకుండ చేయుము. ఇదియే నా కోరిక.
హృదయమునందు ఏదేని ఒక కోరిక కలిగినచో ఇంద్రియములు, మనస్సు, ప్రాణములు, దేహము, ధర్మము, ధైర్యము, బుద్ధి, లజ్జ, సంపదలు, తేజస్సు, స్మృతి, సత్యము, మొదలగునవి అన్నియును నష్టమైపోవును.
"స్వామీ! కులం, రూపం, ధనం, తపస్సు, విద్యలు భగవంతుని ప్రసన్నం చేసుకోలేవు. కేవలం **నిష్కల్మషమైన భక్తి** మాత్రమే నిన్ను కట్టిపడేస్తుంది.
నా తండ్రి చేసిన సమస్త పాపాలను క్షమించి ఆయనకు ఉత్తమ లోకాలను ప్రసాదించు!"ఇదియే నా ప్రార్థన అన్నాడు.
5. ప్రహ్లాదుని పట్టాభిషేకం & శ్రీహరి ఆశీర్వాదం (10వ అధ్యాయం)
ప్రహ్లాదుని నిష్కామ భక్తికి, ఉదార గుణానికి ప్రసన్నుడైన నరసింహస్వామి: "ప్రహ్లాదా! నీ వంటి భక్తుడు జన్మించిన వంశంలో ఏడు తరాల పూర్వీకులు, ఏడు తరాల భావితరాలు పావనమవుతారు. నీ తండ్రి ముక్తుడయ్యాడు" అని వరమిచ్చాడు.
బ్రహ్మదేవుడు, మునుల సమక్షంలో ప్రహ్లాదునికి రాక్షస రాజ్యానికి పట్టాభిషేకం చేశారు. నరసింహస్వామి ప్రహ్లాదుడిని ఆశీర్వదించి అంతర్థానమయ్యాడు. ప్రహ్లాదుడు సుదీర్ఘకాలం పరమ భాగవతోత్తముడిగా రాజ్యాన్ని పాలించి, చివరికి భగవత్సన్నిధిని చేరుకున్నాడు.
పరమపురుషుడైన పరమాత్మయొక్క ఈ నృసింహావతారగాథయు, హిరణ్యకశిపుని యొక్క, ఆయన సేనాపతుల యొక్క వధలును, భక్తశిరోమణియైన ప్రహ్లాదుని పావన చరితము ఏకాగ్రచిత్తముతో వినినవారు, పఠించినవారు భయరహితమైన పరంధామమును పొందుదురు.
నరసింహస్వామి ఉగ్ర రూపం శాంతించాక, ప్రహ్లాదునికి రాజ్యాభిషేకం జరుగాక. అనేక ధర్మ సంబంద విషయాలను ధర్మరాజు నారదుని అడిగాడు(ప్రహ్లాద చరిత్ర ధర్మ రాజు నారద సంవాదం ద్వారా శిశు పాలుడు మరణించిన సందర్భంగా వస్తుంది)
ధర్మరాజు అడిగిన ప్రశ్నకు సమాధానంగా నారద మహర్షి శ్రీమద్భాగవతం సప్తమ స్కంధం (10-15 అధ్యాయాలు) లో మానవ జీవన మార్గాన్ని స్పష్టం చేశారు. అందులో **5 ముఖ్యమైన సందేశాలు**:
1️⃣ **పుట్టుక కాదు... గుణమే ముఖ్యం (వర్ణ ధర్మాలు):**
మనిషి ప్రాధాన్యత పుట్టుకతో కాదు, అతను పాటించే సత్యం, అహింస, శౌచం, ఇంద్రియ నిగ్రహం వంటి గుణాలతోనే నిర్ణయించబడుతుంది. ఎవరైతే స్వధర్మం ఆచరిస్తారో వారే ఈశ్వర అనుగ్రహం పొందుతారు.
(ప్రహ్లాదుడు రాక్షస కులంలో పుట్టినా పరమ భాగవతుడయ్యాడు.)
2️⃣ **ఎక్కడైనా భగవంతుణ్ణి చేరవచ్చు (గృహస్థ ధర్మం):**
రాజ్య పాలన చేస్తూ, గృహస్థుడిగా ఉంటూనే ప్రహ్లాదుడు మొదలైన ఎందరో రాజులు ముక్తి పొందారు. సంసారాన్ని వదిలేయాల్సిన పనిలేదు; చేసే ప్రతి పనిని భగవదర్పణంగా చేస్తే గృహస్థాశ్రమమే ముక్తి మార్గమవుతుంది.
3️⃣ **చిన్న ప్రాణి పట్ల కూడా దయ (అజగర వ్రతం):**
అడవిలో కొండచిలువలా ప్రశాంతంగా ఉండే ఒక అవధూత కథ(దత్తాత్రేయ సంవాదం)ద్వారా — "ఎంత లభించినా తృప్తిగా ఉండటం, ఇంట్లో ఉండే చిన్న క్రిమి కీటకాల పట్ల కూడా దయ కలిగి ఉండటం" నేర్పించారు.
4️⃣ **విద్య అంతరార్థం ఇంద్రియ నిగ్రహమే (బ్రహ్మచర్యం):**
నిజమైన చదువు అంటే విజ్ఞానంతో పాటు మనస్సును, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడమే.
(రాక్షస గురువులు ఎంత చెడు నేర్పించినా ప్రహ్లాదుడు మంచి వైపే నిలబడ్డాడు.)
5️⃣ **నీ ఇంట్లోనే భగవంతుడు ఉన్నాడు:**
ఆత్మారాముడై నిష్క్రియాపరత్వము వలన సంతోషించువానికి కలుగు సుఖము, పెక్కు కోరికలతో లోభియై ధనమునకై అటునిటు పరుగులు తీయువానికి లభింపదు. నీలోనే నీతోనే ఈశ్వరుడు అనుక్షణం ఉన్నాడు.
📝 నేటి ముఖ్య విషయాలు:
1. **సర్వాంతర్యామి తత్త్వం:** భగవంతుడు అణువణువునా ఉన్నాడనే ప్రహ్లాదుని విశ్వాసాన్ని నిలబెట్టడానికే స్వామి స్తంభం నుండి ఆవిర్భవించాడు.
2. **అధర్మ నాశనం - భక్త రక్షణ:** భగవంతుని ఉగ్రరూపం అధర్మాత్ములకే భయంకరం; నిశ్చల భక్తునికి ఆ రూపామే అత్యంత దయామయం, కరుణామయం!
3. **భక్తికి వయస్సు లేదు:** కులం, ధనం, వయస్సులతో సంబంధం లేదు... కేవలం శరణాగతి, నిస్వార్థ భక్తి మాత్రమే పరమాత్మ అనుగ్రహాన్ని తెచ్చిపెడతాయి.
పరిస్థితులు ఎలా ఉన్నా, ఏ ఆశ్రమంలో ఉన్నా ధర్మం తప్పక, నిష్కామ భక్తితో జీవిస్తే భగవంతుని అనుగ్రహం మనకూ లభిస్తుంది!
.....సశేషం
🌹🙏🌹
🙏*న్యాయపతి*🙏
*నరసింహారావు*
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి